Friday, May 28, 2010

హాసానికి ముళ్లపూడి వారి ఆశీస్సులు

మా "హాసం క్లబ్" వార్షికోత్సవానికి శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారి శుభాకాంక్షలు
ఓ హాసం క్లబ్బూ !
పరిహాసాన్ని సుందర దరహాసంగా ఏమార్చి
నవ్వులు గుబాళించే హహహహ ! హమామ్ సబ్బూ !
ను - వ్వొస్తానంటే
న - వ్విస్తానంటే
నేనొద్దాంటానా !

ఆకూవక్కా సున్నంలాగే
జోకూ నేనూ నువ్వూ కలిస్తే
నవ్వుల తాంబూలం !
అది నే వద్దంటానా ?

కాని - ఐతే- నువ్వు మాత్రం హాయిగా నవ్వక పోయావో
భకరా ( అను భమిడిపాటి కామేశ్వరరావు గారు )
పబ్లిగ్గా పగలబడి నవ్వినంతొట్టు

ఆంధ్రుల్లో ఐకమత్యం కాలరెత్తుకున్నంత ఒట్టు
గిరీశం మధుర వాణికి తాళి కట్టినంత ఒట్టు
గంగా కావేరి నదులు
కాశీ రామేస్రాల్లో సరిగంగా స్తానాలు చేసినంత ఒట్టు
శివుడి తలమీద గంగ కూర్చుందని
గౌరి కంటనీరు పెడితే
శివ శివా! గంగ నా శిరసున కాదే !
నీ కళ్లలోనే తిరుగుతోందే చూస్కో
అని శివుడు నవ్వించి నవ్వినంత ఒట్టు
హాసం క్లబ్ ! హాపీబర్త్ డే ! !
---శ్రీ ముళ్లపూడి వెంకట రమణ (చెన్నై)

శ్రీ రమణ గారు నాపై ఎంతో ప్రేమతో , నే కోరిన వెంటనే మా "హాసం క్లబ్" ను
ఆశీర్వదిస్తూ వ్రాసి పంపారు. మీతో ఆ నవ్వుల దీవెనలను పంచుకోవాలనిపించింది.
అన్నట్టు ఈ రోజు నా పుట్టిన రోజు ( మే 28 ) సరిగ్గా ఓ నెల రోజుల తరువాత జూన్
28 న ముళ్లపూడి మా రాజమండ్రి ,ఆల్కాట్ గార్దెన్స్ లోని లూధరన్ హాస్పటల్లో
నవ్వుతూ, నవ్విస్తూ పుట్టారు !! అన్నట్టు మరచే పోయా. ఈ రోజుతో 70 లోకి
అడుగు పెడుతున్న నాకు మతిమరపు సహజమేగా ! ఈ రోజు మహానటుడు ,నటరత్న
యంటీఆర్ జయంతి.. తెలుగువాళ్ళ ఉనికిని దేశానికి చాటిన ఆ మహవ్యక్తి కి తెలుగు
జనాలందరి తరఫున జోహార్లు.


Thursday, May 27, 2010

అప్పు తచ్చులు అను అచ్చు తప్పులు !

అప్పు తుచ్చులను అక్షరాలు అక్షరాలా ఖూనీ !!

అచ్చులో అక్షరాల కూర్పులో తప్పులు దొర్లినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కో సారి భావమే
పూర్తిగా మారిపోయి నవ్వూ తెప్పించవచ్చు , కొందరికి కోపం కలిగించవచ్చు. అచ్చయే ముందు
ప్రూఫ్ ను తీసి అందులో తప్పులులను దిద్దేవారు. వాళ్ళని ప్రూఫ్ రీడర్స్ అంటారు. అలాజాగ్రత్తగా
తప్పులను దిద్దినా ఇంకా కొన్ని తప్పులు అలానే ఉండిపోయేవి. అప్పుడు పుస్తకం చివరాఖరున
( చివర అన్నా , ఆఖరున అన్నా ఒకటే , మరి గేటు గుమ్మం లా ,అగ్గినిప్పులా చివరాఖరని తరచు
రచనలలో కనిపిస్తున్నది ! )గతంలో తప్పొప్పులు అంటూచివరి పేజీలో తప్పు దానికెదురుగా ఒప్పు అని
వేసే వారు. ఇప్పుడు కంపొజింగు అంతా కంప్యూటర్ల ద్వారా జరుగుతున్నది కనుక అక్కడే పొరబాట్లు
సరిదిద్దుతున్నారు ఐనా అక్కడక్కడా తప్పులు దొర్లుతూ వినోదాన్ని అందిస్తుంటాయి. మా రాజమండ్రి
లో ఒక స్ధానిక దిన పత్రికలో తరచు అచ్చు తప్పులు వచ్చేవి. పత్రిక మైయిన్ హెడ్డింగ్ క్రింద సంపుటి,
సంచిక ప్రక్క రెండు పేచీలు, వెల పది పెసలు అన్ని చాలా కాలం వరకు అచ్చయేది. మరో సారి వార్తలు
అచ్చేస్తూ , చైర్మన్ చే రంకు స్ధాపన (శంకు స్దాపనకు వచ్చిన ప్రమాదం అని ఈ పాటికి మీరు గ్రహించే
ఉంటారు ).బ్యాంకులో కే.వీ.శాస్త్రి అనే మా కొలీగ్ ఇలాటివి పత్రికల్లో పట్టుకొని మాకు వినొదాన్ని పంచే
వాడు. ఇన్ని చెప్పిన నేనే గత బ్లాగులో ఫేర్లగురించి వ్రాస్తూ చివర వేటూరికి ఘటిస్తూఅనడానికి
బదులు గటిస్తూ అని వ్రాసా. ఆ తప్పుని, ఇంకా నే తెలియకుండా చేసిన అక్షర ఖూనీలను మన్నించమని
కోరుతున్నాను.
అప్పు తుచ్చులతో కొన్ని వాఖ్యాలను శ్రీ ఆరుద్ర "జ్యోతి" మాస పత్రికలో వ్రాసారు. వాటిలో కొన్ని ’చెత్త
గించండి
సత్యం వధ ధర్మంచెర
ఎంతవారలైనా కొంత దాసులే
చల్ మోహనరంగా ! నీకూ నాకూ జోడు కరచెను గదరా
డబ్బిచ్చి మార్కులు వేయించుకున్నవారు చదువు కొన్న వారు
చచ్చుబుడ్డి బాగా వెలగదు
డాక్టర్లు రోగి పర్సు చూసి వైద్యం చేస్తారు.
అక్కరకు రాని చట్టము
లోకులు క్రాకుల వంటి వారు.

Tuesday, May 25, 2010

పేరులో " నేముంది " ?


పేరులో "నేము" ముంది ? !

