Wednesday, December 19, 2012

తెలుగు తల్లికి వందనం !!

                 ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు మాట వినిపిస్తున్నది. కారణం మన ప్రభుత్వం
తెలుగు మహా సభలు నిర్వహించడానికి నిర్ణయించడమే. ఓ నాడు తెలుగు అంటూ
ఆనాటి యన్టీఆర్ తెలుగును ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రవేశ పెడుతుంటే ఈనాటి
నాయకులు కొందరు తెలుగు తెగులంటూ వేళాకోళం చేస్తే మనమూ నవ్వుకున్నాం
అవును నవ్వమా ,మనం తెలుగోళ్ళం కదా !!
        గోదారి జలాలలో
        ఆ తీయదనమేమి ?
        నన్నయ గంటమ్ము కడిగెనాడేమో !
        పినాకిని పదచాలనములో
        ఆ విలాసమేమి ?
        తిక్కన భారత విన్యాసమేమో !
        కృష్ణా తరంగాలలో
        ఆ సంగీతమేమి ?
        ఎర్రన పద్యాల ఆలాపనేమో !
        పోతన పదాలలో
        ఆ మాధుర్యమేమి ?
        అక్షరాలకమృతము అద్దినాడేమో !!
ఇంతటి తెలుగు అమ్మంటే మనకు నామోషీ
మమ్మీ అంటూ పిలిస్తే ఎంతో ఖుషీ ఖుషీ !!

        బ్రిటిష్ దేశస్తుడైన బ్రౌన్ తెలుగు భాషను నేర్చుకొని, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు
తయారు చేశాడనీ, మన వేమన పద్యాలను  తన భాషలోకి అనువాదం చేశాడని ఎంత
మంది ఈకాలం పిల్లలకు తెలుసు. వాళ్ళకు తెలియడానికి వాళ్ళ తల్లిదండ్రులకు
తెలిస్తేగదా !బ్రౌనంటే ఎవరంటే అదో రంగు అని ఈ మద్యే కాన్వేంటులో తన పిల్లల్ని
చదివిస్తున్న ఓ పెద్దమనిషి. జవాబిచ్చాడు.
     తెలుగు భాషలో వున్న అందం, మాధుర్యం మరో భాషకు లేదనే చెప్పాలి. తెలుగుతో
ఎన్నెన్నో చమత్కారాలను సృష్టించవచ్చు. ఒకే మాటకు వేరు వేరు సంధర్భాలలో
వేరు వేరు అర్ధాలు వస్తాయి. దీనితో ఎంత హాస్యానైనా పుట్టించవచ్చు. ఆనాటి తెలుగు
సినిమాలలో నటినటుల ఉచ్చారణ, రచయితలు వ్రాసిన మాటలు తెలుగు భాష
అందాన్నిచాటి చెప్పాయి. అక్కినేని అంటారు, చదువురాని నేను అంత చక్కగా మాటలు
చెప్పానంటే ఆనాటి దర్శకులు, కవులూ అని. ఈనాటి దర్శకులకు తెలిస్తేకదా నటులకు
చెప్పడానికి.

        ఇప్పుడు పొరబాటున తెలుగు మాట్లాడే తెలుగు వాళ్ళుకూడా గమ్మత్తు తెలుగు
మాట్లాడుతున్నారు. మీరు గమనించివుంటారు. ప్రతి రెండు పదాలకూ అండ్, అండ్
అంటుంటారు. దేనికో, బహుశ: అదో ఫ్యాషన్ కాబోలు. మాటలు రాని వాడెవడో
తడబడుతూ మాట్లాడితే అదే సరైనదనుకుంటుంన్నారు. ఇక మన ప్రభుత్వం
తెలుగును ఎంత ఖూనీ చేస్తున్నదో అన్న దానికి నిదర్శనం ఇటీవల ప్రత్యక్ష
మవుతున్న ప్లాస్టిక్ బోర్డులు. అవి కూడా తయారు చేయించింది ప్రభుత్వ విద్యా
శాఖ !! ఉదాహరణకు కొన్ని :-
    విద్వామా హక్కు,  సర్వశిక్షాఅభియాన్,  అంధ్రప్రదేశ్ !!
 దయచేసి తెలుగు మీ పిల్లలకి నేర్పండి. మీరూ తెలుగు పుస్తకాలు తీసు "కొని"
చదవండి. మీ పిల్లలకి తెలుగు పుస్తకాలు కానుకగా ఇవ్వటం అలవాటు చేసు
కోండి. ఆచార్య జి.ఎన్.రెడ్డి గారు వ్రాసిన తెలుగు పర్యాయపద నిఘంటువును
ఒకసారి చూడండి. తెలుగులో ఎన్నెని పర్యాయపదాలున్నాయో తెలుస్తుంది.

