Friday, December 31, 2010

01-01-11/ఒకటీ, ఒకటీ,ఒకటొకటే !

అప్పుడే ఏడాది వెళ్ళి కొత్త ఏడాది వచ్చేస్తున్నది. కానీ ఎన్ని ఏడాదులు
మారినా ఏమున్నది గర్వ కారణం ? గతానికి, ఇప్పటికీ ఏం మార్పూ
లేదు ! నాయకులు మనల్ని ఏమార్పు చేశారు. మరికొందరు యువ
నేతలు ఓదార్పులు చేశారు. సగటు మనిషి జీవితం అప్పుడూ ఇప్పుడూ
ఒక్కటే అని చెబుతున్నట్లు లేదూ రేపటితారీఖు !! ఎన్ని కష్టాలు
గత ఏడాది వచ్చినా ఇక ఈ కొత్త సంవత్సరంలో మన జీవితాల్లో మర్పు
వస్తుందనే ఆశతో రేపు ఉదయాన్నే కలుసుకోగానే "హాపీ న్యూ ఇయర్"
అని నవ్వుతూ చెప్పు కుంటాం. రాత్రి మత్తు వదలని మందుబాబులు
తుల్లుతూ ,నవ్వుతూ చెబుతారు. కొత్త కాలం"డర్" రోజులు రాగానే
కొంత మందికి కాలెండర్ పిచ్చి వుంటుంది. అలాటి వాళ్ళని చూసి
వ్యాపారస్తులకు కేలం"డర్" పట్టుకుంటుంది.
అసలు రోమనులు మార్చి ఒకటో తేదినే సంవత్సరపు మొదలుగా
లెక్కించే వారట! కానీ క్రీస్తు పూర్వం 46 సంవత్సరంలో అప్పటి రోమన్
చక్రవర్తి జూలియస్ సీజర్ జనవరి ఒకటో తేదిని నూతన సంవత్సరంగా
పాటించాడు. సీజర్ తన్ ఆస్థాన జ్యోతిష్యుడు సోసీజన్ సహాయంతో
తయారు చేసిన కేలండర్ భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ
చేయడానికి 365 1/4 రోజులు పడుతుంది. ఏడాదికి 365 రోజులైతే,
ఏడాది పన్నెండు నెలలుగా విభజించబడింది. ఏప్రిల్,జూన్, సెప్టెంబర్,
నవంబర్ మాసాలకు 30 రోజులుంటాయి. ఫిబ్రవరిలో 28/29 రోజులు
వుంటాయి. ఇక మిగిలిన మాసాలకు 31 రోజులుంటాయి. ఇక లీపు
సంవత్సరమంటే నాలుగు చేత భాగిస్తే శేషం లేకుండా వుండేది ! లీపు
సంవత్సరంలో ఫిబ్రవరికి 29 రోజులుంటాయి.
నిజానికి మన నూతన సంవత్సరం ఉగాది. కాని మనం ఆంగ్ల
నూతన సంవత్సరాన్ని జరుపుకున్నంత ఉత్సాహంగా తెలుగు
సంత్సరాదిని జరుపుకోము. దానికి కారణం, మనం తెలుగు వాళ్లం
కావడమే. నేనూ తెలుగు వాడినే కాబట్టి మీ అందరికీ మా ఇంటిల్లిపాది
నూతన సంవత్శర శుభాకాంక్షలు ఇప్పుడే అందిస్తున్నాను.
. >>>>>>>>>>>>oOo<<<<<<<<<<<

కేలెండరు కార్టూన్ "కొంటెబొమ్మల బాపు" పుస్తకం సౌజన్యంతో.........

Wednesday, December 29, 2010

రాగ భావాల సరళి పింగళి


పింగళి నాగేంద్రరావుగారి పేరు గుర్తు రాగానే ఆయన విజయ చిత్రాలకు
కూర్చిన అద్భుత సంభాషణలు, గీతాలకు కూర్చిన కమనీయ భావాలు
మదిలో ఒక్కసారిగా మెదులుతాయి. పాతాళభైరవి చిత్రానికి మాంత్రికుడికి
ఆయన వ్రాసిన సంభాషణలు యస్వీ రంగారావుకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు
అందజేశాయి. "సాహసం శాయరా దీంగరి" అని తోటరాముడితో అనడం,అలానే
రాణీగారి తమ్ముడి పాత్ర ధరించిన రేలంగితో ’తప్పు తప్పు’ అన్న ఊతపదం
పలికించడం ఆనాడే కాదు ఈనాడు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఆయన
వాడిన శబ్ద ప్రయోగాలు మరే రచయితకు సాధ్యం కాలేదేమో అనిపిస్తుంది.
ఇక మాయాబజార్ చిత్రంలో ఆయన ప్రయోగించిన ’అలమలం’,’కవచమిది
కవచమిది పరమం పవిత్రం’,’తాతాపాదులవారు’,గోంగూర-శాకంబరీ దేవి
ప్రసాదం’ ఇలా ఒకటేమిటి ఎన్నేన్నో ప్రయోగాలు కోకొల్లలు.
పాటలలో "జగదేకవీరుని కధ" చిత్రంలో
"జలకాలాటలలో-కలకల పాటలలో
ఏమి హాయిలే హలా, అహ-ఏమి హాయిలే హలా"
అన్న పాటలో "హలా" అన్న ప్రయోగాన్ని పింగళి చేశారు. "హలా" అంటే
సంస్కృతంలో చెలీ అని అర్ధమట. ఈ శబ్దాన్ని శాకుంతలం నాటికలో
కాళిదాసు వాడాడట. కీరవాణి రాగంలో స్వరపరచిన ఈ గీతాన్ని,పి.లీల,
సుశీల,సరోజిని, రాజరత్నం చతుర్గళ గీతంగా పాడారు. చతురస్రగతిలో
సాగిన ఈ పాటకు పియానో పై అందించిన రిధమ్ కార్డ్స్ మరింత సొగసును
చేకూర్చాయి..
పింగళి వారు సినిమాలకు ముందు మంచి నాటక రచయిత.
ఆయన కలంనుండి వెలువడిన నాటకాలు, జేబున్నీసా,వింధ్యరాణి, మేవాడ్
రాజ్య పతనం, గమ్మత్తు చావు, పాషాణి, నారాజు,క్షాత్రహిందు,ఒకే కుటుంబం,
కవి సామ్రాట్.. శాయి గారి సంపాదకత్వంలో వెలువడే ఇంటింటి పత్రిక
రచన డిసెంబరు సంచిక పింగళివారి నాటకాలు ప్రత్యేక రచనను
( ఇంద్రగంటి శ్రీకాంతశర్మ) ప్రచురించి తన ప్రత్యేకతను మరోసారి చాటుకొంది.
లాహిరి లాహిరి లాహిరిలో పేరిట రెండు భాగాలుగా పింగళి గీతాలకు
సచిత్ర వ్యాఖ్యానం డా"వి.వి.రామారావు రాయగా క్రియేటివ్ లింక్స్ వారిచే
పుస్తక రూపంలో వెలువడింది.
పింగళి వారి జయంతి ఈ నాడు. ఆయనకు అభిమానులందరి తర్ఫున
అంజలి ఘటిస్తూ...

