Monday, October 31, 2011

నేడు మహనీయుడు సర్దార్ పటేల్ జయంతి

ఈనాడు మన దేశ పరిస్థితి సర్దార్ పటేల్ ప్రధాన మంత్రి అయివుంటే వేరుగా
వుండేది. హైద్రాబాదు మాది అంటే కాదు మాది అంటూ కొట్టుకుంటున్న మన
తెలుగు సోదరులకు ఆయన వల్లే మనకు మిగిలింది. ఈ విషయం ఈనాటి
యువతరానికి ఎంతమందికి తెలుసు. ఏ నిర్ణయాన్ని అయినా ధృఢచిత్తంతో
తీసుకొనే సర్దార్ పటేల్ ను "ఉక్కుమనిషి" అని పిలిచే వారు.
ఆయన జయంతి రోజున ఏ రాజకీయనాయకుడు ఆయన విగ్రహానికి ఒక్క
పూలమాల వేశాడు. అసలు ఈనాటి (వి)నాయకులకు ఆయనగురించి తెలిస్తే
గదా ? ఎన్ని చోట్ల ఆయన విగ్రహాలు ఉన్నాయి ?
వంశపాలన చేస్తున్న కుటుంబం ,వారి భక్తులు ఆయన స్మృతులు లేకుండా
జాగ్రత్త పడ్డారు. గాంధీజీ కూడా నెహ్రూజీ పై గల అపార ప్రేమతో సర్దార్ పటేల్
ను కాకుండా నెహ్రూను ప్రధానిగా చేశారు. ఆయన జయంతి పర్వదినాన
మనకు హైద్రాబాదును కానుకగా ఇచ్చిన ఈ మహనీయుణ్ణి ఓ సారి స్మరించడం
భారతీయులుగా ప్రతి ఒక్కరి కర్తవ్యం.

Friday, October 28, 2011

నా సొంత గోడు !!



ఎవరైనా సుఖంగా, ఆనందంగా వుంటే సంతోషించడం మంచి లక్షణం ! కానీ
అదేమిటో ఈ మధ్య కొంతమంది కష్టాలూ నష్టాలూ పడుతుంటే నాకు చాలా
ఆనందంగా వుంటున్నది. వయసు పెరిగిన కొద్దీ వీడికి ఇదేం బుద్ధిరా బాబూ
అనుకుంటున్నారా?! ఏవిటో ఈ మధ్య నేను బయటకు వెళ్ళటమే బాగా తగ్గిం
చాను. కారణం తోటి మానవులు వాళ్ళ ప్రవర్తన చాలా చిరాకు కలిగించడమే!
ఇలా కదలకుండా ఇంట్లో కూర్చోడం చేత నాకు బద్ధకం పెరిగింది! ఎదో వంట్లో
తేడాగా అనిపిస్తున్నది. ప్రతి రోజూ ఉదయం మా ఇంటికి వచ్చినాతో పుస్తకాలు,
పత్రికలతో కాలక్షేపం చేసే మా డాక్టరు మితృలు రాఘవమూర్తిగారితో వళ్ళు
రెపేరుకు( ఈ మాట శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు, ఆయనకు కాస్త వళ్ళు
నలతగా వున్నప్పుడు ఫోనులో నాతో అనే వారు) వచ్చినట్లు వుందండి అంటే
హాస్పటల్కు రండి అని బిపి, సుగరూ ఉన్నాయేమో అని చూసి అంతా నార్మల్
గా వుంది మునపటిలా బయటికి వెళ్ళి వస్తుండండి" అని అన్నారు. సరేనని
స్కూటర్ మీద బయలుదేరి రోడ్దెక్కగానే ఎదురుగా యమస్పీడుగా బైకుమీద
ఓ మెడవంకరగాడు వస్తూ నన్ను గుద్దేయబోయి, తమాయించుకున్నాడు గాని
వాడి మెడసందులో వున్న ఖరీదైన సెల్లు మాత్రం ఎగిరి అంతదూరంలో రోడ్డు
మీదపడి తునాతునకలైంది. చాలా మంది జనాలు మూగి ఆ ముక్కలు దయతో
ఏరుకొచ్చి సానుభూతి చూపించడం మొదలెట్టారు. మీరు ఏమైనా అను కోండినాకు
మాత్రం తెగ ఆనందం వేసింది. కాలం ఎంతో విలువైనదిగా , ఒక్క క్షణం వృధా
చేయనివాళ్ళలా ఇలా స్ఫీడుగా వెళ్తూ సెల్లు మీద సొల్లు కబుర్లు చెప్పుకొనే ఇలాటి
జులాయిగాళ్ళకి ఇలాటి శాస్తి జరిగి తీరాలిసిందే !
ఈ వేళ వార్తలు వింటుంటే ( ఈ రోజు పేపర్లన్నిటికీ శెలవు కాబట్టి న్యూస్ చానళ్ళు
చూడటం తప్పలేదు) కాకినాడలో వేలమంది జనాలు పోస్టాఫీసులో 50 రూపాయలతో
పొదుపు ఖాతాలు ప్రారంభించడానికి క్యూలో ఉదయం ఏడు గంటలనుంచే నిలబడ్డారన్న
వార్త వింతగా తోచింది. జగన్, గాలి, సత్యసాయి ట్రస్టుల డబ్బు నంతా ఇలా ఓపెన్చేసిన
ఖాతాల్లో 50,60, వేల పైగా ప్రజలకు జమచేస్తారని ఎవడో తలకు మాసినవాడు ప్రచారం
చేస్తే ఈ మూఢ జనులు తమ పనులు మానుకొని ఖాతాలు తెరిచారట! కోప్పడకండీ
మనకు ఇలాటి మూఢజనాలున్నారు కాబట్టే మనకు ఇలాటి దోపిడీ ప్రభుత్వాలు వస్తు
న్నాయి. బంగారం మెరుగు పెడతామని ఎవడో వస్తే వాడికి ఇచ్చేస్తుంటారు. బంగారం
ధరలు మండిపోతూ వెలిగిపోతుంటే చవగ్గా బంగారం అమ్ముతామంటే ఎగబడి కాకి
బంగారం కొనేసే జనాలు ఇంకా వున్నారు. తేరగా వస్తుందంటే ఇలా డబ్బుకు ఆశపడుతున్న
వాళ్లల్లో బాగా డబ్బు చేసిన వాళ్ళూ, చదువుకున్న వాళ్ళు వుండటం మన దౌర్భాగ్యం
చాలామంది బైకులు డ్రైవ్ చేస్తున్నారుకానీ వాళ్ళకు నడపటమే కాదు, కనీసం పార్కింగ్
చేయటం రాదు. మా ఇంటికెదురుగా వున్న హాస్పటల్కువచ్చే వాళ్ళు గేటు కెదురుగా
అడ్డదిడ్డంగా పార్కు చేస్తుంటారు. పెద్దవాళ్ళు, పేషెంట్స్ వాటి మధ్య నుంచి లోపలికి వెళ్ళడం
ఎంత కష్టమో వీళ్ళకి అవసరం లేదు. ఇక మన స్కూటర్ పార్క్ చేసి వెళ్ళిరాగానే దానికి
అడ్డంగా పెట్టే వాళ్ళుకొందరైతే, మన స్కూటర్ మీద కూర్చొని దర్జాగా కబుర్లు చెప్పుకొనే
వాళ్ళూ మరికొందరు. ఇలాటి నడవడి చూస్తుంటే నాకు మాత్రం( మా ఆవిడ మాత్రం
మీకెందుకు ! మీ బోధలు వాళ్లకెందుకు ! అనవసర గోడవలకు దిగకండీ అంటుంది)
చిర్రెత్తుకు వస్తుంది. పోను పోను, మరింకెంత ఘోరంగా తయారవుతుందోనని నా బెంగ.
ఈ అన్యాయాలను చూస్తూ టెన్షన్ పడకుండా వుండాలంటే ఇంట్లో హాయిగా పుస్తకాల
మధ్య కూర్చొని కాలక్షేపం చేయడమే ఆరోగ్యానికి మంచిదనిపిస్తుంది.మళ్ళీ కొత్త పుస్త
కాలకోసం బైటకు వెళ్లక తప్పదు కాదా ! అందుకే పోస్టులో తెప్పించుకుంటున్నాను.
ఇంట్లోకి కూరలు, తదిరవస్తువులకోసం రిలయన్సు మార్ట్ కు వెళితే అన్నీ అక్కడే
దొరుకుతాయి కాబట్టి, పార్కింగ్ బాధలూ వుండవనుకుంటే, మన కార్టులో వున్న
మనం కొనుక్కున్న వస్తువులను తీసి ఇది ఏ కౌంటరులో వున్నదని మనల్ని
అడిగేవాళ్ళు కొందరైతే , మనకు అడ్డంగా నిలబడి కదలకుండా కబుర్లు చెప్పుకొనే
వాళ్ళు మరికొందరు!. దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి (?) చెందినా జనాల్లో మార్పు
రాకపోవడం బాధాకరం ! ఏదో చాదస్తంగా వ్రాసానా! నాకు వయసు పైబడినకొద్ది చాదస్తం
పెరుగుతున్నదంటున్నది, నా శ్రీమతి. ఆవిడకేమో వయసు తగ్గుతున్నట్లు!
సెల్లు బైకు కార్టూన్కు మితృలు డాక్టర్ జయదేవ్ బాబుగారికి కృతజ్ఞతలు

