Tuesday, May 31, 2011

కోటిరూపాయల బాపు బొమ్మల మ్యూజియం ఎక్కడ ?!

స్టేట్ గ్యాలరీ, మాదాపూర్ లో జూన్ 4, 5 ,6 తేదీల్లో బాపుగారి ఒరిజినల్
బొమ్మలతో బొమ్మలకొలువు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల
వరకు జరుగుతుందన్న ఆహ్వాన పత్రం చూశాక, 2001 , మార్చి స్మైల్
సంచిక 16, 17 పేజీలలో చదివిన " బాపు బొమ్మల కోసం కోటి రూపాయల
మ్యూజియం " అన్న ఆర్టికల్ జ్ఞాపకం వచ్చి ఆనాటి ఆ ఆర్టికల్
మీ ముందు వుంచుతున్నాను. చదివి ఆ మ్యూజియం వివరాలు మరిన్ని
తెలిస్తే అభిమానులెవరైనా తెలియజేస్తారని ఆశిస్తాను.
హైదరాబాదులోని శిల్పారామం ఎదురుగా బాపు బొమ్మల కోసం
మ్యూజియం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.ఒక తెలుగు
కార్టూనిస్టుకి ఇంతటి గౌరవం దక్కడం వెనుక ఇద్దరు అధికారుల కృషి,
పట్టుదల వుంది. అసలు "బాపు బొమ్మలకోసం ఒక మ్యూజియం" వుండా
లనే ఆలోచనకు సారధ్యం వహించింది, పునాది వేసింది ఐఎ ఎస్ అధికారి
రాణి కుముదిని.మరో ఐ ఎ ఎస్ అధికారి హుడా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ
పార్ధసారధి భాస్కర్ గారు మ్యూజియం కోసం శిల్పారామం ఎదురుగా ఐదు
ఎకరాల స్థలంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మాణం ప్రారంభించారు.
బాపు బొమ్మల మీద అభిమానంతో ఈ ఇద్దరు ఐ ఎ ఎస్ల కృషి వల్ల బాపు
అపురూప చిత్రాలను కాపాడుకొనే అదృష్టం కలిగింది మనకి.
మూడువేలకి పైగా కార్టూన్లు, లైన్ డ్రాయింగ్స్ కాక మరో ఐదు వందల
కలర్ ఇల్లస్ట్రేషన్సుని ఈ మ్యూజియంలో తీర్చిదిద్దుతున్నారు. బాపు గీసిన
కదలని బొమ్మలతో బాటు ఆయన తీసిన కదిలే బొమ్మల వివరాలు సీడీల్లో
భద్రపరుస్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకి మ్యూజియం. సిద్ధం అవుతుంది
అప్పటివరకూ ఎదురుచూసే ఓపిక లేక పోతే ఈ కార్టూన్లు చూసి నవ్వుకోండి.
( "స్మైల్" మార్చి 2001 సంచిక నుంచి )


అప్పుడే పదేళ్ళు దాటి పోయాయి. ఆ మ్యూజియం విషయం అందరూ మర్చే
పోయారు.బాపుగారి ఒరిజినల్ బొమ్మలకొలువు జరుగుతున్న ఈ సంధర్భం
లోనైనా ఈ మ్యూజియం విషయం ఆలోచిస్తే బాగుంటుంది.లేకపొతే ఆంధృల
ఆరంభశూరత్వం మరోసారి బయటపడుతుంది.
( కార్టూనిస్ట్ శ్రీ శ్యాంమ్మోహన్ " స్మైల్ " సౌజన్యంతో )

