Tuesday, December 29, 2009

సరాగమాల వి.ఏ.కె.రంగారావు గారు



దాదాపు నలభై ఆరేళ్ళక్రితం ఆంధ్ర వార పత్రికలో "సరాగమాల" పేరిట వచ్చిన శీర్షికలో సినిమా సంగీతం మంచి చెడులగురించి వ్రాసిన శ్రీ వి.ఏ.కె.రంగారావు గారి పేరు సుపరిచితం.ఆయన పూర్తి పేరు వేంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు.నాకు మంచి సినిమా సంగీతమంటే అభిమానం వుండటంచేత ప్రతి వారం "సరాగమాల" శీర్షికను చదివేవాడిని.ఐదేళ్ళ క్రితం 2005 జూన్ 7వ తేదీన చెన్నై పైక్రాఫ్ట్ రోడ్ లోని ఆయన రామ్మహల్ ఇంటికి వెళ్ళి కలిసే అదృస్టం నాకు కలిగింది.సరాగమాల శీర్షిక ఆంధ్రపత్రికలో రావడానికి బాపు రమణలే ముఖ్య కారకులు.శ్రీ రంగారావు గారు ఎంతగానో అభిమానించే శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారే "సరాగమాల" అనే పేరుని సూచించారట. "సరాగమాల" లో మొదటి సారి శ్రీ మల్లాది "కలిమిలేములు" సిన్మా కోసం వ్రాసిన "కొమ్మల మీద కోతి కొమ్మచ్చులాడింది తెల్లా తెల్లని ఓ బుల్లి ఎండ, నేల మీద వాలింది వాలుమొగ్గ లేసింది నల్లానల్లని ఓ బుచ్చి నీడ" పాట గురించే రంగారావు వ్రాయటం జరిగింది.ఇన్నాళ్ళకు శ్రీ ముళ్ళపూడి తన ఆత్మ కధకు "కోతి కొమ్మచ్చి" అని పేరు పెట్టడం ఒక విశేషం!.


ఆయన దగ్గర 40,000 పైగా వివిధ గ్రామఫోన్ రికార్డుల కలెక్షన్ ఉంది. ఆ రికార్డులకోసం ఎంతోకాలం కష్టపడి ఎన్నేన్నో ఊర్లు తిరిగి సేకరింఛారు.అంతే కాదు సాహితీ విలువలున్న ఎన్నో ఆంగ్ల,తెలుగు పుస్తకాల గ్రంధాలయం ఉంది. ఆయన మంచి నాట్యాచారుడు కూడా! కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ రంగారావు ప్రతి ఏటా స్వామి ఎదుట నట్యనివేదనం చేస్తారు. వార్త పత్రికలో వ్రాసిన సంగీత విమర్శలను "ఆలాపన" అనే పుస్తకంగా వెలు వడింది.అలనాటి సినిమాల సంగీత విమర్శనాత్మక వ్యాసాలు సంగీత ప్రియులను అలరిస్తాయి.

Sunday, December 27, 2009

నేను చదివిన కొత్త (పాత) పుస్తకం



ఈ మధ్య నేను పుస్తక ప్రదర్శన జరుగుతున్న షాపులో 1921లో శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు వ్రాసిన నాటకం కొన్నాను.ఈ నాటికనే 1939లో సి.పుల్లయ్య దర్శకత్వంలో ఈస్టిండియా ఫిలిమ్స్ వారు పుష్పవల్లి,భానుమతి లతో సినిమాగా నిర్మించారు.ఇదే భాను మతి మొదటి చిత్రం.ఈ నాటికలో సింగరాజు లింగరాజు పెళ్ళికుమార్తె తండ్రికి వ్రాసి ఇచ్చిన అగ్రిమెంట్ ఇలా వుంటుంది!

బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి,సింగరాజు లింగరాజు వ్రాసి ఇచ్చిన రసీదు.మీ కుమార్తె చి"సౌ"కాళిందిని చి"బసవ రాజునకు చేసుకొనుటకును, అందులకై మీరు మాకు కట్నము క్రింద నైదువేల నైదువందల రూపాయలు రొక్కమును(చిక్కిన నేటీ రుపాయలకు లక్షతో సమానం) రవ్వల యుంగరము,వెండి చెంబులు,వెండి కంచము, వెండి పావుకోళ్ళు,పట్టు తాబితాలు,వియ్యపురాలు వియ్యంకుల లాంఛనములు యధావిధిగా ఇచ్చుటకును,ప్రతి పూట పెండ్లివారిని బ్యాండుతో బిలుచుటకును, రాకపోకలకు బండ్లు.రాత్రులు దివిటీలు ఏర్పాటు చేయుటకును, రోజుకు రెండు సార్లు పిండివంటలతో భోజనములను, మూడు సార్లు కాఫీ,ఉప్మా,ఇడ్డెనులు, దోశె,రవ్వలడ్డు,కాజా,మైసూరు పాకాలతో ఫలహారములు మా ఇస్టానుసారము అయిదు దినములు మమ్ము గౌరవించుటకు,అంపకాలనాడు మాకు పట్టు బట్టలను మాతో వచ్చు వారికి ఉప్పాడ బట్టలు ఇచ్చుటకును నిర్ణయించుకొని బజానా క్రింద 10 రూపాయలు ఇచ్చినారు గాన ముట్టినది. --సింగరాజు లింగరాజు వ్రాలు

ఇది నాటికలో కాళ్ళకూరి వరవిక్రయం లోని ఓ మచ్చుతునక.


శ్రీ బాపు ముఖ చిత్రంతో వెలువడిన ఈ పుస్తకం ధర రూ.25/-.విశాలాంధ్రలో దొరుకుతుంది. మీ దగ్గర లేకపోతే తప్పక కొని చదువవలసిన మరో మంచి పుస్తకం! ****సురేఖ

Wednesday, December 23, 2009

గోదావరమ్మ పాపి(డి) కొండలు




అందాల పాపికొండలు చూడాలంటే రాజమండ్రి కి దగ్గర లోనున్న పట్టిసీమకు వెళ్ళి అక్కడనుంచి లాంచీలో ప్రయాణం చేయాలి.లాంచీలుకూడా రెండస్తులతో క్రింద మన్ఛి రెస్టారెంట్,టాయ్లెట్ సౌకర్యాలతో వుంటాయి.పట్టిసీమ చేరాక వేరే నావలో వెళ్ళి అక్కడ గల శివాలయం చూడవచ్చు.ఆ గుడిని మీరు "మేఘ సందేశం" సినిమాలో చూసివుంటారు.మహా శివుడు వీరభదృడిగా, మహా విష్ణువు భావనారాయణుని పేరిట క్షేత్రపాలకునిగా అవతరింఛారని చెబుతారు.ఆలయంలో శివలింగం నయనానందకరంగా దర్శనమిస్తుంది.తిరిగి లాంచి ఎక్కి ప్రయణిస్తుంటే దారిలో ఓ కొండ ఏనుగు ఆకారంలో అగుపిస్తుంది.దాని తరువాత మనకు నందీ శ్వరఆలయం అగుపిస్తుంది."జానకి రాముడు" ఈ గుడి ప్రాంగణంలోనే చిత్రీకరించారట. అలానే గండిపోసమ్మ ఆలయాన్ని చూదవచ్చు.మరికొంత దూరము ప్రయాణించాక దేవీపట్నం పోలీస్ స్టేషన్ వస్తుంది.ఈ పోలీస్ స్టేషన్ పైనే అల్లూరి సీతారామ రాజు దాడి చేసాడు.ఆనాటి పోలీస్ స్టేషన్ ఇప్పుడూ చూడవచ్చు! అటు తరువాత లాంచిని ట్రైబల్ విలేజ్ రిసార్ట్ దగ్గర ఆపి ప్రయాణీకులకు లంచ్ ఏర్పాటు చేస్తారు.ఈ రిసార్ట్ లో రాతృలు గడపాలనుకునే వారికి ఏసి/నాన్ ఏసీ గదులు వున్నాయి. ఇక్కడ నుంచి ప్రయాణంలో గోదావరి వెడల్పు రాను రాను తగ్గుతుంది.అటూ ఇటూ రెండు కొండల మధ్య నుంచి లాంచి ప్రయాణిస్తుంటే ఆ దృశ్యం కన్నుల పండుగా వుంటుంది. గోదావరికి ఇరువైపులా సన్నని పాపిడి తీసినట్లు రెండు కొండలు వున్నందున ఈ కొండలకు పాపిడి కొండలని పేరొచ్చింది.చివరికవి జనాల నోట్లో పాపి కొండలుగా మారి పోయాయి. పాపి కొండలు దాటాక పేరంటాఅలపల్లి శివాలయం వుంది.అక్కడి కొండలనుంచి పారే సెలయేర్లలో కాళ్ళు కడుగుకోంటే ఎంతో హాయిగా వుటుంది.శివుణ్ణి దర్శనం చేసుకున్నాక లాంచి తిరిగి రాజమండ్రి వైపు సాగిపోతుంది.పాపికొండల ప్రయాణం ఓ మధురానుభూతిగా మనకు మిగులుతుంది!

