Saturday, December 31, 2011

నేనూ-నా కార్టూన్ల పుస్తకం


 నేను కార్టూన్లు గీయటం నా SSLC క్లాసు నుంచే మొదలయినా పత్రికలో
                 మొట్టమొదటిసారి అచ్చయింది ఆంధ్రసచిత్రవార పత్రికలో 1958 లో.అంతకు
                  ముందు పట్టువదలని విక్రమార్కునిలా పంపేవాడినికానీ అంతే వేగంగా
                తిరుగు టపాలో తిరిగి వచ్చేవి. కార్టునిష్టులకు ప్రొత్సాహాన్నిచ్చిన మొదటి
                తెలుగు పత్రిక ఆంధ్రపత్రిక వీక్లీ. ఆ సంస్థ ప్రచురించే భారతి సాహిత్య మాస
                పత్రికలో మొట్టమొదటి తెలుగు కార్టూనిష్టు శ్రీ తలిశెట్టీ రామారావు గారి
                కార్టూన్లు 1931 నుంచే ప్రచురించే వారు . 1954లో ఆంధ్రవారపత్రిక దసరా
                సంచికకోసం పిల్లలకు బొమ్మల పోటీ పెడితే నేనూ, మా చెల్లి (కస్తూరి),
                అప్పుడు దాని వయసు పదేళ్ళు, బొమ్మలు పంపాము. "నేనూ, మాసంగీతం
                మాష్టారు" అన్న అది గీసిన బొమ్మకు ప్రధమ బహుమతి వచ్చింది, నా బొమ్మ
                తిరిగి వచ్చింది. చివరకు 1958 లో " నిశ్శబ్దం" అన్న నా సైలెంట్ కార్టూన్
                అచ్చయి ముచ్చటగా మూడు  రూపాయలు పారితోషికం వచ్చింది.
 అటు తరువాత  ఆంధ్ర వారపత్రికతో బాటు ఆంధ్రప్రభ , స్వాతి,ఆంధ్రజ్యోతి,
                ఆంధ్రభూమి పత్రికలలో నా కార్టూన్లు రావడం మొదలయింది. బాపు రమణ
                గారి రచనలు ఆంధ్రపత్రిక వీక్లీలో ఎక్కువ వచ్చేవి. శ్రీ బాపు అప్పుడప్పుడు
                "రేఖ" అనే పేరుతో కూడా వేసేవారు. ఆపేరుకు నేను "సు" చేర్చి సురేఖ
                కలం పేరుతో వేయడం మొదలెట్టాను. ఆ రోజుల్లో ఇండియన్ ఇంకుతో
                మాత్రమే బొమ్మలు వేయాలని నియమం వుండేది. ఎంతో కష్టపడి బొమ్మ
                వేసి, సన్నని క్రొక్విల్ పాళీ ఇంకులో ముంచి బొమ్మను దిద్దగానే ఇంకు
                ఒక్కసారిగా బొమ్మమీద ముద్దలా పడేది. నిజంగా ఏడుపొచ్చినంత
                పనయేది. నవ్వులు-పువ్వులు అనే హాస్య పత్రికలో నా కార్టూన్లు,
                పజిల్స్ రెగ్యులరుగా అచ్చయేవి. అటుతరువాత  మద్రాసు నుంచి ప్రచురించే
                "కినీమా" అనే సినిమా వార పత్రికలో ప్రతి వారం నేను సినిమా పజిల్
                నిర్వహించే వాడిని.



                2008లో మా ఇద్దరమ్మయిలు, అబ్బాయి నా కార్టూన్లతో ఓ పుస్తకం వేద్దామని
                నన్ను ఒప్పించారు. మా హాసం క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో హాసం పత్రిక
                స్థాపకులు, శాంతా బయో యండీ పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డిగారు నా
                "సురేఖార్టూన్స్" పుస్తకాన్ని అవిష్కరించారు. ఆ పుస్తకానికి ఆభరణం
                శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు వ్రాసిన "జూబిలీబాయ్" జిందాబాద్ అంటూ
                వ్రాసిన ముందు పలుకులు. నా పుస్తకంలో రమణగారి ముందుమాట చదివిన
                మితృలు, ప్రముఖ కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ ఇలా అన్నారు" ముళ్ళపూడి
                వారి చేత ముందు మాట రాయించారు. ఎంత ముచ్చటగా పొందికగా వ్రాశారో.
                కార్టూన్ పుస్తకాలకి ముందుమాట రాయగలిగిన ఏకైక రచయిత ఆయనే.
                ఆ విధంగా మీరు చాలా అదృష్టవంతులు" ఈనాడు కార్టూన్ ఎడిటర్ శ్రీ శ్రీధర్
                గారు నా పుస్తకం ఆసాంతం శ్రర్ధగా చూశారు.మితృలు కార్టూనిస్ట్ సరసిగారు
                నా కార్టూన్ల పుస్తకం అందుకొని తన ఉత్తరంలో ఇలా అన్నారు"....ఈ సంవత్సరం
                నా రెండో పుస్తకం తెచ్చేప్రయత్నంలో ఉన్నాను. దానికి శ్రీ ముళ్లపూడివారి
                చేత ముందు మాట రాయిద్దాం అనుకున్నా, అయితే మీ పుస్తకం గడపకే
                రమణగారి తోరణాలు కట్టేసున్నాయి. ’ఆరిమీ’ అనుకున్నాను" ఇందరు
                ప్రముఖుల ఆదరాభిమానాలు అందుకున్న ఓ సామాన్యునిగా నేను దన్యుణ్ణి.