Saturday, May 28, 2011

ఈ రోజు తారకరాముని జయంతి

ఈ రోజు నందమూరి తారక రామారావు గారి పుట్టిన రోజు. తెలుగువాళ్ళ
ఆత్మ గౌరవాన్ని నిజంగా తెలుగు నేలపై నిలబెట్టిన మహనీయుడాయన.
తెలుగు వాళ్లనే ఒక జాతి వుందనీ , ఉత్తరభారత దేశప్రజలకూ చాటి
చెప్పిన గొప్ప వ్యక్తి రామారావు. మనల్ని మద్రాసీలుగా పిలవబడుతుంటే
" తెలుగు " వాణిని పార్లమెంటులో వినిపించాడు. మామూలుగా దీనికి కూడా
మన తెలుగు వాళ్ళు కొందరు హర్షించలేదు. "తెలుగు తెగులు ": అంటూ
ఎగతాళి చేసి మనం తెలుగువాళ్ళమని నిరూపించుకొన్నారు. బాపు రమణ
గార్లచే పిల్లలకు తెలుగు పాఠాలు తయారు చేయించి, ఆ తెలుగు ప్రముఖులు
ఇద్దరినీ ఉచితరీతిన సత్కరించాడు.
ఇక నటుడిగా అనితర సాధ్యంగా వివిధ పాత్రలను తెరపై అవిష్కరించారు.
రాముడు, కృష్ణుడు ఇలానే ఉంటారు అని పించారు. ఇలాటి మహానటుడి
మైనం బొమ్మను ప్రదర్శనలో( Madame Tussaud) వుంచకబోవటం ఆయనా
.ఓ తెలుగు నటుడిగా పుట్టడమే !!

శ్రీ నందమూరి తారకరామారావు లాంటి ప్రముఖ తెలుగు వ్యక్తి పుట్టిన రోజునే
నా పుట్టిన రోజు కావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడి
ఈ ఫొటో నా చిన్ననాటిది. ఈ రోజుతో 70 సంవత్సరాలు పూర్తిచేసుకొని 71లోకి
అడుగు పెడుతున్నా ఇంకా నా ఆలోచనలు యవ్వనంగానే వున్నాయి. దీనికి
కారణం భగవంతుడు నాకు ఇచ్చిన మంచి కుటుంబం, నాపై అమిత ప్రేమాభి
మానాలు చూపించే మితృలు ! అందరికీ నా శుభాకాంక్షలు !!

Tuesday, May 24, 2011

" ఐస్ " వాటర్ అను కన్నీటి ఏడుపు కధ !

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అన్నారు ఆత్రేయ. కన్నీళ్లను ఇంగ్లీషులో
" టియర్స్" అని అంటారుగానీ, ఏడిస్తే, నవ్వితే వచ్చే ఆ కన్నీళ్ళు కళ్ళనుంచే
వస్తాయి కాబట్టి " ఐస్ " వాటర్ అని అంటే కాస్త హాస్సెంగా వుంటుంది కదా?
కన్నీళ్ళ రుచి ఉప్పగా వుండటానికి కారణాన్ని ప్రఖ్యాత రచయిత జనార్దన
మహర్షిగారు తన " వెన్నముద్దలు " పుస్తకంలో సరదాగా ఇలా చెప్పారు.
"ఎన్ని చేపల
ఏడుపో...
సముద్రం ఉప్పు..!
మరోచోట ఇలా అన్నారు :
"ఎందుకా ఏడుపు
ఎవడు పోయాడట ?
పక్కింటోడు
ఎదిగిపోయాడట !!