Tuesday, December 28, 2010

కాళీపట్నం రామారావు రచనలు


కారాగా పేరుగాంచిన శ్రీ కాళీపట్నం రామారావు గారి రచనలు మనసు ఫౌండేషన్
వారు చంద్రగారు గీసిన ముఖచిత్రం తో ప్రచురించారు. ఆయన శ్రికాకుళం లో
కధానిలయం స్థాపించారు. ఈ సంపుటిలో 493 పేజీలొని "కాళీపట్నం రామారావు
నేపధ్యం 2000" ను యధాతధంగా మీ ముందు వుంచుతున్నాను.
<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>
1997 ఫిబ్రవరి 22న కధానిలయం పుట్టింది. అప్పటినుంచి కధానిలయమే
కారామాస్టారూ, కారామాస్టారే కధానిలయం అయింది. ఆయన 75వ యేట
మొదలయిన ఈ పరిశోధనా గ్రంధాలయం ప్రతి యేటా ఫిబ్రవరి రెండవ శని,
ఆది వారాలలో పుట్టినరోజు సమావేశాలు జరుగుతుంటాయి. ఏడాది
పొడవునా దేశవిదేశాలనుంచి సాహిత్యాభిమానులు వస్తుంటారు.స్థానిక
రాజకీయ ప్రముఖులు సందర్శిస్తుంటారు. మీడియావారు కధానిలయం
విశేషాలు జనానికి తెలియబరచడానికి వస్తుంటారు.
ఈ సందర్శకులతో వ్యవహరించటం రామారావు జీవితంలో ఒక
ముఖ్య భాగం. కధానిలయం కోసం పుస్తకాలు, పత్రికలు సేకరించటానికి
రాష్ట్రం నలుమూలలకు తిరగడం మరో ముఖ్యభాగం. సేకరించిన వాటిని
రిజిస్టర్ చేయడమూ, వివరాలను వెతుక్కోటానికి అనువుగా పుస్తకాలలోకి
ఎక్కించటమూ అవసరమైన వారికి సమాచారాన్ని అందించడమూ వంటి
దినవారి కార్యక్రమం మరొక ముఖ్యభాగం.
ఈ పనులన్నింటిలోనూ ట్రస్టు మెంబర్లయిన .బి.వి.ఏ.రామారావునాయుడు
యగళ్ళ రామకృష్ణ, దాసరి రామచంద్రరావు,ఎన్.రమణమూర్తి వంటి వారి
సహకారం లభిస్తుంది. శ్రీకాకుళ సాహితి అన్ని విధాలా అండదండలు
అందిస్తుంది.
ఇన్నేళ్ళ కృషి ఫలితంగా
కధా నిలయానికి 12 లక్షల కార్పస్ ఫండ్ సమకూరింది. 7000 వరకూ
పుస్తకాలు, 15-20 వేల పత్రికలు లభించాయి.తెలుగు అకాడమీతో కలిసి
కధానిలయం "కధాకోశం" అనే కధల సూచిని తీసుకురాగగింది.
అయితే
1990లో మొదలయిన భారతదేశ ఆర్ధిక సంస్కరణలు ఫలితాలు
ప్రపంచీకరణ ప్రభావంగా దేశ ప్రజల దైనందిన జీవితాలలో అనేక మార్పులు
వచ్చాయి. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయంపట్ల నిర్లక్ష్యం, రియల్ ఎస్టేట్
లో ధరలు రెండింతలు మూడింతలు అవటం ,సాంప్రదాయకవృత్తుల నాశనం,
కొత్త వృత్తులు ఏర్పడటం వంటి విషయాల మీద మేధావులు ఆలోచనలు
కేంద్రీకృతమవసాగాయి. వీటన్నింటి ప్రభావం తెలుగు సాహిత్యంలో వస్తురూపంలో
కనబడసాగింది.
ఈ విషయాలమీద యజ్ఞం రాసిన కారా మాస్టారు ఏమనుకుంటున్నారన్న
కుతుహలం మీడియా ఇంటర్యూలలో వ్యక్తమయింది. అటువంటి అనేక ఇంటర్యూలు
వ్యాసాలు ఈ భాగంలో జేరాయి. 1999లో వెలువడిన కాళీపట్నం రామారావు
రచనలలో అలభ్యమైనవి ఈ భాగంలో దొరికిన మేరకు చేర్చడం జరిగింది. అందులో
"అర్ధం కాని మానవ గాధ" ( 1947లో ప్రచురితం) అనే కధ ఒకటి. రచయితగా
సామాజిక సంవేదనాశీలిగా రామారావుగారిని కొంచెం పట్టిచ్చే కధ "అన్నెమ్మ
నాయురాలు" అప్పులతో జరిగే అభివృద్ధి పట్ల రామారావు వైముఖ్యం ఈ కధలో
వ్యక్తమయింది.
వ్యక్తిగత జీవితంలో
భార్య అనారోగ్యం, పెద్దవాళ్ళవుతున్న పిల్లల వాళ్ళ సంతానాల సమస్యలు,
సన్నిహిత మితృలు వల్లంపాటి వెంకట సుబ్బయ్య వంటి వారిని కోల్పోవడం,
పైబడుతున్న ముదిమి వంటి వాటి మధ్య రామారావు మాస్టారు కధానిలయం
అభివృద్ధి కోసం పడుతున్న శ్రమ గమనించిన ఎవరికైనా జీవనోత్సాహం
కలిగిస్తూనే ఉంటుంది. రాచకొండ విశ్వనాధశాస్త్రి సమగ్రరచనల సంపుటం
"రచనాసాగరం" పంపిణీలో ఆయన సాఫల్యం వారి జీవనోత్సాహానికి ఒక
చక్కని ఉదాహరణ. అనేక సంస్ఠలు ఈ మధ్యకాలంలో వారికి సన్మానాలు
చేశాయి.పురస్కారం అందించాయి.లోక్నాయక్ పురస్కారం ప్రముఖమైన వాటిల్లో
ఒకటి.
ఏమైనా-
కధారచయిత రామారావుగారు సాహితీ సృజనకి సమయాన్ని కేటాయించక
పోవటం "సాహిత్యద్రోహం"గా ఆయన రచనాభిమానులు భావిస్తూనేవున్నారు.
కాళీపట్నం రామారావు రచనలు (మనసు ఫౌండేషన్ సౌజన్యంతో)
మనసు ఫౌండేషన్, 2584, second Stage, Kumara Swamy Layout,
BANGALORE- 560 078 -Phone: 09845575455

Monday, December 27, 2010

నర్తన యజ్ఞాలు




హైదరాబాదులో వివిధ వయసులవారు "ధిల్లానా" నాట్యాన్ని ఏకకాలంలో
2800 మంది నృత్య కళాకారులు అభినయించి గిన్నిస్ సంస్థనుంచి
ప్రపంచ రికార్డు ను అందుకొన్నారు. ఈ వార్త చదివిన తరువాత మా
రాజమండ్రిలో గత పాతికేళ్ళనుండి విజయవంతంగా నిర్వహిస్తున్న
డా" సప్పా దుర్గాప్రసాద్ గారి నటరాజ నృత్య నికేతన్ గురించి మీతో
చెప్పాలనిపించింది
కృతయుగంలో ఆరాధన సంస్కృతిలో హిందూ దేవతలు అందరూ
నాత్యకళాకోవిదులు . ఆది దంపతులైన శివపార్వతులు
నాట్యానికి ఆదిస్వరూపులు. వినాయకుడు,కుమారస్వామి, మొదలైన
దైవస్వరూపులతో బాటు యక్ష,గంధర్వ, కిన్నెర, కింపురుష,మునిగణ,
ప్రమదగణాలు, అప్సరలు అందరూ నాట్యమాడినవారే. అలాగే వాల్మీకి
రామాయణంలో శ్రీరాముడు నిర్వహించిన అశ్వమేధయాగంలో లవకుశలూ
రామాయణ గానం చేస్తూ నాట్యమాడినట్లు మనం చదివాము. ఇక
ద్వాపర యుగంలో బాలకృష్ణుడు కాళీయుని పడగలపై నాట్యమాడిన
ఘట్టం మనకు తెలుసుకదా!
1997 సంవత్సరంలో తొలిసారిగా జనవరి12 వతేదీన రాజమండ్రి
టిటిడి కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటలనుండి రాత్రి 12 గంటల
వరకు 108 నృత్య కళాకారులచే "నర్తనయజ్ఞం" శ్రీ సప్పా దుర్గాప్రసాద్
నిర్వహించారు. 2002లో శిల్పారామంలో 118 కళాకారులతో యజ్ఞ
నర్తనాలు,2003 లో మూడవ నృత్య యజ్ఞం తిరిగి రాజమండ్రిలో
నగర ప్రముఖుల పాల్గొన్న కార్యక్రమంలో 136 నృత్యకారులచే
నిర్వహించబడి 2004 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ గా నమోదయింది..
రాజమండ్రిలో శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ కోటిపల్లి బస్ స్టాండ్ వద్ద
నిర్మించిన ఆలయ నృత్య కళావనం వివిధ నృత్య భంగిమల శిల్పాలతో
సందర్శకులను అలరిస్తుంది.

