Tuesday, January 29, 2013

పద్మశ్రీకి బాపు అవార్డు !!


      ఎన్నాళ్ళకు పద్మశ్రీ అవార్డుకు విలువ వచ్చింది ! అవునండీ పద్మశ్రీ అవార్డు
బాపుగారికి వచ్చి ఇన్నాళ్ళకు ఆ బిరుదుకే విలువ పెరిగింది. ఆయన
ఇంతకాలం అవార్డు కా(రా)వాలని ఆయన ఏనాడు కోరుకోలేదు. కానీ
ఆయన అభిమానులు మాత్రం ప్రతి ఏడాదీ పద్మ అవార్డుల ప్రకటనలో బాపు
గారి పేరుంటుందేమోనని ఆతృతగా ఎదురు చూస్తూనే వున్నారు.


      శ్రీ బాపు 1945 నుంచి తెలుగు, తమిళం, ఇంగ్లీషు పత్రికల ,కధలకీ
, నవలల ముఖచిత్రాలకీ బొమ్మలు, కార్టూన్లు వేస్తునే వున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి ముఖ్యమంత్రిగా సారధ్యం వహిస్తున్నప్పుడు
బాపు రమణలు కలసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధమిక విద్యాభోధనకు ఆడియో
విజువల్ పాఠాలు ( 1986-88) నిర్మించారు. ఈటీవీ కోసం 40 గంటల టీవీ
సీరియలుకు దర్శకత్వం వహించారు (1996-2004). తిరుమల తిరుపతి
దేవస్ఠానం ఆస్థాన చిత్రకారుడిగా 1979 నియమించ బడ్డారు. రఘుపతి
వెంకయ్య అవార్డు, ఆంధ్రాయూనివర్సిటీ నుంచి డాక్టరేట్ (కళాప్రపూర్ణ),
తిరుపతి వెంకటేశ్వరయూనివర్సిటీ ఆనరరీ డాక్టరేట్ ఇలా ఎన్నో సత్కారాలు
అందుకున్నారు.
        ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ 2001, ఆంధ్రప్రదేశ్ ప్రెస్
అకాడమీ-2002, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం-క్రోక్విల్ అకాడమీ-2002,
ప్రపంచ తెలుగు సమాఖ్య 2004, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 5 వ
తెలుగు సాహితీ సదస్సు 2006 లలో లైఫ్ టైం అచీవుమెంట్ అవార్డులు
పొందారు..భద్రాచలం రామాలయంలో, కోటప్పకొండ దేవాలయంలోనూ
ఆయన వేసిన వర్ణచిత్రాలు అలంకారాలుగా నిలచాయి.
   1967 నుండి తెలుగు సినిమాలకు గర్వకారణమైన చిత్రాలను మితృలు
శ్రీ ముళ్లపూడితో సహకారంతో దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో
వచ్చిన "సీతాకళ్యాణం" విదేశాలలో విమర్శకుల ప్రశంసలను పొందటమే
కాకుండా, లండన్, చికాగో చిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది.శ్రీ బాపు 9 హిందీ
చిత్రాలకు, ఒక తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. "వంశవృక్షం" చిత్రంతో
అనిల్ కపూర్ ను హీరోగా పరిచయం చేశారు.

   మేమింత అందంగా వుంటామా అని దేముళ్ళే అనుకునేటంత అందంగా
వుంటాయి శ్రీ బాపూ గీసిన దేముళ్ళ బొమ్మలు. శ్రీ బాపూ దేముళ్ళ బొమ్మలు
చిత్రించేటప్పుడు ఋషిగా మారిపోతారని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు
అన్నారు. ఇంతటి ప్రతిభావంతులైన శ్రీ బాపుకి పద్మశ్రీ నిజంగా చాలా చిన్న
పురస్కారం. అభిమానుల ప్రేమాదారాలే ఆయనకు నిజంగా తృప్తినిచ్చే
బహుమతి. ఆయన అభిమానిగా , ఆశేష అభిమానులందరి తరఫున
వారికి నా శుభాభినందనలు.

Thursday, January 10, 2013

మధురమీ సు(రేష్)ధాగానం !!