భార్యాభర్తలు సినిమాలో ఓ డైలాగు, " ఏడ్చే మొగాడిని, నవ్వే ఆడదాన్ని నమ్మ
కూడదు" ఇక పిల్లలు, పెళ్ళాలు తమ కోర్కెలు తీర్చుకోడానికి ఏడ్పు మంత్రం
చదువుతారని!. పిల్లల విషయంలో మాత్రం దీనికి కారణం అమ్మా నాన్నలే! ఇక
ఈ కాలంలో ఆడవాళ్ళు అలా "ఐస్" వాటర్ కురిపించి చీరలో, నగలో భర్తలచేత
కొనిపించుకోవటం లేదు. భర్తలే వాళ్ళు ఇంట్లో తమకు, పిల్లలకు చేసే సేవలకే
"ఐస"యిపోయి వారి కోరికలు తీరుస్తున్నారు. కానీ పిల్లలకు ఏడిస్తే తమ పనులు
సాధించుకోవచ్చు అన్న అలవాటును పెద్దలు చెస్తే చివరకు వాళ్ళే ఏడుపు ముఖం
పెట్టాల్సి వస్తుంది. " ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు"
అని బుజ్జి పాపాయిలను ఆటపాటలతో మరిపించవచ్చు కానీ పెద్దపిల్లలను ఏడ్చి
నప్పుడల్లా చంకనెక్కించుకొంటే నడుమునొప్పితో ఏడవలసి వస్తుంది. ముఖ్యంగా
ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ వున్న బొమ్మో మరోటో కావాలని ఏడుపు
లంకించుకోవటం ఆ ఇంటివారికీ, మనకూ ఇబ్బందే! బుజ్జిపాపాయిల ఏడుపు
ఉంగా ఉంగా అంటూ విన సొంపుగానే వుంటుంది.అదీకాక వాళ్ళు ఎంత ఏడిస్తే
ఊపిరితిత్తులకు అంత బలమనే మన పెద్దలు " బాలానాం రోదనం బలం " అన్నారు!
ఇక కొందరు వాళ్ళకు ఏ బాధలు లేకపోయినా ఎదుటివాళ్లని చూసి ఏడుస్తునే
వుంటారు ఎదుటవాడి అబ్బాయికో అమ్మాయికో మంచి మార్కులొచ్చి మెడిసనులోనో
ఇంజనీరింగ్ లోనో సీటొస్తే " ఆ ఊరికే సంబరపడిపోతున్నాడు.రేపు ఫీజులు కట్టేటప్పుడు
తెలుస్తుంది " అంటూ ఏడుస్తుంటారు. మా హాసంక్లబ్ కార్యక్రమాలకు ఏనాడూ రాని
ఓ పెద్దమనిషి "మీరు హాలు సగానికిపైగా జనాలువచ్చారన్నారు, సగంహాలు ఖాళీట
గదా" అని ఓ వెకిలి ఏడుపునవ్వు నవ్వుతుంటాడు. ఇది అతనికి ప్రతిసారి అలవాటైన
ఏడుపు.

ముళ్లపూడి రమణగారి "బుడుగు" బుజ్జిపాపాయిల ఏడుపు గురించి ఇలా చెప్తాడు.
"చిన్ని పాపాయికి కోపంవస్తే వాడు కేరుకేరుమని, యాయా అని ఘట్టిగా చాలాసేపు
చెప్తాడన్నమాట.!" ఇంకా ఏడుపు గురించి బుడుగు బోల్డు సంగతులు చెప్పాడు.
"ఏడిస్తే బామ్మ రూపాయిస్తుంది. ఇక లావుపాటి పక్కింటి పిన్నిగారు ఉందా,.వాళ్ళ
మగుడు దానికి ప్రెవేటు చెప్పేస్తాడా, అప్పుడేమో అది యిలా యేడుస్తూ బామ్మ
దగ్గరకి వస్తుందా, బామ్మేమో యేడవకమ్మా అని దానికి కాఫీ యిస్తుంది". అంటే
ఏడుపువల్ల కొన్ని సమయాల్లో లాభాలున్నాయని మన బుడుగు చెప్తాడు.

