Friday, July 30, 2010

రావి శాస్త్రి "రచనా సాగరం"


రాచకొండ విశ్వనాధ శాస్త్రి

రావి శాస్త్రి గా పేరొందిన తెలుగు పాఠకుల అభిమాన రచయిత
ఎన్నో కధలు, నవలలు, నాటికలు వ్రాసారు. శ్రీ శాస్త్రి గారు 1922,
జూలై 30 వ తేదీన శీకాకుళం లో జన్మించారు.
ఆయన రచనలన్నీ ఒకే చోట ఏర్చి కూర్చి రాచకొండ విశ్వనాధ శాస్త్రి
రచనా సాగరం పేరిట మనసు ఫౌండేషన్ వారు శ్రి బాపు ముఖచిత్రంతో
1373 పేజీలతో పుస్తకాన్ని ప్రచురించారు.
శ్రీ రావి శాస్త్రి గారి కలం నుండి వెలువడిన ఓ చిన్న మణిపూస.

విస్కీ సీసాని
అతను కౌగలించుకొని తెస్తూ
మెట్ల మీద బోర్లా పడిపోయాడు.
విరిగిన సీసా పెంకులు అతని గుండెల్లో గుచ్చుకోగా,
అతను చనిపోయాడు.
అతను ఆ విధంగా మట్టిపాలయినందుకు
అతని భార్యాబిడ్డలూ విచారించారు.
సీసాలోని స్కాచ్ విస్కీ నేలపాలయినందుకు
అతని" స్నేహితులు " విచారించేరు.
( స్వాతి ,సెప్టెంబరు, 1978 )




"


"

Thursday, July 29, 2010

సెల్లులో సొల్లు కబుర్లు !!


సెల్లులొ సొల్లు కబుర్లు
ఈ కాలంలో సెల్లులేని ఇల్లు ఎక్కడుంది చెప్పండి. అంతెందుకు
సందు సందున మందు దుకాణాల్లా సెల్లు దుకాణాలు, అందులో
సెల్లులు సెల్లుచేస్తుంటె కొనుక్కోడానికి మూగే జనాలు ఎప్పుడూ
కనిపిస్తుంటారు. నాకు అనిపిస్తుంటుంది, నిత్యావసారాలలాగ
వీటికి ఇంత డిమాండ్ ఏమిటా అని.! కాలేజీకి వెళ్ళే అమ్మాయిల,
అబ్బాయిల చేతుల్లోనే కాదు, స్కూళ్లకు వెళ్ళే పిల్లల చేతుల్లోనూ
ఈ ఫోన్లే !.
మా కాలంలో అసలు లాండు ఫోన్లే ఎవరో వ్యాపారం చేసే వాళ్ళకు,
గొప్పవాళ్లకి వుండేవి. రాజమండ్రిలో మేము ఉంటున్న వీధిలో నాళం
రాజారావు గారనె ఎలక్ట్రికల్ డీలర్ షాపు/ఇంట్లో, అద్దేపల్లి నాగేశ్వరరావు
గారి ప్రెస్ ( సరస్వతీ పవర్ ప్రెస్, ఈ ప్రెస్ లోనే ఆంధ్రాయూనివర్సిటీ వారి
AA పుస్తకాలు అచ్చయేవి) మాత్రమే టెలీఫోన్లు ఉండెవి. నాన్న గారు బ్యాంకు
నుంచి ఫోను చేస్తే , ప్రెస్ వాళ్ళు చెప్పమన్న విషయం మా ఇంటికి
వచ్చి చెప్పేవారు. రోజులు మారాయి. ఇప్పుడు ఫోను స్టేటస్ సింబల్ కాదు.
అత్యవసరం. ఇక మొబైల్ ఫోన్ మన బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన
సమాచారాన్ని తెలియచేయడానికి ఉపయోగిస్తే సద్వినియోగమే. కానీ
ఈనాడు సెల్ వల్ల ఉపయోగంతో బాటు నష్టం కూడా వుంటున్నది. బయట
నుంచి ఇంటికి మాట్లాడే టప్పుడు కొద్దిగా నెమ్మదిగా మాట్లాడటం నేర్చుకోవాలి.
ఈ మధ్య HINDU పత్రికలో శ్రీ వి.రాజగోపాల్ సెల్ ఫోన్లపై వ్రాస్తూ, జరిగిన ఓ
సంఘటణను ఉదహరించారు. ఓ పెద్దమనిషి రోడ్డు మీద నిలబడి ఫోనులోగట్టిగా
ఇంట్లో బీరువాలో డబ్బు పెట్టానని, బ్లూ టీషర్ట్ వేసుకొన్నతను వస్తాడు ,డబ్బు
ఇమ్మని చెబితే, ఇదంతా విన్న ఒకడు అతనింటికి వెళ్ళి (బ్లూ షర్టు తో)
డబ్బు తీసుకొని దొరలా వచ్చి దొంగగా చక్కాపోయాడట! మనం సాధారణంగా
చూస్తుంటాము. రైళ్లల్లో, సినిమా హాళ్లల్లో గట్టిగా ఇంట్లో విషయాలన్నీ
లోకమంతా వినిపించేలా మాట్లాడుతుంటారు. ఇక బైకులమీద వెడుతూ
మెడ వంకర పోయిన వాడిలా సెల్లుతో మాట్లాడుతుంటారు. ఇది ప్రమాదం
అని తెలియక కాదు, వాళ్ల భావనలో ఫాషన్. ఇంట్లో ఉన్నప్పుడె చాలా సార్లు
ఎంత జాగ్రత్తగా వున్నా క్రింద పడిపోతూంటుంది. అదేమిటొ అలా మెడ సందులో
అలవాటు చేసుకోవడం మంచిది. ఇక ఆఖరుగా సెల్లు జోకులతో ముగిస్తాను.
భార్య భర్తతో, " ఏమండీ, ప్రతి అడ్డమైన వెధవ దగ్గర సెల్ ఫోనుంటున్నది.
మీరూ ఒకటి కొనుక్కోరాదటండీ ! "
*****************************************
******************************************