Monday, December 17, 2012

రాజమండ్రి గోదావరినదిపై ఆలనాటి హేవలాక్ వంతెన పై ప్లీజ్ హావ్ ఏ లుక్ !!



           ఎన్నో ఏళ్ళుగా మూత పడిన ఈ అందాల అలనాటి వంతెన నిరుపయోగంగా వుంచకుండా
      వందేళ్లనాటి ఇంజనీరింగ్ ప్రతిభకు గుర్తుగా ఈనాటి తరం మరచిపోకుండా సుందరంగా తీర్చి
      దిద్దితే బాగుంటుందని ప్రజలు, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఇంతవరకూ
      ప్రయత్నాలు ఏ మాత్రం ముందుకు సాగటంలేదు. స్థానిక ప్రజాప్రతిధినులు కేంద్రంలో, రాష్ట్రం
      లో ఒకే పార్టీకి చెందినా  ఎందుకో ఈ విషయంలో శ్రర్ధ వహించటంలేదు. పర్యాటక మంత్రిగా
      పదవిలో వున్న చిరంజీవి ఈ విషయంలొ చూపుసారించాలి. . మొన్ననే వచ్చిన
      మన రాష్ట్రానికే చెందినన రైల్వే సహాయ మంత్రి గారు కూడా ఈ విషయంలో పెదవి విప్పక
      పోవటం  అత్యంత విచారకరం.ఆనాటి బ్రిటిష్  ఇంజనీర్ హేవ్ లాక్ సారధ్యంలో మూడేళ్ళ
      అతి స్వల్పకాలంలో ఈ వంతెన నిర్మింపబడటం విశేషం.
       1897 నవంబరు లో నిర్మాణం ప్రారంభమైన ఈ వంతెన ఆగస్టు 30 వతేదీ,1900  సంవత్సరం
      రైళ్ల రాకపోకలకు  ప్రారంభించబడింది. ఇక్కడ మీరు ఆనాటి శిలాపలకాన్ని చూడొచ్చు. !!
      పుష్కర్ ఘాట్ వద్ద ఇప్పటికీ ఆ శిలాఫలకం పదిలంగా వుంది.
   



      ఇదే మరో ఏ దేశమైనా, అంతెందుకు మనదేశంలోని మరో రాష్ట్రమైనా ఈ వంతెన గురించి
     శ్రర్ధ తీసుకొనే వారు. ఏం చేస్తాం మనం తెలుగువాళ్ళం. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని
     ఆరోజుల్లో మూడేళ్ళ స్వల్పకాలంలోఅనుకున్న దాని కంటే తక్కువ వ్యయం తో నిర్మించిన
     ఈ వంతెన దాదాపు వందేళ్లకు పైగా సేవ లందించింది.ఈ.వంతెనను స్మతి చిహ్నంగా పదిల
     పరచుకోవసిన భాధ్యత మనందరీదీ !!