రాజకీయనాయకుల్ని కవ్వించి ఏడ్పించే కార్టూన్లు మనల్ని మాత్రం నవ్విస్తాయి.
అంటే వాళ్ళేడుస్తుంటే మనం నవ్వుతామన్నమాట! అంకెల్లో ఏడు సంఖ్య అంటే
చాలామంది ఇష్టపడరు. దేన్నైనా లెక్కపెట్టేటప్పుడు ఏడు సంఖ్యరాగానే ఆరున్నొక్కటి
అంటారు. ఏడిస్తే వాడు ఆరున్నొక్కరాగం తీశాడు అంటారు. మన అమితంగా
అభిమానించేవారికి ఏదైనా దుఖం, కష్టం కలిగినప్పుడు మనకు కన్నీరు వస్తుంది.
అందుకే ఇలాటి సంధర్భాలలో ఏడుస్తున్నవారిని ఏడవనివ్వమంటారు. అలా ఏడిస్తే
మనసు తేలిక పడుతూందని, రోగ నిరోధక వ్యవస్త మెరుగు పడుతుందని చెబుతారు.
బాధకలిగినప్పుడు ఏడ్చేది మానవులు మాత్రమే! మిగతా జంతుజాలం వాటికి వచ్చిన
శారీరక బాధలను మరోవిధంగా , అరుపుల ద్వారా తెలియపరుస్తాయికానీ కన్నీళ్ళు
కార్చవు. అంతేకాదు తోటి జంతువులు బాగుంటే మన మానవుల్లా అవి ఏడవవు!!
(కన్నీళ్ళ కార్టూన్లతో మనని నవ్వించిన బాపుగారికి కృతజ్ఞతలతో)

Friday, May 20, 2011

తెలుగు పాఠకులకు పరిచయమైన ఊమెన్ !!

ఊమెన్ కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ ! ఆయన
గురించి మన బ్లాగరు మితృలు శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారు
తన saahitya-abhimaani.blogspot.co ద్వారా ఇదివరలో తెలియ
జేశారు.

ఆంధ్ర సచిత్రవార పత్రిక సంపాదకులు శ్రీ శివలెంక రాధాకృష్ణగారు
శ్రీ ఊమెన్ కార్టూన్లను వారం వారం మొదటి పేజీలో ప్రచురించే వారు.
తెలుగులోకి అనువాదం చేసి ప్రచురుణ జరిగేది నా దగ్గర వున్న ఆయన
కార్టూన్లను మీ ముందు వుంచుతున్నాను.
శివసేన నేత బాల్ ధాకరే కూడా మంచి కార్టూనిస్టే! ఆయన రైల్వేలలో
అవినీతి పై గీసిన కార్టూన్ చూడండి.

Thursday, May 19, 2011

మన రాజకీయ కార్టూనిస్ట్ ఆణిముత్యాలు !!



ఈనాటి తెలుగు దినపత్రికలలో పాఠకుల దృష్టి పడేది మొట్టమొదట
ఆనాటి కార్టూన్లమీదే! కార్టూన్లకోసం పత్రికలు కొనే నాలాంటి వాళ్ళు
చాలా మంది ఉంటారని నా నమ్మకం. నిన్న జరిగిన రాజకీయాలన్నీ
ఒక్క గీతలో మన కళ్ళముందు ప్రత్యక్షంచేస్తాడు కార్టూనిస్ట్ !. ఇది
వరలో రాజకీయ కార్టూన్లకు ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్ పిళ్లై గారి
"శంకర్స్ వీక్లీ " వుండేది. శ్రీ శంకర్ నెహ్రూ మీద వారం వారం ఎన్నో
కార్టూన్లు గీసేవారు. ఆ కార్టూన్లకోసం నెహ్రూజీ ఆతృతతో ఎదురు
చూసేవారట1 ఈనాటి నాయకులు తమపై వచ్చిన కార్టూన్లను చూసి
కిసుక్కున నవ్వు కోవడం మాని విసుక్కుంటున్నారు, నసుక్కుంటున్నారు.
ఈనాడు, ప్రముఖ వార్తా పత్రికలలో రాజకీయ వ్యంగ్య చిత్రాలు గీసే
శ్రీధర్(ఈనాడు), సురేంద్ర ( ది హిండూ), శేఖర్ (ఆంధ్రజ్యోతి) మన
తెలుగు వాళ్లయినందుకు గర్వించాలి. మీకు మరో విషయం తెలుసా
"ఈనాడు" ప్రారంభించిన కొత్తలో ప్రఖ్యాత రచయిత, కార్టూనిస్ట్
శ్రీ సుధామ (శ్రీ అల్లంరాజు వెంకటరావుగారు) పాకెట్ కార్టూన్లు వేసే
వారు. అలనాడు " ఈనాడు "లో శ్రీ సుధామ గీసిన పాకెట్ కార్టూన్
మీ కోసం.
ఇక్కడ మీరు చూస్తున్న కార్టూన్లు ఈనాడు, ది హిండూ, శ్రీ శేఖర్ గారి
పారాహూషార్ సౌజన్యంతో.