భలే మంచి రోజు ! సినారె పుట్టిన రోజు !!



రసహృదయ వశిష్టుడు సినారె
ప్రముఖకవి, సినీ గేయ రచయిత తెలంగాణాలోని హనుమాజీపేట
అనే చిన్న గ్రామంలో జూలై 29 , 1931 జన్మించారు. ఆయన హైద్రాబాద్
ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేస్తూనె యన్టీయార్
ఆహ్వానం పై 1961 లో "గులేబాకావళి కధ" చిత్రంతో పాటలు వ్రాయటం
ప్రారంభించారు. మద్రాసులో నివాసం వుండకుండా హైదరాబాదులోనే ఉంటూ
శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ లాంటి దిగ్గజాల మధ్య నిలబడి పాటల రచయితగా
అసమాన ఖ్యాతిని పొందారంటే సామాన్య విషయం కాదు. శ్రీ నారాయణరెడ్డి
ప్రభంధిక మాటలను సినీ గేయ రచనలలో ప్రవేశపెట్టారు. ఆయన స్వయంగా
మధురంగా పాడగలగటం మరో ప్లస్ పాయింట్ అయింది. సినారె గా ప్రశిద్దులైన
ఆయన లలిత సంగీతం, గేయ కావ్యాలు వ్రాశారు. " ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు
దాగెనో", "సాగుమా ఓ నీల మేఘమా" లాంటి లలిత గీతాలు సినిమా కోసం
వ్రాసినవి కావు. తరువాత ఆ పాటలను వివిధ సినిమాలలో ఉపయోగించారు.
మొదటి సారిగా 1961లో యన్టీయార్ సినిమా "గులేబాకావళి కధ" చిత్రానికి
పాటలు వ్రాస్తున్నప్పుడు, శనివారం సాయంత్రం హైద్రాబాదు నుండి మద్రాసుకు
వచ్చి పాటలు వ్రాసి తిరిగి సోమవారం ఉదయం ఫ్లయిట్లో తిరుగుప్రయాణమై
యూనివర్సిటీలో క్లాసులకు హాజరయ్యే వారంటే ఆయన కార్యదీక్షత,సమయ
పాలనను మెచ్చుకోలేకుండా వుండలేము. శ్రీ నారాయణరెడ్డి మంచి వక్త. ఘజల్స్
అద్భుతంగా గానం చేయగల ప్రతిభాశాలి. " మాయదారి సిన్నోడు నా మనసే
లాగేసుండు" పాటలో తెలంగాణా మాండలీకాన్ని సినిమా పాటలో మొదటిసారిగా
ప్రవేశపెట్టారు. ఆయన రచించిన ప్రఖ్యాత కావ్య రచన కర్పూరవసంతరాయలు,
నాగార్జున సాగరం, జాతిరత్నం, ఋతుచక్రం, విశ్వంభర, గేయ నాటికలు, నవ్వని
పువ్వు, అజంతాసుందరి మొదలైనవి. 1978లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ
గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. సాహిత్య అకాడమీ తో బాటు 1977 లో పద్మశ్రీ
అందుకొన్నారు. "కర్పూర వసంతరాయలు" కావ్యాన్ని ఆయన ఆలపించగా అమెరికా
లోని ఆయన అభిమానులు LP రికార్డుగా తయారు చేయించి విడుదల చేశారు.
సినారె చమత్కారాలు
ప్రసిద్ధ కవి బోయి భీమన్న తన అభిప్రాయాల్ని వ్యాసాల్లొ, ఉపన్యాసాల్లో నిర్భయంగా
వ్యక్తీకరిస్తుంటారు. భీమన్న పాల్గొన్న ఒక సభలో సినారె ప్రసంగిస్తూ బోయి "భీమన్న
కాదు, ఈయన బాబోయ్ భీమన్న" అన్నారు.
* * * * * *
హైదరాబాదులో నాగార్జున సాగర్ కమ్యూనిటీ హాల్లో సినారె గారికి జ్ణాన పీఠ్ ఎవార్డు
వచ్చినప్పుడు జరిగిన సన్మాన సభకు జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు అధ్యక్షత
వహించారు. సినారె వారిని సంభోదిస్తూ " మేధావుల సాంబశివరావు" అన్నారు.
**********
సినారె చణుకు
1990 లో తూర్పు గోదావరి జిల్లా రామవరం లో సినారె కి సన్మానం ఏర్పాటు
చేశారు. విశేషజనవాహినిని చూసిన ఓ వక్త ఈ సభ "మయ సభ"ను గుర్తు
చేస్తుంది అని అన్నాడు. "మయ సభ" అంటే ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా
చూపించేది. కాబట్టి ఈ సభను మయ సభా అనవద్దు, వాఇ~మయ సభ అందాం
అన్నారు.
***********
సినారె ఇంటికి ఒక నియోగి ప్రముఖుడు, ఆయనతో ఓ వ్యాకరణవేత్తా వచ్చారు.
ఇద్దరూ సినారెకు అత్యంత ఆప్తులు. సెలవు తీసుకొని వెడుతూ స్కూటర్ మీద
కూర్చున్నారు. మితృలకు వీడ్కోలు చెబుతూ సినారె "బాగుంది ! ఈ జంట! ముందు
కరణం, వెనుక వ్యాకరణం" అంటూ చలోక్తి వదిలారు..
***********
ఈ రోజు 29వ తేదీన 80వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సినారె గారికి మన
బ్లాగందరి తరఫున శుభాకాంక్షలు !!