రాజమండ్రిలోని మా మితృలు డా"జోగేశ్వరరావుగారు వారి అమ్మాయి దగ్గరకు
                అమెరికా వెళుతూ వెంట నా సురేఖార్టూన్స్ పుస్తకాలు తీసుకొని వెళ్ళి అక్కడి
                స్నేహితులకు నా పుస్తకాలు అందజేశారు. ఏవిటీ వీడి సొంత గోల అనుకోకండి.
                నా అనుభూతులను ఆత్మీయులైన మీ అందరితో పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ
                కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పంచుకుంటున్నాను.

Thursday, December 29, 2011

శ్రీరామరాజ్యం చూశారా !

 నిన్న మాటినీకి "శ్రీరామరాజ్యం" చూడటానికి నేనూ,నా శ్రీమతి మా
                     సన్నిహిత మితృలతో వెళ్ళాము. అక్కడ నాకు పరిచయం వున్న
                     ఒక ఆయన సకుటుంబంగా ఎదురుపడ్డాడు. సాధారణంగా సినిమా
                     హాల్లో కనిపించగానే " సినిమాకేనా ?" అనే షరా మామూలు ప్రశ్న
                     కాకుండా   "శ్రీరామరాజ్యం" సినిమాకేనా ?"   అన్నా,ఏమంటే ఆ
                     ధియేటర్ కాంప్లెక్స్లో ఇంకా రెండు మాస్ మసాలా సినిమాలు ఆడు
                     తున్నాయి. ఆయన సమాధానం నాకు ఆశ్చర్యం, మరింత బాధ
                     కలిగించింది. " ఎబ్బే, ఇంకా ఈ పౌరాణికాలేం చూస్తాం. మాకే ఇష్టం
                     లేనప్పుడు ఈ పిల్లలు ( వాళ్ళకు 9,11 ఏళ్ళ వయసుంటుంది )
                     చూస్తారటండీ. అసలే ఇవి కంప్యూటరు రోజులు! స్టంట్లూ,డాన్సులూ
                     అసలు మజా లేక పోతే అస్సలు చూడరు " అన్నాడు. ఇలాటి
                     మహానుభావులున్నప్పుడు పిల్లలకు మన పౌరాణిక కధల గురించి
                     మంచి ప్రవర్తన, కుటుంబ అనుబంధాల గురించి ఎలా తెలుస్తుంది.
                     ఏదైనా పిల్లలు నేర్చుకొనేది అమ్మా నాన్నల నుంచే కదా ?


శ్రీరామరాజ్యం సినిమా చూడకుండానే మరికొందరు " అబ్బే, నయన
                     తార సీతేమిటండీ, అవ్వ !"అనీ "సింహా" లాటి సినిమాల్లో వేసిన బాల
                     కృష్ణ రాముడా ? "అన్న వాళ్ళూ చాలామంది ఉన్నారు. అలా అన్న
                     ఒకాయనే సినిమా చూసివచ్చి "ఏదో అనుకున్నా సుమాండీ ! బాపూ
                     గారు ఆ నయనతారను సీతగా ఎంత చక్కగా చూపించాడో, అయోధ్య
                     ఇలా వుండేదా అన్నట్లు ఆ సెట్టింగులూ కన్నుల పండుగచేశాయి!
                     బాలకృష్ణ కూడా కొన్ని చోట్ల వాళ్ల నాన్న రామారావుని  గుర్తోచ్చాలా
                     చేశాడు సుమా " అని అన్నాడు.


                     ఎందుకోగానీ మన తెలుగు వాళ్ళు కొంతమంది పనిగట్టుకొని బాపూ
                     రమణల ఈ సినిమాపై  మొదటినుంచీ కావాలనే నెగటివె టాక్ ను
                     ప్రచారం చేశారేమోనని అనిపించింది. ఇదే సినిమాను ఏ హిందీ
                     నిర్మాతో తీసివుంటే మన వాళ్ళు " ఆహా ! ఓహో ! " అంటూ పొగిడే
                     వారన్నది నిజం !     వాల్మీకి మహర్షి లవకుశులను రామాయణం
                     నుంచి    ఏమి తెలుసుకున్నారని ప్రశ్నించి వారి చేత రామాయణ
                     కావ్య  అనౌత్యాన్ని చెప్పించిన తీరు ప్రశంశనీయం. శ్రీ ముళ్ళపూడి
                     బాపులకు శ్రీ రాముడన్నా, రామాయణ మన్నా ఎంతో ఇష్టం. కవరు
                     మీద ఎడ్రస్ వ్రాసినా ,   ఓ పుస్తకం మీద సంతకం చేసినా  శ్రీ రామ
                     అని వ్రాయకుండా వుండరు. ఈ చిత్రాన్ని అందించిన శ్రీ యలమంచిలి
                     సాయిబాబా, సంగీత దర్శకుడు ఇలయరాజా, గేయరచయిత జొన్న
                     విత్తుల , కమేరామేన్ రాజు, కళాదర్శకులు ఇతర సాంకేతిక నిపుణులు
                     తెలుగుతెరకు  ఒక కమణీయ క్లాసిక్ ను అందించి   ధన్యులయ్యారు.
                     ఇలాటి చిత్రాలను ఆదరించి ఇలాటి మరిన్ని మంచి చిత్రాలనిర్మాణానికి
                     పొత్సాహాన్ని అందించడం మన తెలుగు వారి ప్రతి ఒక్కరి కర్తవ్యం.