Wednesday, May 18, 2011

కోతి మూకబుర్లు !!



మరీ అల్లరి చేసే పిల్లల్ని కోతిమూక అంటాం. ఏవియస్ కోతిమూక
పేరిట ఓ సినిమాయే తీసేశాడు. కొందరు పెద్దమనుషుల నడవిడిక
చూస్తుంటే పిల్లల అల్లరికన్నా, కోతులు చేసే గోల కన్నా ఘోరంగా
వుంటుంది. నిజానికి కోతులు ఆ చెట్టుమీద నుంచి ఈ చెట్టుమీదకీ
ఆ కొమ్మ నుంచి పైకీ , కిందికీ సందడిగా దూకుతూ మంచి వినోదాన్నే
కలిగిస్తాయి. ఈ నాడు వచ్చే సినిమాల్లోని కొందరు హాస్యగాళ్ళ(క్షమించాలి),
నాయకీ నాయకుల కంటే కోతి గెంతులే మంచి వినోదాన్ని కలిగిస్తాయి కదూ?!
కోతులు కొమ్మల మీద చేసే విన్యాస్యాల్నే కోతికొమ్మచ్చి లంటారు.
శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు కోతికొమ్మచ్చి పేరిట రాసుకున్న తమ
ఆత్మ కధ, ఇంకోతి కొమ్మచ్చిగా రెండోభాగం కూడా విడుదలై విశేష పాఠక
ఆదరణపొందింది. రాబోయే జూన్ 28 నాటికి రమణగారి పుట్టిన రోజుకు మరో
కోతి కొమ్మచ్చి మన ముందుకు "ముక్కోతి కొమ్మచ్చి"గా మనముందుకు
హాసం బుక్స్ ద్వారా రాబోతున్నది. ఇక అమెరికాలో తెలుగొచ్చి చదవటం
రాని మన తెలుగు వాళ్లకోసం యస్పీ.బాలు ,శ్రీ వరప్రసాదరెడ్డి గారల గాత్రంతో
వినే కోతికొమ్మచ్చులు విడుదలయ్యాయి.
రామాయణంలో సీతాన్వేషణలో వానరసేన ఎంత ప్రాముఖ్యం వహించిందో
మనకు తెలుసుగా! సీతాదేవిని కనుగొని ఆ విషయం హనుమంతుడు
తెలియజేయగానే యువరాజు అంగదుడు వానరులకు మధువనంలోకి
ప్రవేశానికి అనుమతించాక వనంలోని తేనె నంతా తాగినంత తాగి మిగతా
తేనెను ఒలకబోసి ఆ మధువు మత్తులో నానా గోలా చేస్తారు వానరులు.
అంటే అంగదుడు తన సేవకులకు గొప్ప పార్టీ ఇచ్చాడన్నమాట. అందు
వల్లనేమో తాచెడ్డ కోతి వనమెల్లా చెరచింది అన్న నానుడి వచ్చిందేమో1
ఇక మన వానరమితృలపై ఎన్నెన్నో సామెతలున్నాయి. కోతికి కొబ్బరి
కాయ దొరికినట్టు, కొండమీద కోతి ఇలా! జున్నుముక్కను పంచుకోడంలో
తగవులు పడి తీర్పుకోసం కోతి దగ్గరకెళ్ళిన పిల్లులకధను మనం చిన్నప్పుడు
చదువుకున్నాం ! దీన్నే మార్జాల మర్కటన్యాయం అంటారు. జంగిల్ బుక్
కధలో కోతులు వాటి రాజ్యంలో మౌగ్లీని అల్లరి పెట్టిన తీరు తెలుసుకదా!
మనం కోతులనుంచే పుట్టామని డార్విన్ సిద్ధాంతం చెబుతున్నది. వాటికి
మనకు చాలా పోలికలున్నాయి. ముఖ్యంగా చెవులు చూడండి. అచ్చు మనకి
లాగానే వుంటాయి. పిల్లలు పెద్దలు కూడా ఎక్కడ కోతులు అగుపడ్డా కోతుల్లా
ఎగబడి చూస్తారు. కవ్విస్తారు ! శ్రీ బాపు గారు జూలో కోతులు లావాటి పిన్ని
గారిని చూసి కిచకిచలాడుకోవటం ఎంత చక్కగా వేసారో ఛుశారుగా! కోతి తెలివికి
మొసలి-కోతి కధ ఒక ఉదాహరణ.
"మల్లీశ్వరి" లో భానుమతి పాడిన కోతీబావకు పెళ్ళంట అన్న పాట
విన్నారుగా!
ఇక కోతి కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం! మరీ ఎక్కువైతే కోతిపుండు
బ్రహ్మరాక్షసి అవుతుంది !