Sunday, December 16, 2012

వాల్ట్ డిస్నీని చిరంజీవిని చేసిన మిక్కీమౌస్

జీవంలేని బొమ్మల్ని జీవంపోసి కదిలే బొమ్మలుగా చేసిన వాల్ట్ డిస్నీ పేరు
తెలియని వారుండరు. ప్రపంచ ప్రముఖ దేశాలలో నిర్మించిన డిస్నీ వరల్డ్
వేలాది సందర్శకులతో ప్రతి రోజూ సందడిగా కళకళలాడుతూంటుంది!
వాల్టర్ ఎలియాస్ డిస్నీ చికాగోలో 1901 డిసెంబరు  5 న జన్మించాడు.
అరువు తెచ్చుకున్న కమెరాతో "డిస్నీ లాఫ్-ఓ-గ్రామ్స్" పేరిట చిన్నచిన్న
కార్టూన్ సినిమాలను ప్రకటనల నిమిత్తం తయారు చేయటం మొదలెట్టాడు.
వాటిని సినిమా ప్రదర్శన ముందు ధీయేటర్లలో చూపించేవారు.

ఆయన సృష్ఠించిన  మిక్కీమౌస్, డొనాల్డ్ డక్, గూఫీ మొదలైన పాత్రలు
పిల్లల్ని పెద్దల్ని విపరీతంగా ఆకర్షించాయి. ఇప్పట్లా కంప్యుటర్ పరిజ్ఞానం
లేని రోజుల్లో కార్టూన్ చిత్ర నిర్మాణం చాలా శ్రమతో కూడిన పని. బొమ్మ
లోని ప్రతి కదలికనూ చిత్రాలలో చూపిస్తూ కొన్ని వేల బొమ్మలు వేసి
ప్రతి ఫ్రేమును చిత్రీకరించాలి. కొద్ది నిడివిగల చిత్రాల్నే కాకుండా డిస్నీ
పూర్తి నిడివి చిత్రాలైన సిండ్రిల్లా, స్నోవైట్ లాంటి కార్టూన్ చిత్రాలు 
నిర్మించటమే కాకుండా ఆ చిత్రాలకు ప్రతిష్టాకరమైన అకాడమీ అవార్డులు
పొందాడు...ఆయన 1928లో " స్టీమ్ బోట్  లిల్లీ" అన్న మిక్కీ మౌస్
చిత్రాన్ని నిర్మించాడు.. కార్టూన్ చిత్రాల నిర్మాణానికి దశ దిశ చూపిన
వాల్ట్ డిస్నీ 1966 డిసెంబరు 15 న కీర్తిశెషుడయ్యాడు. ఇప్పటికీ
వాల్ట్ డిస్నీ సంస్థ తరఫున చిత్రాలు నిర్మింపబడుతూనే వున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా వున్న డిస్నీల్యాండ్ అన్ని వయసులవారినీ
ఈనాటికీ ఆకర్షిస్తూ డిస్నీని  చిరంజీవిని చేశాయి !!

Saturday, December 15, 2012

కొంటె బొమ్మల బాపుగారి పుట్టిన రోజు


         1933 డిసెంబరు 15న నర్సాపురంలో సత్తిరాజు లక్ష్మీనారాయణ
అనే అబ్బాయి పుట్టినప్పుడు బాపులా మారిపోయి అందమైన
బొమ్మాయిల సృష్ఠికర్త అవుతాడానీ, తెలుగు భాష రాత, గీత
రెండూ మారిపోతాయని తెలుగుజాతి ఖ్యాతి ఖండాంతరాలలో
వెలిగే సిన్మాలు తయారవుతాయనీ ఊహించి వుండరు. ఈనాడు
బాపుగారి అందాల అక్షరాలు కంప్యూటర్ ఫాంట్లుగా రూపుదిద్దు
కొన్నాయి. రాదుగా ప్రచురుణ సంస్థ (రష్యా) "అందాల అఆలు" అనే
 బాపుగారి తెలుగుఅక్షరాల పుస్తకాన్ని ప్రచురించందంటే తెలుగు
 వాళ్ళంగా మనమెంత అదృష్టవంతులం.

                      బాపుగారి తొలిబొమ్మ బాలన్నయ్య,బాలక్కయ్యల పిల్లల పత్రికలో
తొలిసారిగా1945లో అచ్చయింది. బాపు జంట ముళ్లపూడి వెంకట
రమణగారి తొలి రచనకూడా అప్పుడే "బాల"లో వచ్చింది.