Saturday, December 25, 2010

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి






రాజమండ్రి సమీపంలోనున్న రావులపాలెంకు 26 కిలోమీటర్ల దూరం లో ఈ
క్షేత్రం వుంది. అయినవిల్లి వినాయకుడు విఘ్నాలను తొలగించే స్వామిగా
ప్రసిద్ధి చెందాడు. ఏ శుభకార్యం మొదలు పెట్టినా ఈ స్వామిని పూజిస్తే ఆ
కార్యం జయప్రదం అవుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. గౌతమీ,వృద్ధ
గౌతమీ గోదావరీ ప్రాంతంలో చల్లని కొబ్బరి తోటలమధ్య ఈ ఆలయం
నిర్మించబడింది. విశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో ఈ దేవాళయంలో
క్షేత్రస్వామి శ్రీ విఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై దర్శనమిస్తాడు
సాధారణంగా ఆలయాలు తూర్పుముఖంగా వుంటాయి. కానీ ఇక్కడి స్వామి
దక్షిణముఖంగా వుంటాడు. ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారాలున్న గృహాలకు
ఎటువంటి విఘ్నాలు వుండవని నమ్మకం. రెండు గోపురాలు,సింహద్వారాలతో
అలరారే ఈ దేవాళయం దక్షిణ సింహద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవచ్చును.
ఈ దేవాళయం ప్రాంగణంలోనే అన్నపూర్ణాదేవి శ్రీ విఘ్నేశ్వరాలయం ప్రక్కనే
ప్రతిష్టించబడింది. క్షేత్రపాలకుడైన శ్రీకాల భైరవశ్వామిని కూడా ప్రతిష్టించారు. ఈ
క్షేత్రంలో స్వామి స్వయంభూ అవటము వలన నిత్యం శక్తి ప్రస్ఫుటమవుతుంది.
ఈ దేవాళయాన్ని దర్శించాలంటే రాజమండ్రి నుండి రావులపాలెం మీదుగా
అయినవిల్లి వెళ్ళాలి. రాజమండ్రి నుంచి రూటు, రావులపాలెం-బోడిపాలెం
వంతెన-వానపల్లి-అయినవల్లి.......60 కిలోమీటరులు. ప్రతీ విద్యార్ధి పరీక్షలలో
మంచి ఫలితాలు సాధించాలనే సంకల్పంతో వినూత్న పద్ధతిలో లక్షపెన్నులతో
స్వామివారికి అభిషేకం జరిపించి పెన్నులను ఉచితంగా విద్యార్ధులకు అంద
జేస్తుంటారు ! ఈ వెబ్ సైటు ద్వారా మరిన్ని ఆలయ వివరాలు తెలుసుకోండి.
visit:www.ainavillivighneswara.com.
బొంబాయినుంచి మా అబ్బాయి, కోడలు, మా రెండో అమ్మాయి నాలుగు
రోజుల క్రితం వచ్చినప్పుడు మరొసారి విఘ్నేశ్వరస్వామిని దర్శించుకున్నాం.

Wednesday, December 22, 2010

గణితంతో తధిగణితో !!



చిన్న వయసులోనే గణితంలో కీర్తి ప్రతిష్టలను పొందిన గొప్ప వ్యక్తి
శ్రీనివాస రామానుజం పుట్టిన రోజు డిసెంబరు 22, 1887. ఆయన
తమిళనాడులోని "ఈరోడ్" లో జన్మించారు. ఆయన తండ్రి ఓ వస్త్ర
దుకాణం ( కుంభకోణం) లో గుమాస్తా పని చేసి కుటుంబాన్ని
పోషించారు. పేద కుటుంబం లో పుట్టినా గణిత శాస్త్రంలో ఎన్నో
పరిశోధనలు చేసిన ఆయన ప్రతిభను చూసి విదేశీయులు సైతం
ఆశ్చర్యపోయారు !1914లో లండన్లోని జి.హెచ్.హార్టీ ఆహ్వానం
మీద అక్కడికి వెళ్ళి, కొత్త సిద్ధాంతాలపై పరిశోధనలు చేసి కేంబ్రిడ్జ్
విశ్వ విద్యాలయం నుంచి బి.ఏ. గౌరవ పట్టాను తీసుకున్నారు.
విశ్రాంతి లేకుండా చేసిన పరిశోధనల వల్ల ఆరోగ్యం దెబ్బతిని
క్షయ వ్యాధితో 1920 లో స్వర్గస్తుడయ్యారు.ఆయన జయంతి రోజున
శ్రీనివాస రామానుజం కు నివాళులు .

)<<<<<<<<<<<<<,oOo>>>>>>>>>>>>(

సాధారణంగా లెఖ్కలంటే చాలమందికి భయం. నిజానికి
మనం పరీక్షలలో వ్రాసే సరైనజవాబులకు నూటికి నూరు మార్కులు
వచ్చేది లెక్కల్లోనే! మాధ్స్ కూడా సరదాగా, ఇంత సులువా అనేట్లు
మా రాజమండ్రి లోని వ్యాపారవేక్త శ్రీ గమిని రంగయ్యగారు కృషి
చేస్తున్నారు. ఆయన GAMINI TOYDOM అనే పేరుతో వ్యాపారం
నిర్వహిస్తున్నారు. Mcom., పట్టభద్రుడయిన శ్రీ రంగయ్యకు లెఖ్ఖలంటే
అభిమానం. ఒక వైపు వ్యాపారన్ని కొన సాగిస్తూనే Gem Techniques
పేరిట freelance mathematician గా పనిచేస్తూ రాష్ట్రంలోని వివిధ
పాఠశాలలోనే కాకుండా , ఇతర రాష్ట్రాలలో కూడా స్కూలు విద్యార్ధులకు
లెఖ్ఖలలో సులువు పద్ధతులు వాళ్ళు సులువుగా అర్ధం చేసుకోవడానికే
కాకుండా, గుర్తు పెట్టుకొనేటట్లు విపులంగా చెబుతూ ప్రదర్శనలు ఇస్తున్నారు.
విద్యార్ధులకు ఆయన చెప్పే సులువైన పద్ధతులకు ఓ ఉదాహరణ:-....

TRIPLE AGE MULTIPLICATION
మీ స్నేహితుల వయసు ఎవరిదైనా 3367 చేత గుణించి వచ్చిన
సంఖ్యను తిరిగి 3 చేత గుణిస్తే వాళ్ళ వయసు మూడు సారులు
తిరిగి వస్తుంది ! ప్రయత్నించి చూడండి.

<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>

3367 3367 3367
X6 X16 X66
_____ _____ _____
20202 53872 22222
X3 X3 X3
______ _____ ______
060606 161616 666666
_______ ______ _______

శ్రీ గమిని రంగయ్య SPARKLE OF WONDER MATHS పేరుతో
ఓ పుస్తకాన్ని ఇలాటి గమ్మత్తు లెఖ్ఖలతో ప్రచురించారు. శ్రీ రామానుజం
జయంతిని సంధర్భంగా శ్రి గమిని రంగయ్యగారికి శుభాభినందనలు.



Monday, December 20, 2010

సలహాల్రావ్ సమాధానాలు !!