Wednesday, May 11, 2011

తోడు నీడగా !!



నేను దాదాపూ నలభై ఐదు ఏళ్లక్రితం ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో
వేసిన గుర్రపు పందేల కార్టూన్ ( అప్పుడు నేను బాపట్ల ఎస్బీఐ లో
పని చేస్తున్నాను) పై మితృలు డాక్టర్ జయదేవ్ బాబుగారు
పెద్ద మనసుతో తన అమూల్యమైన అబిప్రాయాన్ని ఇలా తెలియ
జేశారు.
"సురేఖ గారి రేస్ కార్టూన్ NEW YORKER పత్రికలో చోటు చేసు
కోవలసిన గొప్ప కార్టూన్.అది చూసి స్ఫూర్తి చెంది ఈ కార్టూన్ గీశాను"
అంటూ ఓ చక్కని కార్టూన్ గీసారు. శ్రీ జయదేవ్ గారికి కృతజ్ఞతలు
తెలియజేసుకుంటూ ఆనాటి నా కార్టూన్ , అంతకంటే అద్భుతంగా గీసిన
జయదేవ్ గారి ఈనాటి కార్టూన్ మీ ముందు వుంచుతున్నాను.

Sunday, May 08, 2011

అమ్మమాట

అమ్మ అన్నపదం ఎంతో మధురమైన పదం! అమ్మను తలచు కోవడానికి
ప్రత్యేకంగా ఏడాదికి ఒకరోజును ఎన్నుకోడం మన సాంప్రదాయం కాదు !
అమ్మ ప్రతి క్షణం మన ముందూ వెనుకా వుంటూనే వుంటుంది. మా అమ్మ
ఫొటోలను మీకు ఇక్కడ వరుసగా చూపిస్తున్నాను.



మా అమ్మగారి దగ్గర కంటే నాన్నగారి దగ్గరే మాకు చనువెక్కువ. ఏమంటే
అమ్మ మేము తప్పుగా మాట్లాడినా,(వస్తది,పోతది లాటి మాటలు) విపరీతంగా
కోప్పడెది. ఆమె వల్లే ఎవరైనా పెద్దవాళ్లతో ఎట్లా మాట్లాడాలో, తోటివాళ్లతో ఎలా
స్నేహంగా వుండాలో నేర్చుకున్నాము. ఆదివారం మధ్యాహ్నం రేడియోలో
వచ్చే రేడియో అన్నయ్య, అక్కయ్య పిల్లల కార్యక్రమాలను వినడానికి వచ్చే
పక్కింటి పిల్లలకు ప్రత్యేకించి చేసిన పిండి వంటలను (ముఖ్యంగా మైసూర్
పాక్ ,లడ్డు చేయటంలో అమ్మ స్పెషలిస్ట్) పెట్టేది.