మన రూపాలు దేశాలు, రాస్ట్రాలు ,పరిసరాలబట్టి వేరు వేరుగా వున్నా మనను గుర్తించడానికి
మనవాళ్ళు పేర్లు పెట్టారు. అంతెందుకు మనుషులకే కాకుండా ,జంతువులకు, పక్షులకు, రక
రకాల వస్తువులకు కూడా వివిధమైన పేర్లుంటాయి. ఇక ఊర్లకు పేర్లుంటాయి. సముద్ర తీరాలు
దగ్గర గల ఊర్లకు విశాఖపట్నం, మచిలీ పట్నం, చెన్నపట్నం లాంటి ప్రత్యేక పేర్లుంటాయి. ఇక
మన దగ్గరకు వస్తే పేర్లను బట్టి కులాలను, వాళ్ళ వృత్తులను పూర్వం గుర్తించేవాళ్ళు. శాస్త్రీ, శర్మ,
గుప్త, శెట్టి, చౌదరి, రాజు, వర్మ, రెడ్డి ఇలా పేర్ల చివర తగిలించుకున్న వాటి వల్ల వాళేవరో తెలిస్తుంది.
కానీ రోజులు మారాయి. మారిన రోజులబట్టి కులాలకు ,మతాలకు ప్రత్యెకత తగ్గింది. పేర్లు కూడా
ఆధునికతను ప్రతిబింబిస్తున్నాయి. ఇది నిజంగా శుభపరిణామమే. గతంలో తమ పిల్లలకు తప్ప
కుండా తమ తల్లి దండ్రుల పేర్లను పెట్టే ఆనవాయితీ విధిగా పాటింఛేవారు. తమ తల్లిదండ్రులు
జీవించి వుండగానే తమ పిల్లలకు వారి ఫెరు పెట్టడంవల్ల తమ వంశంలో పెద్దల పేర్లు కొన్నితరాల
వరకు గుర్తుండి పోయే వీలు వుంటుంది. ఇప్పుడు అలా పేర్లు పెట్టినా చివరగా ఆ పేర్లకు ఆధునిక
పేర్లను చేర్చడం వల్ల చివరకు పెద్దల పేర్లు మరుగున పడిపోతూనే వున్నాయి. మా ఇద్దరమ్మాయిలకు
మా నాయనమ్మగారిపేరు, అమ్మమ్మ పేర్లతో వెంకట లక్ష్మీ మాధురి, లక్ష్మీ మాధవి అన్న పేర్లు పెట్టినా
వాళ్ళను పూర్తి పేరుతో ఏ నాడూ పిలవలేదు. ఇక ఇంటి పేర్ల విషయానికి వస్తే కొన్ని ఇంటి పేర్లు
వినడానికి కూడా చాలా బాగుంటాయి. మా ఇంటి పేరు " మట్టెగుంట" అయితే స్కూళ్ళల్లో , ఓటర్ల
లిస్టుల్లో " మట్టి గుంట" అనే వ్రాస్తారు. నిజానికి మట్టెగుంట అనే ఊరు ఒంగోలు దగ్గర ఉందట.నేను
విశాఖపట్టణం యస్బీఐ లో పన్జేస్తున్నప్పుడు మా పెద్దామ్మాయి మాధురిని వాళ్ల స్నేహితురాలి
ఇంట్లో మచిలీపట్ట్ణం కి చెందిన ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ అగుపించి మీ ఇంటి ఫెరేమిటని అడిగితే "మట్టెగుంట"
అని చెప్పడానికి ఇష్టపడక ఎంతసేపటికీ చెప్పలేదట. చివరకు ఆ స్నేహితురాలు వాళ్ళ ఇంటి పేరు
మీ ఇంటి పేరే అని చెప్పగానే ఆయన నేను మీ తాతగారికి కజిన్ అవుతాను. ఫెరు చెప్పటానికి సిగ్గు
పడటంవళ్ళ నువ్వేవరో నాకు ఇంతవరకూ తెలియలేదాన్నారు. కొన్ని ఇంటి పేర్లు నిజంగా బాగుంటాయి.
సామవేదం, సంధ్యావందనం, పమిడిఘంటం, ఆవుల, ప్రతివాద భయంకర ఇలా ఎన్నేన్నో! కొన్నిపేర్లు
నేతుల, పచ్చిపులుసు లాటివికూడా వుంటాయి. కొందరి అసలు పేర్లకన్నా వాళ్ళ ఇంటి పేర్లు చెబితేనే
గుర్తుకు వస్తారు. హాస్య నటుడు వెంకటరామయ్య అంటే తెలియదు. అదే రేలంగి అంటె వెంటనే గుర్తుకొస్తుంది.
అలానే అక్కినేని, గుమ్మడి, ఘంటసాల, ఆదుర్తి ,పింగలి మొదలైన ప్రముఖుల పేర్లు వారి ఇంటిపేరుతోనే
గుర్తింపు పొందారు. ఇక కొందరు వాళ్ల పేర్లలోని వి(పొ)డి అక్షరాలతోనే ప్రాచుర్యం పొందారు. .ఉదాహరణకు
సినారే ( సి.నారాయణ రెడ్డి), శ్రీ శ్రీ ( శ్రీరంగం శ్రీనివాసరావు) మొదలయిన వారు. ఇక సత్తిరాజు లక్శ్మీనారాయణ
గారు అన్న పేరు కంటే " బాపు" అన్న పేరే అందరి హృదయాల్లో నిలచిపోయింది. అయినా పేర్లలో నేముంది
చెప్పండి ? మన నడవడి , ప్రవర్తనల ద్వారానే మన పేరు కలకాలం నిలచి పోతుంది.
ఆఖరిగా అక్షర శిల్పి " వేటూరి" కి శ్రర్ధాంజలి గటిస్తూ శలవు తీసుకుంటా.