Sunday, December 20, 2009

ఫొటో కార్టూన్లు

పత్రికలలో అప్పుడప్పుడు ప్రచురించే రాజకీయనాయకుల ఫొటోలు,ప్రకటనల కోసం వేసే ఫొటోలు చూసినప్పుడు నాకు వచ్చే ఆలోచనలు ఇలా చూపించడానికి చేసిన ప్రయత్నం ఎలా వుందో మీరు చెప్పండి.













Tuesday, December 15, 2009

బొమ్మాయిల సృష్టికర్త బాపు పుట్టినరోజు




1933 డిసెంబరు 15న నర్సాపురంలో సత్తిరాజు లక్ష్మీ నారాయణ అనే అబ్బాయి పుట్టినప్పుడు బాపులా మారి అందమైన బొమ్మాయిల సృస్టికర్త అవుతాడనీ, తెలుగు భాష రాత,గీత రెండూ మారిపోతాయని, తెలుగుజాతి ఖండాంతరాలలో వెలిగిపోయే సినిమాలు తయారవుతాయని ఎవరూ ఊహించివుండరు! ఈ నాడు బాపు అందాల అక్షరాలు కంప్యూటర్ ఫాంట్లుగా రూపుదిద్దుకున్నాయంటేను,రష్యాలో రాదుగా ప్రచురుణ సంస్ధ "అందాల అఆలు" తెలుగుపుస్తకం ముద్రించారంటేను ఆనంద,ఆశ్చ్రర్యరాలతో పొంగి పోని తెలుగువాడుంటాడా?!ఆయన బికాం అవగానే ఎల్ యల్బీ చేసాక ఆయన కామ్ గా లాయర్ అయుంటే తెలుగుజాతి ఓ మంచి చిత్రకారున్ని,చిత్ర దర్శకున్నీ పోగొట్టుకొని వుండేది.


బాపు తొలిబొమ్మ రేడియో అన్నయ్య "బాల" పత్రికలో1945 అచ్చయింది.ఆయన చిన్ననాటి,ఈనాటి మితృడు
ముళ్ళపూడి తొలి రచన కూడా "బాల"లోనే అచ్చయింది. ప్రచారాలకు,పొగడ్తలకు ఆమడ దూరం వుండే శ్రీ బాపు వాల్టర్ ధాంప్సన్,ఎఫ్.డీ.స్టూవర్ట్,ఎఫిషెంట్ పబ్లిసిటీస్ లలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి ప్రఛారాలకే ప్రచారం తెచ్చారు! ఆయన కార్టూన్లు చూసి ఎంతోమంది కార్టూనిస్టులుగా నాలా చాలా మంది ఆయన ఏకలవ్య శిష్యులైనారు.కొంత కాలం బాపు "రేఖ"పేరుతో కధలకు బొమ్మలు వెసేవారు.ఆ పేరు చూసే నేను "రేఖ" అనే పేరుకు "సు" అక్షరం చేర్చి "సురేఖ" గా కార్టూన్లు వేయడం మొదలెట్టా!


కీ"శే" ఎమ్వీయల్ బాపు గురించి ఇలా అన్నారు" కొండంత పెరిగి, గరికపరకలా తల వంచడం చాలా కస్టం.కానీ అంత విజ్ఞానంతో అనంతంగా పెరిగినా నిత్య విధ్యార్ధిలా వినయంతో తలవంచి జీవించడం అతనికి ఇష్టం". ఈ పుట్టిన రోజు శుభ సమయాన శ్రీ బాపు గారికి మన మితృలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ,


బాపూ బొమ్మలంటే నాకెంతో కసి!
ఆ బొమ్మల్ని చూసి
చూడగానే చింపేస్తా!!
ఆ పై అంటించేస్తా!!
కలకాలం నా ఆల్బ మ్స్ లో దాచేస్తా!!!!

సురేఖ*

Tuesday, December 08, 2009

అమర గానసరస్వతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి




సంగీత సామ్రాజ్ఞీ, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత,భారతరత్న శ్రీమతి
యం.యస్.సుబ్బులక్ష్మిగతించి ఈ డిసెంబర్ 11 తేదీకి ఐదేళ్ళు గడుస్తున్నాయి.
ఆ మహా గాయనికి స్మృతి కవిత పేరిట నవంబర్ 2006 లో కవితా
సంకలనం వెలువడింది.అందులో డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం,లకుమ,
డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు,తనికెళ్ళ భరణి,డా.శిఖామణి,మొహమ్మద్
ఖాదర్ఖాన్ మొదలైన వారి కవితలతో బాటు నేను వ్రాసిన కవిత కూడా
చోటుచేసుకొనే అదృస్టం కలిగింది. ఈ సంధర్భంలో ఆ కవితను మీ అందరితో
పాలుపంచుకుంటున్నాను.




గాన సరస్వతి
యం.యస్.సుబ్బులక్ష్మి!

నేడు అమృతం సేవించే దేవతలకు
గానా అమృతం పంచుతున్నది!!

గాన సరస్వతి ముక్కెర మెరుపులతో
నింగి లోని తారల తళుకులు మసక బారాయి!!

నిన్నటిదాకా పుణ్యాత్ముల నెలవు కాదు స్వర్గం-
ఆమె రాకతో స్వర్గమే పుణ్యం చేసుకున్నది!!!



**********సురేఖ

Sunday, December 06, 2009

రూపాయలు - రూపాంతరాలు




ఈ నాడు డబ్బున్న వాళ్లను జనాలు గౌరవిస్తారు.వాళ్ళకు ఎలాంటి
అవలక్షణాలున్నా అవేవీ అగుపించవు!కాని డబ్బు మనుషులకు అంత
విలువనిస్తున్నా ఆ డబ్బుకు మాత్రం ఈనాడు రోజు రోజుకు విలువ తగ్గి
పోతున్నది.ఒక నాడు పెద్దగా వుండే వంద రూపాయలనోటు ఈనాడు
చిన్నదవటంమే కాకుండా విలువే లేకుండా పోయింది. వంద దాకా ఎందుకు
మా చిన్నతనంలో పది రూపాయల నోటు పెద్దదిగా వుండేది. ఈనాటి వంద
కంటే ఎంతో విలువా వుండేది.ఆ రోజుల్లో ఒక రూపాయికి నాలుగు అణాలు.
ఆంధ్ర పత్రిక వీక్లీ ఖరీదు పావాలా.నెలకి అంటే నాల్గు వారాలకి ఒక రూపాయన్న
మాట! ఇప్పుడు వీక్లీ ఖరీదు పది రూపయలు.అలానే చందమామ ఆరు అణాలు.
ఏడాది చందా రూ.4.50పై ! ఆనాటి ,నే పుట్టకముందు నాటి ఒక రూపాయి
నోట్లు (1917,1935), 1949,50ల నాటి పది,ఐదు రూపాయల నోట్లు నా
దగ్గర వున్నవి మీకు చుపిస్తున్నాను. ఇప్పటి పది రూపాయల నోటు నంబరు
చూడండి! ప్రత్యేకంగా లేదూ!! పాత రూపాయల నోట్లు మా నాన్నగారు కలెక్ట్
చేసినవి.ఆయన స్టేట్ బాంక్ లో కాష్ ఆఫీసర్ గా పనిచేసినప్పుడు ప్రీంటింగ్ లో
పొరపాటుగా ప్రింటయినవి ప్రత్యేకంగా సేకరించేవారు.మీకు షోలే సిన్మా గుర్తుందా?
అందులో అమితాబ్ బొమ్మా బొరుసా వేసిన రూపాయికి రెండు వైపులా బొమ్మే
వుండటం ధర్మేంద్ర గుర్తిస్తాడు. ఇరువైపులా బొరుసు వున్న రూపాయి (మా నాన్న
గారు సేకరించింది) ఇంకా నా దగ్గర వుంది.అన్నట్టు మా నాన్న గారు 1959లో
బాంకు లో రిటైర్ అయినప్పుడు ఆయన సేలరీ నెలకు 500/-రూపాయలు!!