అమ్మకు పుస్తకాలు పత్రికలు చదవడం అంటే చాలా ఇష్టం. ఆంధ్ర వార పత్రికలో
వచ్చే ప్రఖ్యాత ఇంగ్లీషు నవల అనువాద సీరియల్సు చదివేది. "కౌంట్ ఆఫ్ మాంట్
క్రిష్టో" ( శ్రీ సూరంపూడి సీతారాం అనువాదం) పుస్తకరూపంలో వచ్చాక ఆ నవల
కొని ఎక్కువ సార్లు చదివేది. ఆకధను ప్రక్కింటి స్నేహితులకు (ఇరుగుపొరుగులు)
సంక్షిప్తంగా చెబుతుండేది. ఈనాటికీ అమ్మ కొన్న ఆ నవల నా లైబ్రరీలో అమ్మ
గుర్తుగా పదిలంగా వుంది.

మనసుకవి ఆత్రేయ గారు అమ్మ గురించి ఓ పాటలో ఇట్లా అంటారు...
అమ్మ వంటిది
అంత మంచిది
అమ్మ ఒక్కటే !
అయ్యైనా జేజైనా
అమ్మ పిమ్మటే.........
అమ్మను అనుక్షణం తలుస్తూ మన అమ్మలందరికీ జేజేలు !!

Saturday, May 07, 2011

శ్రీ కిళాంబి వేంకట నరసింహాచార్యులవారి జయంతి


మనసుకవిగా పేరుపొంది అభిమానుల మనసులు దోచుకున్న ఆత్రేయగారి జయంతి నేడు.
రాయక నిర్మాతలను, రాసి ప్రేక్షకులను ఏడిపిస్తారని ఆయన గురించి చమత్కరిస్తారు.
ఆయన వ్రాసిన ఎన్నో పాటల చరణాలు వింటే చాలు, ఆ పాటల సాహిత్యం కలకాలం
మన మనసులనుంచి చెరిగిపోవు. అలానే ఆయన సంభాషణలు అందించిన ప్రేమనగర్,
డాక్టర్ చక్రవర్తి,మాంగల్యబలం, మనుషులు మమతలు, అర్ధాంగి, విచిత్రబంధం,ఆత్మబలం,
చిలిపికృష్ణుడు, పునర్జన్మ, చక్రవాకం, మూగమనసులు ( శ్రీ ముళ్లపూడి వెంకట రమణ
గారితో) మరువలేని కమనీయ చిత్రాలు.
ఆయన వ్రాసిన పాటలలో కొన్నింటిని గుర్తు చేస్తాను. పాటల్లోని పదాలు తేలికగా
అగుపిస్తాయి, కానీ బరువైన భావంతో హృదయాల్ని కదలిస్తాయి ,కరగిస్తాయి.
వద్దురా కన్నయ్యా...వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇల్లు వదలి పోవద్దురా అయ్యా..అయ్యా
పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పసిపాపలను బూచి పట్టుకెళ్ళే వేళ.... (అర్ధాంగి)
<><><><><><><><>
కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
(తోడికోడళ్ళు )
<><><><><><><><>
ఎవరికి ఎవరు కాపలా
బంధాలన్నీ నీకేలా
ఈ బంధాలన్నీ నీకేలా
తనువుకు ప్రాణం కాపలా
మనిషికి మనసే కాపలా
తనువును వదలి తరలే వేళ
మన మనసే మనకు కాపలా.... ( ఇంటికి దీపం ఇల్లాలు )
<><><><><><><><><>
రేపంటి రూపం కంటి-పూవింటి తూపులవంటి
నీ కంటి చూపులు వెంట నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి-పూవింటి దొరనే కంటి
నా కంటి కళలు కలలు నీ సొమ్మంటి.....(మంచీ చెడూ )
<><><><><><><><>
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
మనుషులనే వారున్నారా అని దేమునికొచ్చెను అనుమానం..
మనసులేని ఈ మనిసిని చూసి దేవుడు రాయైపోయాడు
దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు.... (దాగుడుమూతలు)
<><><><><><><><>
మానూ మాకును కాను
రాయి రప్పను కాను
మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను....
మణిసి తోటి ఏలాకోళం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మావా
ఇరిగిపోతే అతకదు మల్లా.......... ( మూగమనసులు)
<><><><><><>
నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ-నవ్వుతూ సావాలిరా
సచ్చినాక నవ్వలేవురా
ఎందరేడ్చినా బతికిరావురా-తిరిగిరావురా...అందుకే..11నవ్వు11\
(మాయదారి మల్లిగాడు)
ఇలా ఎన్నని చెప్పాలి ఏదని చెప్పాలి? అయినా మనసుండలేక మరి కొన్ని..
పేమ ఎంత మధురం
ప్రియురాలు అంత కఠినం.
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
బుద్ధికి హృదయము లేక
హృదయానికి బుద్ధే రాక
నరుడే ఈ నరలోకం నరకం చేసాడు
తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు నెలాగైనా
మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా
అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్ని మంచికని
అనుకోవడమే మనిషి పని.......
ఆహా! ఎంత చక్కటి పద ప్రయోగాలు! ఆత్రేయ చిరంజీవి !!