Saturday, May 22, 2010

కడియం నందన వనాలు


మొక్కలు మనకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. అంతే కాదు మనకు పండ్లను ,కాయగూరలను అందిస్తాయి.
రకరకాల రంగురంగుల పూలను అందిస్తాయి. వాతావరణము లోకి ఆక్సిజన్ను వదలి కార్బన్ డైయక్సైడ్
ను తీసుకుంటాయి. ఎన్నోరకాల పూలమొక్కలను పెంచే నర్సరీలకు ఆదాయాన్ని, ఎంతో మందికి జీవనో
పాధిని అందిస్తున్నాయి. రాజమండ్రికి సమీపంలో (తూర్పు గోదావరి జిల్లా) కడియం,కడియపులంకలలో
గల నర్సరీలు ఇందుకు నిదర్శనం. అపార్ట్మెంట్ సంస్కృతి మొదలయిన తరువాత ఇంట్లో మొక్కలతో
గార్డెన్ పెంచుకొనే అభిలాష తగ్గిపోయినా ఇంకా మొక్కలను అమితంగా ప్రేమించే వాళ్ళు కుండీలలో
వివిధ మొక్కలను పెంచుకుంటూనే ఉన్నారు.
కడియంలోని నర్సరీలకు ఎంతో చరిత్ర వుంది. మొదట్లో అందరిలాగానే ఇక్కడ కూడా కంది,రాగులు,జొన్న
లాంటి పంటలు వేసేవారు. ఈ పంటలతో లాభాలు అంతగాలేకపోవటం చేత మరో వ్యవసాయ పద్ధతులకోసం
ప్రయత్నించి పూల,పండ్ల మొక్కల సాగును ప్రారంభించారు. సాధారణంగా అన్ని ప్రాంతాలలో అన్ని రకాల
మొక్కలు పెరగవు. కానీ గోదావరి నేల అన్ని రకాలమొక్కలకు అనువుగావుంటుంది. 1950 నుండి నర్సరీ
బాగా అభివృద్ధి చెందటం మొదలయింది. ఒకరిని చూసిమరొకరు ఈ వ్యాపారంలోకి ప్రవేసించారు.. శ్రీ పల్లా వెంకన్న,
శ్రీ గంగుమల్లు సత్యనారాయణ లాంటి ప్రముఖ వ్యాపారులు ఆధునిక పోకడలను అనుసరించి వ్యాపారాన్ని
అభివృద్ధి చేసారు. ఇప్పుడు కడియం, పరిసరాల్లో దాదాపు 600 పైగా నర్సరీ తోటలు ఉన్నాయి. దక్షిణ అమెరికాలో
పెరిగే ఫలానా మొక్క మా గార్డెన్స్ లో దొరుకుతుందని ఇక్కడి నర్సరీ వ్యాపారులు గర్వం గా చెప్పుకొనే స్దాయికి
ఎదిగారు. గులాబి,బంతి, చేమంతి, మల్లె, జాజి, లిల్లి, కనకాంబరం లాంటి పూల మొక్కలనే కాకుండా ఒక్క మందారం
పూలలోనే 500 రకాల మందారాలు ఇక్కడ దొరుకుతాయి. జామ,మామిడి, సపోటా, బత్తాయి, అరటి, దానిమ్మ పండ్ల
మొక్కలే కాకుండా అలంకరణకు ఉపయోగించే సైకస్, క్రిస్టమస్ ట్రీ, యాస్పరేగస్, యుఫోర్బియా,కాక్టస్, అగలోనేమా
మొదలైన 1500 రకాల మొక్కలు లభిస్తాయి. ఇండియాలో ఏ రకం కొత్త మొక్క వచ్చినా అది కడియం నర్సరీలలో
అగుపించాలనేదే ఇక్కడి వ్యాపారుల ధ్యేయం..ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడినుండి మొక్కలు మన రాష్ట్రంలోనే
కాకుండా ఢీల్లీ,గోవా, మధ్యప్రదేష్, మహరాష్ట్ర, బెంగాల్,అస్సాం,రాజస్తాన్ మొదలయిన చోట్లకు కూడా ఎగుమతి అవుతాయి !
ఈ మొక్కలను చాలావరకు స్దానికంగా అభివృధి చేయటమే కాకుండా మరికొన్ని ఇతర చోట్లనుంచి ఇక్కడికి తెచ్చి ఇక్కడ
అభివృద్ధి చేయడం మరో ప్రత్యేకత. ఇక్కడి రైతులకు అంతగా చదువు లేక పోయినా ప్రతి మొక్క గురించి క్షుణ్ణంగా తెలుసు.
నోరు తిరగని శాస్త్రీయ నామాలను కూడా టకటకా చెప్పేయగలరు. కడియం నర్సరీలను ప్రతి రోజూ వేలాది మంది వివిధ
ప్రాంతాల ప్రజలు సందర్శిస్తుంటారు.వారిలో విదేశీయులుకూడా ఈ మొక్కలను చూసి రైతుల వ్యాపార ప్రావీణ్యానికి,
ముగ్ధులవుతుంటారు. ఈ సారి సెలవులకు రాజమండ్రి వచ్చినప్పుడు కడియం నర్సరీలను చూడటం మర్చిపోకండి.


Friday, May 21, 2010

1967లో మొదటి సారిగా వచ్చిన ఏటీయం !





రోజులు మారాయి. పూర్వపు రోజుల్లో బాంకు నుంచి డబ్బులు తీసుకోవాలంటే బాంకు పనిచేసే
టైములోపలే తీసుకోవాల్సి వచ్చేది. మరిప్పుడో, అర్ఢ రాత్రి, అపరాత్రి మనకు ఇష్టం వచ్చినప్పుడు
డబ్బు తీసుకొవచ్చు.( అదేలెండి ! మన ఖాతాలో బాలన్స్ ఉంటేనే !!). అదేకాదు, మనం ఏ ఊరెల్లినా
అక్కడే డబ్బు తీసుకొనే సదుపాయం వచ్చింది. అదే ఏటీయం.! ఈ యంత్రాన్ని ( ఆటొమేటెడ్ టెల్లర్
మిషన్) జాన్ షెపర్డ్ బారన్ కనిపెట్టాడు. ఓ సారి అత్యవసరంగా బ్యాంకులో డబ్బు డ్రా చేసుకోవాలను
కొంటే బ్యాంకు టైమ్ ఐపోయిందట. బారన్ కు డబ్బును అందజేసే మిషన్ ఉంటే బాగుంటుందనే
ఆలోచన వచ్చింది. 1967 లో మొట్టమొదటి టెల్లర్ మిషను లండనులోని ఒక బ్యాంకు వద్ద ఏర్పాటు
చేశారు. ఒక ప్రత్యేకమైన చెక్కును మిషన్లో ఉంచితే దాని సంకేతక సంఖ్యను సరిపోల్చి నగదును
ఇచ్చేది. తరువాత ప్లాస్టిక్ కార్డులు ప్రవేశించాయి. ఏటీయం లాంటి సదుపాయాన్ని ప్రపంచ ప్రజానీకానికి
అందించిన జాన్ షెపర్డ్ బారన్ గత శని వారం తన 84 ఏట ఉత్తర స్కాట్లాండ్లోని ఓ ఆసుపత్రిలో మరణించాడు.
* * * * * * * * * * * * * *
మన ఖాతాలో డబ్బులు లేక పోతే ఏటీయం ఏటీయియ్యం అంటుంది !!
* * * * * * * * * * * * * *
ఓ సారి అలనాటి నటుడు వంగర వేంకట సుబ్బయ్య ( మాయాబజార్ సినిమాలో అల్లుతో శర్మ,శాస్త్రీ జంట
గా అగుపించారు ) వేషాలకోసం ప్రయత్నిస్తుంటే ," ఏవియం లో ప్రయత్నించక పొయారా ? అని ఒక మితృడంటే
వంగర " వాళ్ళేమిస్తారయ్యా ! స్టూడియో బయట ’ఏవియ్యం ’ అని పెద్ద బోర్డు పెట్టుకున్నారు కదా !" అని
సహజ ధోరణిలో చమత్కరించారట.
+ + + + + + + + + + + + +