Tuesday, December 27, 2011

ముద్దు-ముచ్చట

 కొన్నిటిని చూడగానే ముద్దొస్తుంటాయి. చిట్టి చిట్టి పాపాయిలే కాదు, బుజ్జి బుజ్జి
            కుక్కపిల్లలు కూడా ముద్దొస్తాయి!. కాకి పిల్ల కాకికి ముద్దంటారు. మా చిన్న
           తనంలో ఇంగ్లీషు సినిమాల్లో తప్పక ముద్దుల దృశ్యాలుండేవి. ఆ సీన్లొచ్చి
           నప్పుడల్లా ముందు క్లాసుల నుంచి ఈలలు గోలలూ ! ఇప్పుడు వాటిల్లో
           కన్నా మన సినిమాల్లోనే ముద్దులు అంతకన్నా ఘోరంగా శృంగార దృశ్యాలు
           ఉంటున్నాయి. ఇదివరలో మన సినిమాల్లో నాయకీనాయకుల మధ్య ముద్దు
           లను చూపాలంటే సింబాలిగ్గా రెండుపూలు గాలికి కదలి రెండూ దగ్గరైనట్లు
           చూపించే వారు. "పెళ్ళికానుక" సినిమాలో హీరో హీరోయిన్ల స్టాండ్ వేసిన
           సైకిల్ హ్యాండిల్స్  కదలి రెండు ముందు చక్రాలు కలసినట్లు చూపించారు.
            కలవరి డి పాటతో పాప్యులరయిన "త్రీ" చిత్రంలో నటిస్తున హీరో ధనుష్
           భార్య ఐశ్వర్య  హీరో హీరోయిన్ శృతిఃహాసన్ల మధ్య ముద్దు ముచ్చట్లను
           స్వయంగా దర్శకత్వం వహించడం ఇప్పుడో పెద్ద వార్త. ఇప్పుడు ముద్దుల పై
          మన ఆంధ్రప్రదేశ్ మంత్రులకు మోజు ఎక్కువయిందనడానికి ఇటీవల ఓ
          సభలో ఇద్దరు మంత్రులు ఒకరినొకరు ముద్దులతో ముంచెత్తుకున్నారని
          పత్రికలలో వార్తలతో బాటూ ఫొటోలూ చూశాం. అదృష్టవశాత్తు వాళ్ళిద్దరు
          మగ మహారాజులే !!.ఈ విషయంపై ఈనాడు శ్రీధర్ ఓ మంచి కార్టూన్ కూడా
          వేశారు.ఓ దివంగత ముఖ్య మంత్రి ప్రజలకు ఫైయింగ్ కిస్సులిచ్చేవాడు!



          1961లో న్ను కొన్న KISS ME , YOU FOOL  అన్న కార్టూన్ పుస్తకం
          నుంచి కొన్ని కార్టూన్లు మీ కోసం. ఈ పుస్తకం అట్ట మీద లిప్స్ బొమ్మ ప్లాస్టిక్
          ప్లేట్ మీద వుండేది. పుస్తకాన్ని కదిపితే ఆ అధరాలు ముద్దుకు రెడీ అన్నట్లు
          కదిలేవి. ఆ పుస్తకాన్ని ఎరువు తీసుకొన్న ఓ పెద్ద మనిషి ఆ లిప్స్ బొమ్మను
          ఊడగొట్టి ఇచ్చాడు. ఇక సినిమా పాటల్లో " అడగక ఇచ్చిన మనసే ముద్దు
          (దాగుడు మూతలు,) "ము ము ము ముద్దంటే చేదా" (అదృష్టవంతులు),
          " ఇవ్వు ఇవ్వు ఒక ముద్దు " (ప్రేమ) ఇలా ముద్దులపై పాటలూ వచ్చాయి.
          ముక్తాయింపుగా ఓ ముద్దు జోకు:
             "చూడండి! ఆ ఎదురింటాయన ఆఫీసుకు వెల్తూ భార్యకు ఓ ముద్దిచ్చి
              వెళ్తాడు.  మీరూ వున్నారు " అంది భార్యామణి రాగాలు పోతూ.
            " నాకభ్యంతరం లెదే ! వాళ్ళాయన చూస్తే బాగుండదేమో" అన్నాడు
              భార్యతో.
               ఈ ముద్దోచ్చే కార్టూన్ బాపు గారికి కృతజ్ఞతలతో.

Monday, December 26, 2011

వడ్దాది పాపయ్య రంగుల చిత్రాల హరివిల్లు

 శ్రీ వడ్డాది పాపయ్య  19వ వర్ధంతి నేడు.

            వపాగా ప్రఖ్యాతి పొందిన శ్రీ వడ్డాది పాపయ్య అలనాటి" బాల" పిల్లల పత్రికలో
            లటుకు చిటుకు శీర్షికకు బొమ్మలు వేశారు చందమామ పత్రికలో 1960నుంచి
             1991 వరకూ దాదాపు 470 పైగా ముఖచిత్రాలను చిత్రించి చందమామకు
           ఆకర్షణగా నిలిచారు. చక్రపాణి గారి సంపాదకత్వాన హైద్రాబాదునుండి వెలువడిన
           "యువ" మాసపత్రికలో ఎన్నో చిత్రాలను ముఖచిత్రాలుగా, లోపలి కవరు పేజీలలో
           చిత్రించారు




Saturday, December 24, 2011

బాపూ రమణీయం !!




ఈ బాపూరమణీయం రెండు దశాబ్దాలక్రితం నవో (వ్వో)దయ వారు , ఏప్రియల్
1990 లో అచ్చోసి అభిమానులపైకి వదిలారు. యాభైలనాటి సినిమా రివ్యూలు
కార్టూన్లు, కార్ట్యూన్లు, జోకులు, మకతికలు, వగైరా కలిపి పాఠకులను రంజింప
చేసింది అపురూప పుస్తకం. దీని ఖరీదు మామూలు ఎడిషన్ అరవై రూపాయలు,
మేలు ప్రతి ధర ( గట్టి అట్టతో బైండింగు చేసినది) ఎనభైఐదు రూపాయలు. ఆ నాటి
శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు వ్రాసిన అద్భుత చనత్కారాల సమీక్షలు,జోకులు,
బాపు గారి కార్ట్యూన్లు,కార్టూన్లు ఎన్నెన్నో!