Tuesday, October 25, 2011

సామాన్యునితో అసామాన్యుడు- శ్రీ ఆర్కే. లక్ష్మణ్ !!

శ్రీ ఆర్కే లక్ష్మణ్ ఇట్లా అంటారు." పుట్టుకతోనే ఏ వ్యక్తి ఏ రంగంలోనూ
ప్రముఖుడైపోడు"
నిన్ననే తన 90 వ జనమదినాన్ని జరుపుకున్న ప్రఖ్యాత వ్యంగ్య
చిత్రకారుడు తన పొలిటికల్ కార్టూన్లతో అలరించారు. ఆయన TIMES
OF INDIA దిన పత్రికకు అనుదినం వేసిన ప్రతిఒక్క కార్టూన్లలో ఆయన
సృష్టించిన భారతదేశపు సామాన్యుడు అగుపిస్తాడు.
చక్కని కార్టూనిస్ట్ కావాడానికి ప్రధానంగా హాస్యాభిరుచి, చక్కగా బొమ్మలు
గీయగలగడం, మంచి చదువు అవసరమని శ్రీ లక్ష్మణ్ అంటారు.


అందవికారంగా వుండే పక్షులు కాకులు కూడా అయన కుంచె తో
ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక ఆయన గీసిన రాజకీయ, క్రీడా ,సినీ
ప్రముఖుల కేరికేచర్లు గురించి వేరే చెప్పనక్కరలేదు .
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఆయన వేసిన కొన్ని పాకెట్ కార్టూన్లు,
తెలుగు అనువాదంతో చూడండి. ఆయన అనారోగ్యం నుంచి మరింత
కోలుకొని మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ...

Sunday, October 23, 2011

శ్రీ సత్తిరాజు శంకరనారాయణ రేఖాచిత్ర ప్రదర్శన

సత్తిరాజు అనగానే ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా వుందే అని మీకనిపించింది
కదూ ! అవును అది మన బాపు గారి ఇంటి పేరు, బాపుగారి పూర్తి పేరు
సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఈ శంకరనారాయణగారు బాపుగారి సోదరులు.
ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. చిత్రలేఖనం
పై ఆశక్తితో పెన్సిల్, చార్కోల్ లతొ అద్భుతమైన ప్రముఖుల పొట్రైట్స్ 1500
పైగా వేశారు. అల్లు నుంచి ఆలీ దాకా, జానీవాకర్ నుంచి జానీ లీవర్ వరకూ
తెలుగు హిందీ కళాకారుల స్కెచ్ లు గీశారు. అలానే సంగీత కళాకారుల,సినీ
రాజకీయ ప్రముఖుల చిత్రాలను చిత్రించారు. "హాసరేఖలు" పేరిట ఆయన
చిత్రించిన హాస్య-సంగీత కళాకారుల రేఖాచిత్రాలతో హాసం ప్రచురణలు
ఓ అందమైన పుస్తకాన్ని, జూలై,2008లో ప్రచురించింది.