              సాధారణంగా ఓ చిత్రకారుడు కార్టూనిస్ట్ గానో, మంచి తైల, నీటి వర్ణ
చిత్రకారుడిగానో ఏదో ఒక రంగంలోనే ప్రతిభావంతుడవటం చూస్తాం.
కాని, బాపు తన చిన్ననాటి  ఆర్ట్ స్కూల్లో చేరాలన్న కోరిక తీరకపోయినా
  అసమామనచిత్రకారుడిగా పేరుపొందారు. .దేముళ్ళందరూ మేమింత
అందంగా వుంటామని బాపుగారి బొమ్మలద్వారా తెలిపారు.

               శ్రీ ఆరుద్ర బాపు గురించి తన కూనలమ్మ పదాల్లో ఇలా అన్నారు.
             కొంటె బొమ్మల బాపు
             కొన్నితరముల సేపు
             గుండె వుయ్యెల నూపు
             ఓ కూనలమ్మా!
నిజమే శ్రీ బాపు కొన్ని తరాలదాకా అభిమానులను తన చిత్రాలద్వారా
అలరిస్తూనే వుంటారు. శ్రీ బాపు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Saturday, December 08, 2012

రోజులు మారాయ్ !!

             రోజులు మారటమే కాదు చాలా తొందరగా రోజు రోజుకూ మారిపోతున్నాయ్. అప్పుడే మరో
మూడు వారాలకు కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేస్తున్నాం. మా రోజుల్లో పిల్లల దగ్గర నుంచి
పెద్దలదాకా జీవనం ఇంత వేగంగాలేదు. మేం స్కూల్లో చదువుతున్నప్పుడు పరీక్షలయ్యాక
హాయిగా సెలవులుండేవి. ఇక స్కూలు మరచి పోయి మామయ్య ఊరికో, నాయనమ్మవూరికో
వెళ్ళి గడిపేవాళ్ళం. ఇప్పుడు LKG పిల్లలకూ , వాళ్ల తల్లితండ్రులకూ తీరెకే లేదు. ఇక్కడ మీరు
చూస్తున్న మేడ కు( రాజమండ్రి)  నాకు నాలుగేళ్ళ వయసప్పుడు అద్దెకు వచ్చాము. నేను,
అక్కయ్య, చెల్లాయి ఈ ఇంట్లోనే ఎలిమెంటరీ చదువు నుంచి పై చదువులుదాకా పూర్తి చేశాం.
తరువాత మానాన్నగారు స్టేట్ బ్యాంకులో ఇంకో ఆర్నెల్లకు రిటైరవుతారనగా మా సొంత వూరు
బాపట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. తిరిగి నేను బ్యాంకులో ఉద్యోగంలో చేరాక 1972 లో
రాజమండ్రి వచ్చాక అదే ఇంట్లో సొంత ఇల్లుకొనుక్కునేదాక  మా పిలల్తోవున్నాము. అంటే ఈ
మేడలో మూడుతరాల వాళ్లము వున్నామన్న మాట. ఈ మేడ క్రింద గోడౌన్లుండేవి. పైన పెంకుల