పుస్తకం వెనుక కవరు పై బాపుగారు, రమణగారు ఇలా వ్రాసారు :
నలభై ఏళ్లనాటి రాతలూ గీతలూ
దులిపి బజార్లో ఆరెయ్యడం
కల్తీలేని అహంకారం
-కొందరు
కాదులే పాపం !-మమకారం
-మరి కొందరు
అలా మాట సవిరించడం
అదోరకం చమత్కారం
-ఇంకొందరు
నిజానికిది ఏకారమో నిర్ణయించే
పాఠకులకి (వాళ్లది
యమ టేస్టు లెండి )
మా నమస్కారం
--బాపు
రమణ
(ప్రమోదూత)



ఇక ఈ బాపురమణీయం పుస్తకం మీద తెలుగు మాస్టారు, అదేనండి
హాస్యనటులు శ్రీ రావి కొండలరావు అవిష్కణ సభలో చేసిన అల్లరి ప్రసంగ
పాఠం సంక్షిప్తంగా మీ కోసం :

సైలెన్స్ ! ఎవడక్కడ నీకు తెలుసా?..బాపూరమణీయము అని పుస్తకం చూశాను.
ఏదో బిల్హణీయము,స్వారోచిషమను సంభవము అన్నట్లుగా,బాపూరమణీయము,
అనగా, ఆ కోవకు చెందిన ప్రబంధమో, గ్రంధమో అనుకున్నాను.తీరా చూస్తే
ఎప్పుడో వచ్చిన సినిమాల మీద సమీక్షలు ఇప్పుడెందుకయ్యా బాబ్జీ !దేనికి?
సైలెన్స్! ఇప్పుడా సమీక్షలు చదివి ఆ సినిమాలు ఎవడు చూస్తాడోయ్! అసలు
చూడ్డానికి అవేవి,ఎక్కడున్నాయి గనక? నిన్న వచ్చిన సినిమాయే నేడుంటం
లేదు-అలాటిది ఎప్పుడో 1950 ఆ ప్రాంతాల వచ్చిన స్నిమాలు ఇప్పుడు ఎక్కడ
వుంటాయి ఆ పాతతరం సినిమా సమీక్షలతో ఓ పెద్ద పుస్తకం! దేనికి? ఏమి
ప్రయోజనం ? ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. అన్ని పేజీలు,అంత పుస్తకం
పైగా 60 రూపాయలా? " మేలు ప్రతి 85, ఫిమేలు ప్రతి 60?"అని, అతనెవరూ,
శ్రీ రమణా- శ్రీ రమణ అని అతని చమత్కారం ఒకటి !సైలెన్స్! తన పేరు ముందు
ఎవడైనా శ్రీ పెడతాడో పెట్టడో అని, ముందే తగిలించేసుకున్నాడు."శ్రీ రమణ"అని.
ఇందులో ఓ కధ. "రామారావు రోడ్డుమీద నడుస్తున్నాడు" రామారావు రోడ్డు
మీద నడవక, నా బుర్ర మీద నడుస్తాడ్రా రాస్కేల్!.... ఈ పుస్తకంలో "కార్ట్యూన్లు"
అని వున్నాయి.అదేమిటా మాట? నాకు తెలీకడుగుతున్నాను.కార్టూను, ట్యూను
కలిపిన మాటా? అలా కలిపితే "కార్టూన్ల్యూను" అవాలి.. మరి కార్ట్యూన్ ఏమిటయ్యా-
ఎవడివా తెలివితేటలు?ఐనా ఇంగ్లీషు అనబడే ఆంగ్ల భాషలో,సంధులెక్కడ
వున్నాయోయ్ ! సైలెన్స్! అరవై రూపాయలు పెట్టిన ఈ పుస్తకంలో అచ్చుతప్పులు
దిద్దేవాడే లేకుండా పోయాడు! అన్నీ అలా వదిలేశారు ! "దాఋణం"."హెచ్చెరుక",
"నెస్ట్ పిశ్చర్", "తప్పులో కాలేయడం,"జానపధ బాటసారి","కధాశివబ్రహ్మం",
"రేలంగిరిజ", "కధోచితంగా," ఇలా అక్షరాల తప్పులు కోకొల్లలు! మరోసారి ప్రిటింగ్ గా
వున్నప్పుడైనా ఇవన్నీ దిద్దుకోమను! అతనెవరు-బాపు, కార్టూన్లు అని వేశాడు.అన్నీ
వంకరటింకర బొమ్మలే, అలాటివి నేను మాత్రం వెయ్యలేనా-ఎవడైనా వేస్తాడు-
నీకు శక్తి వున్నప్పుడు "శ్రీరామ పట్టాభిషేకము","దమయంతీ స్వయంవరము" లాటివి
వెయ్యి.ఇవెందుకూ-ఈగీతలబొమ్మలు !ఓ బొమ్మలో ఆ పిల్లెవరో మేకప్ తుడుచు
కుందిట-ముక్కూ,కళ్ళూ పోయాయట! అదెలాగది? ముఖంమీద రంగు పోతుంది
గాని,అవెలా పోతాయి వోయ్ ! మరో బొమ్మలో భార్య "ఏ సినిమాకెళ్ళారూ" అని
అడిగింది. "బుడ్డిమంతుడు" అన్నాడు.అలాంటి ఎక్కడుందోయ్? "బుద్ధిమంతుడు"
అనుకుంటాను!.......ఇలా సరదాగా చేసిన ఆయన ప్రసంగం విని నవ్వుల్లో మునిగారు
అభిమానులంతా!!




బాపూగారు గీసిన నటి గిరిజ చిత్రం...

Tuesday, November 29, 2011

నాకూ మనసున్నాది ....