Thursday, May 20, 2010

ఆంధ్ర కేసరి

మనదేశం లో ఒకేసారి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి పదవిని అలంకరించడమే
కాకుండా ప్రసిస్ధి చెందిన నాగార్జునడామ్ లాంటి భారీ ప్రాజెక్ట్ కు రూపకల్పన
చేసిన నీతిమంతుడయిన ఏకైక ముఖ్యమంత్రి ’ఆంధ్ర కేశరి ’ టంగుటూరి ప్రకాశం
గారు అన్న విషయం ఈ తరం వారికి చాలామందికి తెలియకపోవచ్చు. జాతీయ
స్ధాయిలో గుర్తింపు పొందిన ఆంధృడాయన. ఎంతటి వారినైనా ఎదుర్కొనగలిగిన
ధైర్యవంతుడు. బ్రిటిష్ వారి తుపాకులకు చాతీ చూపిన సాహసి. మద్ర్రాసులో
లక్షల రూపాయలను ఆర్జిస్తున్న లాయరు వృత్తిని తృణప్రాయంగా వదలి రాజకీయల
లోకి ప్రవేసించిన ప్రకాశం పంతులుగారు పుట్టిన ఊరు వేరైనా ఆయన రాజకీయ
జీవితమంతా గోదావరీతీరం, రాజమహేంద్రవరం ( రాజమండ్రి )లోనే సాగింది.ఆయన
పుట్టిన ఊరు కొత్త జిల్లాగా మారినప్పుడు ఆయన పేరిట ’ ప్రకాశం జిల్లాగా పేరు
పెట్టారు. అటువంటి ఉత్తమ వ్యక్తి తమ ఊరి ప్రధమ పౌరుడు కావటం తమకు గర్వ
కారణమని రాజమండ్రి ప్రజానీకం ఆయన్ని తమ నగరానికి చైర్మన్గా ఆనాడు ఎన్ను
కున్నారు. 1901 ప్రాంతంలో రాజమండ్రి పట్టణం తరచు ముంపులకు గురయేది.
ముందు చూపుతో గోదావరి నీరు పట్టణంలోకి ప్రవేశించకుండా గట్టును నిర్మించడానికి
ఆయన సముత నిర్నయం , ఆయన ముందు చూపుకు నిదర్శనం.ఆయన ముఖ్య
మంత్రిగా అధికారం చేబట్టాక కృష్ణా నదిపై కాటన్ నిర్మించిన ఆనకట్ట శిధిలావస్దకు
చేరిందని పుననిర్మాణం చేపట్టాడు. తరువాత ఆ బారేజ్ ప్రకాశం బారేజ్ గా ఈ నాడు
నిలచింది. అలా ప్రకాశం ఉభయ గోదావరి జిల్లాలకే కాకుండా కృష్ణా జిల్లాకు మేలు
చేశాడు. ఆయన లాయరుగా పనిచేస్తున్నప్పుడు వాదనలు సరిగా వినకుండా కునికి
పాట్లు పడుతున్న బ్రిటిష్ న్యాయమూర్తికి చురకలంటించిన ధైర్యశాలి. మరో సారి కందుకూరి
వీరేశలింగంను కూడా బోనులో నిలబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తెగువరి. స్వాతంత్ర
భావాలను ప్రజలలోకి తీసుకు వెళ్ళడానికి ఆయన ’ స్వరాజ్య ’ అనే పత్రికను ఇంగ్లీష్,
తెలుగు,తమిళ భాషల్లో ప్రచురించారు. కాంగ్రెస్, బ్రిటిష్ వారు వేసిన సైమన్ కమీష్ ను
బహిష్కరించినప్పుడు కాల్పుల్లో ఓ కార్యకర్త మరణించాడు.. అప్పుడు ప్రకాశం ధైర్యంగా
ఆ తుపాకులకు ఎదురునిల్చొని తన చాతీ చూపించి బ్రిటిష్ వాళ్ళని గడగడ లాడించాడు,
సింహం లా ధర్యాన్ని చూపిన ఆయన్ని "ఆంధ్ర కేశరి"గా అభిమానులు పిలచారు. దక్షినాదిన
కాంగ్రెస్ ను నడిపించగల శక్తి ఆయన ఒక్కడికే వుందని అందరూ తీర్మానించారు. 1946
సంయుక్త మద్రాసు రాష్ట్రానికి ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. కొన్ని కారణాలవల్ల ఆయన
తన పదవికి రాజీనామా చేసి ప్రజాపార్టీ అనే కొత్త పార్టీని స్తాపించారు. కర్నూలు రాజధానిగా
ఆంధ్ర ఏర్పడినప్పుడు రాస్ట్రాన్ని నడపగల ఏకైక నాయకుడిగా ఆయన్ని ప్రధాని నెహ్రూ గుర్తించి
మొదటి ముఖ్యమంత్రిని చేశాడు. నీతికి నిజాయితికీ నిలబడగలిగిన ఒకే ఒక్క నాయకుడు
టంగుటూరి ప్రకాశం. ఆయన మే, 20, 1957 న మరణించారు. ఆయన ముఖ్యమంత్రిగా
ఉన్నప్పుడు రాజమండ్రి లో మా స్కూల్ యానివర్సరీకి అధ్యక్షులుగా వచ్చారు. అప్పుడు
ఆయన టేబుల్ పై కూర్చొని అధ్యక్షోపన్యాసం ఇవ్వడం నాకింకా గుర్తుంది !!

Tuesday, May 18, 2010

" మండే " ఎండలు !!