శ్రీశంకరనారాయణగారు చిత్రించిన ఈ రూపురేఖా చిత్రాల ప్రదర్శన ఈ
నెల 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు ICCR ART GALLERYలో
(రవీంద్రభారతి) అభిమానులకు కనువిందు చేయబోతున్నది.



శ్రీ శంకర్ సృష్టించిన ఈ రూపురేఖలు ప్రదర్శనను శ్రీమతి స్వాతీ శోమనాధ్
గారు ప్రారంభిస్తున్నారు ఈ ప్రదర్శన ఉదయం 11 గంటలనుండి రాత్రి
7 గంటలవరకు 26వతేదీ నుండి 28 తేదీవరకు నిర్వహించబడుతుంది.
కళాభిమానులందరినీ ఈ చిత్రప్రదర్శన అలరిస్తుంది.

Tuesday, October 18, 2011

కుడి ఏడమైతే పొరబాటు కలదోయ్ !!

ఇక్కడ వున్న ఒక అణా విలువైన పోస్టేజి స్టాంపులు ముద్రణలో పొరబాటు
జరిగి కుడి ఎడమలుగా అచ్చయ్యాయి. తరువాత తప్పు గుర్తించి సరిచేసి
కొత్తగా విడుదల చేశారు. ఇవి 1950 ప్రాంతంలో విడుదలయ్యాయని గుర్తు.
మా నాన్నగారికున్న హాబీలలో నాణేల సేకరణతో బాటు స్టాంపు కలెక్షన్
కూడా వుండేది. ఆయన సేకరించిన ఆనాటి అపురూపమైన స్టాంపులను
మీకు చూపిస్తున్నాను. ఆ రోజుల్లో కవరుకు ఒక అణా స్టాంపునే అంటించే
వారు. ఈ బొమ్మ కూర్చున్న భంగిమలో నున్న భోదిస్వత్తునిది.

స్టాంపులపై జోకులు :)
:" అమ్మా , ఈ కవరు బరువు ఎక్కువగా వుంది.
మరిన్ని స్టాంపులు అతికించాలి."
" ఇప్పటికే కవరు బరువుందంటున్నావ్! మరిన్ని
అతికిస్తే, మరింత బరువు పెరగదూ?!"
<><><><><><><>

" ఆ రాజకీయ నాయకురాలంటే నీకు పడదు గదా,
మరి ఆవిడ బొమ్మ వున్న స్టాంపునే కవరుకు
అతికిస్తున్నావ్ ?"
"నిజమే! పోస్టాఫీసులో ఆ బొమ్మ మీద ఠఫీ ఠపీ మని
సీలుతో గుద్దుతారు కదా! అలా నా కోపం తీర్చుకుంటా"

Monday, October 17, 2011

దేవదాసు (1953) సినిమా నవల



గతంలో సినిమా కధలు, మాటలు పాటలతో పుస్తకరూపంలో విడుదలవడం
అన్నపూర్ణావారి "తోడికోడళ్ళు" చిత్రంతో మొదలయింది. అటుతరువాత చాలా
మణిపూసలనతగ్గ చిత్రాల నవలలు పెద్ద సైజులో మంచి ముద్రణతొ వచ్చాయి.
ఇప్పుడు సెప్టెంబరు 12,2011న క్రియేటివ్ లింక్స్ వారు అందంగా పాటలు,
మాటలు, ఆచిత్ర విశేషాలు అపురూపమైన చాయాచిత్రాలతో,పాటల సిడీని
జతపరచి విడుదలచేయడం ప్రశంశనీయం. శ్రీ టి.యస్.జగన్మోహన్ చక్కగా
నవలీకరించారు. ఆయన ముందు మాటలో ఇలా అంటారు.
"దేవదాసు"ని వెండితెర నవలగా మలిచే సమయంలో, ఎ
పర్వతం వంటి శరత్ బాబు ! ఎక్కడ అతి చిన్న అణువు వంటి నేను న్నోసార్లు నా
హృదయం వికలమై, కళ్ళు చెమర్చాయి.ఎన్నేన్నోసార్లు నా స్మృతులలో
"శరత్ బాబు" దివ్యరూపం కదలాడి, మనసు ఆనందంతో పరవిశించేది.
ఆనందం కలిగిందంటే కలగదూ? ఎక్కడ సాహిత్య ప్రపంచంలో మేరు
పర్వతం వంటి శరత్ బాబు ! ఎక్కడ అతి చిన్న అణువు వంటి నేను !"
అక్టోబరు 24వ తేదీ 1951 న "దేవదాసు" చిత్రం ప్రారంభోత్సవం జరిగింది.
ఆనాటి ప్రారంభోత్సవం ఫొటోలో రచయిత సముద్రాల, దర్శకులు వేదాంతం
రాఘవయ్య, హీరో అక్కినేని, బేబీ అనురాధలను చూడవచ్చు. ఇలాటి ఎన్నో
అపురూప చిత్రాలతో బాటు సంగీత దర్శకులు కీ"శే" సుబ్బురామన్ విశేషాలను
చదవవచ్చు. ఇంకా ఈ పుస్తకంలో శ్రీ విఏకె. రంగారావుగారి నిందా స్తుతిలో
"దేవదాసు" తరువాతి కాలంలో ఎల్పీ రికార్డుగా విడుదలైనప్పుడు స్లీవ్ మీద
వేసిన తప్పులు గ్రామఫోను కంపెనీ ముద్రించడం తదితర విషయాలను ప్రస్తా
వించారు
చిన్న దేవదాసుగా సుధాకర్, చిన్న పార్వతిగా బేబీ అనురాధ.ఈ చిత్రం
26-6-1953 న విడుదలయింది.
పతాక సన్నివేశంలో బండివాడిగా సీతారాం నటన మరువలేనిది. ఇక అక్కినేని
నటన చూసి కన్నీళ్ళు కార్చని వాళ్ళుండరు. ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని
వెండి తెర నవలగా ప్రచురించిన క్రియేటివ్ లింక్ పబ్లికేషన్స్ ,హైద్రాబాదు వారు
అభినందనీయులు. 152 పేజీల ఈ పుస్తకం వెల, పాటల సిడీతో బాటు 150/-
రూపాయలు. అక్కినేని 70 వసంతాల నటజీవితానికి నవనవోన్మేష దర్పణం
అన్న ప్రచురుణకర్తల మాట ఈ పుస్తకం చూశాక మీరు తప్పక ఒప్పుకుంటారు.