Wednesday, July 28, 2010

వార్తా పత్రికల కబుర్లు




వార్తా పత్రికల కబుర్లు
ఇప్పుడు మనకు తెలుగులోనే ఎన్నో దిన పత్రికలు. ఒక్కొక్కటి దాదాపు
ఓ పాతిక కేంద్రాలనుంచి వస్తున్నాయి. ఇక రంగులు , జిల్లా ఎడిషన్లు
ఇలా ఎన్నెన్నో హంగులు. ఉదయని కల్లా పత్రికలు మన ముంగిటకు
వచ్చి పలకరిస్తున్నాయి. మా చిన్న తనంలో ఇన్ని దిన పత్రికలు లేవు.
ప్రముఖ పత్రికలు తెలుగులో రెండే ఉండేవి. అవి కాశీనాధుని నాగేశ్వరరావు
గారి " ఆంధ్రపత్రిక", ఇండియన్ ఎక్స్ప్రెస్స్ గ్రూప్ వారి "ఆంధ్రప్రభ". ఆది వారం
రెండు అణాలు, మిగతా రోజుల్లో ఒక అణా (ఆరు పైసలు) ! ఇంగ్లీష్ దిన
పత్రికలలో "THE HINDU", "MADRAS MAIL", "INDIAN EXPRESS"
పత్రికలు వచ్చేవి. ఇవన్నీ మద్రాసు కేంద్రంగా ప్రచురించ బడేవి.
ఈ నాటి మన వార్తాపత్రికలకు మూలం ఎక్కడో తెలుసుకోవాలంటే రోమన్ల
కాలం నాటి జూలియస్ సీజర్ కాలం నాటికి వెళ్ళాలి. సీజర్ "ఏక్టా డయర్నా"
లిఖిత ప్రకటనల పత్రాలు ప్రవేశపెట్టాడు. "ఏక్టా డయర్నా" అంటే "దైనిక విశేషాలు"
అని అర్ధం ట. మొదట్లో లెటర్ ప్రెస్ ద్వారా అచ్చయే పత్రికలు ఈనాడు అత్యంత ఆఫ్సెట్లో
వేగంగా వివిధరంగుల్లో తయారవుతున్నాయి. "ఆంధ్రపత్రిక", "ఆంధ్రప్రభ" తరువాత
విజయవాడ నుంచి INDIAN EXPRESS తో బాటు ప్రచురించడం ప్రారంభించారు.
కాలక్రమాన ఉషోదయా సంస్ఠ " "ఈనాడు " పత్రికను ప్రారంభించి పేరులోనే కొత్త
వరవడిని ప్రవేశపెట్టారు. ఆంధృల అభిమాన పత్రికగా ఫెరుమోసిన "ఆంధ్ర పత్రిక"
కనుమరుగయింది. "ఆంధ్రజ్యోతి", "వార్త", "సాక్షి", "సూర్య", " విశాలాంధ్ర" పత్రికలు
వస్తున్నాయి. చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు " ఉదయం" పేరిట దిన పత్రికను
ప్రారంభించారు కాని ,ఎంతో కాలం సాగలేదు. "THE HINDU", "INDIAN EXPRESS"
పత్రికలు బోఫోర్స్ కుంభకోణాన్ని బయట పెట్టాయి. ఎమర్జన్సీ చీకటి రోజుల్లో పత్రికల
మీద అప్పటి ప్రభుత్వం ఉక్కుపాదం పెట్టినా దేశంలోని పత్రికలు ధైర్యంగా ఎదుర్కోన్నాయి.
మహత్మా గాంధి సంపాదకత్వంలో వెలువడిన YOUNG INDIA ( 25.05.1921)
పత్రికను, ఆంధ్రపత్రిక ( 4th APRIL, 1914) ప్రతిని, గాంధి హత్యను GANDHIJI
SHOT DEAD అన్న వార్తను ప్రచురించిన జనవరి 31,1948 నాటి HINDU పత్రికను,
బోఫోర్స్ కుంభకోణం వార్తను వేసిన HINDU, INDIAN EXPRESS పత్రికల ఫొటోలను
పైన చూడండి.
ప్రఖ్యాత హాస్య రచయిత కీ" శే" శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ గారిని కలవడానికి వేళ్ళి
నప్పుడు, ఏమండి ఇంకా స్నానం అవలేదా? అని అడిగితే, "ఫెపర్లలో ఉదయాన్నే చావు
కబుర్లు ఉంటాయి కదా, అవన్నీ చదివాక స్నానం చేస్తా, అందుకే లేటు" అని నవ్వుతూ
అనే వారు. ఉదయాన్నే పేపర్లలో ఈ వార్తలు చూసినప్పుడల్లా ఆయన మాటలే గుర్తు
కొస్తాయి.