"నాకూ మనసున్నాది " అంటూ కవితల పుస్తకం వ్రాసి ప్రశంసలందుకున్న ఈయన పేరు మహమ్మద్
ఖాదర్ ఖాన్. నిజంగా ఈయన మనసున్న మనిషి! రాజమండ్రి, దానవాయిపేట పోస్టాఫీసులో పోస్ట్
మాస్టారుగా పనిచేసి ఆ శాఖలో నాలుగుసార్లు ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెరెన్స్ అవార్డును అందుకున్న
పనిమంతుడు. తెలుగు సాహిత్య ప్రేమికుడైన ఖాన్ తెలుగును మన తెలుగు వాళ్లకంటే అద్భుతంగా
మాట్లాడతాడు. స్నేహానికి ప్రాణమిచ్చే ఖాన్ మెచ్చిన వాఖ్య:" జిస్ పల్ డే మే తులె మొహబ్బత్, ఉస్మే
చాందీ నహీ తోల్ నా"(ప్రేమాభిమానాలు తూచిన త్రాసులో వెండి బంగారాలను తూచవద్దు) ఆయన
తన పుస్తకంలో ఇలా అంటారు." ఈ గ్రంధ విక్రయంలో సింహభాగాన్ని నిజమైన ఆర్ధికావసరం కలిగిన
విద్యావైద్య సహాయార్ధులకు వినియొగించ నిశ్చయించాము.కావున దయతో మీరు కుడా ఈ పుస్తకాన్ని
కొని మీ వంతు సాయంగా సమాజానికి ఉపయోగించండి !!"


ఖాదర్ ఖాన్ ప్రతి ఆదివారం స్థానిక దినపత్రిక "సమాచారం"లో కవితలు వ్రాసేవారు. వాటిలో ముఖ్యంగా
నన్ను శాంతి కపోతాలు, రాక్షసజన్మ ప్రసాదించవూ అన్న కవితలు నన్ను ఆలోచింపజేశాయి. ఈనాటి
మానవులకన్నా ఆనాటి దానవుడు రావణుడే మిన్న అని రాక్షసజన్మ... అన్న కవితలో ఖాన్ చెప్పారు.
ఆయన్ని స్వయంగా కలసి అభినందనలు చెప్పాలి అని అనుకుంటుండగానే ఆయన దగ్గర నుంచి ఓ
ఉత్తరం వచ్చింది." ఈ వయసులో ఎవరికీ ప్రియుణ్ణి కాలేను కాబట్టి మీ "హాసం క్లబ్ " కు ప్రియుణ్ణి
కావాలని వుంది" అన్నది ఆ లేఖాంశం. వెంటనే ఆయన్ని పోస్టాఫీసుకు వెళ్ళి కలవటం, "స్నేహమేరా
జీవితం,స్నేహమేరా శాశ్వతం, అల్లా సాక్షిగా" అన్నట్లు ఆయన మాకు ఆనాటినుంచి మా "అహ"లకు
(అప్పారావు, హనుమంతరావు ,హాసం క్లబ్ ) తోడై మాతో పాలు పంచుకుంటున్నారు.


మా మితృడు హనుమంతరావుతో బాటు నేను, ఖాను కొన్ని స్కిట్స్ తయారుచేసి "హాసం క్లబ్"లో
ప్రదర్శించాము. అందులో "డాక్టర్-పేషెంట్" స్కిట్ హాస్యప్రియుల ప్రశంసలు అందుకొంది. ఆయన
పోస్టాఫీసులొ జరిగిన ఓ సంఘటన చెప్పారు. తిరుపతి వెళ్ళివచ్చిన ఒకాయన లడ్డూ ప్రసాదం స్టాఫ్
అందరికీ పంచుతూ ఈయన దగ్గరకు ఓ పెద్ద లడ్డూ తెచ్చి" మీరు ముస్లింలు, మీకభ్యంతరం లేక పొతే
మీకు ఇవ్వాలనుకుంటున్నాను" అన్నాడట. వెంటనే ఖాన్ " ఆ వెంకన్నబాబు మా ఆడబడుచు
బీబీనాంచారమ్మ కూ భర్తే కదా! అందుకే చూశారా ఆయన నాకు పూర్తి లడ్డు మీ చెత పంపించాడు.
మిగతా మా స్టాఫుకు చిన్న ముక్కలే ఇచ్చాడు"అంటూ కళ్లకద్దుకొని తీసుకున్నారట. చూశారా ఖాన్
మనసు౧ వినాయకుడి పై కార్టూన్లు అలా మరీ విపరీతంగా మీ కార్టూనిస్టులు వేయడం బాగాలేదు అని
ఆయన నొచ్చుకుంటూ నాతో అన్నారు. ఆయన కవితలో కొన్ని మచ్చుతునకలు మీ కోసం ’
1 తెలుగు
మా తెలుగు తీయనిది
మానుండి ఎవరూ విడతీయనిది
తెలుగును వాడుదాం
తెలుగులో ఆడిపాడుదాం
తెలుగును కాపాడుదాం
2 శాంతి కపోతాలు
నీకు శాంతి కపోతాలు బోలెడు
ప్రేమతో ఆనందంగా అందించాలని
చాలా ఆశగా వుంది భాయీ
మసాలా రుచులు మరిగినవాడివి
వండుకొని తినవని
నమ్మకంఏమిటి ? (ఎవరిని ఉద్దేసించి ఈ కవిత వ్రాశారో మీరు గ్రహించే వుంటారు)
గత ఆదివారం 27-11-11న మక్కాయాత్ర పలుమార్లు చేసివచ్చిన మా ఖాన్ బాయికి మితృలు సత్కారం
ఏర్పాటు చేశారు. ఆ రోజు ముంబాయి ప్రయాణంలో వున్న నేను మితృడు ఖాన్ కు ఇలా మీ అందరి ద్వారా
అభినందనలు అంద జేస్తున్నాను.