Saturday, October 15, 2011

అలనాటి వార్తా పత్రిక ఆంధ్రప్రభ-రాజకీయ వ్యంగ్య చిత్రాలు



నిన్ననే నా సన్నిహితులు ఏజెయమ్.గాంధి నాకు పాతవన్నీ ఇష్టమని, ఆయనకు
నర్సాపురం వారి అత్తగారి ఇంట్లో దొరికిన ఆంధ్రప్రభ దినపత్రికలు 1956-57 నాటివి
ఇచ్చారు. వాళ్ళింట్లో వున్న వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, మామగారు, అత్తగార్ల
ఫోటోలకు కొత్త ఫ్రేములు కట్టించడానికి వాటిని విప్పితే ఆ ఫొటోల అట్ట వెనుక ఈ
పత్రికలు 55 ఏళ్ళక్రితంవి ఏ మాత్రం చెక్కు చెదరకుండా అగుపించాయట. వెంటనే
నేను గుర్తుకొచ్చి నాకు తెచ్చి ఇచ్చారు. 1956 డిసెంబరు 29 తేదీ సంచిక పతాక
శీర్షిక "ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన పరతిపాదనలు- పార్లమెంటరీ
నియోజకవర్గాలు 35 ; అసెంబ్లీకి సంబంధించినవి 249. 43పార్లమెంటరీ స్థానాలు;
301అసెంబ్లీ స్థానాలు-అసెంబ్లీలో తెలంగాణాకు మరి నాలుగు స్థానాలు." శ్రీ నార్ల
ఆంధ్రప్రభకు సంపాదకులుగా వుండేవారు. ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక వున్నా ఆంధ్ర
ప్రభ అత్యధిక సర్కులేషన్ గల పత్రికగా వుండేది. ఆ సంచికలో "10 రూపాయలకే
కట్టుడు పళ్ళు" అన్న వార్త చూడవచ్చు. ఆరు పేజీల పత్రిక వెల ఒక అణా, అంటే
ఆరు పైసలన్నమాట!.


ఆ సంచికలో రెండో పేజీలో వేసిన రాజకీయ కార్టూన్ చూడండి.ప్రసిద్ధ బ్రిటిష్ వ్యంగ్య
చిత్రకారుడు డేవిడ్ లో "మాంచెస్టర్ గార్డియన్" వేసిన కార్టూన్ను మార్పు చేసి
చిత్రకారుడు శ్రీ వాసు గీశారు.


జనవరి 4, 1957 ఆంధ్రప్రభలో కాశ్మీరు సమస్యను పాకిస్థాన్ తిరగతోడుతున్న
విషయాన్ని శ్రీ వాసు గీశారు. ఆ రోజుల్లో కార్టూన్ లోని విషయాన్ని విపులీకరించే
వారు. " కాశ్మీర్ సమస్యను తిరిగి పరిశీలించవలసిందిగా భద్రతాసంఘాన్ని పాకిస్థాన్
తిరిగి కోరింది" --వార్త ! విచిత్ర మేమంటే ఇన్ని సంవత్సరాలైనా కాశ్మీర్ సమస్య
అలానే వుంది !!


జనవరి 11, 1957 ప్రభలో "ఈడెన్ రాజీనామాను ఈజిప్ట్ ప్రెసిడెంట్ నాజర్ కు
బ్రహ్మాండమైన విజయంగా పరిగణించాలి" --వాషింగ్టన్ లోని కామన్వెల్త్ వర్గాల
వార్త.... శ్రీ వాసు చిత్రించిన మరో కార్టూన్! మరోసారి ఆనాటి పత్రికలలోని వ్యాపార
ప్రకటనలను చూద్దాం !!

Thursday, October 13, 2011

విమానాలు= వి మానవతులు !!



ఒకప్పుడు విమానాలు సామాన్యూడికి అందుబాటులో ( ఎక్కడో పైన ఎగిరేవి గొప్పోళ్లకు
మాత్రం అందుబాటులా వుంటాయా?!) వుండేవికాదు గానీ ఇప్పుడు రైల్టిక్కెట్లు (రైలు టిక్కెట్ల
కోసం ఇక్కట్లు ఎక్కువై) దొరకటం అంత సులువు కాకపోవటం వల్ల అందరూ విమానాల
వైపు పరుగెడుతున్నారు. అసలు విమానాలను కనుక్కొన్నది రైటు సోదరులని అంటారు
కానీ అది రైటుకాదని నా అనుమానం. ఏమంటే మన పురాణాల కాలం నుంచే విమానాలు,
(పుష్పకవిమానాలు, ఇవి ఇప్పుడుంటే అంతులేకుండా టిక్కెట్లు ఎంచక్కా అమ్ముకోవచ్చు)!
వుండేవి. రామాయణకాలంలో జెట్లూ వుండేవి, అదేనండి మీరు రామాయణంలో జటాయువు
గురించి చదవలే! ఇప్పటి విమానాల్లో మనకి అన్ని సదుపాయాలూ చూడటానికి ఉన్న వనితలను
ఎయిర్ హోస్టెస్స్ లంటారు. అచ్చతెలుగులో విమానవతులు అని పిలవాలన్నమాట. నిజ జీవితంలో
ఎయిర్ హోస్టెస్ ఐన కాంచన ( దర్శకుడు శ్రీధర్ విమానప్రయాణంలో చూశాక) "కాదలిక్క నేరమిల్లై"
లో నాయకిగా నటించి సినిమాతారగా మారిపోయింది. అలానే నటి వాణిశ్రీ" ప్రేమనగర్" సినిమాలో
ఎయిర్ హోస్టెస్ పాత్రలో నటించింది.
విమానాల మీద ప్రయాణమే కాదు ఎన్నెన్నో జోకులూ, కార్టూన్లు ఉన్నాయి. ఇక్కడ మీరు
చూస్తున్న కార్టూన్ బ్రిటిష్ వార పత్రిక TIT BITS ( 1950) సంచికలోనిది.
ఈ కార్టూన్ రైల్వే జంక్షన్లలో రైళ్ళు మారేటట్లు విమానాలు మారుతే ఎలా వుంటుందో అనే సరదా
ఊహతో వేసింది..