ఈ ఎండాకాలం ఎప్పుడు ఎండవుతుందో ! అంటూ ఈ రోజుల్లో ప్రతి వాళ్ళూ రోజులు
లెక్కపెట్టుకుంటున్నారు. ఐనా మనకు ఏ కాలం నచ్చుతుంది చెప్పండి. వర్షాకాలం
వచ్చాక, పాడు వర్షాలు ఇంట్లోంచి కదలటానికి లేదు. ఆ ఎండాకాలమే నయం. హాయిగా
ఉక్కపోసి చమట పట్టినా షవరుక్రింద స్నానం ఎన్నిసార్లు చేసినా ఎంతో’ హాయిగా వుండేది.
కరెంట్ కోతతో ఉక్కపోతతో వళ్ళంతా తడిసిపోయాక కరెంట్ వచ్చి ఫాను తిరుగుతుంటే
ఆ హాయే హాయి అని అనుకుంటాం. రాజకీయనాయకుల్లా క్షణాల్లో మాట మార్చేస్తాం !
ఇప్పుడు వార్తల్లో ఎండకు ఇంతమంది పరలోక యాత్ర అని వేస్తున్నట్లే వానాకాలంలో
రోడ్లన్నీ వర్షంనీళ్ళతో నిండి డ్రయనేజ్ కన్నాల్లో పడి కొట్టుకుపోయారని వార్తలు స్క్రోలింగ్లో
చూస్తాం. ఐనా పాపం ఆ సూరీడు ( మాజీ సీయం. ఆప్తుడువిషయం కాదండోయ్) తన పేరేగల ఆది
వారంకూడా రెస్ట్ తీసుకోకుండా పూర్తిగా తన ప్రతాపం చూపిస్తాడు. పోనీ మరునాడైన "మండే"
నాడు సెలవు తీసుకోకుండా మరింత "మండి" పొతాడు ! ’మండే’ రోజుగదా మరి ! ఆయన్ని
పాపం ఏమనలేం. పైగా ఇవి అయనకు ప్రతి వారాలూ మండేలే గదా ! "ఫ్రై" డే నాడైతే మరింత "ఫ్రై" చేస్తాడు
మనకు కావాలి టీ, కాఫీ హాట్ హాట్ గా !
ఉండాలి పేపర్,టీవీల్లో వార్తలు హాట్ హాట్ గా ! !
సిన్మాల్లో సీన్లు కనిపించాలి హాట్ హాట్ గా ! !
ఐనా సూరీడు మాత్రం తన ప్రతాపం చూపకూడదు హట్ హట్ గా ! !
ఇలా హాట్ హాట్ గా రాసి బుర్ర వేడెక్కి ఓ కప్పు కాఫీ ఇమ్మంటే శ్రిమతి ఏమందో నా కార్టూన్లోనే
చూడండి మరి. ఇక కట్ అంటూ కరెంట్ కట్టయింది ! ఉంటా టా టా టా !!

Monday, May 17, 2010

లోకానికి "వెలుగు" నిచ్చిన ధామస్ అల్వా ఎడిసన్






ఎంతమందో శాస్త్రవేత్తలు మనం ఈ నాడు అనుభవిస్తున్న ఎన్నో వస్తువులను
కనుగొన్నారు. వాళ్ళందరిలో నాకు చిన్నప్పటినుంచి ఎంతో ఇష్టమైన శాస్త్రవేత్త
ధామస్ అల్వా ఎడిసన్. ఈ రోజు మనం చీకట్లో వెలుగును చూస్తున్నామంటేనూ,
మాధుర్యమైన పాటలను, సంగీతాన్ని వీనులవిందుగా ఆనందిస్తున్నామంటేనూ,
అలనాటి ప్రముఖుల స్వరాన్ని పదిలపరచుకుని ఈ తరం వారికీ వినిపిస్తున్నా
మంటేనూ దానికి మూల కారకుడు ధామస్ అల్వా ఎడిసనే. ఎలట్రిక్ బల్బు, గ్రామ
ఫోన్ మొదలైన పరికరాలను దాదాపు 1300 కనిపెట్టాడు. బల్బు కనిపెట్టడానికి
ముందు 299 సార్లు విఫలమైనప్పుడు ఎడిసన్ భార్య వేళాకోలం చేస్తే, " నేను బల్బు
కనిపెట్టడంలో ఫెయిలవ లేదు. ఏ విధంగా చేస్తే బల్బు కనిపెట్టలేమో అన్నది 299
పధ్దతుల్లొ తెలుసుకున్నాను" అని జవబిచ్చాడట., ఓటమి నుంచి కూడా పార్థాలు
నేర్చుకోవచ్చని ఎడిసన్ నిరూపించాడు. ఎడిసన్ ఒక సారి చిన్న దీపం పెట్టుకొని
చదువుకుంటూ వుండగా గాలికి దీపం ఆరిపోయింది. గాలి తగిలినా కూడా ఆరిపోని
దీపాన్ని కనుక్కోవాలనే ప్రయత్నమే ఆయన సృష్టించిన నేటి ఎలట్రిక్ బల్బుకు నాంది
అయింది. ఇక్కడ మీరు చూసే బొమ్మల్లో ఎడిసన్ కనుగొన్న మొదటి గ్రామఫోన్
ప్రకటన, వాక్స్ సిలిండర్ మీద పాటను రెకార్డు చేయటం, మొదటి ఎలట్రిక్ బల్బు,
అలనాటి గ్రామఫోన్ ( ఈ గ్రామఫోన్ నా దగ్గర వుంది) ఎల్పీ రికార్డు, నేటి అదునాతన
సిడీ బొమ్మలున్నాయి.

Sunday, May 16, 2010

దామెర్ల రామారావు (1897-1925) ఆర్ట్ గాలరీ-రాజమండ్రీ






దామెర్ల మెమోరియల్ ఆర్ట్ గాలరీ, రాజమండ్రి
ఆంధ్రదేశ చిత్రకళావైభవానికి వన్నెతెచ్చిన చిత్రకారుల్లో దామెర్ల రామారావు ఒకరు.
అంతటి కళాకారుడు జీవించినది అతి కొద్ది కాలమైనా ( ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు
లోనే ఆయన అకాలమరణం చెందారు).ఆ కొద్ది కాలంలోనే చిత్రకళకు ఆయన చేసిన సేవ
మరువలేనిది. గోదావరి రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఆనంకళాకేంద్రం వెనుక శ్రీ రామారావు
పేరు మీద ఓ ఆర్ట్ గాలరీ నిర్మించారు. శ్రీ రామారావు 1887 మార్చి 8వ తేదీన రాజమండ్రి
లో జన్మించారు. అతి పిన్న వయసులోనే ఆయన పెన్సిలు తో బొమ్మలు వేస్తుండేవారట.
పదేళ్ళ వయసులో వారి మేనమామ బహుకరించిన వాటర్ కలర్స్ తో ఆయన చిత్రకళా
ప్రతిభ దినదినాభివృద్ధి మానమయింది. ఆయన కుంచె నుంచి జాలువారిన రంగుల చిత్రాలు
కొన్ని ఇక్కడ మీకోసం. మీరెప్పుడైనా రాజమండ్రి వస్తే దామెర్ల రామారావు గారి చిత్రాలను
చూడటం మరచిపోకండి.ఈ ఆర్ట్ గాలరీ ప్రభుత్వ నిర్వహణలో వుంది కాబట్టి సందర్శకులు
చూడటానికి నిర్ణయించిన టైమ్ మాత్రం అంత సదుపాయంగా లేదనే చెప్పాలి. ఆఫీస్ టైముల్లా
ఉదయం 9-00 గంటల నుంచి మధ్యహ్నం 12-00 గంటల వరకు తిరిగి 2-00 గంటల నుంచి
సాయంత్రం 5-00 గంటల దాకా అనుమతించడం బాగుండలేదు. శుక్రవారం సెలవుతో ఆదివారం
తెరచి వుంచడం మాత్రం కాస్త ఊరట కలిగించే విషయం.