Tuesday, December 01, 2009

హాసం కబుర్లు





నాకు నిత్య జీవితంలో హాస్యంగా మాట్లాడట మంటే చాలా ఇస్టం.బ్యాంకులో
కూడా కొలీగ్స్ తో,కస్టమర్ల తో అలానే మాట్లాడే వాడిని.ఒక సారి ఓ కస్టమర్ని
డిపాజిట్ వేయమని అడిగితే,"ఎలాగండి, డబ్బంతా ఇంటి మీద పెట్టేసాం,సార్"
అని అన్నాడు."అదేంటి?! ఇంటి మీద పెడితే గాలొచ్చినా,వానొచ్చినా ప్రమాదం
కదా? దయచేసి మా బ్యాంకులో పెడితే సురక్షితం!"అన్నాను.ఆయన పెద్దగా
నవ్వి మర్నాడు డిపాజిట్ ఇచ్చాడు.అలానే నే అవార్డు స్టాప్ఫ్ గా వున్నప్పుడు
మా కాష్ ఆఫీసర్ "ఈ రోజు కౌంటర్ చెయ్యండి" అంటే "కార్పెంటర్ చేత చేయించు
కోండి" అని నవ్వుతూ అనే వాడిని.ఐనా అవతలి వారిక్కూడాఆ సెన్స్సఫ్ హ్యూమర్
లేక పోతే ప్రమోదం ప్రమాదంగా మారి పోతుంది.శ్రీ వరప్రసాదరెడ్డి,యమ్బీయస్.ప్రసాద్
గారి ప్రోత్సాహంతో మా బాంకు మితృడు డివీ.హనుమంతరావు నేను మా ఇంటి డాబా
మీద ప్రసాద్ గారు,యస్వీ.రామారావు గారి అధ్వర్యంలో ప్రారంభించాము.ఆ నాటి నుంచి
ఈ నాటి వరకు ప్రతి నెలా 3వ ఆదివారమ్ విజయవంతంగా నిర్వహిస్తున్నము.మాకు
సాహిత్య అభిమాని,రిటైర్డ్ పోస్ట్ మాస్టార్ శ్రీ ఖాదర్ ఖాన్ తోడు గానిలచారు.
నవ్వటం నిజంగా నవ్వులాట కాదు. నవ్వుల పాలవ కుండా మరొకర్ని కులాల పేరిట,
మతాల పేరిట నవ్వులపాలు చెయ్యకుండా నవ్వించడం మా హాసం క్లబ్ ధ్యేయం.నవ్వు
సహజమైన పైన్ కిల్లర్!నవ్వటానికి మన ముఖం లోని 17 కండరాలు పనిచేస్తే కోపం
వచ్చిన ముఖానికి 43 కండరాలకు పని చెప్పాలట! గత ఏడాది మా హాసం క్లబ్ వార్షి
కోత్సవం లో శ్రీ రావి కొండలరావు గారిని సత్కరించాము.శ్రీ కె.ఐ.వరప్రసాద రెడ్డి నా
సురేఖార్టూన్స్ పుస్తకాన్ని,హనుమంతరావు,నేను ఖాన్ రాసిన"నవ్వుల పందిరి" స్కిట్స్
పుస్తకాలను అవిష్కరించారు.ప్రతి నెలా కార్యక్రమాలలో హాస్యప్రియులు సకుటుంబంగా
పాల్గుంటున్నారు.అలనటీ ఆపాత మధురాలను యస్.కృష్ణారావు,సత్యనారాయణ గార్లు
ప్రతి కార్యక్రమం లోను క్రమం తప్పకుండా ఆలపిస్తారు.
ఎదుట మనిషిది ఏ భాషైనా,ఏ దేశం ఐనా మనకు ఎదురైనప్పుడు చిరునవ్వు చిందిస్తే
మనం వారికి ఆప్తులవుతాం.
మీరూ మీ ఊర్లో ఇలాటి క్లబ్ లేకుంటే వెంటనే ప్రారంభిస్తారని ఆశిస్తూ,

"నవ్వే జనా సుఖినో భవంతు"

********************************************************

మా హాసం క్లబ్ కబుర్లు:

హసం హాస్య, సంగీత పక్ష పత్రిక 2001 అక్టోబర్ 1వ తేదీన మొదటి సంచికను
శాంతా బయోటెక్నిక్స్ అధిపతి పద్మభూషణ్ కె.ఐ.వరప్రసాదరెడ్డి గారు,శ్రీ యమ్బీయస్
ప్రసాద్ గారు మేనేజింగ్ ఎడిటర్ గా ప్రారంభించారు.మొదటి సంపాదకీయంలో"మాకు
చేతనైన రీతిలో హాస్యాన్ని,సంగీతాన్ని వీలైనంత ఎక్కువ మందికి అందించే ప్రయత్నం
చేస్తున్నాం.వివిధ ప్రాంతాలలో ఉన్న వివిధ వర్గాల పాఠకులు ఏదో ఒక మార్గంలో ఈ
అవకాశాన్ని వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశ.ఆరోగ్యం
అని ఎందుకంటున్నామంటే సేద తీరే మార్గాలు ఎన్నున్నా సరే అవి మోతాదు మించితే
హాని చేస్తాయి.హాస్యం,సంగీతం విషయంలో ఆ భయాలు లేవు.పైగా అవి కుటుంబ
సమేతంగా ఆనందించ తగ్గవి...." ఇలాటి మంచి పత్రిక డిసెంబర్ 2004,16 వ తేది
సంచిక ఆఖరి సంచిక అని శ్రీ వరాప్రసాదరెడ్డి గారు భాధాతప్త హృదయంతో సంపాదకీయమ్
వ్రాసారు."హాస్య,సంగీతాలపై అభిరుచి ఉన్నవారందరికీ"హాసం" గురించి తెలిసి,ఆదరించి
వుండి వుంటే ఈ లేఖ రాసే సంధర్భం వచ్చేది కాదు. తెలుగులో మంచి పత్రికలు రావని,
మంచి సినిమాలు రావని వాపోయే వారికి"ఇదీ దీనికి కారణం.ఈ ప్రతికూల ఆలోచనా ధోరణి
మారినప్పుడే మనకు మంచి కాలం" అని చెప్పడమే ఈ లేఖ ఉద్దేశ్యం అని ఆయన అన్నారు.
కాని హాసం అభిమానులు మాత్రం చాలా ఆవేదన చెందారు.అంతకు ముందు ఏప్రియల్ నెల
ఉగాది రోజున ఉదయం 10.30 గంటలకు రాజమండ్రి లో శ్రీ రామ్ నగర్లో మా ఇంట్లో హాసం
క్లబ్ శ్రీ యమ్బీయస్స్.ప్రసాద్, శ్రీ యస్వీ రామారావు ప్రారంభించారు. ఆ విషయాలు మరునాడు
చెప్పుకుందామా మరి......

Sunday, November 29, 2009

గోదావరి చిత్ర గాన లహరి


అందాల గోదావరికి తెలుగు చిత్ర పరిశ్రమకు మూగమనసులు సినిమాతో అనుబంధం ఏర్పడింది.
బాపు రమణలు ఒకరు ప.గో,మరొకరు తూ.గో జిల్లాలకు చెందిన వారు కాబట్టి తమ సినిమాలను
ఎక్కువగా గోదావరి తీరంలోనే నిర్మించారు.ఐనా తెలుగు చిత్ర పరిశ్రమ తమ సినిమా పాటలలో
గోదావరికి సముచిత స్ఠానం ఇచ్చారు.

మొదటి సారి 1952 లో వచ్చిన మరదలు పెళ్ళి లో ఇలా వినిపిస్తుంది. "పిలిచె గోదారొడ్డు,నోరూరించే బందరు లడ్డు" అని శ్రీశ్రీ రచించారు.

తరువాత యన్టీఆర్,జమున నటించిన చిరంజీవులు లో
"నీ ఆశ అడియాస,నీ బ్రతుకు అమవాస...
కన్నులలో గోదారి కలువలే కట్టింది." అంటూ ఆరుద్ర వ్రాసారు.

అలానే పెద్దమనుషులు చిత్రంలో,
"కుక్క తోక పట్టుకొని గోదావరీదితే కోటిపల్లి కాడ తేలేనయా" అని కొసరాజు రచించారు.

ఇక పల్లెటూరు చిత్రంలో,
"కల్లోల గౌతమి,వెల్లువల క్రిష్ణమ్మ,..."అని వేములపల్లి శ్రీకృష్ణ కలం నుంచి వచ్చింది.



విచిత్ర కుటుంబం చిత్రం కోసం సినారే,
"ఆదికవి నన్నయ అవతరించిన నేల
తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల
ఆంధ్ర సంస్కృతికి తీయనిక్షీరధారలై
జీవకళ లొలుకు గోదావరీ తరంగాల..."అంటూ సాగిపోతుంది రచన!

1963లో కోటిపల్లి,నర్సాపురం రేవుల్లో మూగమనసులు పాటలు,
"గోదారీ గట్టుంది,గట్టు మీద చెట్టుంది",తల్లీ గోదారికీ ఎల్లువస్తే అందం,
ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం"

అనుపమ వారి ఉయ్యాల-జంపాల చిత్రం లో ఆరుద్ర గీతం "కొండగాలి తిరిగింది,గుండె వూసులాడింది,
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది" ఎంత మంచి పాట!!

బాపురమణల ముత్యాలముగ్గు లో శేషేంద్రశర్మ రఛన
కొమ్మల్లో పక్షులారా గగనంలో మబ్బులారా నదిని దోచుకుపోతున్న నావను ఆపండి గుర్తుండేవుంటుంది.


దేవత సిన్మాలో "ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడుతూ వుంటే" పాట రచయిత శ్రీ వేటూరి.

సితార లో"వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం",

ప్రేమించి పెళ్ళాడు లో "ఒయ్యరి గోదారమ్మఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం",

ఆంధ్రకేసరి కోసం ఆరుద్ర రాసిన
"వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా భాసించే రాజమహేంద్రి" గీతం గోదావరి ప్రాసత్యాన్ని,రాజమండ్రి వైభవాన్నివివరిస్తూ
"కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు,వీరేశ లింగ మొకడు మిగిలెను చాలు" కలకాలం నిలిచిపోయే
పాట.


ఇలా తల్లి గోదారి పై ఎన్నెన్నో పాటలు!!