Monday, July 26, 2010

బొమ్మల కధలుగా ఇతిహాసాలు






విదేశాల్లో చిత్రకధలు ( కామిక్స్) పిల్లల్లో, పెద్దల్లో బాగా ప్రాచూర్యాన్ని
పొందాయి. మన దేశంలో అమరచిత్ర కధలు రూపంలో మన పౌరాణిక,
చారిత్రాత్మక గాధలు ఇండియా బుక్ హౌస్ సంస్థ విడుదల చేస్తున్నది.
1985లో సంస్కృతి ఇంటర్నేషనల్ శ్రీ బాపు, ముళ్ళపూడి గీసి,వ్రాసిన
రామాయణం బొమ్మల కధను ప్రచురించింది. ప్రచురుణ కర్తలు ముందు
మాటలో ఇలా అన్నారు.
" ఈ పుస్తకాన్ని ముందు ఇంగ్లీషు, ఫ్రెంచి, శ్పానిష్ భాషలలో
ప్రచురించి పదివేల కాపీలు అమెరికా, కెనడా దేశాలకు
పంపించాము. ఆమెరికాలో అఖండ విజయం పొందిన ఈ
గ్రంధం త్వరలో మరికొన్ని విదేశ భాషలలో కూడా ప్రచురించ
టానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కధను విని కొంత అర్ధం
చేసుకున్న అమెరికెన్ పిల్లలు ఈ బొమ్మలు చూసి కధ
గురించి యింకా ఎక్కువ అర్ధం చేసుకున్నా మన్నారు"

శ్రీ కృష్ణలీలలు, మహా భారతం బాపు బొమ్మలు, ముళ్లపూడి వారి రచన చిన్న
పిల్లలకు చక్కగా అర్ధమయేంత అందంగా వుంటాయి. కొంచెం పెద్ద పిల్లలు
యింకా ఎంత సేపైనా చూడాలి అంటారు. ఈ పుస్తకాలు రామాయణం
లాగానే ఏ వయసుకు తగినట్లు ఆవయసుల వారికి ఉల్లాసం కలిగిస్తాయి.



Sunday, July 25, 2010

సురేఖార్ట్యూనులు




సురేఖా కార్ట్యూనులు : : నీరు కన్నీరు అను ’ఐస్ " వాటర్
( EYES WATER )
మునిసిపాలిటీ అందించే కలరు నీరు కాదా జనంపాలిటి కలరా !
ఆ నీళ్ళు త్రాగి రోగాలు రాని జనాలు ఒకరైనా కలరా ?
అందుకే సందు సందు ముందు పెట్టేశారు ఓ "మందు" దుకాణం !!
ఆ "మందు" తో తీర్చుకుంటున్నారు లే ఓటేసిన జనం ఋణం ! !