Saturday, May 15, 2010

అపర భగీరధుడి 207వ జయంతి ఈ రోజే !!




సర్ ఆర్ధర్ ధామస్ కాటన్ 207 వ జయంతి నేడే ! ఆయన భారతదేశంలో పుట్టకపోయినా ఈ దేశప్రజల
శౌభాగ్యం కోసం తపించాడు. ఈనాడు ఉభయ గోదావరీ జిల్లాలు సస్యశామలంగా ఉన్నాయంటే ఆ మహాను
భావుడి నిరంతర కృషే కారణం. గోదావరి జిల్లాల రైతులోకం కాటన్ మహాశయుణ్ణి మరో భగవంతునిగా ఈ
నాటికీ ఆరాధిస్తారు. మానవుడికి అమరత్వం అతను చేసిన కృషి వల్లే కలుగుతుంది. గోదావరిపై ధవళేస్వరం
లో ఆనకట్ట నిర్మించి కరవు కాటకాలను రూపుమాపాడు. క్రీ"శ" 1803 మే 15వ తేదీన ( ఈ రోజే ) ఇంగ్లాండు
లోని ’కాంబర్మిర్ అబీ’ అనే గ్రామంలో హెన్రీ, కాల్వెలీ కాటన్ దంపతులకు పదవ సంతానంగా కాటన్ జన్మిం
చాడు. 15వ ఏట మిలటరీ శిక్షణాలయంలో ఇంజనీర్గా శిక్షణ పొందాడు. పద్దెనిమిదోయేట ఈస్టిండియా కంపెనీ
వారిచే చెరువుల శాఖకు సంభందించిన సూపర్టెండెంట్కు సహాయకుడిగా నియమించబడ్డాడు. కొంతకాలం తరు
వాత కాటన్ ను గోదావరి సీమలో నిర్మాణాత్మక కార్యక్రమాన్ని సూచించడానికి నియమించారు. అందుకోసం
రాజమండ్రి వచ్చిన కాటన్ గోదావరిని పరిశిలించి పంపిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. 1847 ఏప్రియల్లో
నాలుగు భాగాలుగా ఆరోగ్యాన్నికూడా లెక్కచేయకుండా పన్నెమ్డు అడుగుల ఎత్తు గల రాతి కట్టడంతో ఆనకట్ట
నిర్మించాడు. 1852 మార్చి 31 నాటికి నిర్మాణం పూర్తిచేశాడు. నిర్మాణానికి ఐన ఖర్చు 16,60,000/- రూపాయలు.
ఆనకట్ట మొత్తం పొడవు 11,945 అడుగులు. దాదాపు వంద సంవత్సరాలు సేవలందించిన ఆనకట్ట పునాదులు
కుంగడంతో పాత ఆనకట్టకు నలభై మీటర్ల దూరంలో కొత్త ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. 141 కోట్ల ఖర్చుతో నిర్మిం
చిన బారేజ్ 1982 అక్టోబర్ ఇరవతొమ్మిదిన ప్రారంభించబడ్డది. దానికి సర్ ఆర్ధర్ కాటన్ బారేజీ గా పేరు పెట్టారు.
కరవు గోదావరి జిల్లాలనుంచి మాయమైందంటే అది కాటన్ పుణ్యమే ! అందుకే కాటన్ కీర్తి గోదావరీ జలాల్లో
కలకాలం నిలచి వుంటుందనటంలో సందేహంలేదు. ఆ మహను భావుడి జయంతి రోజున తెలుగు ప్రజలందరి
తరుఫున నమోవాకాలు తెలియజేస్తున్నాను.

Thursday, May 13, 2010

పేరడీ జ్యొతి పంచాంగం !!




శ్రీ సంక్షోభకృన్నామ సంవత్సర సగంపూర్ణశాస్త్రీయ
జ్యోతీ పన్చాంగమ్
1963 బాపు రమణగార్లు తమ మిత్ర బృందంతో ప్రారంభించిన "జ్యోతి" మాసపత్రిక ఉగాది
సంచికలో అనుభందంగా ఇచ్చిన పేరడీ పంచాంగం చదవడానికి చాలా సరదాగా వుంటుంది.
బాపురమణల ’ఇంకోతి కొమ్మచ్చి’లో ఈ పంచాంగం వేశారు. జ్యోతిలో ఆనాడు వేసిన
పంచాంగంలో వేసిన ప్రకటనలు కూడా నవ్వులు కురిపిస్తాయి. అలాటి ఓ ప్రకటన మచ్చుకి
చదవండి.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * **
బహుమతి ! బహుమతి ! !
అద్భుత మాయా స్పెషల్ సత్తు ఉంగరం
ఇది చేతి వేలుకు పెట్టుకొని, తలకు మందు రాసుకొన్నచో తలనొప్పి
పోవును. కోర్టులో జయము, అందమగు స్త్రీలు వశమూ,కీళ్ళ నొప్పులు
బస్సు కు డబ్బు లేనివారికి కాళ్ళ నొప్పులు, వీణ సితారు విధ్వాంసులకు
వేళ్ళ నొప్పులు . ఉంగరం వెల బేడ. స్పెషలు పావలా, ఎగస్ట్రా స్పెషలు
ఆరణాలు ! రెండు ఉంగరములు కొనినవారికి పదిహేను రూపాయల రోలీ
కెమేరా, ఇరవై ఐదు రూపాయల రిస్టువాచీ ఉచిత బహుమతి.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
ఈ పేరడీ ప్రకటన లాగానే ఇప్పుడు టీవీ చానల్లలో వస్తున్న తాయెత్తుల ప్రకటనలూ
వుంటున్నాయ్!!

అన్నట్లు మీకు ఈపాటికి తెలిసే వుంటుంది. భాపు రమణుల "కోతికొమ్మచ్చి" తెలుగు
అర్ధమై చదవటం రాని తెలుగువాళ్ళకోసం ఎస్ఫీ బాలు మధుర గాత్రంతో ఆడియో సిడీలు
గా విడుదలయ్యాయని.!!


Wednesday, May 12, 2010

నాకు నచ్చిన "వెన్నముద్దలు" !!

