Sunday, May 12, 2013

అమ్మా నీకు వందనం !

       అమ్మ ఎంత తీయనిపదం. మనను ఈ నేల మీదకు
       తీసుకురావడానికి అమ్మ పడె బాధను మర్చి పోయి
       పెంచుతుంది. తను ఆకలితో వున్నా పిల్లలకు పెట్టి
       కానీ అమ్మ ముద్ద ముట్టదు. దెబ్బ తగిలితే అమ్మను
       తెలియని వాళ్ళ నోటి నుంచి కూడా వచ్చేమొదటి
       మాట "అమ్మా!" అనే!

      అమ్మ మీద ఎన్ని పాటలు, ఎన్ని సినిమాలూ వచ్చాయో!
       శ్రీ సినారె " మనుషులు మట్టిబొమ్మలు " చిత్రానికి వ్రాసిన
       ఈ పాట విన్నారనుకుంటాను.
           అమ్మా అని నోరారా పిలవరా
            ఆ పిలుపే అందరు నోచని వరమురా-వరమురా
          పలుపు తెంచుకొని లేగ దూడ
          పరవశించును"అంబా" అని
          గొంతుపెకలని గువ్వ పిల్ల
          కువకువలాడును "అమ్మా"అని
          ఆ పిలుపే ఈ యిలకే
          కమ్మని మమతల కానుకరా
          దేవకి కడుపున వెలసిన కృష్ణయ్య
          తలచె యశోదను "తల్లి" అని
          ఆ తలపే తన అణువణువు నిండగ
          పిలువలేదా " అమ్మా" అని
          ఆ పిలుపే నిను నడిపే - ఆరని వెలుగుల దీపికరా
          అమ్మా అని నోరారా పిలవరా
          ఆ పిలుపే అందరు నోచని వరమురా

    శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు తన సాహితీ సర్వస్వం
     మొదటి భాగం "కధారమణీయం-1"  తొమ్మిది మంది
     తల్లులకు అంకితమిస్తూ ఇలా అంటారు..
          "నన్నుకనిపెంచి
          పెద్ద చేసిన -
           ముళ్లపూడి ఆదిలక్ష్మి
           మహాపతి సూరమ్మ
           కొవ్వలి సత్యావతి
           చల్లా సీతామహాలక్ష్మి
          వీరఘంటం సీతాబాయి
      
          పున్నావఝ్జుల(రేడియో) భానుమతి
          మండలీక సుబ్బులక్ష్మి
          శివలెంక కామాక్షమ్మ
          సత్తిరాజు సూర్యకాంతం
         
          ఈ తొమ్మండుగురు అమ్మలను స్మరిస్తూ"
           జన్మనిచ్చిన అమ్మతోబాటు తనను ప్రేమతో
           ఆదరించిన తల్లులను ఆయన మర్చిపోలేదు.


  మా అమ్మ మట్టెగుంట సీత గారికి సాహిత్యమంటే ఎంతో
 ఇష్టం. తెలుగుపత్రికలన్నీ చదివే వారు. ఆ రోజుల్లో ఆంధ్ర
సచిత్రవారపత్రికలో  ప్రసిద్ధ ఇంగ్లీషు నవలల అనువాదాలు
సీరియల్సుగా వచ్చేవి. వాటిలో మా అమ్మగారికి అలెగ్జాండర్
డ్యూమాస్ రచన కౌంట్ ఆఫ్ మాంట్ క్రిష్టో అంటే చాలా ఇష్టం
పుస్తకరూపంలో ఆ నవల    రెండు భాగాలుగా వెలువడినప్పుడు
కొని తరచు చదివే వారు. ఆపుస్తకం ఇప్పటికీ అమ్మ గుర్తుగా
నా దగ్గర వుంది. నేటి మాతృదినోత్సవం రోజున అమ్మలందరికీ
పాదాభివందనాలు.

Sunday, May 05, 2013

ఈరోజే కాదు ప్రతి రోజూ నవ్వుల మయం కావాలి !!

 నవ్వటం నిజంగా నవ్వులాటకాదు. మన నవ్వు మనల్ని నవ్వులపాలు 
చేయకుండా మరొకర్ని నవ్వులపాలు చేయకుండా వున్నప్పుడె ఆ నవ్వుకు
విలువ. అందుకే మేము మా హాసంక్లబ్ లో జోకు చెప్పేవాళ్ళకు, ఒక మతాన్ని
కాని, వర్గాన్నికాని  ఉదహరించకుండా జోకులు చెప్పాలని కోరుతుంటాం.
చాలామంది పంజాబీల గురించి జోకులు చెబుతుంటారు. పంజాబీలలో
ఎంతోమంది మేధావులున్నారు. ఇక అమాయకులు, తెలివి తక్కువవారు
అన్ని రకాలమనుషుల్లోనూ వుంటారు కదా!?


నవ్వు సహజమయిన పెయిన్ కిల్లర్ ! బాధానివారిణి. ఇది టెన్షన్ యుగం!
ఆఫీసునుంచో, షాపింగ్ నుంచో మనం ఇంటికి తిరిగి వస్తుంటే ట్రాఫిక్ తో
ఎంతో టెన్షన్. ఇలాటి ఈ స్పీడ్ యుగంలో మనం ఈ టెన్షన్లనుంచి దూరం
అవాలంటే మంచి జోకుల పుస్తకమో, కార్టూన్ పుస్తకమో మంచి రిలీఫ్ !!
మంచి జోకైనా, కార్టూనైనా ఎన్ని సార్లు చదివినా చూసినా, లేకపోతే జ్ఞాపకం
వచ్చినా కొత్తగానే వుంటుంది. మరో విశేషమేమంటే నవ్వాలంటే మన
ముఖంలో  17 కండారాలకు పనికలిగితే అదే చిరాగ్గా కోపంగా వున్నప్పుడు
43 కండరాలు పనిచేయాలి. అటువంటప్పుడు ఆ కండరాలచేత ఓవర్
వర్క్ చేయించడం ఎందుకు చెప్పండి. అందుకే ఈ నవ్వుల పండుగ రోజే
కాదు ఎప్పుడూ నవ్వుతూనే వుందాం! ఎదుటి మనిషిది ఏ భాషైనా, ఏ దేశం
యైనా మనకు ఎదురైనప్పుడు చిరునవ్వు చిందిస్తే మనం వారికి ఆప్తులవుతాం.
నవ్వుకు భాషలేదుకదా. "శాంతి నవ్వుతో ఆరంభమవుతుంది" అన్న మదర్
ధెరిస్సా మాట మీకు గుర్తుండే వుంటుంది. అందుకే మనం సదా నవ్వుదాం!
నవ్విద్దాం! మనసారా నవ్వుకుందాం !
                            "నవ్వేజనా సుఖినో భవంతు"