Saturday, July 24, 2010

"ఈనాడు" శ్రీధర్ కార్టూ‍న్ల పుస్తకం




ఈనాడు శ్రీధర్ కార్టూన్ల పుస్తకం
ఈనాడులో శ్రీ శ్రిధర్ గారి కార్టున్లు చూసినప్పుడు ఆర్కే లక్ష్మణ్ గారి కార్టూన్
పుస్తకాలలా శ్రీధర్ గారి కార్టూన్ల పుస్తకం కూడా వెలువడితే బాగుండునని
చాలామంది ఆయన అభిమానులకు కలిగే వుంటుంది. ఈనాడు ఆగస్ట్,1999
లో ఈనాడు కార్టూన్లు శిధర్ పేరిట 10 X 8.5" సైజులో 214 పేజీలతో చక్కని
బైండు పుస్తకం రూ.70/-లకు విడుదలచేసింది. ఈనాడు పత్రికలో శ్రీధర్ 30
నవంబర్ 1982 నుండి 13 జూన్ 1999 వరకు వేసిన కార్టూనను
ఇందులో చూడొచ్చు. శ్రి ఆర్కే లక్ష్మన్ గారి తరువాత తెలుగులో రాజకీయ కార్టూనిస్ట్ గా
శ్రిధర్ ప్రధమ స్థానంలో నిలుస్తారనటంలో అతియోశక్తి లేదు.
శ్రీ రామోజీ రావు గారు పుస్త్రకంలో తన అభిప్రాయాన్ని ఇలా చెప్పారు.
" నేను నాటి,పాదుచేసి, పెంచిన మొక్క గురించి ఏం చెప్పను? "ఈనాడు" ప్రాంగణంలో
నా కళ్ళ ముందే కార్టూన్ కల్పవృక్షం గా ఎదిగిన శ్రిధర్ గురించి ఎంతని చెప్పను? నాటి
నా ఆలొచనకు శ్రీధర్ లో అంతర్లీనంగా ఉన్న తపన, వృత్తిపట్ల అంకిత భావం తోడయ్యాయి.
ఇవాళ ఆర్.కె.లక్ష్మణ్ల్ లాంటి అగ్రశ్రేణి కార్టూనిస్టుల సరసన సుస్ధిర స్థానాన్ని శ్రీధర్ కు
సముపార్జించిపెట్టాయి. ఈనాడులో పుట్టి ఈనాడులో పెరిగిన శ్రిధర్ తో నా అనుబంధం-
తండ్రీబిడ్డల వాత్సల్యం. శ్రీధర్ లాంటి కార్టూనిస్ట్ "ఈనాడు"లో తయారయినందుకు
పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాను."
ఇక శ్రీధర్ ఇలా అంటారు, "స్కాములూ, అవినీతి, అసమర్ధతా, నిరుద్యోగం, కరవూ,
చెత్తా చెదారం, బాధలూ, నీటి కొరతా, కరెంటు కోతా, అధిక ధరలూ, పన్నులూ కొనసాగినంత
కాలం నవ్వక తప్పదు... అంటే ,జీవిత పర్యంతం నవ్వాలి. అదంతే- నవ్వండి !"
ఆగస్టు 24, 1908 లో శ్రీధర్ గారిని కలిసే అదృష్టం నాకు కలిగింది. ఆనాటి ఫొటొ మరొ
సారి, మీ అందరికోసం.

Friday, July 23, 2010

బాపు రమణ బొమ్మల కధలు






మరో మంచి పుస్తకం - బాపు రమణ బొమ్మల కధలు
బాపు రమణలు 60 ఏళ్ళనుంచి చేసిన కళా (ధా) పోసన లన్నీ ఏర్చి కూర్చి ఒకే
పుస్తక రూపంలో రచన శాయిగారు తమ వాహిని బుక్ ట్రస్ట్ ద్వారా పెద్ద సైజులో
465 పేజీలతో ప్రచురించారు. తెలుగు పాఠకులకు ఇది పసందైన విందు. ఆంధ్ర
సచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ వార పత్రిక,ఆంధ్రజ్యోతి వీక్లీ, చందమామ,యివ,జ్యొతి,
విజయచిత్ర ఇలా ఎన్నెన్నొ ప్రముఖ పత్రికలలోని అద్భుత రచనలను,బొమ్మల
కధలను చూస్తూ చదవొచ్చు. ఆనాటి చందమామలో బాపుగారు వేసిన రంగుల
గలివర్ ట్రావల్సు బొమ్మల కధ, ఆంధ్రవారపత్రికలో వేసిన, రైతూ-రాజు, బంగారం-
సింగారం , బుడుగు "రాచ్చసుడూ పదమూడో ఎక్కం ఖధ", బాపుగారు గీ(రా)సు
కున్న పెళ్ళిపుస్తకం,శ్రీ నాధ కవి సార్వభౌముడు స్క్రీన్ ప్లేలు ,చెప్పినడ్రాయింగ్
పాఠాలు, పంచతంత్రం బొమ్మల కధ అన్నీ అపురూపాలే.
495/-రూపాయలవిలువ గల ఈ పుస్తకం వాహిని బుక్ ట్రస్ట్,1-9-286
వుద్యానగర్, హైదరాబాద్- 500 04 వారి వద్ద దొరుకుతుంది.

Wednesday, July 21, 2010

గో గో గో !! గోమాత !!