అలానే అమ్మాయి మెడలో విమానం బొమ్మ లాకెట్ పై నేను గీసిన చిలిపికార్టూన్. ఈ నా కార్టూన్
చూసి ప్రఖ్యాత కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ గారు తన్ అభిప్రాయాన్నెంత చిలిపిగా చెప్పారో చూడండి.!!
శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు తమ "కోతికొమ్మచ్చి"లో విమాన సాహస యాత్ర గురించి ఇలా
చెప్పారు. "అప్పట్లో హిందూ పేపరు వారు మెద్రాసు-హైద్రాబాదు విమాన సర్వీసు నడిపేవారు....
అది తెల్లవారుఝామున మెద్రాసులో మూడుగంటలకు హిందూ డెయిలీ, స్పోర్ట్స్ మెన్ వీక్లీ
పత్రికలు వేసుకొని హైద్రాబాదు వెళ్ళి అక్కడ ఓ పెద్ద లోడ్ దించేది. అక్కడనుంచి విజయవాడకి
షార్ట్ హాల్ హాప్, అక్కడ మిగతా పేపర్లు దించేవారు. అక్కడినుంచి బండి ఖాళీ కాబట్టి ఐదుగురు
పాసెంజర్లను ఎక్కించుకొనేవారు. టిక్కెట్ విజయవాడ నించి మెడ్రాసుకు నలభైఐదు రూపాయలు.
ప్రయాణం కూడా నలభైఐదు నిముషాలే... సుఖాలు మరిగిన పాసెంజర్లు ఎక్కడానికి జంకేవారు-
నాలాటివాళ్ళు సాహసించేవాళ్ళు-ఇది ప్లేను-చవక కాబట్టీ."
శ్రీ ముళ్లపూడి విమానం పై చెప్పిన ఓ జోకు:
ఒక నేలయ్యగారు తొలిసారి విమానం ఎక్కారు ఢిల్లీకి. ఇంజను హోరెత్తగానే కిటికీలోంచి
చూచి కెవ్వుమన్నాడు.
"అయ్య బాబోయ్, అప్పుడే ఎంతెత్తు కెగిరిపోయామో చూడండి, చూడండి, కిందని ఆ జనం
చీమలబారులా ఎలా కనిపిస్తున్నారో ?" అన్నాడు.
"అయ్యా, విమానం ఇంకా పైకి లేవలేదు. మీరు చూసేది జనం కాదు, నిజంగానే చీమలబారు"
అన్నాడు పక్కాయన.

Wednesday, October 05, 2011

" ఆడు " వారి మాటలకు అర్ధాలే వేరులే !!




ఆడువారు అంటే "ఆడు" వారు కాదండి ! మాటలాడువారని నా భావన!
మాటలకు అర్ధాలు ఎలా మారిపోతున్నాయో ! అదే మన తెలుగు భాష
కున్న సౌకర్యం.తెలుగుతో మాటలాడుకోవడమే కాదు ( ఐనా మన తెలుగు
వాళ్ళు తెలుగులో మాట్లాడు కోవడం తక్కువే కదా ) ఆ మాటలతో ఆటలు
ఆడుకోవచ్చు! ఒక్కో సంధర్భాన్ని బట్టి , ప్రాంతాలను బట్టి అర్ధాలు ఇట్టే
మారిపోతాయి. మీరు కొత్తగా స్కూటరో , బైకో కొనుక్కుని బయటకు
వచ్చారనుకోండి. వెంటనే మీకు ఎదురయ్యే ప్రశ్న, "పెట్రోల్ ఎంతిస్తుంది?"
అని. అసలే పెట్రోలు ధర పెట్రోలులా మండిపోతుంటే ఆ ప్రశ్నతో మనకు
మరింత మండి పోతుంది ! అదేమన్నా కామధేనువా, కాకపోతే ఏ ఆవా,
గేదా, పాలిచ్చినట్లు పెట్రొలు ఇవ్వడానికి.