జనార్ధనునివెన్నముద్దలు’!! ఓ మంచి పుస్తకం

మీలో ఎవరైనా శ్రీ జనార్ధనమహర్షి వ్రాసిన వెన్నముద్దలు కవితల పుస్తకం
ఇంతవరకూ చదవకపోతే వెంటనే కొని చదవండి. నాకు ఆయన కవితలు
చదువుతుంటే ఓ మాంచి బాపూ బొమ్మ చూసిన ఆనందం ఇప్పటికీ కలుగు
తునే వుంటుంది.
వెన్నముద్దలు లో కొన్ని నవనీతాల్ని మీ ముందు వుంచుతున్నాను.
* మా అమ్మ
మా ఆవిడ
నా రెండు కళ్ళు
. . . . .
కళ్ళు
ఒకదానినొకటి
చూసుకోవు.
. . , , , .
* కడుపులో బిడ్డ
తిరగబడ్డాడు
పెద్దాపరేషన్
కోలుకోవడానికి
రెండేళ్ళు పట్టింది.
.. . . . .
ఇరవై రెండేళ్ళ తర్వాత
మళ్ళీ తిరగబడ్డాడు
ఇంకేం కోలుకుంటుంది.
* * * *
చివరిగా....
* మార్నింగ్ వాకులు
తక్కువై అతనికి,
ఈవినింగ్ వాకులు
ఎక్కువై ఆమెకి,
. . ,.. ,.
కడుపొచ్చింది.
ఇలాటి వెన్నముద్దలు ప్రతి పేజీలోను మిమ్మల్ని అలరిస్తాయి.ఆలోచింపజేస్తాయి.
అన్నిటికంటే ఈ పుస్తకంలో ప్రతి పేజీ పైన ఒక్కో కవి అపురూపమైన ఫొటోలు
వుంచండం జనార్ధన మహర్షి గారి అభిరుచికి, ఆ కవులపై ఆయనకున్న గౌరవాన్ని
అభినందించకుండా వుండలేం !


Sunday, May 09, 2010

అమ్మను సదా తలచుకొందాం ! !



అమ్మను తలచుకుందాం !
ఈ రోజు మాతృ మూర్తులందరినీ తలచుకొవాలసిన మంచిరోజు.ఈ నాడే కాదు కలకాలం
అమ్మను ఎలా మరచిపోగలం.. శ్రీ ముళ్లపూడి వెంకటరమణ తన సాహితీ సర్వస్వం మొదటి
సంపుటాన్ని తనని పెంచి పెద్ద చేసిన అమ్మ ముళ్లపూడి ఆదిలక్ష్మి గారితో బాటు తనను
తల్లిలా ఆదరించిన మహీపతి సూరమ్మ, కొవ్వలి సత్యవతి, చల్లా సీతా మహాలక్ష్మి,వీరఘంటం
సీతాబాయి, పున్నావఝుల (రేడియో) భానుమతి, మండలీక సుబ్బులక్ష్మి, శివలెంక కామాక్షమ్మ,
సత్తిరాజు సూర్యకాంతం ( బాపూ గారి అమ్మ గారు) ఈ మాతృమూర్తులందరికీ అంకితం ఇచ్చారు.
అమ్మను శ్రీ ఆత్రేయ చక్రవర్తి సంగీత దర్శకత్వంలో చక్రవర్తి పాడిన పాటను ఇలావ్రాశారు.
అమ్మంటే అమ్మ
ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ
రక్తాన్ని అర్పించి - ప్రాణాన్ని పూరించి
చేస్తుంది నీ బొమ్మ
మరణాన్ని ఎదిరించి - మరోసారి జన్మించి
ఇస్తుంది నీకు జన్మ
ధనం పోసి కొనలేము - రుణం తీర్చుకోలేము
అందుకే అమ్మ
విధి ఆడే ఆటల్లో - విడిపోయే బ్రతుకుల్లో
మిగిలేదే మమకారం
మిగులుండే మమతల్ని
తెగిపోని బంధాల్ని
కలిపేదే తల్లి రక్తం
తనకు కన్ను నీవైతే - నీకు రెప్ప తానౌతుంది
అందుకే అమ్మ
అమ్మంటే అమ్మ
ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ.
జగతిలోని అమ్మలందరికీ పాదాభివందనాలు !
అమ్మను అందంగా చూపించిన బాపూ గారికి కృతజ్నతలతో.......


Friday, May 07, 2010

మనసుకవి పుట్టిన రోజు




మనసుకవి ఆత్రేయ
శ్రీ కిళాంబి వేంకట నరసింహాచార్యులు నెల్లూరు జిల్లా మంగళంపాడులో 7-05-1921 తేదీన
జన్మించిన ఆయన పేరులోని ఆచార్య,గోత్రంలోనిఆత్రేయ, రెండూ కలిపి ’ఆచార్య ఆత్రేయ" గా
పేరు పొందారు. ఆత్రేయ నెల్లూరు మున్సిఫ్ కోర్టులో గుమాస్తాగా, "జమీన్ రైతు" పత్రికలో
సహాయ సంపాదకుడిగా పనిచేసారు. ఆయన గౌతమ బుద్ధ, అశోక సమ్రాట్, పరివర్తన,వాస్తవం,
ఎన్జీవో,ఈనాడు, విశ్వ శాంతి,కప్పలు,భయం,మనసువయసు మొదలైన నాటకాలు రచించారు.
ఆయన "దీక్ష" ( 1951) సినిమాతో పాటల రచయితగా "పోరా బాబూ పో..." అనే పాటతో సినిమా
రంగంలో ప్రవేసించారు. ఆనాటి నుంచి తిరుగులెని గీత రచయితగా దాదాపు నాలుగువందల
చిత్రాలకుపైగా మాటలు ,పాటలు రచించారు. ప్రేమనగర్,డాక్టర్ చక్రవర్తి,మాంగల్యబలం, మనుషులు
మమతలు, విచిత్రబంధం,అర్ధాంగి,అదృష్టవంతులు,ఆత్మబలం,చిలిపికృష్ణుడు,బంగారు బాబు,పునర్జన్మ,
చక్రవాకం,మంచివాడు,మూగమనసులు ( ఈ చిత్రంలో కొన్ని మాటలు ముళ్లపూడి రచించారు),జీవన
తరంగాలు మొ" పేరుతెచ్చిన చిత్రాలు.
’తోడి కోదళ్ళు’ చిత్రంలో ఆయన రాసిన ’కారులో షికారు కెళ్ళే’ పాటను చాలామంది శ్రీశ్రీ రచన
అని అనుకోవడం జరిగింది పాటలు సరైన టైముకి వ్రాసి ఇవ్వక నిర్మాతలను, వ్రాసాక శ్రోతలను ఆత్రేయ
ఏడిపిస్తారని ఆయన గురించి పరిశ్రమలో చమత్కరించే వారు. 13-9-1989 న ఆయన మద్రాసులో
కీర్తిశేషులయ్యారు.
ఈ రోజు , మే 7 వ తేదీ ఆయన జయంతి నాడు మనసుకవిని స్మరించుకొందాం.
వోల్గా వీడియోస్ సౌజన్యంతో ప్రేమనగర్ చిత్రం లోని ఓ ఆత్రేయ గీతం మీకోసం.