ఆవు దూడను పూర్తిగా తాగనివ్వక దాని పాలు పూర్తిగా.
పిండుకుంటాము. మనది ఓ వేళ పాల వ్యాపారమైతే
అందులో నీళ్లు కలిపి అమ్ముకుంటాము. అన్యాయంగా
సంపాదించే వాళ్ళను "వాడు నానా గడ్డి తిని సంపాదించాడు"
అంటూ వుంటారు. ఫాలు పిండుకుంటే పిండుకున్నారు
ఆ ఆవుకు ఇంత దానాగా గడ్డి వేయరు. పాలు తిసుకున్నాక
వాటిని రోడ్డు మీదకు తోలుతారు. పాపం అవి కార్పొరేషన్
చెత్త కుండీలలోని నానా చెత్త తింటాయి. ప్లాస్టిక్ సంచుల్లో
ఉంచి పారేసిన కూరగాయల తొక్కును ఆ సంచుల్తో పాటు
నములుతాయి. ఆ ప్లాస్టిక్ అరగక వాటికి ఎన్ని జబ్బులో!
గోవును పూజించడం మన సంప్రదాయం. చెత్త కుండీ దగ్గర
ఆవు కనిపించగానే ,అక్కడ ఎంత దుర్ఘ్హంధంగా వున్నా సరే
వెళ్ళి తోకకు ఓ దండం పెడతారు. ఢిల్లీ లో సుల్తాన్పూర్ బర్డ్
సాంక్చ్యురీ దగ్గర ఎండిన చెరువులోని ఓ రకం చేప కళేబరాన్ని
తింటున్న ఓ ఆవు ఫొటోని "ఇండియా టుడే" పత్రిక ఇటీవలే
ప్రచురించింది. అంటె ఆవులు కూడా మాంసాహార జంతువులుగా
మారిఫొయేటట్లు ఛెస్తున్నామన్నమాట. అదే ఆ పై ఫొటో.
గోవు మాలచ్చిమిని నీ దేవతంటావు
పాలు తీసుకొని రోడ్డు పైకి గోగో అంటూ తోలుతుంటావు !!
మునిసిపాలిటీల నానా చెత్త తింటుంటే ఆ ఆవు
చూసి తోకకో దండమెడతావు!! నోటికో పండందించలేవు !!
ఫోటో : ఇండియా టుడే సౌజన్యంతో

"గణపతి" సృష్ఠికర్త శ్రీ చిలకమర్తి





హాస్య రచయిత శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రధమాంధ్ర
రచయితల్లో ప్రముఖవ్యక్తి. ఆయన తన ఇరవై రెండో ఏట
మొదటి రచన చేశారు. ఆయన 1889లో రచించిన "గయో
పాఖ్యానం" నాటిక వందేళ్ళు పైగా ప్రదర్శించబడింది. కందుకూరి
తో బాటు ప్రముఖులంతా ఈ నాటికలో పాత్రలను పోషించారు.
శ్రీ చిలకమర్తి గీతామంజరి, కృపాంబోనిధి, మొదలైన శతకాలు,
సరస్వతి,మనోరమ,దేశమాత పత్రికలను నిర్వహించారు. ఆయన
వ్రాసిన "గణపతి" హాస్య నవల కడుబుబ్బ నవ్విస్తుంది. 1967లొ
ఆకాశవాణి విజయవాడ కేద్రం గణపతి నవలను రేడియో నాటకంగా
మార్పుచేసి ప్రసారం చేసి నప్పటినుంచి ఎన్నోసార్లు పున ప్రసారమయింది.
ఈనాటికను ఆకాశవాణి వారు ఆడియో సిడీగా విడుదల చేశారు.
ఇందులో గణపతిగా నండూరి సుబ్బారావు,అతని తల్లి సింగమ్మగా
పి .సీతారత్నమ్మ, పంతులుగారిగా పుచ్చాపూర్ణానందం మొదలైనవారు
నటించారు. ఈ సీడీ అమ్మకానికి ఆకాశకేంద్రాల వద్ద లభిస్తుంది.
" భరత ఖండంబు, చక్కని పాడియావు
హిందువులు, లేగదూడలై ఏద్చు చుండ
తెల్లవారను, గడుసరి గొల్లవారు
పిదుకుచున్నారు, మూతులు బిగియగట్టి" అని చిలకమర్తి విదేశీ
పాలనపై ఓ పద్యం వ్రాశారు. ఇక్కడ హిందువులు అంటే ఒక మతం
గురించి ఆయన ప్రస్తావించడం కాదని మనం గ్రహించాలి. ఆ కాలంలో
మన దేశాన్ని హిందూదేశం అనే పిలిచేవారు. మనం తెలుగోళ్ళం కాబట్టి
ఆ మధ్య కొందరు తెలుగోళ్ళు ఈ పద్యం చిలకమర్తి స్వంతం కాదని ఓ
రగడ చేశారు. ‘ఛిలకమర్తి 1867 సెప్టెంబర్ 26న రాజమండ్రిలో జన్మించారు