ఒకటో ప్రశ్న : పేనుపాలెం నుంచిశ్రీమతి మాతాశ్రీగారు తమ కుమారీశ్రీకి తలలో పేలు
విపరీతంగా చేరాయని,ఎన్నోరకాల షాంపూలు, మందుల హేరాయిల్లు
వాడినా పోవటంలేదనీ, మంచి సలహా చెప్పమని అడుగుతున్నారు.
సలహాల్రావ్ : మాతశ్రీ గారు వాడల్సిన అసలైన మందు నే చెబ్తా! మీరు వెంటనే
బ్రాందీగానీ,విస్కీగానీ తీసుకొని, తీసుకొని అంటే లోపలికి కాదు, దోసిట్లో
తీసుకునన్న మాట, కుమారీశ్రీ తలకు బాగా పట్టించండి. తరువాత
గండ్ర ఇసుక ఆ జుట్టులో బాగా చల్లండి. ఇప్పుడు మీరు తలకు రాసిన
బ్రాందీ ఆ పేలు బాగా త్రాగేసి మత్తు తలకెక్కి, కిక్కెక్కి అక్కడి ఇసుక
రేణువులు తీసి ఒకదానితో ఒకటి తగువులాడుకుంటూ కొట్టుకుంటూ
చచ్చినట్లు చస్తాయి. ఇంకేం ఇప్పుడే మందుల షాపుకు ( మీ వీధి చివరే
మీ కుటుంబ సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు) పరిగెట్టండి.
రెండోప్రశ్న : పొదుపులూరి నుంచి పి.సి.నారయ్యగారు, వారు అమెరికా వెళ్ళిరావాలని
అనుకుంటున్నారట. బోల్డు డబ్బు ఖర్చవుతుందని బెంగగా వుందట.
ఖర్చు ఎంతవుతుందో చెబితే ఆలోచిస్తారట.!
సలహాల్రావ్: పి.సి.నారయ్యగారూ బెంగ పడకండి. ఒక్క పైసాఖర్చుకాదు. నిజమండీ,
వేళ్ళి రావాలని అనుకోడానికేం ఖర్చు కాదండి. బెంగపడకుండా అను
కుంటూనే వుండండి.
మూడోప్రశ్న: కోదాడనుంచి కొత్త కోడలు కోమలిగారు తను అత్తవారింట్లో పాలు ఎంత
జాగ్రత్తగా కాచినా పాలు విరిగి పోతున్నాయట. పాలు విరిగినప్పుడల్లా
అత్తగారు నోరు మూత పడకుండా తిడుతున్నారని, అత్తగారి నోరు
విప్పకుండా, పాలు విరగ కుండా వుండే మార్గం చెప్పండని అడుగుతున్నారు.
సలహాల్రావ్ : కోమలిగారూ, ఇలా చూడండి ! ఈ సారి పాలు కాచేటప్పుడు అందులో రెండు
టీ స్పూన్ల ఫ్లెవికాల్ కలపుతుండండి. పాలు విరగవు. ఓ వేళ సరదాపడి
విరిగినా అందులో మీరు కలిపిన ఫ్లెవికాల్ వల్ల వెంటనే అతుక్కుపోతాయి.
తరవాత ఓ గ్లాసు పాలను మీ అత్తగారికి ప్రేమతో ఇచ్చారంటే ఆ పాలు
త్రాగిన అత్తగారు ఇక నోరు తెరిస్తే ఒట్టు!
నాల్గోప్రశ్న: పెన్నులూరినుంచి నవలల దస్తూరీబాయిగారు, తను ఎన్ని కధలు,నవలలు
వ్రాసి పత్రికలకు పంపినా ఒక్కటీ అచ్చవటం లేదట. ఇంత కాలం మామూలుగా
కుడిచేత్తో వ్రాస్తున్నానని, ఇకనుండి ఎడమ చేత్తో వ్రాస్తే పడే అవకాశం వుందా
అని, పంపిన కధలు తిరిగి రాకుండా వుండే ఉపాయం కూడా చెప్పమంటున్నారు.
సలహల్రావ్ : అమ్మా, దస్తూరీబాయి గారూ, మీరు కుడిచేత్తో వ్రాసినా, ఎడమచెత్తో వ్రాసినా
ఫలితం వుండదండి. మీరో మాంచి బాల్పాయింట్ పెన్నో, సిరా పెన్నో కొనుక్కొని
దానితో వ్రాయండి! మీ రచనలు తిరిగి రాకుండా వుండాలంటే స్టాంపులతో
కవరును జత చేయకండి. మీ కధ చస్తే తిరిగిరాదు.గ్యారంటీ !!
ఐదోప్రశ్న: ఆరోగ్యవరం నుంచి కత్తుల కోతలరావుగారు ఇలా వ్రాస్తున్నారు.
ఆయన ఇప్పటివరకూ 116 పైగా ఆపరేషన్లు చేయించుకొన్నారట! ఆయనకు ఇలా ఎక్కువ ఆపరేషన్లు చేయించుకొని ఆపరేషన్ టేబుల్ మీదే కాకుండా గిన్నేస్ బుక్కులో కూడా ఎక్కాలని వుందట. కానీ ఆపరేషన్లు చేసే ఆయన డాక్టర్లు ప్రతిసారి కోసి కుట్టడానికి విసుగు పుడుతుంది బాబోయ్ అంటున్నారట. సలహా చెప్పమని వ్రాస్తున్నారు.
సలహాల్రావ్ : ఈ సారి ఆపరేషను చేసినప్పుడు సర్జన్ గారిని ఓ మాంచి ఇంపోర్టెడ్ జిప్ కుట్టేయమనండి! మీ పొట్టను ఓపెన్ చేయడం, మూసేయడం చాలా సులువవుతుంది. డాక్టరు ఒప్పుకోక పోతే మీ పాంట్లు కుట్టే టైలర్ చేత జిప్పు కుట్టించుకోండి!!
ఆరో ప్రశ్న: వార్తలు తెలుసుకోవడానికి న్యూస్ పేపరు బెస్టా, టీవీ బెస్టా చెప్పమని డిష్ బాదు నుండి టీవీ.రావుగారు అడుగుతున్నారండీ.
సలహాల్రావ్ : టీవీ.రావుగారూ, టీవీ కన్నా పేపరే నయమండి. కరెంట్ పోతే టివీ వార్తలు చూడలేము.అదే ఏ ఈనాడు పేపరో ఐతే కరెంట్ పోగానే హాయిగా దాన్తో విసురుకోవచ్చు.!!
ఏడో ప్రశ్న : తోటల పుష్పగారు తనకు పూలమొక్కలంటే అమిత ప్రేమనీ, కానీ కుండీలలోని
మొక్కల ఆకులకు పురుగులు చేరి మొగ్గలు రాలి పోతున్నాయని, ఎన్ని రకాల
పురుగుల మందులు వాడినా అవి మరింత ఎక్కువవుతున్నాయని ఏడుస్తూ
వ్రాస్తున్నారండీ.
సలహల్రావ్ : చూశారా గమ్మత్తు! ఇది నే జవాబివ్వబోయే ఏడో ప్రశ్న, మొక్కలపై ప్రేమున్న
మీకు ఏడుపు రావడం సహజమే! పురుగుమందులు వాడితే పురుగులెలాచస్తాయండి? బాతురూములు కడిగే ఆసిడ్ రెండు మగ్గుల్లో తీసుకొని ఓ బకెట్ నీళ్లల్లో కలపండి. మిట్టమధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు పూలకుండీలలో పోయండి..దెబ్బకు ఆకులు మలమలా మాడి రాలిపోతాయి. పురుగులకు తినడానికి ఆకుల తిండి లేక ఆకలితో దెబ్బకి చస్తాయి.
ఎనిమిదోప్రశ్న :కేశవరం నుండి శ్రీమతి కేశవర్ధిని గారు ఎంత మంచి నూనెలు వాడినా తలదువ్వు
కొన్నప్పుడల్లా జుట్టు విపరీతంగా రాలి పోతున్నదని, రాలిపోకుండా సలహా చెప్ప
మంటున్నారు.
సలహల్రావ్ : ఇదో రాలిపోయే కేసన్నమాట! కేశవర్ధినిగారూ, మీరు తల దువ్వుకొనేటప్పుడు ఓ
అట్టపెట్టె తీసుకొని అందులో రాలిన మీ జుట్టును వేసుకుంటే మీ రాలిన జుట్టు ఎక్కడికీ
పోదు.
(మా "హాసం క్లబ్" కార్యక్రమంలో నేనూ, మితృడు దినవహి హనుమంతరావు ప్రదర్శించిన స్కిట్)