Tuesday, November 24, 2009

నేను -- నాడు... నేడు...




















ప్రతి మనిషి ఎప్పటికప్పుడు ఈరోజు నేనేంటి అని కాక నిన్న ఎలా ఉన్నాను. ఇపుడు ఎలా ఉన్నాను.రేపు ఎలా ఉండాలి అని విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. నాడైనా, నేడైనా ప్రతీ అనుభవం ఒక జీవితపాఠంలా మలుచుకుని సాగిపోతూ ఉండాలి. ముప్పై నాలుగేళ్ల క్రిందటి చిత్రాన్ని చూసుకుంటే అప్పటి ఆలోచనలు, పోరాటాలు, లక్ష్యాలు ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడుతాయి.

Sunday, November 22, 2009

కార్టూన్లు-కామిక్స్-కమామిషు




ఈ తరం పిల్లలు రకరకాల కార్టూన్లను తనివితీరా(పాపం వాళ్ళకు హొమ్ వర్కు భారంతో అంత టైమూవుండటంలేదు) చూస్తున్నారు.మేం చదువుకునే రోజుల్లో మాకు శెలవులు,మరింత ఆటవిడుపు వున్నా ఇంట్లో చూడటానికి టీవీలు లేవు.కార్టూన్లు చూడాలంటే రెగ్యులర్ ఇంగ్లీష్ సినిమాలతో బాటు ఓ ఐదు నిముషాలు చూసి సంతోషడేవాళ్ళం!మరో విషయం ఆ రోజుల్లో ఇంగ్లీష్ సినిమాలు ఆదివారం ఉదయం ఆటలుగా వేసేవారు.ఆ రోజు నాన్నాగారికి బ్యాంకు శెలవు కాబట్టి మమ్మల్ని తీసికెళ్లేవారు. మెయిన్ పిక్చర్కి ముందు ఐదు నిముషాల్లో ఇట్టే తెరపై ఏ మిక్కీమౌసో ప్రత్యక్షమై అట్టే మాయమైపోయేది. ఒక్కోసారి అసలు చూపించేవాళ్ళేకాదు! ఇక మాకు నిరాశే మిగిలేది.ఆ మార్నింగ్ షోలకు క్లాస్ కన్షెషన్ వుండేది. అంటే బాల్కనీ టిక్కెట్టు దాని క్రిందిక్ల్లాస్ ధరకే ఇచ్చేవారు.




ఆదివారం మాకు మరో ఆటవిడుపు ఇంగ్లీష్ పేపరే! ఇండియన్ ఎక్సప్రెస్ ఆదివారం సండేస్టాండర్డ్ పేరుతో వచ్చేది.అందులో మెజీషియన్ మాండ్రేక్, బ్రింగింగ్ అప్ ఫాదర్,లిటిల్ కింగ్,ప్రిన్స్ వాలియంట్ మొదలయిన బొమ్మల కధలు రంగుల్లో వచ్చేవి.మావి కాన్వెంట్ చదువులు కాదు కాబట్టి నాన్నగారు చదివి చెప్పేవారు. కొంతకాలం తరువాత మమ్మల్నే చదవమని అర్ధం చెప్పమనేవారు. మాకు అదో ఇంగ్లీష్ పాఠంలా వుండేది. ది మెడ్రాస్ మెయిల్,ఇండియన్ ఎక్స్ప్రెస్ చివరి పేజీల్లో కర్లీవీ,టార్ఝన్ బొమ్మల కధలు ప్రతి రోజూ వేసేవారు.ఆంధ్రపత్రిక వీక్లీలో బాపు బంగారం-సింగారం,లంకె బిందెలు.రాజు-రైతు, విశ్వాత్ముల నరసింహమూర్తి పంచతంత్రం, చందమామలో బాపు గలివర్ ట్రావల్స్ మొ" బొమ్మల కధలు చదవేవాళ్ళం.కార్టూన్ చిత్రాల సృష్టికర్త వాల్ట్ డిస్నీమిక్కీమౌస్ లాంటి కార్టూన్లే కాకుండా డిస్నీ లాండ్ నిర్మించి అనేక అస్కార్ ఎవార్డ్స్ పొందాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంద్రజాల్ కామిక్స్ పేరిట ఫాంటమ్, చందమామ సంస్ధ క్లాసిక్స్ ‍‍అండ్ కామిక్స్ పేర డిస్నీ కామిక్స్,ఇండియా బుక్ హౌస్ అమర్ చిత్ర కధ పేరిట ట్వింకిల్, భారత రామాయణాలు బొమ్మల కధలుగా ప్రఛురించారు.కొంతకాలంవరకు ట్వింకిల్ తెలుగులో కూడా వెలువడింది.

Saturday, November 21, 2009

నిత్యకళ్యాణం-పచ్చతోరణం-మన సంప్రదాయాలు



నేను ఆడవాళ్ళ సాంప్రదాయాల గురించి వ్రాయటం ఏమిటని అనుకోకండి!
మన అభ్యున్నతికి తొడ్పడేది ముందుగా ఆడవాళ్ళే అన్నమాట కాదనలేం.
కొందరు ఉద్యోగాలకు బైటకు వెల్తున్నా మన సాంప్రదాయాలను చక్కగా
పాటిస్తున్నారు.ఇంట్లో పూజలు,లలితా పారాయణం లాంటివి జరుపుకుంటున్నారు.






మన సాంప్రదాయంలో కాళ్ళకు పసుపు రాసి బొట్టుపెట్టి తాంబూలం ఇవ్వటం
మంచి అలవాటు.పసుపు మంచి యాంటీ సెప్టిక్ గుణాలు కలిగివున్న విషయం
అందరికి తెలిసిన విషయమే.ఇంతకు ముందు గుమ్మాలకు పసుపు వ్రాసి పసుపు
తోనే చేసిన కుంకుమ,వరి పిండి తో బొట్లు పెట్టే వారు.ఇప్పుడు ముందు గుమ్మం
తప్ప ఇతర గదులకు గుమ్మాలే వుండటం లేదు.ఉన్న ఒక్క గుమ్మానికి పసుపు
పెయింట్ వేయించి ఏవేవో డిజైన్లు వేయిస్తున్నాం.పసుపు వ్రాయటం వల్ల కీటకాలు,
అనారోగ్యం కలిగించే క్రిములు రావని మన పూర్వికులు ఇలాటి సంప్రదాయాలని
ఏర్పాటు చేసారు.






ఇప్పుడు ప్రతి ఇంట్లో వంటింట్లోనే పంపు వుంటున్నది.పూర్వం ఎంతటివారైనా
చెరువుకో,నదికో వెళ్ళి నీళ్ళు తెచ్చుకొనేవారు.పాదాలు నీటిలో ప్రతి రోజూ
నానటంవల్ల వేళ్ళ మధ్య పుండ్లు పడేవి.రోజూ స్నానం చేసి పాదాలకు పసుపు
రాసుకోవటం వల్ల మందులా పని చేసి పుండ్లు తగ్గేవి.అలానే గుమ్మాలకు కట్టే
మామిడి ఆకుల తోరణాలు.ఆ ఆకుల ద్వారా మంచి గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఇంటి ముందు వరి పిండితో ముగ్గులు పెడీతే చీమలు లాంటి చిన్నజీవులకు
ఆహారం అందించే అలవాటును కూడా మన పెద్దలు తెలిపారు.
ఇప్పుడు ఇంట్లో కాలికి పసుపురాస్తే మార్బుల్ నేల పాడై పోతుందని భయపడు
తున్నారు.అలాటప్పుడు కాళ్ళ క్రింద ఓ ప్లాస్టిక్ షీట్ వేసి పసుపు ధైర్యంగా రాయొచ్చు.

Thursday, November 19, 2009

మితృలారా! నేనిక్కడ,మరి మీరెక్కడ?


ఈ ఫొటో నేను రాజమండ్రి యస్.ఆర్.సిటీ.హైస్కూల్లో SSLC చదువుకునేటప్పుడు మార్చి 1956 లో తీసినది. ఇందులో నేను పైనుంచి రెండవ వరుసలో కుడివైపు నుంచి నాల్గవ వాడిని! ఆ వరుసలో మొదట వున్నది నక్కిన శ్రీరామమూర్తి. ఇక్కడే క్లాత్ బిజినెస్ చేస్తున్నాడు.అదే వరుసలో ఎడమవైపున మొదట వున్నది భాగవతుల మంగశర్మ.భిలై స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్ గా రిటైరై ఇక్కడే వుంటున్నారు.తరచు కలుస్తుంటాము.ఆయన సతీమణి భాగవతుల లలిత మంచి కధా రచయిత్రి. "తీరనిఋణం" పేరిట ఆమె కధా సంకలనం వెలువడింది.పై వరుసలో కుడి నుంచి రెండో అతను వీర్రాజు.పోస్టల్ డిపార్టుమెంట్ లో పనిచేసాడు.తక్కిన మితృలు ఎవరైనా ఈ ఫొటో ఛూసి జవాబిస్తారని ఆశిస్తున్నాను.ఇక టీచర్లలో కూర్చున్న వాళ్ళలో ఎడమనుంచి నాలుగో సోషల్ మేస్టారు పి.సూర్యనారాయనమూర్తి గారు.ఆయన దివంగత సినీ హాస్య నటుడు రాజబాబు మేనమామ! అదే వరుసలో చివరవున్నది మాధ్స్ మేస్టారు చలపతి రావు గారు.మా అబ్బాయి సాయి చదివిన స్కూల్లో (టౌన్ హై స్కూల్)ప్రధాన ఉపాద్యాయుడుగా పనిచేసి రెటైర్ అయ్యారు. అంటే నేను,మా అబ్బాయి (ఇప్పుడు వాడు బొంబాయిలో ఓ సంస్దలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు) ఒకే గురువు గారి దగ్గర చదువుకున్నామన్న మాట!