            జంధ్యాల రూపొందించిన " హై హై నాయకా " సినిమాలోని " సరిగమలెరుగని
రాగము....." పాట గుర్తుందా! ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా ప్రవేశించిన శ్రీ
మాధవపెద్ది సురేష్, మాధవపెద్ది సత్యం ( ఈయన మాయాబజార్ సినిమాలో
శ్రీ యస్వీ రంగారావుకు పాడిన "వివాహ భోజనంబు" పాట పాడటమే కాకుండా
అందులో అగుపిస్తారు కూడా), కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే, గాయకులు
మాధవపెద్ది రమేష్ వంటి మేటి సినీ సాం కేతవర్గానికి చెందిన కుటుంబం నుంచి
వచ్చారు.  1967 లో విజయవాడలో భావనాకళాసమితి నిర్వహించిన ఒక
కార్యక్రమంలో శ్రీ సురేష్ హార్మోనిస్ట్ గా తనప్రతిభను చూపించారు. ఆ సమయంలో
ఆయన SSLC విద్యార్ధి. శ్రీ సురేష్ అన్నగారు కర్ణాటక, హిందుస్థానీ సంగీతాన్ని
అధ్యయనం చేశారు. ఆయన ఇచ్చిన పోత్సాహంతో సురేష్ సంగీతం మీద అభిమానాన్ని
పెంచుకున్నారు. సురేష్ తల్లిగారు శ్రీమతి వసుంధరాదేవిగారికి వీణలో డిప్లొమో,
కర్ణాటక సంగీతంలో ప్రవేశముంది. సంగీతం ప్రవృత్తే గాని, వృత్తి కాకూడదని ఆమె
అనేవారట.
 శ్రీ సురేష్ నాన్నగారు విజయవాడ ఆంధ్రా సిమెంట్స్ లో ఇంజనీరుగా పనిచేసేవారు.
సురేష్ సంగీతంపై చూపిస్తున్న శ్రర్ధను గమనించి ఆయన అమ్మగారికి తెలియకుండా
ఓ అకార్డియన్ను కొనిచ్చారట. అనుకోకుండా సురేష్ నాన్నగారు 1973 లో కీర్తిశేషు
లయ్యాక కుటుంబం మద్రాసు తరలి వెళ్లారు. ఆనాడు వాళ్ల నాన్నగారు కొనిచ్చిన
ఆ వాయిద్యమే శ్రీ సురేష్ గారికి భుక్తికి దారి చూపించింది. సురేష్ అన్నగారు శ్రీ
మాధవిపెద్ది  రమేష్ నేపధ్యగాయకుడిగా ప్రశిద్ధిపొందారు.అటుతరువాత శ్రీసురేష్
సంగీత దర్శకులు శ్రీ టి.చలపతిరావుగారివద్ద అకార్డియన్ ప్లేయరగా చేరారు.1974
నుంచి ఎస్.రాజేశ్వరరావు, కె.వి.మహదేవన్,పెండ్యాల, జె.వి.రాఘవులు,రమేష్ నాయుడు,
జి.కె.వెంకటేష్, నౌషద్,లక్ష్మీకాంత్ ప్యారీలాల్,ఆర్.డి.బర్మన్ వంటి సుప్రసిద్ధ సంగీత
దర్శకుల వద్ద పనిచేశారు.
 హై హై నాయకా సినిమా తరువాత రంభ రాంబాబు, భార్గవ్, ప్రేమా జిందాబాద్, బాబాయ్
హోటల్, పర్వతాలు పానకాలు,బృందావనం చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాలన్నిటిలో బృందావనం శ్రీ సురేష్ గారి సినీ సంగీత జీవీతాన్ని మలుపు
తిప్పిందనే చెప్పాలి. అందులో శ్రీ వెన్నెలకంటి కలం నుంచి వెలువడిన " మధురమీ
సుధాగానం" సంగీత కూర్పు గొప్ప సంగీత దర్శకులను గుర్తు చేసింది. భైరవద్వీపం
లోని నరుడా ఓ నరుడా అనే వేటూరి గీతం, నారద తుంబుర గానామృతం లాటి
మధురగీతాలు ఆయనకు ఉత్తమ సంగీతదర్శకుడు అవార్డుతో బాటు డబుల్ ప్లాటినం
డిస్కును సంపాదించి పెట్టింది. దాసరి  125వ చిత్రం మాయాబజార్, రాజేంద్రప్రసాద్
మేడమ్, ఈ.కోదండరామిరెడ్డి "మాతో పెట్టుకోకు" చిత్రాలు శ్రీ సురేష్ ప్రతిభను చాటాయి.
"సాహిత్యం-సంగీతం పూలదండలోని దవనం,మల్లెపూలలాగ కలసి,విడిగా తెలిసి
అలరించాలి" అని రమేష్ అంటారు.


శ్రీమాధవపెద్ది సురేష్ గారిని నేను మొదట ఓ సంధర్భంలో శ్రీ బాపుగారింట్లో కలవడం
జరిగింది. " రాజమండ్రి మా అత్తగారి ఊరే , ఈసారి వచ్చినప్పుడు తప్పక కలుద్దాం"
అన్నారు. అటుతరువాత ఫేసు బుక్ మిత్రులుగా తరచు కలుసుకుంటున్నా ఓనాడు ఫోనులో
"నేను రాజమండ్రి వచ్చాను" అన్నారు.. నేను ఆయన్నికలసి మా ఇంటికి రమ్మని పిలువగానే
వచ్చారు. ఉన్న కొద్ది సేపూ ఆయన నాతో, నా శ్రీమతితో ఎంతోకాలం నుంచి పరిచయం
వున్న వారిలా కలివిడిగా మాట్లాడారు. వారి బాబాయి గారు శ్రీ మాధవపెద్ది గోఖలే
గీసిన చిత్రం ( భారతి మాస పత్రికలోని నా సేకరణ) పైన ఆయన సంతకం చేశారు.
సంగీత దర్శకుడిగా శ్రీ మాధవపెద్ది సురేష్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ..