Saturday, May 07, 2011

శ్రీ కిళాంబి వేంకట నరసింహాచార్యులవారి జయంతి


మనసుకవిగా పేరుపొంది అభిమానుల మనసులు దోచుకున్న ఆత్రేయగారి జయంతి నేడు.
రాయక నిర్మాతలను, రాసి ప్రేక్షకులను ఏడిపిస్తారని ఆయన గురించి చమత్కరిస్తారు.
ఆయన వ్రాసిన ఎన్నో పాటల చరణాలు వింటే చాలు, ఆ పాటల సాహిత్యం కలకాలం
మన మనసులనుంచి చెరిగిపోవు. అలానే ఆయన సంభాషణలు అందించిన ప్రేమనగర్,
డాక్టర్ చక్రవర్తి,మాంగల్యబలం, మనుషులు మమతలు, అర్ధాంగి, విచిత్రబంధం,ఆత్మబలం,
చిలిపికృష్ణుడు, పునర్జన్మ, చక్రవాకం, మూగమనసులు ( శ్రీ ముళ్లపూడి వెంకట రమణ
గారితో) మరువలేని కమనీయ చిత్రాలు.
ఆయన వ్రాసిన పాటలలో కొన్నింటిని గుర్తు చేస్తాను. పాటల్లోని పదాలు తేలికగా
అగుపిస్తాయి, కానీ బరువైన భావంతో హృదయాల్ని కదలిస్తాయి ,కరగిస్తాయి.
వద్దురా కన్నయ్యా...వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇల్లు వదలి పోవద్దురా అయ్యా..అయ్యా
పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పసిపాపలను బూచి పట్టుకెళ్ళే వేళ.... (అర్ధాంగి)
<><><><><><><><>
కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
(తోడికోడళ్ళు )
<><><><><><><><>
ఎవరికి ఎవరు కాపలా
బంధాలన్నీ నీకేలా
ఈ బంధాలన్నీ నీకేలా
తనువుకు ప్రాణం కాపలా
మనిషికి మనసే కాపలా
తనువును వదలి తరలే వేళ
మన మనసే మనకు కాపలా.... ( ఇంటికి దీపం ఇల్లాలు )
<><><><><><><><><>
రేపంటి రూపం కంటి-పూవింటి తూపులవంటి
నీ కంటి చూపులు వెంట నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి-పూవింటి దొరనే కంటి
నా కంటి కళలు కలలు నీ సొమ్మంటి.....(మంచీ చెడూ )
<><><><><><><><>
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
మనుషులనే వారున్నారా అని దేమునికొచ్చెను అనుమానం..
మనసులేని ఈ మనిసిని చూసి దేవుడు రాయైపోయాడు
దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు.... (దాగుడుమూతలు)
<><><><><><><><>
మానూ మాకును కాను
రాయి రప్పను కాను
మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను....
మణిసి తోటి ఏలాకోళం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మావా
ఇరిగిపోతే అతకదు మల్లా.......... ( మూగమనసులు)
<><><><><><>
నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ-నవ్వుతూ సావాలిరా
సచ్చినాక నవ్వలేవురా
ఎందరేడ్చినా బతికిరావురా-తిరిగిరావురా...అందుకే..11నవ్వు11\
(మాయదారి మల్లిగాడు)
ఇలా ఎన్నని చెప్పాలి ఏదని చెప్పాలి? అయినా మనసుండలేక మరి కొన్ని..
పేమ ఎంత మధురం
ప్రియురాలు అంత కఠినం.
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
బుద్ధికి హృదయము లేక
హృదయానికి బుద్ధే రాక
నరుడే ఈ నరలోకం నరకం చేసాడు
తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు నెలాగైనా
మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా
అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్ని మంచికని
అనుకోవడమే మనిషి పని.......
ఆహా! ఎంత చక్కటి పద ప్రయోగాలు! ఆత్రేయ చిరంజీవి !!

4 comments:

  1. సింగిరెడ్డి నారాయణ రెడ్డి, భాగవతుల సదాశివ శంకర శాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు (ఇది కొద్దో గొప్పో కొంతమందికి తెలుసులెండి), కిళాంబి వెంకట నరసింహా చార్యులు వీళ్ళంతా పదహారవ శతాబ్దపు కవులో, రాజులో, గాయకులో అనేసుకోగలరు. కాస్త వివరంగా వాళ్ళ పూర్తీ పేరు సి.నా.రే., ఆరుద్ర, శ్రీ శ్రీ, ఆత్రేయ ఇలా రాస్తే కదా జనాలకి అర్ధమయ్యేది. మీ పోస్ట్ టైటిల్ చూసి ఎవరైనా ఈయనెవరో తిరుమల గుడిలో పూజారి అనుకుంటే అది వాళ్ళ తప్పు కాదు మాస్టారూ.

    ఇంక ఆయన రాతల గురించి చెప్పేంతటి వాడిని కాదు. మాట్లాడుకునే పదాలతోనే లోతైన భావాల పాట్లాడుకోవడం ఆయనకే చెల్లింది.

    ReplyDelete
  2. మనసు గురించి మాచక్కగా చెప్పిన మన-సుకవి ఆత్రేయ.

    ReplyDelete
  3. అనుకున్నామని జరగవు అన్ని - అనుకోలేదని ఆగవు కొన్ని
    జరిగేవన్నీ మంచికని - అనుకోవడమే మనిషి పని
    నీ సుఖమే నే కోరుతున్నా - నిను వీడి అందుకే వెళుతున్నా
    -మురళీ కృష్ణ
    <><><><><><><><><>
    తెలియని పాశం వెంటపడి - ఋణం తీర్చుకో మంటుంది
    నీ భుజం మార్చుకో మంటుంది
    ఈ జీవన తరంగాలలో - ఆదేవుని చదరంగం లో
    ఎవరికి ఎవరు సొంతము- ఎంతవరకీ బంధము
    -జీవన తరంగాలు

    ReplyDelete
  4. 'కారులో షికారు కెళ్ళే' శ్రీశ్రీ, 'రేపంటి రూపంకంటి' సినారె రాశారనుకున్నా. చాలా మంచి పాటలు.

    ReplyDelete