పెద్ద ఇల్లు. పై వరండాలో చెక్క కిటికీల తలుపుల చెక్కలు కదిపితే తెరచుకొనేవి. లోపల చాలా
పెద్ద హాలు ఆ హలుకు రెండు వైపులా రెండేసి గదులు, మొత్తం నాలుగు గదులుండేవి. మేడ
మీదకు వెళ్ళటానికి చెక్క మెట్లుండేవి. పైన పెంకులు కనిపించకుండా గదులపైన చెక్కతో సరంబీ
( ఇప్పటి ఫాల్స్ సీలింగన్నమాట) వుండేది. ఆ ఇంటి ఫొటో తీద్దామనుకుంటుండగానే రెండేళ్ళక్రితం
పడగొట్టి షాపింగ్ కామ్ప్లెక్స్ గామార్చారు.. మనసులో బాగా నాటుకు పోయిన ఆ ఇంటి బొమ్మను
అచ్చు అలానే గీయగలిగాను.
 ఆ రోజుల్లో మాకు వినోదం కొతకాలం వరకూ గ్రామఫోను, అటు తరువాత రేడియో.
మా చిన్నపటినుంచే ఈ బొమ్మలో చూపిస్తున పెద్ద గ్రామఫోనుండేది. తరువాత
1947లో మా నాన్నగారు STEWART WARNER అనే అమెరికన్ రేడియో
కొన్నారు. అప్పుడే ఆ గ్రామఫోనూ రికార్డులూ అమ్మేశారు. నాకింకా బాగా గుర్తు
కొనుక్కున్న వాళ్ళు గ్రామఫోను తీసుకు వెల్తుంటే నేను చాలా గొడవ చేశాను.
అక్కయ్య రేడియోలో మంచి పాటలు, పిల్లల పోగ్రాములూ వస్తాయిరా అని చెప్పి
మరపించింది. రేడియోలో ఏ మైనా మంచి పాట వస్తే ఆ పాటనుమళ్ళీ పెట్టమని
గోలచేసేవాడిని. గ్రామఫోనులా అలా కుదరదురా అని అక్కయ్య చెప్పేది. ప్రతి ఆది
వారం మధ్యాహ్నం 2-15 నుంచి ౩-౦౦ గంతలవరకూ రేడియో అక్కయ,అన్నయ్యల
పిల్లల ప్రోగ్రాములోచ్చేవి. చుట్టుప్రక్కల పిల్లలంతాఆ సమయానికి మా ఇంటికి చేరే
వాళ్ళు. చాలా సందడిగా వుండేది. ఆ ప్రోగ్రాములో పొట్టిబావ-చిట్టిమరదలూ, తాతయ్య,
మొద్దబ్బాయి మాటలు, కబుర్లూ చాలా బాగుండేవి. మేం పెద్దయ్యాక సాయంత్రం
సిలోన్ లో శ్రీమతి మీనాక్షీ పొన్నుదొరై నిర్వహించే తెలుగు సినిమా పాటలు స్కూలు
నుంచి రాగానే వినే వాళ్ళం. అటు తరువాత ప్రతి బుధవారం రాత్రి ఎనిమిదింటికి
రేడియో సిలోన్లో అమీన్ సయాని అద్భుతంగా నిర్వహించే.బినాకా గీత్ మాలా వినే
వాళ్ళం. అప్పటిరోజుల్లో మాకు అవే వినోదాలు. ఆదివారం తెలుగు సినిమాలు సంక్షిప్త
శబ్దచిత్రాలుగా వచ్చేవి. ఇక బాల, చందమామ విడవకుండా చదివే వాళ్లం .బాల