Sunday, December 19, 2010

టామ్ సాయర్ ప్రపంచయాత్ర ( టామ్ సాయర్ ఎబ్రాడ్ )


శ్రీ నండూరి రామమోహనరావు గారి ఆంగ్లనవలానువాదం గురించి నిన్న
నేను చెప్పిన విషయాలకు మన బ్లాగరు మితృలనుంచి మంచి స్పందన
వచ్చింది. సుజాతగారు టామ్ సాయర్ ప్రపంచయాత్ర గురించి గుర్తు చేశారు.
హాసం ప్రచురణలు ప్రచురించిన ఆ పుస్తకంలో శ్రీ నండూరి రామమోహనరావు
ముందు మాటగా చెప్పిన ""రచయిత మాట" మీ కోసం .
<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఒకప్పుడు మనతో బాగా సన్నిహితంగా వుండి, తర్వాత ఏళ్ళతరబడి కనబడకుండా
పోయిన చిన్ననాటి స్నేహితుడు హఠాత్తుగా ఏ రోడ్డుమీదో ఎదురుపడితే ఎలా వుంటుంది?
సరిగా అలాగే అయింది నా పరిస్ఠితి. చాలాకాలంగా నేను రాశాననే జ్ఞాపకం కూడా
మిగలకుండా పోయిన "టామ్సాయర్ ప్రపంచయాత్ర" అనువాద నవలను సీరియల్ గా
ప్రచురించిన ఆంధ్రవార పత్రిక కటింగ్స్ ను తాను ఒక చోట సంపాదించానని మిత్రులు
శ్రీ ఎమ్భియస్ ప్రసాద్ కొన్నాళ్ల క్రిందట చెప్పగానే వృద్దాప్యం వల్ల ఓపిక లేక ఎగిరి
గంతు వెయ్యలేదు గాని, మానసికంగా అంత పనీ చేశాను.
ఏనాటి మాట ? "టామ్ సాయర్ ప్రపంచయాత్ర" సీరియల్ ప్రచురణ 1955లో
జరిగిందని ప్రసాద్ గారు చెప్పారు. మొత్తంపై ఒక" లాంగ్ లాస్ట్ ఫ్రెండ్" మళ్ళీ
కనిపించినట్టయింది. ఆ రోజుల్లోనే ఒక సారి పుస్తకరూపంలో వచ్చింది కూడా.
నెమ్మదినెమ్మదిగా అదీ అంతర్ధానమై పోయింది. కొంతకాలం దానికోసం వెంపర్లాడాను,
కాని ఫలితం లేక వూరుకున్నాను. ఇన్నాళ్ల తరవాత ప్రసాద్ గారికి అది దొరకడం
దాన్ని తమ "హాసం" ప్రచురణలలో ఒకటిగా ప్రచురించడానికి ఆయన నిశ్చయించడం
ఎంతో సంతోషంగా వుంది.. ఇందుకు ఆయనకీ, ప్రచురణకర్త శ్రీ వరప్రసాదరెడ్డి గారికీ
నా ధన్యవాదాలు.
మార్క ట్వేన్ నవలల నా అనువాదాలు గడచిన 50-60 ఏళ్ళలో ఏడెనిమిది
సార్లయినా పునర్ముద్రణ జరిగి వుంటాయి. నన్ను ఇప్పటికీ కొందరు వృద్ధులు
( ప్రముఖులు కూడా ) టామ్సాయర్,హకల్బేరీఫిన్,రాజూ పేదా నవలల అనువాదకుడిగానే
ప్రశంసా పూర్వకంగా గుర్తు పెట్టుకోవడం, ఇతరులతో చెప్పడం తరచుగా జరుగుతూ
వుంటుంది. అదికూడా ఈ "టామ్ సాయర్ ప్రపంచయాత్ర" పునర్ముద్రణ పట్ల నేను
ఉత్సుకత చూపించడానికి ఒక కారణం.ఏమైనా చాలాకాలంగా అలభ్యమై, ఇప్పుడు
పునర్ముద్రణ పొందుతున్న ఈ పుస్తకం పూర్వపు నా మార్కట్వైన్ ఇతర అనువాదాల
లాగానే పాఠకాదరణ పొందగలదని ఆశిస్తున్నాను.
విజయవాడ
ఫిబ్రవరి, 2006 నండూరి రామమోహనరావు

Saturday, December 18, 2010

రచయిత జర్నలిస్ట్ శ్రీ నండూరి రామమోహనరావు




1950-60 శకాలలో ఆంధ్రవారపత్రిక పాఠకులకు శ్రీ నండూరి రామమోహనరావు
పేరు తెలియని వారుండరు. ఆ రోజుల్లో శ్రీ నండూరి ఆంధ్రవారపత్రికలో పిల్లల
కోసం రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ " కాంచనద్వీపం" (TREASURE ISLAND)
మార్క్ ట్వేన్ "టామ్ సాయర్", హకల్ బెరీ ఫిన్", "రాజూ పేద " ,"విచిత్రవ్యక్తి "
(The Myysterious Stranger) అనువదించారు. తెలుగు మీడియంలో
చదువుకొన్న మేము అలా ప్రశిద్ధ ఆంగ్ల నవలలను తెలుగులో చదివే అవకాశం .
కలిగింది. ఆయన అనువాదం కూడా మరో భాష నుంచి తెనిగించినట్లు కాకుండా
తెలుగులో స్వయంగా వ్రాసిన రచనలానే వుండేది. ఆయన విశ్వాత్ముల
నరసింహమూర్తి గారు చిత్రించిన పంచతంత్రం బొమ్మల కధలకు, అటు
తరువాత బాపు గారు వేసిన "అసంప్రేక్ష్యకారిత్యం" బొమ్మల కధలకు
గేయ రచన చేశారు. దురదృష్టవశాత్తు నా దగ్గర అప్పటి ఫంచతంత్రం
బొమ్మల కధల పుస్తకం ( ఆంధ్రగ్రంధమాల ప్రచురణ) ఎవరో సంగ్రహించారు.
ఐనా మిత్రలాభం లో లేడి వేటగాడి వలలో చిక్కినప్పుడు మితృడు వాయసం
పాత్రకు " మేతకోసమై వలలో పడెనే పాపం పసివాడు" అంటూ శ్రీ నండూరి
వ్రాసిన గేయం ఇంకా నాకు గుర్తుంది..శ్రీ నండూరి ఖగోళ భౌతిక శాస్త్ర రచన
"విశ్వరూపం", మానవ పరిణామ శస్త్రగ్రంధం "నరావతారం" రచించారు.
ఆంధ్రజ్యొతి దిన పత్రికకు వ్రాసిన సంపాదకీయాలు సంకలన రూపంగా
వెలువడ్డాయి. శ్రీ నండూరి రామమోహనరావుగారు కృష్ణా జిల్లా ఆరుగొలనులో
1927, ఏప్రియలు 24 న జన్మించారు. నూజివీడు, మచిలీపట్నాలలో హైస్కూల్
చదువు, రాజమండ్రిలో కాలేజీ చదువు పూర్తి చేశారు. 1948 జనవరి నుండి
1960 జూన్ వరకు ఆంధ్రవారపత్రిక అటుతరువాత ఆంధ్రజ్యోతి పత్రికలలో
పనిచేశారు. అమెరికా, రష్యాలలో పర్యటించారు. శ్రీ రామమోహనరావు గారి
సోదరి శ్రీదేవిగారిని శ్రీ ముళ్లపూడి వివాహమాడారు. శ్రీ రామమోహనరావు గారికి
మీ అందరి తరఫున నమస్సుమాంజలి !