Monday, November 16, 2009

నేను కవిని కాదన్నవాడిని కవితతో పొడుస్తా !!!

నేనప్పుడప్పుడు కవితలు?! స్దానిక దినపత్రిక "సమాచారం" లో ప్రతి ఆదివారం వ్రాస్తుంటాను.మీరు నా ఎదురుగా లేరు కాబట్టి
ధైర్యంగా కొన్ని కవితలు చూపిస్తాను.




"సమ్"గీతమ్

పాత పాటలు ఎంతో మధురం!
మంచి పాట ఈ నాటి తెలుగు తెరకు దూరం!!
ఎప్పుడో ఎక్కడో మంచి పాటల సంగీతం!!
ఇప్పుడు వినిపించేది మాత్రం "సమ్"గీతం!!॰

******************************
దిష్టి బొమ్మ

దిస్టి బొమ్మ నిండుగా బట్టలేస్కుని,
ఒంటి నిండుగా గడ్డి నింపుకొని ఠీవిగా నిలబడింది!!
కేరింతల మధ్య తగులబడింది!!
అభాగ్య జీవులకు గుడ్డ కరువు!!
మూగజీవులకు గడ్డి కరువు!!!

*******************************
ఓట్లు-నోట్లు

ఓట్ల కోసం ఈవీయం!
నోట్ల కోసం తెల్లవార్లూ బాంకు ఏటీయం!!
ఓట్లేశాక వాగ్దానాలు మళ్ళీ ఏటియ్యం!!
మెజార్టీ ఎంతైనా గెలుపే మా ధ్యేయం!!
ఏమైతేనేం గెల్చాక ప్రజల నుండి మేం మటుమాయం!!



*********** ఉంటాటాటా..మీ సురేఖ

Sunday, November 15, 2009

శ్రీ వడ్డాది పాపయ్య: అద్భుత వర్ణ చిత్రాల సృష్టి కర్త



కీ"శే"వడ్డాది పాపయ్య వర్ణ ఛిత్రాలు చూడనివారు,అభిమానించని వారు ఎవ్వరు ఉండరు.కాని దురదృస్ట వశాత్తు ఆయన గురించి సరైన ప్రచారం జరగలేదని పిస్తుంది.చక్రపాణి సంపాదకత్వంలో వెలువడిన చందమామ,యువ మాస పత్రికల ముఖచిత్రాలు, లోపలి కధలకు బొమ్మలు ఆయన వేలాదిగా వేసారు. చందమామకు ముందు బాలన్నయ్య,బాలక్కయ్యల "బాల" పత్రిక(1947)లో ఆయన లటుకు-చిటుకు శీర్షికకు,పోలికలు అనే బొమ్మలు,కార్టూన్లు వేసారు.ఆ బొమ్మలు (బాల) కూడా మీకోసం ఇక్కడ చూపిస్తున్నాను.శ్రీ వడ్డాది శ్రీకాకుళం లో 1921 సెప్టెంబర్ 10న జన్మించారు.వీరి నాన్నగారు శ్రీరామమూర్తివృత్తి రిత్యా డ్రాయింగ్ టీచర్.శ్రి పాపయ్యగారు రేఖాచిత్రాలు,ఏక వర్ణ,బహు వర్ణ చిత్రాలు గీసారు.ఆయన చిత్రాలు స్త్రీ ల పైనే ఎక్కువగా వున్న మాట నిజమ ఐనా వివిధ విషయాలపై కూడా చిత్రాలు గీసారు.ఈనాడు యువతులపై ఆసిడ్ దాడులు చేస్తున్న కొందరు యువకుల్ని
మానవ మృగాలుగా మనం వర్ణిస్తున్నాము.ఆయన ఏనాడో "యువ"లో ఈనాటిఆధునిక యువకున్ని "మృగము"అనే బొమ్మ ద్వారా చిత్రించాడు.ఆయన చిత్రకళారంగం లో చూపిన ప్రతిభ మరువలేనిది.అందుకే ఆయన బొమ్మలు ఈ నాటికీ అభిమానుల గుండెల నుంచి చెరిగి పోలేదు.నేను సేకరించి ఆల్బం లో పదిలపర్చుకొన్న కొన్ని బొమ్మలు మీ కోసం.

Thursday, November 12, 2009

కోతి కొమ్మచ్చిలో నేను


నేను ఎంతగానో అభిమానించే, గౌరవించే బాపు రమణల కోతి కొమ్మచ్సిలో చిన్న మాట చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను.


Wednesday, November 11, 2009

తెలుగు తల్లికి వందనం: తెలుగోపనిషత్; సీ.పి.బ్రౌన్



తెలుగువారికి ఒక ప్రత్యేకత వుంది.కొన్ని కొన్ని లక్షణాలనుబట్టి ఎంత మందిలో వున్నా తెలుగువాడిని ఇట్టే పసిగట్టవచ్చు.ఉదాహరణకు :- మీ దోవన మీరు పోతుండగా,ఎవడైనావచ్చి,మీ చెయ్యి మెలిపెట్టి మీ వాచీలో టైము చూసుకొని వెళ్ళిపోతే, వాడు ఖచ్చితంగా తెలుగువాడే అయివుంటాడు. రోడ్డు కడ్డంగా నుంచుని,కార్లు,సైకిళ్ళు,రిక్షాలు,ఆవులు మొదలైన వేటినీ లెక్క చేయకుండా గంటల తరబడి రాజకీయాలు,సినిమాలు చర్చించే వాడు తెలుగువాడనటానికి సందేహం లేదు. మీరు దినపత్రికగాని,మరో పత్రికగాని కొనడంతోటే, "ఒక్క సారి చూసిస్తాను,పేపరిస్తారా?" అని అడిగి పుచ్చుకుని,తిరగేసి,నిర్లక్ష్యంగా మీమీద పడేసి చక్కా పోయేవాడు తెలుగు వాడే. బస్సులో గాని రైల్లో గాని ఆరుగురు కూర్చోవలసిన సీట్లో నలుగురికి కూడా ఇరుకయ్యేట్టు కూర్చో గల నేర్పు ఒక్క తెలుగు వాడికే వుంది.అన్నట్టు అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం : తెలుగు వాళ్ళని తిట్టిపోసి,అరవ్వాళ్ళని,బెంగాలీవాళ్ళని మెచ్చుకునేవాడు కూడా తెలుగు వాడే! ఈ సోదంతా ఇప్పుడెందుకని నన్ను కోప్పడకండి.తెలుగువాడు,కనీసం భారతీయుడు కాకపోయినా సీ.పీ.బ్రౌన్ అనే బ్రిటిష్ దేశీయుడు తెలుగు నేర్చుకుని తెలుగు భాషకు ఎనలేని సేవ చేసాడు. ఆయన జన్మదినం నిన్ననే( నవంబర్ 10 ).ఆయన తెలుగు నిఘంటువును,వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు.అప్పయ్యదీక్షుతులు లాంటి పండితులవద్ద తెలియని విషయాలు నేర్చు కున్నాడు.రాజమండ్రి లో శ్రీ సన్నిధానమ్ నరశింహశర్మ,వారి సోదరులు శాస్త్రి వారి ఇంటికి"బ్రౌన్ మందిరం" అన్న పేరు పెట్టుకొన్నారంటీ వారిని అభినందించాలి.బ్రౌన్ జన్మ దినం రోజున స్తానిక యంయల్.ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు గారి అధ్వర్యంలో సభ నిర్వహించి తెలుగు భాషాభి వృర్ధికి అందరూ కృషి చేయాల్సిన అవసరం గుర్తు చేసారు.వక్తలందరూ ఎన్నోవిషయాలను చెప్పారు కాని మద్రాసీలుగా పిలువబడుతున్న తెలుగు వాళ్ళకి యన్టీఆర్ తెచ్చిన గుర్తింపును ఒక్కరు జ్ఞాపకం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఏమైనా మనం తెలుగు వాళ్ళం కదా!!





చివరగా ఒక మాట: తెలుగోపనిషత్ జ్యోతి బుక్స్ వారు 1964 లో ప్రఛురించిన "రసికజన మనోభిరామము" పుస్తకం లోనిది. ఆ పుస్తకంలో బాపు,రమణ ,రావి కొండలరావు మొ ప్రముఖుల సంపాదకత్వంలో వచ్చిన "జ్యోతి" మాస పత్రికలోని జోకులు,కార్టూన్లతో ఆ పుస్తకం ప్రచురించారు.ఆ పుస్తకం ధర ఎంతో ఊహించండి.దాదాపు 80 పేజీల బుక్ వెల ఒక రూపాయి మాత్రమే! మీరు నమ్మాలి.ఆ పుస్తకం నా దగర వుంది!!