Monday, July 19, 2010

టూ(టీ)త్ పేస్ట్ కబుర్లు




ఉదయాన్నే లేవగానే మనం బ్రష్ చేసుకొంటాము, సారీ, బ్రష్ చేసుకోవటమెందుకు
మనకు మార్కెట్లో ఎన్నో రకాల టూత్ బ్రష్షులు దొరుకుతున్నప్పుడు. ఐనా మనకు
అదేమిటో బ్రష్ చేసుకోవడమనే మాట అలవాటయింది. బ్రష్ ఉంటే చాలదు కదా
తోముకోడానికి పేష్ట్ కావాలి. నాకో సందేహం వస్తుంటుంది. టూత్ పేస్ట్,టూత్ బ్రష్ష్
అని అంటారు. టూత్ అంటే ఒక పన్నని అర్ధంకదా. ఆ ఒక పన్ను తోముకోడానికి
వీటవసరమే ఉండదుకదా. ప్రతి మనిషికి 32 పళ్ళుంటాయి. మరి టీత్ పేస్ట్ అని
ఎందుకనరో ! ఈ దేహానికి ఇలాంటి సందేహాలు వస్తూనే ఉంటాయి. మా చిన్నతనం
లో GIBBS S.R.TOOTH PASTE అని వచ్చేది. ఇప్పటిలా ట్యూబ్లలోనే కాకుండా
గుండ్రని డబ్బాల్లో , ఈ నాటి ఆడవాళ్ళ మేకప్ పౌడర్ కేకుల్లా అన్న మాట. ఓక్కొక్కరికి
ఒకటి చొప్పున వాడల్సి వచ్చేది. రకరకాల బ్రాండుల్లో ఎన్నెన్నో పేస్టులు, పౌడర్లు ఇప్పుడు
వస్తున్నాయి. నీమ్,కాల్గేట్,మెక్లీన్స్,క్లోజప్,పెప్సొడెన్ట్, బినాకా ఇలా ఎన్నేన్నో. మేం ఆ
రోజుల్లో బినాకా టూత్ పేస్టంటె ఇష్టపడటానికి కారణం. పేస్ట్ బాక్సులో ఒక్కోసారి ఒక్కో
జంతువుల బొమ్మల్ని పెట్టెవాళ్ళు. కొంతకాలం TRANSFER PICTURES పెట్టే వారు.
ఆ రోజుల్లో బినాకా అంత ప్రాచూర్యాణ్ణి పొందటానికి కారణం, రేడియో సిలోన్లో ప్రతి భుధ
వారం రాత్రి 8 గంటలకు శ్రీ అమీన్ సయానీ నిర్వహించే హిందీ సినిమాల బినాకా గీత్
మాల. ఆ ప్రోగ్రాం కోసం ఎప్పుడు భుధవారం వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూసే
వారు. ఇక టూత్పేస్టుల ప్రకటనలు తమాషాగా ఉంటున్నాయి. పిల్లవాణ్ణీ డెంటిస్ట్ దగ్గరకు
తీసుకెళ్ళిన తండ్రిని ఏ టూత్ పేస్ట్ వాడుతున్నారు అని అడిగితే "చవకరకం" అని అమా
యకంగా ముఖంపెట్టి జవాబివ్వడం,, అమ్మాయి, అబ్బాయి దగ్గరగా రా,దగ్గరగా రా అని
పాడుతూ పిలిచే క్లోజప్ ప్రకటన ఛూసారుగా. ఇప్పూడు కాల్గేట్ వాళ్ళు ఈటీవీలో పాడుతా
తీయగా ని స్పాన్సార్ చేస్తున్నారు.
చివరిగా మొట్టమొట్టదట టూత్బ్రష్ ని కొన్నదేవరో తెలియదుగాని, కనుక్కోన్నది
మాత్రం 1780 లో వియం ఆడిస్ అనే పెద్దమనిషట. బినాకా టూత్ పేస్ట్ తో నే సేకరించిన
బొమ్మలు చూడండి. ఆ నాటి అమీన్ సయాని బినాకా గీత్ మాలా కాసెట్ HMV వారు
విడుదల చేసారు.
టూత్పేస్టుల్లో ఎర్రవి,నీలంవి, చారలవి, పారదర్శకం వీ ఇలా ఎన్నోరకాలు.ఈప్పుడెమో
పిల్లలకూ ప్రత్యేకంగా వస్తున్నాయి. ఇలా ఎన్నో వ్యాపార చిట్కాలు !!

Sunday, July 18, 2010

అలనాటి టైప్ రైటర్ ఇక అగుపించదా ? !