Friday, December 17, 2010

పుట్టినరోజు


"మీ పుట్టిన రోజు ఎప్పుడండీ?" అని అడిగితే " ప్రతి ఏడాదీ !" అన్నాడట ఓ చమత్కారరావు.
నిన్న ( 15-12-10) మన బాపుగారి పుట్టిన రోజునే మన బ్లాగరు ఫణిబాబుగారి పుట్టిన రోజు
కూడా ! నా పుట్టిన రోజు ముళ్లపూడి వారి పుట్టిన రోజుకు ఒక నెల ముందు , 10 సంవత్సరాల
వెనుక! అంటే ఆయన పుట్టింది 28-జూన్1931, నేను పుట్టింది 28-మే,1941 !. ప్చ్! అలా
మిస్సయ్యాను. ఐతేనేం విశ్వనట చక్రవర్తి , తెలుగువారు అనే వారు వున్నారనిదేశానికి చాటి చెప్పిన
మన నందమూరి తారక రామారావుగారి పుట్టిన రోజూ , నా పుట్టిన రోజూ తేదీ, నెల ఒకటే
అయినందుకు అదో తుత్తి ! ప్రఖ్యాత హాస్య నాటక రచయిత (ఆయన రచించిన కీర్తిశేషులు
నాటకం తోనే రావు గోపాలరావు మురారి పాత్రలో ప్రశిద్ధి పొందారు)భమిడిపాటి రాధాకృష్ణ తెలుగులో
మనపూర్తిపేరు వ్రాసిస్తే మన పుట్టిన తేదీ చెప్పేవారు. అలా ఒక సారి NTR కూడా తన పూర్తి పేరు
( నందమూరి తారక రామారావు ) అని వ్రాసిస్తే అసలైనజన్మతేదీ రాలేదట! మీరు ఈ
విషయంలో తప్పారు కదా అని ఎన్టీయార్ అంటే నా లెఖ్ఖ సరైనదే, మీ పేరే ఎక్కడో తప్పు.
మీరు పుట్టిన ఊర్లో కనుక్కోండి అన్నారు రాధాకృష్ణ. ఎంత మొండి వాడైనా, NTR ఆయన
పుట్టిన ఊర్లో రికార్డులు పరిశీలిస్తే ఆయన పేరు నందమూరి తారక రామారావు చౌదరి అని
రికార్డయి వుందట. ఆ పూర్తి పేరుతో చూస్తే అయన పుట్టిన తేదీ , నెల, సంవత్సరము సరిగా
వచ్చిందట. శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ తెలుగు అక్షరాలన్నిటికి వత్తులతో సహా వేరువేరు
సంఖ్యలను ఇస్తూ కొన్ని లక్షల సంఖ్యలను కూర్చారు. ఉదాహరణకు "శాస్త్రి" అన్న పేరుకు
"శ" కు ఒక సంఖ్య దీర్ఘానికి ఒక సంఖ్య "స", "సి", ర,తవత్తుకు, ఇలా వేరు వేరు సంఖ్యలను
వ్రాసుకున్నారన్నమాట. ఆయన 5000 సంవత్సరాల "భమిడిపాటి కాలెండర్" అన్న
పుస్తకాన్ని వ్రాశారు. శ్రీ భమిడిపాటి ఎన్నో తెలుగు చిత్రాలకు కధ, సంభాషణలను వ్రాసారు.
కొంతకాలం ఆయన రాజమండ్రి S.R.City High Scool ల్లో మాస్టారుగా పనిచేసినప్పుడు
నేను ఆయన స్టూడెంట్ గా చదువుకొనే అదృష్టం కలిగింది. ఈ కధంతా పుట్టినరోజుల కధా
కమామిషుల గురించి చెప్పడంతో జ్ఞాపకం వచ్చింది.
ఇక్కడి ఫొటొ శ్రీ భమిడిపాటి ఫణిబాబు , శ్రీమతి లక్ష్మి గార్లు బాపు గారిని చెన్నైలొ
కలిసి నప్పటిది.ఫణిబాబుగారికి మన బ్లాగందరి తరఫున మరో సారి జన్మదిన శుభాకాంక్షలు!
పుట్టిన రోజులపై ఆరుద్ర తమ ఇంటింటి పజ్యాల్లో ఏమన్నారో ఓ సారి చిత్తగించండి.
<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>
ఇంగ్లండును పరిపాలించే రాణులూ రాజులు
ఎంచక్కా జరుపుకోంటారు ఏడాదికి రెండు పుట్టింరోజులు
ఒకటి నిజంగానే పుట్టిన్రోజు
ఇంకోటి లాంచనాలు పాటించటానికి పెట్టిన రివాజు
నాకూ ఉన్నాయి అలాగే రెండు జనమదినాలు
నేనూ చేసుకొందామనుకుంటాను ఉత్సవాలు
ఒకటి ఇంగ్లీషు తారీఖువారిది
ఇంకోటి తెలుగు పంచాంగం వారిది
అవి జ్ఞాపకం వస్తాయి శ్రీమతి, నా పూబోటికి
అవి జరిగిపోయిన మూడోనాటికి
<><><><><><><><><><><><><><><><><>

Thursday, December 16, 2010

నా " గందరగోళం" సీరియల్ నవల


ఆమావాస్యరాత్రి! రాత్రి పన్నెండయింది. కుమారి తన భర్త కోసం ఆతృతతో బాల్కనీలో
నిలబడిఎదురుచూస్తున్నది. వెన్నెల నీడలో తోటలోని ఆశోక చెట్ల నీడలు దయ్యల్లా
బాల్కనీ గోడల పై పడి భయం వేస్తున్నది. గాలికి కదిలే ఆ చెట్ల నీడలు మరింత
భీభత్సంగా వున్నాయి. ఇంతలో కరెంటు పోయింది. హాల్లో సెల్ ఫోన్ మ్రోగింది. కుమారి
ఆ చీకట్లోనే స్విచ్ వెదికి లైటెసింది. టేబుల్ పైనున్న సెల్ తీసి హలో అంది. అవతలనుంచి
భయంకరమైన నవ్వు కోమలంగా వినిపించింది. భయంతో ఫొన్ క్రెడిల్ పై వుంచేసింది.
క్రింద టామీ కుయ్యో మంటు ఏడుస్తున్నది. పైనుంచి చూస్తే పక్క జట్కా వాడి గుర్రం
టామీనీ తన కొమ్ములతో కుమ్మివేస్తున్నది. ఇంతలో ఓ చల్లని చేయి భుజం మీద
పడింది. కుమారి కేవ్వుమని అరుస్తూ బాల్కనీలోకి పరిగెట్టింది. అసలే మండిపోతున్న
సూర్యుడి వేడికి బాల్కనీ నేల చుర్రుమని కుమారి పాదాలను చుర్రుమనిపించాయి.
ఆ కటిక చీకట్లో బాల్కనీ రెయిలింగ్ పైన పొడవైన ఆకారం నవ్వుతూ కనిపించింది.
ఈ సారి మరోసారి కెవ్వుమని అరవబోయింది. దూరంగా గోదావరినది, బ్రిడ్జి మీద
చార్మీనార్ ఎక్స్ ప్రెస్ వేగంగా పోతున్నది. వెనుకవైపు సముద్ర కెరటాల ఘోష వల్ల
ఏం వినిపించక కనిపించక అంతా గందరగోళం గా వుంది. బాల్కనీ రెయిలింగ్ మీద ఓ
పొడవైన మరుగుజ్జు జుట్టు విరబోసుకొని మళ్ళీ నిలుచునుంది. మరో సారి కెవ్వుమని........
తరువాయి వచ్చే ఏడాది ఇక్కడే ఎప్పుడో ఎక్కడో , భయం భయంగా ఎదురు చూస్తుండండి.
.
<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>
మొదటిసారిగా వ్రాస్తున్న ఈ నవల శైలి, కధ చెప్పేతీరు అద్భుతంగా వుంది కదండీ.
ఇంకేమి, పెన్నులో ఇంకయిపోయే దాకా నే భయంకరమైన భీభత్సమైన కధలు
వ్రాసేస్తా! కానీ మా శ్రీమతి పద్మ మాత్రంఈ నవల గంద్రగోళం గా వుందన్నది.
తను ఇలా వ్రాయలేనని జెలసీ తో అలా అన్నది కాని నవల పెరే "గందరగోళం" కదా?!
!