Tuesday, November 10, 2009

అలనాటి ఆంధృల అభిమాన దిన పత్రిక ఆంధ్రపత్రిక




దేశోద్ద్హారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారిచే బొంబాయి లో 1908న వార పత్రిక గా స్ద్హాపించ బడిన ఆంధ్రపత్రిక 1914 లో దినపత్రిక గా మద్రాసు నుంచి వెలువడింది.వార పత్రిక ఈనాటి జిల్లా అనుభంధం సైజులో వెలువడుతూ వుండేది.తరువాత ఇప్పుడు మనం చూస్తున్న వార పత్రికల సైజు లోకి మార్చారు. ఆ రోజుల్లో పత్రిక భాష గ్రాంధికంగా వుండేది. మచ్చుకి 1937 డిసెంబర్ 16వ తేదీ పత్రికలోని అడ్వర్టయిజ్మెంట్ చూడండి: హాయిగా నుండును "మైసూరు చందనము సబ్బు యెంత శ్రేష్టమైనదో: మీగడగా వచ్చు దాని మనోహరమైన నురుగు అంతమనోజ్ఞము గాను హాయిగాను నుండును.పుష్కలముగా వచ్చు ఆ తెల్లని నురుగు శరీరము యొక్క రోమ కూపములందు చొచ్చుకొనిపోయి అచటగల మలినమును మురికిని యావత్తు పార ద్రోలును" భలే బాగుంది కదండి! అలనాటి పత్రికలో పండితారాధ్యుల నాగేశ్వరరావు,దాసు వామనరావు,కొడవటిగంటి కుటుంబరావు,తెన్నేటి సూరి,పిలకా గణపతి శాస్త్రి,వి.డి.ప్రసాదరావు,సూరంపూడి సీతారాం,ముళ్ళపూడి వెంకటరమణ,వేటూరి సుందరరామమూర్తి,తిరుమల రామచంద్ర, మార్కట్వైన్ నవలలను తెలుగులో అనువందించిన నండూరి రామమోహన రావుల వంటి హేమాహేమీలు సంపాదకవర్గంలో పని చేశారు. బాపు గారి పాకెట్ కార్టూన్లు "మనవాళ్ళు",జయదేవ్,శంకు,బాబు, సత్యమూర్తి "చదువుల్రావ్",విశ్వాత్ముల నరసింహమూర్తి గారి పంచతంత్రం బొమ్మలకధ,బాపు గారి "బంగారం-సింగారం" బొమ్మల కధలు, నాలాటి సామన్యుడి మొదటి కార్టూన్ ఆంధ్ర పత్రిక(1958)లో చోటు చేసుకున్నాయి.అలానే ఎలిమెంట్రీ చదువుకున్న మా అమ్మగారు సీతాలక్ష్మి టేల్ ఆఫ్ టు సిటీస్(రెండు మహానగరాలు),కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టొ,రాజు పేదా, కాంచనద్వీపం(ట్రజర్ ఐలెండ్)మొ" నవలలను చదివే అవకాశం ఆంధ్రపత్రిక కలిగించింది. ఉగాది(1954)లో పిల్ల్ల్లలకు చిత్రలేఖనం పోటీలో మా చెల్లి గీసిన "నేను,మా సంగీతం మాస్టారు"బొమ్మకు బహుమతి వచ్చింది.ఇంతటి మంచి పత్రిక నిలచిపోవటం ఎంతో భాధాకరం. ఆంధ్రపత్రిక గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఎపి అకాఅడమి ప్రఛురించిన ఆంధ్రపత్రిక చరిత్ర చదవండి.

ఆంధ్ర పత్రిక-అమృతాంజనం:....ఆంధ్ర పత్రికతో బాటు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు అమృతాంజనం పైన్ బామ్ను కూడా తయారుచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులతో బాటు లాభాలను కూడా సంపాదించారు.వచ్చిన ధనాన్ని ఆయన దానధర్మాలకు కర్ఛు చేసేవారు.మహత్మా గాంధీ తన "యంగ్ ఇండియా" పత్రికలో ఇలా వ్రాసారట. "నేను శ్రీ నాగేశ్వరరావు తన అమృతాంజనం ద్వారా ప్రజలను బాగా దోచుకోవాలని కోరుకుంటున్నాను.ఏమంటే ఆ డబ్బును తిరిగి ఆయన ఆ ప్రజలకే ఖర్చు చేస్తారు కనుక".ఇక్కడ మీరు గాంధి గారి సంపాదకత్వాన వెలువడిన "యంగ్ ఇండియా" పత్రిక ఫొటో చూడొచ్చు! అమృతాంజనం పై ఒక జోకు: మొదట్లో ఆంధ్రపత్రిక భాష పూర్తిగా గ్రాంధికంగా వుండేది.చదివ లేక తలనొప్పి వచ్చే పాఠకుల కోసమే నాగేశ్వరరావు గారు "అమృతాంజనం" తయారుచేసారు అని ఒకరు చమత్కరించారట! అన్నట్టు చెప్పటం మరిచానండోయ్! మన ముళ్లపూడి వెంకట రమణ గారి "బుడుగు-చిచ్చుల పిడుగు" కూడా ఆంధ్ర వార పత్రికలోనే వచ్చింది.

Monday, November 09, 2009

గోదావరి తల్లికి అందాల ఆభరణాలు



గోదావరి నది పై ఇప్పుడు వున్న రెండు వంతెనలలో ఒకటి ఆసియాలోనే పొడవైన రోడ్డు రైలు వంతెన.పైనున్న రోడ్డు మీదనుంచి వాహనాలు,క్రింద రైళ్ళు,ఆ క్రింద నది పైన నావలు,లాంచీలు వెల్తుంటాయి.వీటన్నిటి కంటే ముందుగా 1900 లో ప్రారంభించిన హావలాక్ బ్రిడ్జి 100 సంవత్సరాలపైన పనిచేసి మూడో వంతెన నిర్మించాక విశ్రాంతి తీసుకొంటున్నది. మూడో బ్రిడ్జి అర్ధచంద్రాకారపు ఆర్చీలతో గొదావరికి కొత్త అందాలు ఇచ్చింది.ప్రతి రోజూ గొదావరి పై పాత బ్రిడ్జి నుండి బయలుదేరి రోడ్డు రైలు బ్రిడ్జి వరకు తీసుకొని వెళ్ళి మళ్ళి కొత్త/పాత బ్రిడ్జి దగ్గరకు మోటార్ బోట్ల పై షికారు వెళ్ళి రావటం ఎంతో ఆహ్లాద కరం గా ఉంటుంది.ఎన్నో ఏళ్ళుగా రాజమండ్రి లో ఉంటున్నా రెండు రోజుల క్రితమే మా అబ్బాయి వచ్చినప్పుడు ఆ బోటు షికారులో వున్న ఆనందం ఏమిటో తెల్సింది.ఈ సారి మీరు మా ఊరొచ్చినప్పుడు బోటు షికారు మరచిపోకండేం!! అన్నట్టు అలనాటి పాత వంతెన శంకుస్తాపన శిలాఫలకం ఆ వంతెనలాగే ఇంకా మనకు దర్శనమిస్తుంది!!

Wednesday, November 04, 2009

గ్రీటింగ్ కార్డుల కధ





ఈనాడు ఆ మైల్ పోయి ఈ మైల్ వచ్చాక ఒకరికి ఒకరు ఉత్తరాల ద్వారా పలుకరించుకోవడం తగ్గిపోయింది.ఇక బజారుకు వెళ్ళి మనకు నచ్చిన గ్రీటింగు కార్డులు కొనటం వాటిని పోస్టాఫీసుకువెళ్ళి పోస్టు చేసే ఓపిక,తీరిక ఉండటంలేదు.నెట్ నుంచి 123 అన్నంత తేలికగా 123 గ్రీటింగ్స్ రకరకాలు మితృలకి ,ఆప్తులకి క్క్షణాల్లో పమ్పిస్తున్నాము.ఐనా మొట్టమొదటి గ్రీటింగ్ కార్డుల చరిత్రను మనం ఓ సారి చెప్పుకోడం,జ్ఞాపకం చేసుకుందాం! 1842 డిసెంబర్ 9వ తేదీన విలియం మా ఈగ్లే మొట్టమొదటి క్రిస్మస్ కార్డును తయారుచేసాడట!విలియం తయారుచేసిన కార్డు పై భాగాన టు ... అని,అడుగున ఫ్రం...అని అచ్చువేసి పంపే వాళ్ళు పేర్లు వ్రాసుకో వడానికి వీలుగా వుండేదట.మొదటి అమెరికన్ క్రిస్మస్ కార్డు(1824-1909) లో లిధోగ్రాఫర్ లూయిస్ ప్రాంగ్ తయారిచేసాడు.1873 లో ప్రాంగ్ చార్లెస్ డికెన్స్ ఆటొగ్రాఫ్ తో గ్రీటింగ్ కార్డును దిజైన్ చేసి తన మితృలకు,కుటుంబ సభ్యులకు పంపించాడట.1900 సం" వరకు మత సంభందమైన విషయాలకే శుభాకాంక్క్షల కార్డులను పంపించే అలవాటు తరువాత పుట్టిన రోజులు మొ'' వాటికి కూడా జేర్చటం మొదలయింది.1920 అతి చిన్న కార్డు వడ్ల గింజ పై 22 మాటలతో వ్ర్రాసిన క్రిస్మస్ కార్డు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కి బహుకరించారట!