ఇక నేను బ్యాంకు నుంచి రిటైరైన కొత్తలో,; కనిపించిన ప్రతి వాడూ "ఏంటీ,
అప్పుడే రిటైరై ఫోయారా? అని ఆడిగే వారు. నేనూ, " మీరు విన్నది సగం
నిజం, సగం అబద్ధం ! ఏమంటే నేను రిటైరయ్యాను అన్నది నిజం. కానీ
ఫొయిన మాట మాత్రం అబద్ధం. ఇదిగో దయ్యంలా మీ ముందు నిలబడి
వున్నాకాబట్టి" అని జవాబిచ్చేవాడిని. ఇలా ఈ ప్రశ్నలను బట్టి ఓ కార్టూన్
కూడా వేసేశా!
నేను శ్రీకాకుళం స్టేటు బ్యాంకులో క్యాషియరుగా 1963లో చేరినప్పుడు
బ్యాంకు మెసెంజరు ( అతని పేరూ అప్పారావే, ఉత్తరాంధ్రలో చాలా
పేర్లు అవే ఉంటాయి) "ఇక్కడ దోమలు లావు ! జాగ్రత్తండీ " అన్నాడు.
నే కంగారు పడుతుంటే క్యాష్ ఆఫీసరు కామేశ్వరరావుగారు "కంగారు
పడకు. లావంటే ఏనుగుల్లా లావని కాదు. ఎక్కువ అని అర్ధం" అన్నారు.
అక్కడ బైటకు వెళ్ళారనడానికి పైకి వేళ్ళారంటారు. నేనొకసారి వైజాగులో
పనిచేస్తున్నప్పుడు ఒకరింటికి వెళ్ళి ఉన్నారా అని అడిగితే " పైకి
వెళ్ళారు" అని జవాబిచ్చారు వారి శ్రీమతి. నేను ఆయన మేడమీద
ఉన్నారేమోననుకొని "ఒకసారి పిలుస్తారా" అనంటే "బజారులో ఎంత
దూరంలో వున్నారో ఎలా వీలవుతుందండీ?"అన్నారు. అప్పుడు తెలిసింది
పైకి అంటే బయటకు అని. ఇప్పటిలా అదృష్టంకొద్దీ అప్పుడు సెల్ ఫోన్లు
లేవుగా!!
"టిఫిను చెయ్యడం ,టిఫిను తీసుకొని రావడం": ఈ మాటల్లోనూ తిరకాసు
వుంది. చాలాకాలం తరువాత ఉదయాన్నే ఇంటికొచ్చిన స్నేహితుడితో
హలో హలో పలకరింపులయ్యాక "కూర్చోవోయ్ ! పదినిముషాల్లో టిఫిన్
తీసుకొనస్తా" అంటూ లోపలికి వెళ్ళిన ఫ్రెండు ఓ పదిహేను నిముషాల
తరువాత ఖాళీ చేతుల్తో బైటకు వస్తే ఆశగా టిఫిన్ తీసుకొస్తాడేమోనని
ఎదురు చూసిన స్నేహితుడి బుర్రకు అప్పుడర్ఢమవుతుంది అతను లోపల
టిఫిన్ తీసుకొని (కానిచ్చి) వచ్చాడని. అలానే టిఫిన్ చేద్దూగాని అంటూ
బజార్లో అగుపించిన మితృన్ని ( అతడు అన్ని రకాల (పిండి)వంటలూ
బాగా చేస్తాడని తెలుసుకొని) ఇంటికి పిలవడమ్లోనూ వేరే అర్ధముంటుంది.





"ఏమిటో ఈ బందులతో మహా ఇబ్బందిగా వుంది.ఊరికెల్దామంటే బస్సులూ,
రైల్లూ తిరగడంలేదు" అన్నాడో మితృడు రెండు రోజుల క్రితం. "బస్సులు
తిరిగితే మాత్రం నువ్వు మీ ఊరెళ్ళడం కుదరదు కదా అన్నా". "ఏం? ఎందుకు
కుదరదు?" అన్నాడు "!బస్సులు నడవాలిగాని,అదే తిరిగితే ఇక్కడే ఉంటావు"
అన్నా. "బస్సులు నడవడానికి వాటికి కాళ్ళుంటాయా?! తిరగడం అన్న మాటే
కరెక్ట్ అన్నాడు. "సరే! తిరగడం, నడవడం రెండూ తప్పే! చక్రాలుంటాయి కాబట్టి
దొర్లడం అనటమే కరెక్ట్ మాట అన్నాను. " ఈ మధ్య బస్సులూ రోడ్లమీద తరచు
దొర్లుతూనే ఉన్నాయ్"అన్నాడు మరొ మితృడు మధ్యలో కలగచేసుకొని.
పడటమన్నా నానా అర్ధాలున్నాయి. "ఈ మధ్య మీ కార్టూన్లేమన్నా పత్రికల్లో
పడ్డాయా" అంటూ మా మితృడు హనుమంతరావడిగితే, " పత్రికలవాళ్ళు
త్రిప్పి పంపిన కార్టూన్లు పోస్ట్మాన్ విసిరితే హాల్లొ పడ్డాయ్!" అంటూ మా పద్మ
జోకెయ్యగానే, వెంటనే ఆ ఐడియాతో కార్టూన్ వేయగానే నిజంగానే "రచన"
పత్రికలో ఆ కార్టూన్ పడింది. అలానే పడటం మీద " నాకు ఏసీ పడదు " అని
ఒకాయన అంటే ఆ "పడటం" మీద ఓ కార్టూన్ వేశాను. శ్రీ ముళ్లపూడి వెంకట
రమణగారు ఈ నా కార్టూన్లను ఎడా-పెడా-ర్ధాల కార్టూన్లంటూ నా కార్టూన్ల
పుస్తకానికి ముందుమాట చెబుతూ అన్నారు.
పెద్దల మాటలకు అర్ధాలే వేరులే !!
*ఒకసారి మదరాసు సెంట్రల్ స్టేషనులో శ్రీ శ్రీ కనబడితే మొక్కపాటి
నరసింహశాస్త్రిగారు " ఊరికేనా ? " అని ప్రశ్నించారు.
" ఊరికే " శ్రీ శ్రీ సమాధానం.
<><><><><>
*ఈ రెండో జోకులోనూ శ్రీ శ్రీ గారే కధానాయకుడు.మదరాసులో
పూర్వం ఒక తెలుగు కాఫీహొటేలు వుండేది. దాని ప్రత్యేకత పెసరట్లు.
కొందరం వెళ్ళి కుర్చీలలో కూర్చొని కావలసినవి ఆర్డరిస్తున్నాము. శ్రీశ్రీ
తనకి సహజమైన పరధ్యానంలో వున్నాడు. అందరం అట్లు ఆర్డరుచేసి
"శ్రీ శ్రీ గారూ ! మీకూ అట్టు చెప్పేం " అన్నాం.
ఆయన " అట్లే కానిండు " అన్నాడు.
<><><><><><>
"ఎచటికండీ అంత త్వరగా బోవుచుంటిరి ?"
"జపానికి"
"అమ్మో అంతదూరమే ?"
"జపానికి కాదండీ-జపమునకు" అని వాని తెలివితక్కువకు
నవ్వుకొనుచు జపాన్ కు బోవును.
ఈ జ్యోకులు బాపు రమణల బృందం అందించిన "జ్యోతి" మాస పత్రికనుంచి
వారికి తెలియకుండగ సంగ్రహించ బడినవి. అందులకు నేనెంతయో వారికి
కృతజ్ఞతలు చెప్పుచున్న వాడను.
.