Thursday, May 05, 2011

స్మృతి కవిత లో నా కవిత


శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి స్మృతి కవిత పేరిట ఎం.ఎస్.సుబ్బులక్ష్మీ
ఫౌండేషన్ ( MSSF ) వారు కవితలను పుస్తక రూపంలో నవంబరు
2006 లో ప్రచురించారు.ఆ పుస్తకంలో మాజీ రాష్ట్రపతి డక్టర్ ఎ.పి.జె
అబ్దుల్ కలాం, లకుమ, డాక్టర్ బూసురపల్లి వెంకటేశ్వర్లు, శ్రీమతి
నన్నపనేని రాజకుమారి, డాక్టర్ చిల్లర భవానీదేవి, కానూరి
వెంకటేశ్వర్లు, ఏ.వి.యస్ (సినీ నటుడు ), ఈతకోట సుబ్బారావు,
మొహమ్మద్ ఖాదర్ ఖాన్, డాక్టర్ ఎల్.కె.సుధాకర్,ఇ.రఘు,తనికెళ్ళ
భరణి (ప్రముఖ నటుడు, రచయిత) ,డాక్టర్ శిఖామణి గార్ల కవితల
మధ్య నా కవిత ప్రచురించబడింది !!
అప్పుడప్పుడు స్థానిక దినపత్రిక "సమాచారం" లో ప్రతి ఆదివారం
సురేఖార్ట్యూన్లు పేర నేను వ్రాసిన కవితల్లోనుంచి ఎన్నుకొని నాకూ
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లాంటి మహనీయురాలి స్మృతి కవితలో చోటు
ఇచ్చినందుకు ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను.
అమరగాన సరస్వతి
గాన సరస్వతి
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి !
నేడు అమృతం సేవించే దేవతలకు
గానామృతం పంచుతున్నది !!
గాన సరస్వతి ముక్కెర మెరుపులతో
నింగిలోని తారల తళకులు మసకబారాయి !!
నిన్నటిదాకా పుణ్యాత్ముల నెలవు కాదు స్వర్గం-
ఆమె రాకతో స్వర్గమే పుణ్యం చేసుకున్నది !!

Sunday, May 01, 2011

నవ్వాలీ !! నవ్వాలీ !! మీ నవ్వులు మాకే ఇవ్వాలీ !!!


నవ్వుల దినొత్సవం రోజున నేను గీసిన కొన్ని కార్టూన్లు
మీ ముందు వుంచుతున్నాను.
అందరికీ నవ్వుల శుభాకాంక్షలు !!