పత్రికలు దాచుకోలెదు కాని అప్పటి చందమామలు ఇప్పటికీ నా దగ్గర వున్నాయ్.
 మా చిన్నప్పుడు వంటకు కుంపట్లు వాడేవారు. బొగ్గుల కుంపటి అన్నమాట  ! బొగ్గుల కుంపటిలో
నెమ్మదిగా కాగిన పాలు చాలా రుచిగా వుండేవి. పులుసు చేయడానికి రాచ్చిప్పలు (అదో రకం
రాయి చెక్కి చేసేవారు) వాడేవారు. అందులో కాగిన పులుసు , చారు చాలా రుచిగా వుంటుందనే
వారు. ఇప్పటిలా నాన్ స్టిక్ పాన్లూ వుండేవి కావి. కూరలూ, పిండి వంటలకూ బాండీ ( బూరెల
మూకుడు) వుపయోగించే వారు. పచ్చళ్ళు చేయడానికి , గారెల పిండి రుబ్బటానికి రోలూ-పొత్రం
వాడేవారు. రోట్లో మా అమ్మగారు చేసిన కంది పచ్చడి రుచే వేరుగా వుండేది..ఇప్పట్లా ప్రెషర్ కుక్కర్లు
లేకపోయినా ఆ రొజుల్లో మా ఇంట్లో రుక్మినీ కుక్కర్ అని వుండేది. గిన్నెలో నీరుపోసి, ఒక గిన్నె మీద
మరో గిన్నె పెట్టి పైన మరో గిన్నె బోర్లిస్తే ఆవిరితో అన్నం ,పప్పూ, కూరలూ వుడికేవి. కానీ దాదాపూ
గంటదాకా పట్టేది.
 అటుతరువాత మా  నాన్నగారు  ఇంగ్లాండులో తయారయిన ఫాక్స్ కిరోసిన్  స్టవ్, మద్రాసు పాపట్
జమాల్ షాపు నుంచి కొన్నారు. ఇప్పటి గాస్ స్టవ్వులా రెండు పొయ్యిలు దానిలో రిబ్బన్ షేపులో
మెటలుతీగతో అల్లిన కాటన్ వత్తులూ , కిరోసన్ రావటానికి ఓ పెద్ద  గ్లాసు సీసా వుండేది. కిరోసిన్, సీసాలో
పోసి బోర్లించి పెడితే స్టవ్వులోకి కొద్ది కొద్దిగా వెళుతూ స్టవ్వు వెలిగేది. కిరోసిన్ ఫ్లో తగ్గించి హెచ్చించ
టానికి కంట్రోలు నాబ్స్ స్టవ్వుకు వుండేవి. కిరసిన్ వెల్తున్నప్పుడల్లా సీసాలో బుడగలు వచ్చేవి. మాకు
ఆ బుడగలు చూడటం అదో సరదా!
  ఆ రోజుల్లో ఇప్పటిలా వాటర్ హీటర్లు, గీజర్లూ లేవు. నీళ్ళను రాగి కాగుల్లో కట్టెల పొయ్యిమీద
 కాచే వారు.తరువాత మేము రాగి బాయిలర్ కొన్నాము.  దీనిలో పాత్ర మధ్యలో రాగి గొట్టం
 వుంటుంది. చుట్టూ నీళ్ళతో నింపి మధ్య గొట్టంలో బొగ్గులు వేసి వెలిగిస్తే వేడికి చుట్టూ వున్న
  నీళ్ళు మరుగుతాయి. వేడి నీళ్ళను పట్టుకోడానికి వీలుగా టాప్ వుంటుంది.