Monday, November 21, 2011

ఈనా"డే" వరల్డ్ టీవీ డే ! ట !!

టీవీ వె(క)తలు !!

నాడు వారం వారం పత్రికల్లో సీరియల్ కధలు !
ఆరుద్ర గళ్ళనుడికట్లు ,కవుల కవితలు !
నేడు ఏరీ మరోవారం వాటి కోసం ఎదురుచూసే ఆనాటి పఠితలు ?!
గంట గంటకు సీరియస్గా సీరియల్ గా ఏడిపించే
టీవీ వనితలు ఠీవిగా వచ్చేస్తున్నారు పిలవని
పేరంటంగా ఇంటిఇంటికి !
దూరమవుతున్నారు మన వనితలు వంటింటికి !!
అమ్మో !! ఓ రోజు కేబుల్ బందే !
మన జనాలకు తీరని ఇబ్బందే !!

Saturday, November 19, 2011

ఆనాటి "లవకుశ" -ఈనాటి "శ్రీరామరాజ్యం"



1963 మార్చి 29 వతేదీన విడుదలయిన లలితాశివజ్యోతి ఫిల్మ్స్ వారి
" లవకుశ " నిర్మాణానికి నాలుగేళ్ళ పైగా సమయం పట్టింది. ఆర్ధిక
ఇబ్బందులతోబాటు నిర్మాణంలో వుండగా దర్శకులు సి.పుల్లయ్య
దివంగతులుకాగా ఆయన కుమారుడు సి.యస్.రావు పూర్తిచేశారు.
కధా, మాటలు సదాశివబ్రహ్మం వ్రాయగా పాటలను సముద్రాల,సదా
శివబ్రహ్మం, కొసరాజు అందించారు. ఘంటసాల కూర్చిన సంగీతం
అత్యంత ప్రజాదరణ పొందింది. లవకుశ పాత్రధారులు వివిధ సీన్లలో
ఆకారాల్లో వయసు తెచ్చిన మార్పులతో ఒక్కోసారి ముందు సీన్లలో
తరువాత దృశ్యాలలో కనిపించినా పెక్షకులు అవేవీ పట్టించుకోకుండా
చిత్రానికి అఖండ విజయాన్ని చేకూర్చారు. టిక్కెట్టు ధర రూపాయి
పావలా (పై తరగతి) వున్న నాడే "లవకుశ" కోటిరూపాయలు పైగా
వసూలు చేసి చరిత్ర సృష్టించింది పూర్తి గేవాకలర్ లో "లవకుశ "
చిత్రీకరణను కమెరామెన్ పి.యల్.రాయ్ నిర్వహించారు.

ఇప్పుడు 48 ఏళ్ళ తరువాత నిర్మాత శ్రీ యలమంచిలి సాయిబాబా
అదే కధను" శ్రీరామరాజ్యం " పేరిట శ్రీ బాపు దర్శకత్వంలో, శ్రీ ముళ్లపూడి
వెంకట రమణ కధ మాటలతో 22-11-2010 ఉదయం 10 గంటలకు
నాచారమ్ రామకృష్ణా స్టూడియోస్ లో పూజతో ప్రారంభించి ఏడాదిలోగా
చిత్ర నిర్మాణం పూర్తిచేసి విడుదల చేయటం విశేషం. శ్రీ బాపు చిత్రాన్ని
అద్భుత కళాఖండంగా మలచారు. నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ
చిత్రం మరపురాని గుర్తుగా నిలచిపోతుంది.

ఇళయరాజా , జొన్నవిత్తులగీతాలకు కూర్చిన సంగీతం, హంగేరియన్ వాద్య
బృందంతో కూర్చిన నేపధ్యసంగీతం శ్రీరామరాజ్యం కి మరింత విలువను
పెంచింది. సీత పాత్రలో నయనతార నటన నయనానందకరంగా వుంది.
ఆమెకు గాత్రధారణ చేసిన సునీత నయనతార నటనకు నిండుతానాన్ని
ఇచ్చింది. బాలకృష్ణ శ్రీరాముడిగా కొన్ని దృశ్యాలలో శ్రీ రామారావులా
అగుపించారు. అక్కినేని వాల్మీకిగా నటనలోనూ, సంభాషణలు పలికే
తీరులోనూ తనకు తానే సాటి అని మరో సారి నిరూపించు కున్నారు.
రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్టింగులు, సాంకేతికపరంగా వాడిన
గ్రాఫిక్స్ చాలాబాగున్నాయి శ్రీ రామారావు భుజం పై నిజం పుట్టుమచ్చ
వుంటే ఇందులో బాలకృష్ణ భుజంపై పెట్టుమచ్చను వుంచడం ఓ విశేషం!
లవకుశలు చిన్న పాపాయిలుగా వున్నప్పుడు ఊయలగా తీగలతో
ఊయల తయారుచేయించడం, ఆశ్రమ దృశ్యాలు, జలపాతాలు, అందమైన
ముని కుటీరాలు, గ్రాఫిక్ లో చూపించిన లేళ్ళు, నెమళ్ళు ఒకటేమిటి
అన్నీ కమనీయ దృశ్యాలే. వాల్మీకి లవకుశలతో రామాయణం గురించి
ఏమి తెలుసుకున్నారని ప్రశ్నించడం వాళ్ళు రామాయణ పాత్రల గొప్పతనం
చెప్పటం ఈతరం పిల్లలకు రామాయణం గురించి తెలుసుకొనడానికి
మంచి సదావకాశం. తెలుగువారు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఇలాటి
మంచి చిత్రం చూపించాల్సిన అవసరం ఎంతైనావుంది. ఒకటే తీరని లోటు.
రమణగారు ఈచిత్రాన్ని చూసివుంటే ఎంత ఆనందించేవారో అని తలచు
కుంటే ఏదో చెప్పరాని బాధ. ఆయన ఆశీస్సులు ఈ చిత్రానికి, నిర్మించిన
నిర్మాత, సాంకేతకనిపుణలకు, నటీనటులకు సర్వదా తప్పక వుంటాయి.