ఇకనుండైనా కొందరు ఆప్త మితృలకయినా గ్రీటింగ్ కార్డులు కొనైనా లేకపోతే తయారు చేసైనా పంపిస్తారు కదూ!

Monday, November 02, 2009

ఇల్లస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లోని అపురూప చిత్రాలు (1950)



ఫిల్మ్ ఫేర్,ఫెమినా లాంటి పత్రికలను ఎన్నో ఏళ్ళుగా ప్రచురిస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రఛురణల సంస్ద బెనెట్ కోల్మన్ కంపెనీ ఇది వరలో ఇలస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే వార పత్రికను ప్రచురించేది. ఎందుకోగాని ఆ పత్రిక ప్రఛురణ చాలా ఏళ్ళ క్రితం నుంచి మాని వేసింది.ఆ పత్రికలో గొప్ప భారతీయ చిత్రకారుల పెయింటింగ్స్,శిల్పాలు,ఫొటోలు ప్రఛురించేవారు.మా నాన్న గారు ఆ పత్రికలోని అపురూప చిత్రాలను జాగ్రత్త చేసి ఆల్బమ్ గా తయారు చేసారు.అందులోని కొన్ని బొమ్మలు మీ ముందు వుంచుతున్నాను.ఇందులో ఒక బొమ్మలో చిత్రకారుడు కవి స్త్రీ ని వర్ణించే తీరులో వుంటే ఆమె రూపం ఎలా ఉంటుందో చమత్కారం గా చూపించటం మీరు గమనించ గలరు

Sunday, November 01, 2009

అపురూపకథ - తిట్టు మాటలు



అలనాటి చందమామ లోని అపురూప కధ తిట్టు మాటలు




గాడిద,ఎద్దు,దున్నపోతు కలసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి "దేవా! మానవులు మా చేత ఎంతో చాకిరీ చేయించుకుంటూ వాళ్ళ తోటి మనుషులను,"అడ్డగాడిదా అని,ఎద్దులాగున్నావు, బుద్ది లేదా అని, ఒరే దున్నపోతా!! అని మా పేర్ల తో తిడుతుంటే మాకు చాలా బాధ కలుగుతున్నది.మీరు ఆ మానవులకు చెప్పి తిట్లలో మా ప్రస్తావన లేకుండా చూడండి" అని మొరపెట్టుకున్నాయి.


అప్పుడు బ్రహ్మ దేవుడు" మీ నడవిడిని బట్టి మానవులు అలా అంటున్నారు. ముందు మీ నడవడి మార్చుకొని నా దగ్గరకు రండి. అప్పుడు చూద్దాము" అన్నాడు.అప్పుడు గాడిద "ఈ దున్నపోతు దగ్గరకు రావటం నే చేసిన తప్పు"అంది. తరువాత ఎద్దు "ఈ అడ్డగాడిద దగ్గరకు వచ్చి పొరపాటు చేసా" అంది. చివరకు దున్నపోతు"ఈ ఎద్దుగాడు మానవ పక్షపాతి వీడి దగ్గరకు వచ్చి చాలా తప్పు చేశాం"అంది.


అలనాటి చందమామ లోని ఈ ఛిన్న కధ ఎలావుంది?

Wednesday, October 28, 2009

బొమ్మల కొలువు




ఇప్పుడు బొమ్మల కొలువులు పెట్టే సాంప్రదాయం తగ్గుతున్నది. ఏమంటే ఈ రోజుల్లో లివింగ్ రూముల్లో ఓ అద్దాల కాబినెట్ కట్టించి అందులో ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటినీ పాపం వాటిని ఊపిరాడకుండా ఉంచేస్తున్నాము.ఐనా ఇప్పటికి విజయదశమికి సంక్రాంతికి బొమ్మల కొలువులు పెట్టే అలవాటును కొంతమందైనా పాటిస్తున్నారు. తమిళనాడు లో బ్యాంకుల్లొ కూడా ఈ కొలువులు ఏర్పాటు చేస్తున్నారు.


మా రాజమండ్రి లో శ్రీమతి అంబరుఖానా నాగలక్ష్మి,వారి అమ్మాయి శివ దీపిక ప్రతి సంక్రాంతికి పెట్టే కొలువుకు పేరంటాళ్ళే కాదు,వివిధ టీవీ ఛానళ్ళ వారు,ప్రింట్ మీడియా వాళ్ళు తప్పక వస్తారు. క్రిందటి ఏడాది కొలువు విశేషాలను ఆంధ్రజ్యోతి ఆదివారం మాగజైన్లో వేశారు కూడా.సన్ టివి కూడా చూపించడం విశేషం!


ఇప్పటికి లక్షల రూపాయలు శ్రీమతి నాగలక్ష్మి ఖర్చు చేయింఛారు వారి శ్రీ వారు ఏజియం.గాంధి చేత. ఆ బొమ్మల కొలువు మీకూ చూపించాలనిపించింది.ఛూశాక మీకూ ఈ సారి తప్పక బొమ్మల కొలువు పెట్టాలనిపిస్తుంది!

Tuesday, October 27, 2009

పుస్తకాలే మంచి నేస్తాలు



నేను నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను,అవి ఇప్పుడు మీకు బుక్ షాపుల్లొ దొరుకుతాయి కాబట్టి, అలానే నా పాత పుస్తకాలు కూడా ఎవ్వరికీ ఇవ్వను! ఏమంటే అవిప్పుడు నాకెక్కడా దొరకవు కాబట్టి అనే నా మాటలు ఛాలా మంది మిత్రులకు కోపంతెప్పిచ్చాయి! అయినా నేను నా మాటకే కట్టుబడి ఉంటున్నాను . అదే మాట పుస్తకప్రియులందరు పాటించాలని నా కోరిక




నేను చాలా కాలం క్రిందట 1941 సం" ఆంధ్రపత్రిక దినపత్రిక (నే పుట్టిన ఏడాది) సంపాదించాను. ఒక బ్యాంకు మితృడు మా ఇంట్లో అది చూసి చదివి ఇస్తానని తీసుకొని ఇవ్వలేదు సరికదా నే పేపర్ కోసం అడిగినప్పుడల్లా "ఏమిటి?తాతల్నాటి పేపర్ కోసం గొడవ చేస్తున్నావు, నిన్నటి పేపర్కు ఈ రోజు విలువ లేదు.పాత పేపర్లతో బాటు మా వాళ్ళు అమ్మేసారు, సారీ" అన్నాడు.అప్పటి నుంచి ఎవ్వరికి నా పుస్తకం కానీ పత్రికలు కానీ ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. తప్పంటారా?




నా దగ్గర 1914 "ది ప్రాక్టీస్ ఆఫ్ ఆయిల్ పెయింటింగ్ ", 1928లో ప్రచురించిన స్టడీస్ ఇన్ ది సైకాలజీ ఆఫ్ సెక్స్ ,ఆంధ్రగ్రంధమాల (ఆంధ్రపత్రిక,1951) కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో తెలుగు సూరంపూడి సీతారాం అనువాదం, 1953 నుంచి చందమామలు, 1955 లో వెలువడిన విచిత్రకవలలు సీరియల్ నవల,బాపురమణ గార్ల పుస్తకాలు, ఆర్కేలక్ష్మన్, బాపు, జయదేవ్, ఈనాడు శ్రీధర్, సరసి, రాగతిపండరి కార్టూన్ పుస్తకాలు, 1944 రీడర్స్ డైజస్ట్ (మా నాన్నగారు మొదటి సారికొన్న ఆయన అభిమాన పత్రిక) 1954 ఆంధ్ర వార పత్రిక (దసరా పిల్లల ప్రత్యేక సంచిక,ఇందులో మా చెల్లి కస్తూరి వేసిన "నేను మా సంగీతం మేస్టారు" బొమ్మకు బహుమతి వచ్చింది),బుక్ ఆఫ్ నాలెడ్జ్ పుస్తకాలు ఎన్నో వున్నాయి.



ఎరువువెళ్ళిన పుస్తకం తమాషా: ... అమెరికాలో లొరెజొ బురోస్ 1849లో పార్లమెంట్ సభ్యుడుగా వుండగా ఒక పుస్తకాన్ని లైబ్రరీ నుంచి తీసుకొన్నాడట! ఆయన వారసులు 140 ఏళ్ళ తరువాత ఆ పుస్తకాన్ని జాగ్రత్త గా లైబ్రరీ కి చేర్చారట! ఎంత మంచి వాళ్ళో!!

Sunday, October 25, 2009

నిప్పుకోడి -సిరాబుడ్డి





ఇది నిప్పుకోడి బొమ్మ కాదు సుమా! పాత కాలంనాటి సిరా బుడ్డి!!