నేను 1981 లో నా గ్రామఫోను కోరిక తీర్చుకోడానికి  ఫిలిప్స్ స్టీరియో రికార్డు ప్లేయర్
  కొన్నాను. ఐనా నాకు నా చిన్ననాటి కీ ఇస్తే పనిచేసే గ్రామఫోను అంటే మక్కువ పోలేదు.
  మా అబ్బాయి అలాటి పాతకాలం గ్రామఫోను కొని నా పుట్టిన రోజు కానుకగా ఐదేళ్లక్రితం
  ఇచ్చాడు. ఈనాడు సిడీలు, విసీడీ, డివీడీలొచ్చినా నాకు మాత్రం ఆ పాతకాలం రికార్డులూ,
  విసీఆర్లూ అంటే ఇంకా మక్కువ పోలేదు. ఎంతైనా పాతకాలం వాడినికదా !!

Friday, December 07, 2012

సినీ ధాత్రి-అభినేత్రి సావిత్రి

            ఎంతోమంది   తెలుగు తారలు సినీ ఆకాశంలో  ఇప్పటివరకు మెరిసినా సావిత్రి మాత్రం
 దక్షిణబారత వెండితెరపై ధృవతారగా వెలిగింది, మిగిలింది.  ఈ తరం తారలు తమ ఒళ్ళు
 చూపటమే , తమ నటనగా భావిస్తే సావిత్రి తన కళ్ళతో, పెదాల కదలికతో శృంగారం,
 విషాదాన్నీ నటించి చూపించి ప్రేక్షకులను కదలించిన మహానటి. నా 12 ఏళ్ళ వయసులో
 1953 లో దేవదాసు రాజమండ్రి అశోక్ మహల్లో విడుదలయింది. శతదినోత్సవం జరిగిన
 సమయంలో గోదావరి వరదలొచ్చాయి. మా మేనమామగారు అప్పుడు ఐ యల్ టీ డీ లో
 ఉన్నతోద్యోగిగా పనిచేసేవారు. ఆల్కాట్ గార్డెన్స్ అంతా వరదనీటిలో మునిగిపోవటం వలన
 కుటుంబమంతా దానవాయిపేటలోని ఓ జమీందారుగారి భవంతిలోకి మారారు. అదే భవనం
 మేడ మీద  దేవదాసు తారలంతా బస చేసారు. అప్పుడు నేను , మా బావతో కలసి మా
 నాన్నగారు తయారు చేసిన ఆల్బంలో సావిత్ర్రిగారి సంతకం తీసుకున్నాను. నాగేశ్వరరావు,
 ఇతర తారల బొమ్మలు కాగితం అరవైఏళ్ళు అవటం వల్ల చినిగిపోయినా సావిత్రి బొమ్మ
 సంతకం ఈనాటికీ మిగలడం ఓ వింత.
 సంసారం చిత్రంలో ఓ చిన్న పాత్రలో "టకు టకు టముకల బండి, కూర్చున్నాడో విగ్రహమండీ"
అనే పాటలో నాగేశ్వరరావును టీజ్ చేస్తున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయిగా అగుపించిన
సావిత్రి అటుతరువాత అదే హీరో ప్రక్క ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల
అభిమాన జంటగా కలకాలం నిలచిపోయారు.

     తమిళచిత్రాలలో నటించి తమిళ తంబీల అభిమాన నటిగా పేరు పొంది ఎన్నో తమిళ చిత్రాల్లో
నాయకుడిగా నటించిన జెమినీ గణేశన్ న్ను వివాహమాడింది.(ఫొటోలు: విజయచిత్ర 1967 విశేష
సంచిక సౌజన్యంతో)
             ఆమె శరీరం ఎంత భారీగా మారినా ప్రేక్షకులకు  ఆమె అద్భుత నటన ముందు అదేమీ గుర్తుకు
రాలేదు. అందుకే బాపుగారు తమ  "బాపు కార్ట్యూనులు"లో " నిండైన విగ్రహం, నటనలో నిగ్రహం
అంటూ చమత్కరించారు. మరువలేని మరపురాని నటీమణి సావిత్రి.
(శ్రీ బాపు గారికి కృతజ్ఞతలతో)

Tuesday, December 04, 2012

అసలుపేరు గానలోల-మారుపేరు ఘంటసాల !

                              ఘంటసాల మాస్టారుగారి  90 వజయంతి నాడే కాదు ఆయన మధురగానం
                              ప్రతితెలుగింటా ప్రతిదినం ఏదో ఒక సమయంలో వినిపిస్తూనే వుంటుంది.
                              ఆయన గళం చిరంజీవి. పద్యమైనా, శ్లోకమైనా, హాస్యగీతమైనా, శృంగార
                              గానమైనా, విషాదగీతమైనా, భక్తి పాటైనా శ్రోతలను ఈనాటికి మైమరిపిస్తూనే
                              వుంటుంది. పాటలతో నటుల నటనకు మరింత నిండుదనం తెచ్చిన ఏకైక గాన
                              విశారదుడాయన.
                                 మధుర గానలోల ఘంటసాల అంటూ ఆయన పై శ్రీ దుర్భా శ్రీరామమూర్తి
                                 గేయ కవితాశతకం రచించారు!
                                      కలతపడితే మాకు నీపాట కావాలి
                                      కునుకుపడితే మనసు సేదదీరాలి
                                      కలవరింతలు కలల సౌఖ్యాలనివ్వాలి
                                      మధురగానలోల ఘంటసాల
                               తోటి గాయనీగాయకులతో శ్రీ ఘంటసాల- అపురూపమైన ఫొటొ .-హాసం సౌజన్యంతో
                                       యన్టీఆర్, ఏయన్నార్లతో !!

                                        శ్రీ బాపు కార్ట్యూన్ అసలు పేరు గాన లోల, మారుపేరు ఘంటసాల !!
                                   నన్నుదోచుకొందువటే వన్నెల జవరాల- సినారే తో ఘంటసాల మాస్టారు