Tuesday, October 04, 2011

కమనీయ పౌరాణిక చిత్ర సృష్టికర్త శ్రీకమలాకర కామేశ్వరరావు

యన్టీయార్ "పాండురంగ మహత్మ్యం", "నర్తనశాల", ఏఎన్నార్ "మహాకవి కాళిదాసు"
లాంటి పౌరాణిక చిత్రాలతో తెలుగు చిత్రాలకు అఖండ విజయంతో బాటు విదేశాలు,
మధ్యప్రదేశ్ లాంటి ప్రక్క రాష్ట్రాలలో కూడా పేరు ప్రఖ్యాతులను గడించిపెట్టిన దర్శకులు
శ్రీ కమలాకర కామేశ్వరరావు గారి శతజయంతి నేడు. ఆయన పౌరాణిక చిత్రాలే కాదు
"గుండమ్మ కధ" చిత్రంతో హాశ్యాన్ని పండించారు ఇంతటి ప్రతిభావంతుడైన ఈయన
దాదాపు యాభై చిత్రాలకే పరిమితమవడం ఆశ్చర్యమే !! ఆయన పౌరాణిక చిత్రనిర్మాణం
లోని ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత హిందీ చిత్ర నిర్మాత రామానంద సాగర్ తాను తీయ
బోయే హిందీ పౌరాణిక ధారావహికలకుముందుగా కామేశ్వరరావుగారి చిత్రాలను
పరిశీలించారంటే ,అదిఆయన ప్రతిభకు నిదర్శనం.ఆయన హెచ్ యమ్ రెడ్డి, బియన్.రెడ్డి,
కె.వి.రెడ్డిల దగ్గరచిత్ర నిర్మాణ మెలుకవలు నేర్చుకున్నారు. దర్శకుడిగా ఆయన చిత్రాలు
"చంద్రహారం", "గుణసుందరి కధ" (తమిళం), "పెంకిపెళ్ళాం" వరుసగా అపజయం చెందినా
కామేశ్వరరావుగారు అపజయాలనూండే పట్టుదలతో విజయాలను సాధించారు.
ఆయనను అమితంగా గౌరవించే యన్టీ రామారావు తన చిత్రం "పాండురంగ మహాత్మ్యం"
దర్శకత్వాన్నిఆయనకు అప్పగించి అఫూర్వ విజయాన్ని సాధించారు
తను దర్శకత్వం వహించిన చిత్రాలన్నిటిలోకి "నర్తనశాల" ఆయనకు బాగా
నచ్చిన చిత్రం. అందులో యన్టీయార్ ను బృహన్నలపాత్రలో అద్భుతంగా చూపించారు
శ్రీ కామేశ్వరరావు. ఆ పాత్రను శ్రీ రామారావు అనన్యసామన్యంగా పోషించారు.


"నర్తనశాల" చిత్రంలో కీచకునిగా నటించిన యస్వీ.రంగారావును "విశ్వనట చక్రవర్తి"
గాచేసింది. జకర్తాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ నటునిగా, ఆ చిత్ర
కళాదర్శకుడికి పురస్కారాన్నిగెలుచుకున్నది. ఈ ఫొటోలో జకర్తాలో జరిగిన
ఆసియా-ఆఫ్రికా పిల్ము ఫెస్టివల్లో ఆనాటి ఇండోనేషియా అద్యక్షుడు శ్రీ సుకర్నోతో
యస్వీ రంగారావు, సావిత్రి, నిర్మాత లక్ష్మీరాజ్యం.



"మహాకవి కాళిదాసు" చిత్రం ఈనాటికి ఓ కావ్యంగా నిలిచిపోయిందంటే అందుకు
ఏయన్నార్ తో బాటు ఆ చిత్రానికి పనిచేసిన కవి నాగేంద్రరావుగారు, సంగీత
దర్శకుడు పెండ్యాలగారు, కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలేగారు ,ఈ మహామహుల
సహకారంతో శ్రీ కామేశ్వరరావుగారు దర్శకప్రతిభే ముఖ్యకారణం. ఈ చిత్రం అక్కినేనికి
మధ్యప్రదేశ్ ప్రభుత్వ"Ratna of Kalidas Academi" పురస్కారం లభించడం విశేషం.
షరా మామూలుగా ఇంతటి ప్రతిభావంతుడైన దర్శకునికి ప్రభుత్వంనుంచి ఎలాంటి
గౌరవం పురస్కారం లభించలేదు. కళాభిమానులందరి తరఫున ఈ మహనీయుని
శతజయంతి సంధర్భంగా నివాళులు

Sunday, October 02, 2011

ఆటగాడు ,పాటగాడు జిత్మోహన్మిత్రా !!