Friday, November 18, 2011

మిక్కీమౌస్ పుట్టిన రోజు

ఎన్ని కార్టూన్ పాత్రలున్నా మిక్కీమౌస్ ఎన్నో ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల
హృదయాలలో నిలచిపోయింది. "స్టీమ్ బోట్ విల్లీ" పేరున మిక్కీమౌస్ పాత్రతో వాల్ట్ డిస్నీ
నిర్మించిన కార్టూన్ చిత్రం మొదటిసారిగా నవంబర్ 18, 1928 లో విడుదలయింది. ఆనాటి
నుంచి నవంబరు 18వతేదీన అభిమానులు మిక్కీకి పుట్టిన రోజు పండుగ జరుపుకుంటున్నారు.
మొదటిసారిగా వాల్ట్ డిస్నీ సృష్ఠించినపాత్రకు మార్టిమర్ మౌస్ అని పేరు పెట్టాడు.కానీ ఆయన
భార్యకు ఆ పేరు నచ్చలేదు. ఆమే ఈ పాత్రకు మిక్కీ మౌస్ అనే పేరును సూచించింది. మొదటి
సారిగా మిక్కీ పాత్రకు డిస్నీ తన గొంతునే నేపధ్యంగా వాడేడు. మిక్కీ మౌస్ 1932 లో వాల్ట్
డిస్నీకి ఎకాడమీ అవార్డును సంపాదించిపెట్టింది. మిక్కీ రంగుల్లో తెరపైకి ఫిబ్రవరి 23 ,1935 న
అగుపించిన రెండు నెలల తరువాత "మీక్కీస్ కంగారూ" అనే తెలుపు నలుపు చిత్రం ఆలస్యంగా
విడుదల అవటం మరో విశేషం !83 ఏళ్ళ మిక్కీమౌస్ ఇంకా పెద్దలనీ చిన్నారులనీ అలరిస్తూనే వుంది.
మిక్కీ మౌస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేద్దాం.

Tuesday, November 15, 2011

చర్మాన్నీ మార్చేయొచ్చు !!



ఈ నెల నాలుగవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పై శీర్షికతో ఒక వార్త వచ్చింది.
ఇదేదో ఫేస్ క్రీముల ప్రకటనలా వుందే అని అనుకుంటూనే చదివాను. చాలా
సంతోషం కలిగింది. ఆ వార్తలో "ఉత్తర అమెరికాలో స్థిరపడిన ప్రముఖ ప్లాస్టిక్
సర్జన్ డాక్టర్ హనుమదాస్ మారెళ్ల దీనికి రూప కల్పన చేశారు" అని వుంది.
ఈ ఏడాదే డాక్టర్ దాసు పిల్లల కాలిన గాయాల చికిత్స పై వ్రాసిన పుస్తకం
చెన్నైలో అవిష్కరించారు. ఆనాటి సభలో మా దాసుబావ ఫొటో.
ఈ ఫొటోలో ఎడమవైపు కూర్చున్నది దాసు, కుడి ప్రక్కన నేను ! దాసు మా
మేనమామ గారి అబ్బాయి. చిన్ననాటి నుంచి మాకు స్కూలు సెలవలివ్వగానే
గుంటూరు వెళ్ళే వాళ్ళం. మా మావయ్య గుంటూరు దగ్గర తాడికొండ లో
ఐ ఎల్ టీ డీ లో ఉన్నతోద్యోగం చేసే వారు. కంపెనీ పెద్ద బంగళా ఇచ్చారు.
మేమిద్దరం కొబ్బరి చీపురు పుల్లలతో పెద్ద పెద్ద గదుల్లో కత్తి యుద్ధాలు
చేసే వాళ్ళం. అట్టపెట్టెకు భూతద్దం పెట్టి ఎత్తుగావుండే వెంటిలేటర్సు నుంచి
వచ్చే ఎండకు అద్దంపెట్టి మరోవైపు ఫిల్మ్ పెట్టి సినిమా ఆటలు ఆడుకొనే
వాళ్ళం. ఇంకొంచెం పెద్దయ్యాక మాకు సినిమా ప్రొజెక్టర్ కొనుక్కోవాలనే
తీరని కోరిక వుండేది. పత్రికల్లో సినిమా ప్రొజెక్టర్ల ప్రకటనలు చూసి సంబర
పడేవాళ్ళం.ఎలా ఐనా తెప్పించుకోవాలనుకొనే వాళ్లం !!


ఈ ఫొటో గుంటూరు అరండల్పేట లోని మా మావయ్య ఇల్లు "ప్రభాతనిలయం"
లో తీసింది. అప్పుడు దాసు గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు.
మెడికోగా ఆనాటి ఫొటో.ఇప్పుడు ఆ ప్రభాత నిలయం బిల్డింగ్ పెద్ద షాపింగ్
కాంప్లెక్స్ గా మారిందట!

గత జనవరిలో డా"దాసు, తన శ్రీమతి డా"పంకజతో రాజమండ్రి మా ఇంటికి
వచ్చినప్పటి ఫొటో. డా"పంకజ మా దాసుకు గుంటూరు మెడికల్ కాలేజీలో
సహాధ్యాయిని. చిన్ననాటి మా ఆటలు, అల్లర్లు, సినిమా ప్రొజెక్టర్ కోసం మేం
పడిన ఆరాటం తలచుకొని ఆనందించాం. తను చదివిన గుంటూరు నగరంలో
అత్యాధునిక తొలి హ్యూమన్ స్కిన్ మార్పిడి యూనిట్ కు రూపకల్పన చేసిన
మా దాసు బావకు మీ అందరి తరుఫున అభినందనలు తెలియజేస్తున్నాను.