<><><><><><><><><>oOo<><><><><><><><>
కార్టూన్ బాపు గారి "కొంటె బొమ్మల బాపు " వాల్యూమ్ -2 సౌజన్యంతో
.

Wednesday, December 15, 2010

ఈ రోజు బాపుగారికి రెండేళ్ళు !!





*

అదేనండి , 15 డిసెంబరు 2010 మన బాపు గారికి రెండేళ్ళు (అంటే రమణ
గారి చమత్కార మాటల్లో 77 అన్నమాట.) ఆయన 1945 " బాల" లో బొమ్మలు
( ఇక్కడ బాపు చిన్నప్పుడు "బాల"లో గీసిన బొమ్మ చూడొచ్చు) గీయటం ప్రారంభించి
ఈరోజు అందాల బొమ్మాయిల సృస్ఠికర్త అవుతాడనీ, తెలుగు భాష రాత ,గీతలు రెండూ
అపురూపంగా మారిపోతాయనీ, తెలుగు జాతి ఖ్యాతి "సీతాకళ్యాణం" తీసిన బొమ్మ
ద్వారా ఖండాంతరాలలో మారు మ్రోగుతుందనీ, ఆయన అక్షరాలు కంప్యూటర్
ఫాంటులుగా విశేష ఆదరణ పొందుతాయనీ, ఆయన వ్రాసిన " అందాల అ ఆ లు"
మాస్కో" రాదుగా" ప్రచురణాలయం పుస్తక రూపంలో ప్రచురిస్తుందనీ,తెలుగువారు ఊహించి
వుండరు.
ఆయన మంచి కధారచయిత కూడా! 1957 లో శ్రీ బాపు "మబ్బూ వానా-
మల్లె వాసనా-" అనే కధను లక్ష్మినారాయణ పేరిట వ్రాసారు.
)<<<<<<<<<<<<<<<<<౦.>>>>>>>>>>>>>>>>>>>>>(
అందాల బాపు రేఖలు
తరం తరం నిరంతరం కురిపిస్తున్నాయి నవ్వుల జల్లులు !!
బాపు అందాల లిపి తెలుగు తల్లికి కూర్చిన సుమ మాలలు !
కుంచె అనే మంత్ర దండంతో అమ్మాయిలను అందాల బొమ్మాయిలుగా మార్చే
చి (మం)త్రాల మాంత్రికుడు !!
తెలుగింటి ముంగిట నిత్యం ఆ బొమ్మాయిలు తీర్చుతున్నాయి " ముత్యాల ముగ్గులు "!
ఆయన సృష్ఠించిన అబ్బాయిలంతా ఆ బొమ్మాయిలకు "అందాల రాముళ్ళే!"
అరవై ఏళ్ళుగా తరగని అభిమానులే అందుకు " సాక్షి "!
పొగడ్తలకు పొంగిపోని "బుద్ధిమంతుడు " !!
ఆయన ఇష్ఠ దైవం దేశవిదేశాల్లో జరుపుకున్నాడు ఘనంగా "సీతాకళ్యాణం " !!
ఆయన్తో " స్నేహం " కడు " రమణీ"యం !!
నాటికీ నేటికీ, ఏ నాటికీ నవ్వించి కవ్వించే బాపు బొమ్మలకు లేదు సరి సాటి !!
బాపూ గారూ,
మీ బొమ్మలంటే నాకెంతో కసి !!
ఆ బొమ్మల్ని చూసి చూడగానే చింపేస్తా !!
ఆ పై అంటించేస్తా !!
కలకాలం నా ఆల్బమ్స్ లో దాచేస్తా !!
హాపీ బర్త్ డే టూ యూ !!


Tuesday, December 14, 2010

చాయాగ్రాహకుడు, దర్శక నిర్మాత, బి.ఎస్.రంగా






కమేరామాన్, దర్శకుడు, విక్రమ్ ఫిలిమ్స్ అధిపతి శ్రీ బిందినగబవాలే శ్రీనివాస్
అయ్యంగార్ తన 93వ ఏట చెన్నైలో కన్నుమూశారన్న వార్త "తెనాలి రామకృష్ణ"
"అమరశిల్పి జక్కన" చిత్రాల అభిమాన ప్రేక్షకులకు బాధాకరమైన వార్త. ఎన్టీఆర్,
ఏయన్నార్, శివాజీ గణేశన్, ఎమ్జీయార్, రాజ్ కుమార్ లాంటి ప్రముఖ నటులు
ఆయన దర్శకత్వం లో నటించారు. "లైలామజ్ఞు", "దేవదాస్" లాంటి చిత్రాలకు
ఆయన చాయాచిత్ర దర్శకత్వం వహించారు. ఆయన చిత్రాలకు ప్రభుత్వ బహు
మతులు పొందాయి. "తెనాలి రామకృష్ణ" లోని పాటలు, పద్యాలు, "అమరశిల్పి
జక్కన" చిత్రం లోని "ఈ నల్లని రాలలో" పాటలు మర్చిపోగలమా?! "
శ్రీ బి.ఎస్.రంగా శ్రర్ధాంజలి ఘటిస్తూ.......,

Monday, December 13, 2010

శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్యానికి 60 ఏళ్ళు !


1950 జూన్లో మొదటి సారిగా ప్రచురించబడ్డ శ్రీశ్రీ "మహాప్రస్ఠానం" ఈ ఏడాది
60 సంవత్సరాలు పూర్తి చేసుకొని షష్టి పూర్తి చేసుకొంటున్నది ! తెలుగులో
ఇప్పటికి 30 సార్లు పునర్ముద్రణకు నోచుకొన్న పుస్తకం ఇదే కావొచ్చు.
మహప్రస్థానం పుస్తకానికి "యోగ్యతాపత్రం" పేరిట ముందు మాటను ప్రఖ్యాత
రచయిత చలం జూలై 17, 1940 లోనే వ్రాశారు. కాని పుస్తకం విడుదలయింది
పదేళ్ళ తరువాత ! ఇందులోని ప్రతి కవిత వేగంగా సాగిపోతుంది. కమ్యూనిజానికి
ఆకర్షితులైన వాళ్ళే కాకుండా , ప్రతి ఒక్కరు ఈ కవితలను అమితంగా ఇష్టపడ్డారు.
తన కవితలను శ్రిశ్రీ తన మితృడు కొంపెల్ల జనార్దనరావుకు అంకితమిచ్చారు.
మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది !
పదండి ముందుకు,
పదండి త్రోసుకు !
పోదాం, పోదాం పైపైకి ! అంటూ పాఠకుల్ని ప్రతి కవితా ముందుకు త్రోసుకొని
పోతుంది. పాఠక హృదయాల్లో శ్రీశ్రీ చిరంజీవి! శ్రీశ్రీ ఈ కవితల్ని"Three cheers
for Man" పేరిట స్వయంగా ఇంగ్లీషులోకి అనువాదం చేసి 1956లో ప్రచురించారు.

Sunday, December 12, 2010

నిద్ర పోరా తమ్ముడా!