ఈ నిప్పుకోడి బొమ్మచూసారా! మొదటి బొమ్మ రెక్క మూసి ఉంచినప్పుడు మామూలు బొమ్మగా అగుపిస్తున్నది. రెక్కని పైకి తీస్తే నిప్పుకోడి బొమ్మ కడుపులో సిరా పోసుకోవచ్చన్న మాట!. కలం పెట్టుకోడానికి చిన్న స్టాండు వుంచబడింది. ఈ బొమ్మ మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి వుంది.మా నాన్న గారు అప్పటి ఇంపీరియల్ బ్యాంకు లో(ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) యూరోపియన్ ఏజెంట్ మర్ఫీ దగ్గర టైపిస్ట్ గా పని చేసినప్పుడు ఆయన ఇంగ్లాండు తిరిగి వెళ్ళేటప్పుడు బహుమతి గా ఇచ్చారట! మా నాన్నగారు (యంవీ.సుబ్బారావు గారు) స్టేట్ బ్యాంక్ లో 1959 లొ పదవీవిరమణ చేసి 1981 లోకీర్తిశేషులయ్యారు. పుస్తక పఠనం, సంగీతం, స్టాంప్, నాణేల సేకరణ, ఆయన హాబీలు. మానాన్న గారి బుక్ కలెక్షన్, నా కలెక్షన్ తో నా దగ్గర మంచి హోమ్ లైబ్రరరీ వుంది.


ఇక నా పుస్తకాల గురించి, " నా కొత్త పుస్తకాలు ఎవ్వరికి ఇవ్వను!
అవి ఇప్పుడు మీకు బుక్ షాపుల్లో దొరుకుతున్నాయి కనుక!

నా పాత పుస్తకాలు ఎవ్వరికి ఇవ్వను.
అవి ఇప్పుడు నాకు ఎక్కడా దొరకవు కనుక!!"

తప్పుగా అనుకోవద్దు.. ..కాని నా లైబ్రరీ విశేషాలను మీతో పంచుకుంటాను.

Saturday, October 24, 2009

బాపూ రమణీయం

బాపు రమణ గార్ల తో నా పరిచయం




నాకు కార్టూన్లను గీయాలనే అభిలాషను,హాస్య రచనలు చదవటం,హాస్యంగా మాట్లాడటం నేర్పింది ఇద్దరు మహానుభావులు! వారు ఒకరేమో శ్రీ లక్ష్మీనారాయణ,మరొకరు శ్రీ వెంకటరమణ.1956 నవంబరు నుంచి 1957 ఏప్రియల్ వరకు ఆంధ్ర వార పత్రికలో వచ్చిన "బుడుగు-చిచ్చుల పిడుగు" (అప్పుడు నాకు 15 ఏళ్ళు)నా లాంటి అశేష పార్ఠకులను విశేషంగా ఆకర్షించింది.బుడుగు సీరియల్ పూర్తయ్యే వరకు ఛదువరులెవరికీ రచయిత ఎవరో తెలియదు! ముగింపు లో ఇది రాసి పెట్టినవాడి పేరు ముళ్లపూడి వెంకట రమణ, బొమ్మలు వేసినవాడి పేరు బాపు అని వేసారు. ఆ నాటి నుంచే బాపురమణల అభిమానిగా మారి పోయాను. రమణగారి పుస్తకాలన్నీ మా నాన్న గారి చేత కొనిపించుకొనే వాడిని.మా నాన్న గారు కూడా పుస్తకాలను అభిమానించేవారే కావటం నేను చేసుకున్న అదృష్టం! 2005 లో రమణగారి పుట్టిన రోజుకి స్వంతంగా తయారు చేసిన జన్మదిన శుభాకాంక్షలు పంపాను.అందగానే ఆయన దగ్గర నుంచి ఫోనొచ్చింది.





మా పెద్దమ్మాయి మాధురి అత్తవారివూరు చెన్నై కాబట్టి ఈ సారి వచ్చినప్పుడు కలుస్తానని ఆనందంగా చెప్పాను.అక్టోబర్లో ఆయన ఇంటికి మా అమ్మాయితో కలసి మొదటి సారి వెళ్ళాను. బాపు ,రమణగార్లను అలా ప్రత్యక్క్షంగా కలవడం,నేనేనాడో చేసుకున్న పుణ్యంగా భావించాను.ఆ నాటి నుంచి ప్రతి ఏడాది రెండు సార్లు కల్సి వస్తూనే వున్నాను.మొదటి సారి వెళ్ళినప్పుడు కొద్ది సేపయిన తరువాత బాపుగారు వర్కు చేసుకోవాలని క్రిందకు వెళ్ళారు. నేను శ్రీ రమణ గారి సంతకం ముళ్లపూడి సాహితీ సర్వస్వం పుస్తకం మీద తీసుకుంటూ "బాపు గారి సంతకం తీసుకోవటం మరచిపోయా" అని అనగానే పుస్తకం తీసుకొని అచ్చు బాపు గారిలా సంతకం చేసి క్రింద బ్రాకెట్ లో 'ఆధరైజ్డ్ ఫోర్జరీ' అని వ్రాయటం కొసమెరుపు!! కొంచెం పేరు రాగానే ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళనే ఏదో కొత్త ముఖాన్ని ఛూస్తున్నట్లు ప్రవర్తించే ఈరోజుల్లో బాపు రమణ లాంటి మంచి మనసున్న మనుషులున్నందుకు ఆ భగవానునికి నమోవాకాలు. వారి తో నా మరికొన్ని అనుభూతులు మరోసారి!!

Thursday, October 22, 2009

ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారితో





ప్రముఖ కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ బాబు గారితో నా మొదటి పరిచయం రాజమండ్రిలో
1980 మే నెలలో.అప్పుడు ఆయన బాపుగారి తో "వంశవృక్క్షం"షూటింగ్ కోసం రాజమండ్రి
వచ్చి నాకు ఉత్తరం ఇలా వ్రాసారు."నేను మీ ఊళ్ళోనే వున్నాను.మిమ్మల్ని కలిసే అవకాశం
నాకివ్వండి" అప్పటికే ఆయన జూయాలజీ ప్రొఫ్ఫెస్స్రర్ చెస్తూ కార్టూనిస్ట్ గా ఉన్నత స్తానం లో
వున్నారు.ఈనాటికీ ఆయన నిగర్వి.స్నేహానికి ఎంతో విలివనిస్తారు.కార్టూన్లు గీయటంలో నా
లాంటి వాళ్ళకు ఎన్నో మెలుకవలు చెప్పారు,నేర్పారు.వెంటనే ఆ సాయంత్రం హోటల్ మేడూరి
లో మా అమ్మాయి మాధురి తో వెళ్ళి కలిసాను.అప్పుడు దాని వయసు 15 ఏళ్ళు. తిరిగి ఇన్నాళ్ళ
కు ఛెన్నై లొ మాధురితో కలసి మనవళ్ళు చి.నృపేష్,చి.హ్రితేష్ తో 29 ఏళ్ళతరువాత ఆగస్టు 5వ
తేదిన కలిసాను.ఆప్పుడు చి.నృపేష్ మా ఇద్దరికి తీసిన ఫొటొ ఇది.

Wednesday, October 21, 2009

మంచి మాట



ఉ(త్త)మ సలహాలు

మనము ఇష్టపడి ఏదైనా వస్తువుకొనుక్కొని ఇంటికి వచ్చిన ఏ మిత్రుడికో
చూపించామనుకోండి, "ఆ! ఇది కొన్నావా? మాకు తెలిసినవాళ్ళు ఇదే కొన్నారు.
రెండు రొజుల్లో పాడైపోయింది" అంటూ కామెంట్ చేస్తుంటారు.మనకు వెంటనే
మనసు చివుక్కు మంటుంది. ఒక వేళ కొనేముందు అలాటి సలహాలు (నిజమై
తేనే ) ఇవ్వచ్ఛు కాని ఎంతో ఉత్సాహంగా కొన్న వస్తువు చూపించినప్పుడు
ఇలాటి ఉత్త సలహాలు ఇచ్చే అలవాటు వున్నవాళ్ళు మానుకుంటే మంచిదని
నా అభిప్రాయం.మీరేమంటారు!

Monday, October 19, 2009

చోద్యం కాకపొతే ...



























మా అళ్ళుల్లు మా అమ్మాయి ల మాటలు చక్కగా వింటారు! మా వెధవే వాళ్ళావిడ ఎంత చెబితే అంత!!


కార్టూనిస్ట్ శ్ర్ జయదేవ్ గారు మెచ్చిన నా కార్టూన్.

Sunday, October 18, 2009

నా పుస్తకం నుంచి





























శ్రీముళ్లపూడి వెంకటరమణ గారు మెచ్చిన నా కార్టూన్

గోదావరి అందాలు





















గోదావరి మాత ఒడిలొ పాపికొండలు.





గోదావరి అందాలు పాపికొండలులో చూద్దాం రండి.రాజమండ్రి నుండి పదకొండు గంటల లాంచీ ప్రయాణం గోదావరి అందాలు చూస్తూ పకృతి ఆస్వాదిస్తూ మనసు పులకిస్తు వుంటె సమయం పదినిముషాలలోనే గడిచిపోయిన అనుభూతి కలుగుతుంది
.