Monday, November 14, 2011

పుస్తకాలే మంచి నేస్తాలు !!

కొన్నివేల సంవత్సరాల పైగా నాలుగు వేదాలు, ఉపనిషత్తులు,అష్టాదశ
పురాణాలు ఈ నాటికీ సజీవంగా ఉన్నాయన్న విషయం అందరికీ
తెలిసిందే. ముద్రణా సౌకర్యాలు లేని ఆ కాలంలో ఒకరి నుంచి మరొకరు
నేర్చుకుంటూ ధారణ శక్తి ద్వారా వీటిని సజీవంగా నిలుపుకుంటూ
వచ్చారు. ఇలా వేదాలు చెప్పేవారిని వేదంవారని, రెండు వేదాలు చెప్పే
వారిని ద్వివేదులవారనీ, మూడు వేదాలపై పట్టుగలవారిని త్రివేదులనీ,
నాలుగు వేదాలు చదివిన వారిని చతుర్వేదులనీ పిలిచేవారు. అలాగే
పురాణాలను ప్రజలకు తెలియజెప్పేవారు పురాణం వారుగా వాడుకలోకి
వచ్చారు. అటుతరువాత వాటిని లిఖితరూపంగా రాళ్లమీద, రాగి రేకుల
పైనా, తాటాకుల మీద, అటు తరువాత కాగితం మీద వ్రాయటం ,ముద్రణా
యంత్రాలు వచ్చాక పుస్తక ప్రచురణ మొదలయింది. ఇప్పుడు డిజిటల్
రూపంలో మన సాహిత్యమంతా నిక్షిప్తమవుతున్నది.
ముద్రణ ప్రారంభమయ్యాక ఎందరో మేధావులు, రచయితలు వెలుగులొకి
వచ్చి పాఠకులకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు. వేలాది
సంవత్సరాలనాటి చరిత్ర, నాగరికత ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి ఈ
గ్రంధ ముద్రణ ఎంతగానో తోడ్పడింది. చరిత్రను ఒకసారి చూస్తే అశోకచక్రవర్తి,
విలియం కేరీ లాంటి మహా వ్యక్తులను మనం తప్పక తలచుకోవాలి. ఆశోకుడు
పాళి లిపిని అభివృద్ధి పరచి బౌద్ధమత ప్రచారం కోసం, అహింసా ధర్మాన్ని
చాటటంకోసం శాసనాలు వ్రాయించి లిపిని ప్రచారంలోకి తెచ్చాడు. బైబిల్
ప్రచారంకోసం తెలుగులో 1746-47లో జర్మనీలో బ్లాక్సు సాయంతో అచ్చు
వేయటం జరిగింది. 1901లో విలియం కెరీ కలకత్తా దగ్గరలోని శ్రీరాంపూర్
లో మిషన్లో కూర్చే అచ్చు అక్షరాలు తయారు చేసి సీసంతో పోత పోయించాడు.
అలా ఆనాడు చేతి కంపోజింగు మొదలయింది. మొట్టమొదట బైబిల్ అచ్చయినా
అటుతరువాత వ్యాకరణం, కధల పుస్తకాలు, వాచకాల ముద్రణ మొదలయింది.
19వ శతాబ్దం నుంచి తెలుగు పుస్తకాల ప్రచురణ ప్రారంభమయింది. వావిళ్ళ,
వెంకట్రామా అండ్ కో, రామా అండ్ కో మొదలయిన సంస్థలు పుస్తక ప్రచురుణ
ద్వారా అపార సేవలు అందించాయి. దాదాపు అదే కాలంలో అద్దేపల్లి వారిచే
రాజమండ్రిలో సరస్వతీ పవర్ ప్రెస్ స్థాపించ బడింది. చాలా కాలం వరకు ఆ
ప్రెస్ లో ఆంధ్రా యూనివర్సిటీ వారి పాఠ్య పుస్తకాలు అచ్చయేవి. విశాలాంధ్ర,
నవయుగ, , నవోదయ, యం.శేషాచలం & కో వారు వారి ప్రచురణలతో పాఠకుల
అభిరుచిని పెంచారు. ఎమెస్కో సంస్థ ఇంటింటా గ్రంధాలయం అనే స్కీమును
ప్రారంభించి , "పుస్తక ప్రపంచం" అనే పత్రికనుకూడా ప్రారంభించింది. ఈ బుక్
క్లబ్ లో చేరి అతి తక్కువ ధరకు పుస్తకాలు పొంది పాఠకులు ఇంటింటా స్వంత
గ్రంధాలయాన్ని ఏర్పరుచుకొన్నారు.

టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాక పాఠకుల్లో పఠనాశక్తి తగ్గింది. కానీ ఈ మధ్య
పుస్తకాలు, పత్రికలపై ఆదరణ పెరుగుతుండటం శుభసూచకం. స్నేహితులకు,
ఆప్తులకు వివిధ సంధర్బాలలో పుస్తకాలనే కానుకగా ఇచ్చే అలవాటును చేసు
కోవాలి. పిల్లలకు మంచి పుస్తకాలు కొని చదివే అలవాటును కలిగించాలి.
ఈ రోజు నుండే గ్రంధాలయ వారోత్సవాలు మొదలవుతున్నాయి. ఈ రోజు ఓ
మంచి పుస్తకం తీసి "కొని" చదువుదాం !!
పుస్తకాల కార్టూన్ మితృలు శ్రీ సరసిగారి ( నవ్య వార పత్రిక) సౌజన్యంతో.
ఈ పుస్తకాలయం నాకున్న అతి ఇష్టమైన విలువైన ఆస్ఠి. ఈ పుస్తకాల
మధ్య గడుపుతుంటే నాకు కాలమే తెలియదు.