Thursday, May 06, 2010

జానపద నవలా సామ్రాట్ దాసరి సుబ్రహ్మణ్యం "రచన" ప్రత్యేక సంఛిక



రచన దాసరి సుబ్రహ్మణ్యం స్మృతి సంచిక
చందమామ అభిమానుల కోసం "రచన" మే నెల సంచిక 244 పేజీలతో
వెలువడింది. ఇందులో చందమామలో తోకచుక్క, మకరదేవత లాంటీ అద్భుత ధారా
వాహికలను వ్రాసిన జానపద నవలా సామ్రాట్ దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి
కొదవటిగంటి రోహిణీ ప్రసాద్,డా.వెలగా వెంకటప్పయ్య, వసుంధర, యండమూరి వీరేంద్ర
నాధ్, మన తెలుగు చందమామ బ్లాగు నిర్వహుకులు శివరామప్రసాద్ కప్పగంతు,
చందమామ డాట్ కమ్ కె.రాజశేఖరరాజు, ,రచన శాయి మొదలయిన చందమామ
ప్రేమికుల రచనలతో బాటు అలనాటి చందమామ చిత్ర కారుడు "చిత్రా" గారి చిత్రాలు,
వారిపై ఈనాటికీ బొమ్మలు గీస్తున్న శ్రీ శంకర్ గారు వెలిబుచ్చిన జ్ణాపకాలు పొందుబరచ
బడ్డాయి. చందమామ అభిమానులు కలకాలం పదిలపరచుకోవాల్సిన ఈ "రచన" సంచికను
ఈ రోజే కొనుక్కోండి.. మీకు స్ధానికంగా దొరకక పోతే rachanapatrika@gmail.com కి
మైల్ చేసి తెప్పించుకోండి.

Sunday, May 02, 2010

నవ్వాలీ నవ్వాలీ !! మీ నవ్వులు అందరికీ ఇవ్వాలీ !!



నవ్వాలీ నవ్వాలీ !! మీ నవ్వులు అందరికివ్వాలి !!!

ఈ రోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం ! అసలు కొందరు అసలు నవ్వినట్లు కనిపించరు.
ఉదాహరణగా చెప్పుకోవాలంటే "హాస్యబ్రహ్మ" భమిడిపాటి కామేశ్వరరావుగారి గురించే
చెప్పుకోవచ్చు. ఆయన చూడటానికి చాలా సీరియస్ గా అగుపించేవారు. కాని ఆయన
ఎన్నో హాస్యరచనలు చేశారు. రోడ్డు మీద ఎవరో అరటిపండు తొక్క మీద కాలేసి జారి
పడ్డారనుకోండి. అప్పుడూ నవ్వు రావచ్చునేమో కాని అది హాస్యమనిపించుకోదుగదా.
కొంతకాలంవరకు తెలుగు సినిమాల్లో ఓ కామేడియన్ మరో వ్యక్తిని కాలితో తన్నితే
అదీ హాస్యంగా చలామణి ఐపోయింది. ఇక ఇప్పుడు హాస్యమంటె బూతుకు పర్యాయ
పదమైపోయింది. ఒకనాటి మన తెలుగు సినిమాల్లొ రేలంగి తెరపై అగుపించగానే జనం
గొల్లున నవ్వే వాళ్ళు. ఇక హాస్య నటుల పాత్రలుకూడా కధలోని ముఖ్య పాత్రల్తో కలసి
సాగిపోయేవి. రేలంగి,రమణారెడ్డి పాత్రలకు ఉండే హాస్యగీతాలు కూడా సందేశాత్మ్కంగా
వుండేవి. ఇక్కడ మీరు "రాముడు-భీముడు" చిత్రం లో రేలంగిరిజలపై చిత్రీకరించిన
’సరదా సరదా సిగరెట్టు’ అన్న పాటను చూడండి. హాస్యానికి తోడు సిగరెట్ చేసే మంచీ
చెడులను కొసరాజుగారు అద్భుతంగా వ్రాసారు.
ప్రముఖుల చమత్కారాలు కూడా నవ్వును పుట్టిస్తాయనడానికి ఇవే మంచి
ఉదాహరణలు. శ్రి దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య ఓ సారి జట్కాలో వెలుతున్నారట. ముందు
వైపు బరువు చాలక జట్కా వాడు "కొంచెం పైకి రండి సార్" అని అంటే "ఇంతకాలానికి
నువ్వొక్కడీవి కనిపించావురా ఆంధ్రదేశంలో తోటి ఆంధృణ్ణి పైకి రమ్మన్నవాడివి" అంటూ
మెచ్చుకొన్నారు !. భమిడిపాటి కామేశ్వరరావుగారికికూడా తెలుగువాళ్ళపై ఇలాటి
అభిప్రాయమే వుండేది. ఆయన ఓ సంధర్భంలో "తెలుగువాడు దుర్యోధనుడి లాంటి వాడు.
దుర్యోధనుడు తనకేమీకావాలని అడగడు. ధర్మరాజుకి మాత్రం ఏమీ ఉండకూడదని కోరు
కుంటాడు" అని అన్నారు.
మీకు కొన్ని నవ్వుల చిట్కాలు!
ఉదయాన్నే లేచాక మంచి జోకులు పుస్తకం చదవండి. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.
మీకు తెలిసిన జోకులను ఇతరులతో పంచుకోండి. మీరూ మీ ఊళ్ళో "హాసం క్లబ్" ప్రారంభించండి.
నెలలో మూడో ఆదివారం ఏర్పాటు చేయండి. మీకు ఎందరో కొత్త కొత్త హాస్య ప్రియులు పరిచయ
మవుతారు. మీకు పత్రికల్లో బాగానచ్చిన కార్టూన్లను కత్తిరించి ఓ ఆల్బమ్ తయారు చేయండి.
అప్పుడప్పూడూ ఆ పుస్తకం తిరగేస్తుంటే మనసు ఉత్సాహంగా వుంటుంది. ఇక ఈ నవ్వుల రోజుకు
సెలవు తీసుకుంటూ ఆఖరుగా ఓ చిన్న జోకు...
"ఏవిటోయ్, అప్పారావ్, సుబ్బారావు అంత మంచి జోక్ చెబితే మేమంతా నవ్వేంకదా, నువ్వు
నవ్వవేం?" అడిగారు మితృలు.
" వాడంటే నాకు వళ్ళు మంట ! ఇంటికి వెళ్ళి నవ్వుకుంటా" అన్నాడు అప్పారావు..