ఇంతకుముందు మనం ఏ ఆఫీసుకు వెళ్లినా టైపు రైటర్ చేసే టిక్ టిక్ శబ్దాలు
వినిపిస్తుండేవి. ఇక ఆ టైపు నేర్పటానికి ప్రతి వీధికి ఒక ఇన్స్టిట్యూట్ అగుపించేది.
కాల క్రమాన కంప్యూటర్లు ప్రవేశించాక టైపు మిషన్లు అగుపించడం దాదాపు మానే
సాయి.ఇంతకు ముందు టైపు చేయడానికి ఓ టైపిస్టు ఉండేవాడు. ఇప్పుడో ప్రతి బల్ల
మీదా కంప్యూటర్లే ! కావలిసిన మాటర్ని టైపు చేసి సులువుగా సేవ్ చేసుకొనే
సదుపాయం కలిగింది. మరో విషయం టైపు రైటర్ అనగానే సాధారణంగా అమ్మాయిలే
టైపిస్టులుగా ఉండేవారు. మీకు "పెళ్ళినాటి ప్రమాణాలు" సినిమా గుర్తుందా. అందులో
రాజసులోచన టైపిస్టు. ఆ అమ్మాయిని ఇష్టపడే ఇద్దరు ముసలి గుమాస్తాలు అల్లు,
చదలవాడ కుటుంబరావులు చేసే కోతి చేష్టలు భలే నవ్వులు కురిపిస్తాయి.1868లో
క్రిష్టఫర్ లాతమ్ షోల్స్ మొట్టమొదటి టైపు రైటర్ కనుక్కొన్నాడు.తరువాత అతని నుంచి
రెమింగ్టన్ కంపెనీ రైట్స్ సంపాదించి ఉత్పత్తిని ప్రారంభించింది. టైపు రైటర్ని ఉపయోగించిన
ప్రముఖ రచయితలు మార్కట్వైన్,లియో టాల్స్టాయ్.. తమ రచనలకు టైపు రైటర్నే
ఉపయోగించే వారట. కొత్తది రాగానే పాతది కనుమరుగవటం సాధారణమే. కానీ OLD
IS GOLD అని మన పెద్దలమాటను గౌరవిస్తూ మీ దగ్గర ఓ వేళ పాత టైపు మిషన్ ఉంటె
పారేయకండి. పాత తరం గుర్తుగా జాగ్రత్త చేయండి. నా దగ్గర ఆ నాటి పాత టైపు మిషను
ఇంకా వుంది. ఇలా టైపు రైటర్ గురించి మీతో చెప్పటానికి కారణం ఈ మధ్య బొంబాయి
TIMES OF INDIA పత్రికలో DEATH OF THE TYPEWRITER అన్న ఆర్టికల్
చదివి, రాజమండ్రి కి తిరిగి రాగానే నా టైపు రైటర్ని ఆప్యాయంగా మరోసారి తనివి తీరా
చూసుకున్నాను.




!

Friday, July 09, 2010

బాలుతో పాడుతా తీయగా అంటున్న అ(బా)పురూపరమణీయం

నవ్వుల జల్లులు కురిపిస్తున్న ఈ రమణీయుణ్ణి, బాపురే అనిపిస్తూ చిత్రగీతలని గీస్తున్న
యువ జంటని గుర్తుపట్టారా ! ఈ ఇద్దరబ్బాయిలూ అశేషాభిమానుల గుండెల్లో
నిత్యయవ్వనులుగా నిలచిన బాపూరమణీయులు !! ఇప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిలు
మరో బాలు(డు)గారితో ఈటీవీ ’పాడుతా తీయగా’ ప్రేక్షక శ్రోతలకు వీ(క)నులను రమణీ
యం చేయబోతున్నారు. ఇంకేం, ఈ నెల 12వ తేదీ సోమవారం రాత్రి 9-30 గంటలకు
ప్రసారం అవుతున్న బాలు(పూ) రమణీయం అనే "పాడుతా తీయగా" కార్యక్రమాన్ని
తప్పక చూడండి. బాపు చిత్రాల్లోని (అదే నండీ సినిమాల్లోని) క(ర)మణీయ పాటలను
!ఆస్వాదించండి!

Wednesday, July 07, 2010

ముత్యాల ముగ్గులేసిన చిన్నారి పిచుకమ్మ!!


ముత్యాల ముగ్గులేసిన చిన్నారి పిచ్చుకమ్మ!!

ఆంధ్రప్రదేష్ లో చాలా నగరాల్లోని పిల్లలకు పిచ్చుకలంటే ఏమిటో తెలియదు.
అలనాటి డైనొసార్ల లాగ కనుమరుగైఫోయాయి. కాని, ఈ ముంబాయి మహా
నగరంలో మాత్రం ప్రతి రోజూ పిచ్చుకలు ప్రత్యక్షమవుతూ కనువిందుకలిగిస్తు
న్నాయి! బాల్కనీలోకి ఎగురుకుంటూ వచ్చి గెంతులేస్తూ చిరు ఎండ లో
పడిన గ్రిల్ల్ నీడను ముక్కుతో పొడుస్తుంటే తన చిన్నారి ముక్కుతో ముగ్గు
లేస్తున్నట్లు అనిపించింది ! వెంటనే నా కమేరాలో ఆ పిచ్చుకమ్మ కళానైపుణ్యాన్ని
దాచేశా!