రాత్రవగానే మనం నిద్ర పోతాం. కొందరికి నిద్ర పట్టదు.ఆ లోచనలు ఎక్కువైనా,
డబ్బు జబ్బు చేసినవాళ్ళకీ, నిద్ర పట్టదు. కొందరు ఆ నిద్రకోసం నిద్ర మాత్రలు
వాడుతుంటారు. ఆకలి రుచెరెగదు , నిద్ర సుఖమెరుగదు అంటారు కదా! బాగా
పని చేసాక గాఢ నిద్ర పడుతుంది. ఇంట్లో హాయిగా మెత్తని పరుపేసుకొని పడు
కున్నా మనకు ఒకోసారి నిద్ర రానే రాదు. అదే చూడండి, ఆరుబయట కాయ
కష్టం చేసుకొనే వాళ్ళు రోడ్డు ప్రక్కనున్న ఇసుక గుట్టమీద, కంకరరాళ్ళమీద
పడుకున్నా ఇట్టె సుఖంగా నిద్రపోతారు. నాకు పుస్తకం చదివుతుంటే నిద్ర రాదు
గానీ టీవీ చూస్తుంటె మాత్రం భలే నిద్ర ముంచుకొస్తుంది. నిద్ర వస్తే పోయి పడుకో
రాదా అని శ్రీమతి అంటే మంచం మీదకు చేరగానే చస్తే నిద్ర పట్టదు. కొంతమంది
ఉద్యోగులు హాయిగా ఆఫీసుల్లోనిద్ర పోతుంటారు.
" రాత్రంతా నిద్రలేదు సార్" అని ఆఫీసరుతో గుమస్తా గుర్నాధం అంటే "ఏవిటీ?
నువ్వు ఇంట్లోకూడా నిద్ర పోతావా? ! " అని ఆశ్సర్య పోయాడట ఆఫీసర్ ఆనంద
రావు. నిద్ర మీద నిద్ర పట్టక మేధావులు మేలుకొని ఆ టైములో నిద్ర మీద కొన్ని
నానుడులు చెప్పారు!
" నిద్ర చెడుతుందని నల్లి కుట్టకుండునా?"
" నిద్ర పోయినవాణ్ణి లేప వచ్చు కానీ మేలుకున్న వాణ్ణి ఎవరూ లేపలేరు "
" నిద్రపోయిన వాడి కాళ్ళకు మొక్కినట్లు"
ఇక సినిమాల్లోనూ నిద్ర మీద ఎన్నో మంచి పాటలొఛ్ఛాయి. లతామంగేష్కర్
తెలుగులో సంతానం చిత్రంలో పాడిన తొలి పాట,’" నిదురపోరా తమ్ముడా!,నిదురలోన
గతమునంతా నిముషమైనా మరిచిపోరా " వింటుంటే అలా నిద్రలోకి జారిపోతాం!
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు "రాజమకుటం" చిత్రానికి వ్రాసిన " సడిసేయ కో గాలి! సడిసేయ
బోకే! బడిలి ఒడిలో రాజు పవళించేనే సడిసేయకే ", ఆత్రేయ "మూగమనసులు" చిత్రానికి
వ్రాసిన " పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా", సినారె
"ధనమా-దైవమా" చిత్రానికి వ్రాసిన " నీ మది చల్లగా స్వామీ నిదురపో,దేవుని నీడలో
వేదన మరచిపో-నీ మది చల్లగా,, "జీవనజ్యోతి" చిత్రానికి " ముద్దుల మా బాబు నిద్ద
రోతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు.." ,"సూత్రధారులు" చిత్రం లో ఆయనే
వ్రాసిన " జోలాజోలమ్మ జోలా, జేజేలా జోల"ఇవి కొన్ని నిద్ర పాటలకు ఉదాహరణలు..
కొందరు వాళ్ళు చెయ్యాలనుకున్న పని పూర్తయేదాకా నిద్ర పోమంటారు. నారా
చంద్రబాబు నాయుడు గారు ఉద్యొగులతో "నే నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను"
అంటూ వుండే వారు. ఊర్మిళాదేవి లక్ష్మణస్వామి వన వాసం నుంచి వచ్చేదాకా నిద్ర
పోతూ నే వున్నదట! ఇక నిద్ర పొతే ఒక పట్టాన లేవని వాళ్ళను కుంభకర్ణ నిద్ర
అంటారు. పరీక్షల రోజుల్లో నిద్ర రాకుండా వుండటానికి టీ తాగుతూ నిద్ర ఆపుకుంటూ
వుంటారు. నిద్ర గురించి రాస్తుంటె నిద్ర ముంచు కొస్తున్నది. నిద్ర మత్తు వదలటానికి
కొన్ని నిద్ర జోకులు చెప్పుకుందామా మరి !

>>>>>>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<<<<<

కుంభకర్ణుడితో రాక్షసులు - " ఏమండోయ్, నిదుర లేవండోయ్"
<><><><><><><><><><><>
" అదేమిటొయ్-ఈ మధ్య బొత్తిగా మరీ అలా గుర్రు పెడుతున్నావు ?"
" నాకిలాగే వచ్చు, నచ్చకపోతే వినకు."
<><><><><><><><><><><><><>
ఒకావిడ డాక్టరు దగ్గరికి వెళ్ళి " మావారికి కలవరింతలండీ, చంపేస్తున్నారు" అంది
" మందిస్తాను పట్టుకెళ్ళండి అవే పోతాయి..."
" అబ్బే పోవడానికివ్వకండి. కాస్త స్పష్టంగా మాట తెలిసేలా కలవరించడానికి
మందివ్వండి.... ఆ పిల్ల పేరు తెలీటం లేదు"
<><><><><><><><><><><><><><><>
శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారి "నవ్వితే నవ్వండి" సౌజన్యంతో

Saturday, December 11, 2010

సినీ పబ్లిసిటీకి బాపు బొమ్మలు !!


గత చిత్రాలలో హాస్య సన్నివేశాలు, వాటిలోని పాత్రలు కధనంలో మిలితమయి
వుండేవి. సినిమా చూసి ఇంటికి వచ్చాక ఆ దృశ్యాలను గుర్తుకు తెచ్చుకొని
నవ్వికొనే వాళ్ళం! ఆ నవ్వుల ఘట్టాలు కలకాలం గుర్తుండిపోయేవి. వాటి
కోసమే సినిమాలకు రిపీటెడ్ ఆడియన్స్ హాల్ల ముందు బారులు తీరే వారు.
ఇప్పటి సినిమాల్లో శృంగార దృశ్యాలనే కాదు హాస్యం కూడా జుగుప్సాకరంగా
వుంటున్నది. రేలంగి, రమణారెడ్డి మమా అళ్లుల్లుగా "ఇల్లరికం" సినిమాలో
తలచుకుంటేనె నవ్వ లేకుండా వుండ లేము. "ఇల్లరికం" చిత్రంలోని రేలంగి,
రమణారెడ్డి పాత్రలను శ్రీ బాపు ఆ చిత్ర ప్రచారానికి ఎంత అద్భుతంగా గీసారో
పై బొమ్మ చూస్తే తెలుస్తుంది !!

Friday, December 10, 2010

బాపు - రమణ -బొమ్మలు - కధలు





శ్రీ బాపు, ముళ్లపూడి వెంకట రమణ గార్లు కలసి మెలసి 60 ఏళ్ళ
క్రితం ( పత్రికా లోకంలో స్వర్ణ యుగమనే చెప్పాలి) వివిధ పత్రికలలో
గీసి రాసిన ఆణిముత్యాలన్నీ పుట్టల్లాంటి పెట్టెల్లోంచి త్రవ్వి తీసి
464 పేజీల గట్టి " అట్ట " హాసం తో "మంద " హాసంగా అచ్చొత్తి
రచన శాయి గారు అభిమానులకు అందించారు. 1960 ల నుంచి
90 లదాకా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, చందమామ,విజయచిత్ర,యువ,
జ్యొతి మాస పత్రిక, లలో ప్రచురించిన ఈ ఇద్దరుమితృల బొమ్మల
కధలను ఆస్వాదించవచ్చు. చందమామ లో బాపు వేసిన "’గలివర్
ట్రావల్స్" రంగుల బొమ్మల కధ, బంగారం-సింగారం, బుడుగు,రాజూ-
రైతు,బుడుగు "రాచ్చసుడూ పదమూడో ఎక్కం" కధ ఇలా ఒకటేమిటి
ఎన్నోఎన్నేన్నో! భాపు బొమ్మలతో గీసిన సినిమా స్క్రిప్ట్ మరెన్నో!!
ఈ పుస్తకం మీ దగ్గర లేపొతే వెంటనే వాహిని బుక్ ట్రస్ట్, 1.9.286/3,
విద్యానగర్, హైదరాబాద్ 500044 కు వెంఠనే వ్రాసి తెప్పించుకొనండి!
మరో మాటండోయ్! ఈ విలువైన పుస్తకం ఆఖరి పేజీలో నా పేరూ చోటు
చేసుకుందోచ్ !!, ప్రముఖులతో బాటు.