ఈ ఫొటోలొని నటున్నికాదు కాదు గాయకుణ్ణి చూశారా! ఆయనే శ్రీపాద జిత్మోహన్ మిత్రా!
పేరుని బట్టి మరోలా అనుకోకండి. ఈయన నూరుపాళ్ల తెలుగువాడే. జిత్ అనే మేమంతా
పిలుస్తాం. జిత్ పాడితే అచ్చు కిషోర్ పాడినట్లే వుంటుంది. అందుకే జిత్ ఆంధ్రా కిషోర్ గా
పేరుపొందాడు. రాజమండ్రి పరిసారాల్లో సినిమా షూటింగ్ అంటే నిర్మాతలకు అన్నివిధాలా
సహకరాన్ని జిత్ అందిస్తాడు. విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన "శంకరాభరణం" సినిమాలో
శంకరశాస్త్రిని "హల్లో శంకరశాస్త్రి" అంటూ పాటపాడుతూ గోలచేసిన పాత్రలో మీరు జిత్ ను
చూసే వుంటారు. కె.విశ్వనాధ్ జిత్ గురించి చెబుతూ "రాజమండ్రి పేరు చెప్పగానే మాకు
ముందు గుర్తుకొచ్చే పేరు జిత్మోహన్ మిత్రా. గోదావరి అందాలు,నది ప్రక్కన దేవాలయాలు
నర్సరీలు వంటి అందమైన లొకేషన్సుని మేము వెండితెరపై చూపెడుతున్నామంటే దానికి,
ముఖ్యకారకుడు, స్పూర్తి, మార్గదర్శి మా జిత్మోహనే. "శారద" తీస్తున్నప్పుడు ఆయనతో
అయిన పరిచయం ఆ తరువాత "సిరిసిరిమువ్వ","శంకరాభరణం","స్వాతిముత్యం" వంటి
చిత్రాలతో బాగా బలపడింది." హాస్యనటుడు ఆలీని తెలుగుతెరకు జిత్ పరిచయం చేసిన
విషయాన్ని ఈ నాటికి శ్రీ ఆలీ చెబుతుంటాడు. 30-3-1943 లో జన్మించిన జిత్ నాన్న
గారు శ్రీపాద కృష్ణమూర్తి ప్లీడరు గుమాస్తా. ఆయన మంచి రంగస్థల నటులు. జిత్ సోదరుడు
కీ"శే" పఠాభి కూడా నటుడిగా పేరుపోందారు. జిత్ శ్రీమతి R&B శాఖలో అసెస్టెంట్
ఇంజనీరుగా పనిచేసి రెటైరయ్యారు. జిత్ 1954లోమొట్టమొదటిసారిగా తను చదివే
మునిసిపల్ హైస్కూళ్ళొ "బైజుబావరా’ చిత్రంలోని "ఓ దునియా కే రఖ్ వాలే" అనే పాటతో
తన గానకళకు స్వీకారం చుట్టాడు. జిత్ మోహన్ మిత్రా ఆర్కెస్ట్రా పేరిట 1970లో
స్వంత బృందం ఏర్పరిచి ఇప్పటివరకూ 3000 ప్రొగ్రాములపైగా నిర్వహించాడు.
1975లో మొదటిసారిగా శ్రీ బాపు దర్శకత్వంలో "ముత్యాలముగ్గు" సినిమాద్వారా సినీ
రంగ ప్రవేశం చేశాడు.
సప్తపది చిత్రంలో శ్రీమతిజానకి పాడిన "గోవుల్లుతెల్లన, గోపయ్య నల్లన" పాటలో
తన కుమార్తె లలితతోనటించిన సన్నివేశం ఆ పాట లాగానే ప్రేక్షకుల హృదయాల్లో
ఈనాటికీ నిలచిపోయింది.


కళాతపస్వి దర్శకులు విశ్వనాధ్ గారిద్వారా సన్మానం అందుకున్నాడు శ్రీ జిత్..శ్రీ ముళ్లపూడి
తన ముక్కోతికొమ్మచ్చిలో "అందాలరాముడు" అవుట్ డోర్ షూటీంగ్ సమయంలో జై ఆంధ్రా
ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు జిత్మోహన్ ఎలా సహాయంచేశాడో రమణగారి మాటల్లో
"జై ఆంధ్రా ఉద్యమం అంత ఉధృతంగా ఉండగా వీళ్ళు షూటింగ్ ఎలా చేస్తారు-చచ్చినా
జరగనివ్వమని జై ఆంధ్రా లీడర్సు కొందరూ- అక్కినేని షూటింగును ఎలా ఆపుతారో చూస్తామని
నై ఆంధ్రాలీడర్స్ కొందరూ రాజమండ్రినుంచి రెండు లారీల్లో దేవీపట్నం లోకేషనుకు బయలు
దేరుతారని కబురు వచ్చింది..నేనూ,సితారాముడూ కారు మీద ఎగిరి వెళ్ళాం.అక్కడ యూనియన్
లీడర్సులో ఒకడూ,నటుడూ,డాన్సరూ,లాయరూ,శ్రీపాద పఠాభిగారి తమ్ముడూ అయిన జిత్
మోహన మిత్రా గారి సహాయ సహకారాలతో ఆ ఊరేగింపు నాయకులను ఆపి, ఈ షూటింగ్
మూడునెలల క్రితమే నిర్ణయించుకున్నామనీ, అడవిలో ఏ మూలో కొండ కోనల్లో జరిగే పనులు
ఆపితే-రెండు మూడు వందల కుటుంబాల పొట్టకొట్టడమే అవుతుందనీ నచ్చచెప్పి ఒప్పించాం"
జిత్ సమర్ధతకు ఇదో చిన్న ఉదాహరణ. శంకరాభరణం షూటింగ్ సమయంలో కీ గ్రామఫోను
(అప్పటికి నా దగ్గర లేదు) కావాలని విశ్వనాధ్ గారు అంటే రాజమండ్రి అంతా గాలించి గ్రామఫోన్
సంపాదించి తెచ్చాడు జిత్!!
మా రాజమండ్రి హాసంక్లబ్ కార్యక్రమాలకు ప్రారంభం నుంచీ దాదాపూ తప్పక హాజరయ్యే జిత్
మోహనమిత్రాకు హైద్రాబాదు హాసం క్లబ్ వారు శ్రీ యమ్బీయస్.ప్రసాద్, శ్రీ యస్వీ.రామారావుగార్ల
అధ్వర్యంలో ఇటీవలే సత్కారం జరిగింది
శ్రీరామదాసు చిత్రంలో అక్కినేనితో జిత్.



"ముద్దమందారం" చిత్రంలో రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో జిత్ నటించి పాడిన "నా
షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి పాట" మీకు వినిపిసున్నాను. ఈ పాట ఎంతో పాప్యులర్
అయింది. Sea Record కంపెనీ మిని లాంగ్ ప్లే రికార్డుగా (33 1/3 RPM) 1981 ఆపాట
విడుదలయింది. సాధారణంగా 331/3 RPM రికార్డులు పెద్ద సైజులో వెలువడితే ఈ రికార్డు
చిన్న సైజులో వెలువడటం ఓ విశేషం !!

Saturday, October 01, 2011

నవ్వుల జల్లు,అల్లు !! జయంతి నేడే !

హాస్యవల్లరి మన అల్లు !
తెలుగుతెరపై కురిపించాడు నవ్వుల పువ్వుల జల్లు !!
ఈనాటి తెలుగుతెరపై సిసలైన నవ్వులు నిల్లు !!
నవ్వులనే సంపదను పంచుతూ తెలుగువాళ్ళకు రాశాడు విల్లు !!