Thursday, October 07, 2010

న్యూసు-న్యూసెన్సు!!


"ఏమండీ,సలహాల్రావు గారూ! వార్తలు తెలుసుకోడానికి
టీవీయా, వార్తా పత్రికా ,ఏది మంచిదంటారూ" అంటూ
సందేహరావు అడిగాడు.
"వార్తాపత్రికే నయమండి! ఏమంటే కరెంటు పోతే మీరు
టీవీ చూడలేరు. అదే న్యూస్ పేపరనుకోండీ హాయిగా
విసనకర్రలా విసురుకోవచ్చు" అన్నాడు సలహాల్రావు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఏదుపుకొట్టుడు సీరియల్సు చూడటం మాని చాలా
కాలమయింది.ఇక వార్తలు చూడ్డానికి ఏటీవీ,ఈటీవీ,
నాలుగో టీవీ,ఐదో టీవీ,తొమ్మిదోటీవీ అంటూ ఎన్నెన్నో
టీవీలున్నాయి. ఇక వాటిలో ఎక్కడో ఏ ప్రమాదమో
జరిగితే మన టీవీ వాళ్లకు అది ప్రమోదమే! మావిలేఖరి
నడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంటూ
న్యూస్ రీడరమ్మ "హలో నామాట వినబడుతుందా?
లారీ గుద్దుకొని క్రిందబడ్డ ఆయన స్పందన తెలుసు
కోండి" అనగానే ఆ హలో"న్యుస్ రీడరమ్మాయి!ఇప్పూడె
అడిగా, తనకు నరకం కనిపిస్తున్నదని చెప్పాడు!"
అంటాడు. తరువాత "పరీక్షల్లో గోల్ద్ మెడలు సాధించిన
విద్యావతి తల్లిదండ్రుల స్పందన ఏమిటో కనుక్కొని
చెప్పండి" అని రీడరమ్మ అనగానే " ఫెయిలయితే
బాగుండేది.ఇప్పుడు బోల్డు డబ్బుతగలేసి పై చదువులు
చదివించాలని" అంటున్నారని జవాబు! ఈలా వుంటుంటాయి
మన వర్తా చానల్ల తీరుతెన్నులు. అమ్మాయి పరీక్ష పాసయితే
అమ్మానాన్నలు సంతోషిస్తారు, దానికి వాళ్ళ స్పందన ఏమిటో
అడగాలా! ఇక ఏదైనా సంఘటన జరిగితే ఆ రోజంతా అదే
గొడవ,ఇక మరే న్యూస్ లేనట్టు. మరో గమ్మత్తు! ప్రతి చానలు
ఎక్స్క్లూజివ్ అంటూ అదే వార్త కొన్ని నిముషాలతేడాలో
చూపిస్తుంటారు. దేశంలో మోసగాళ్ళు, మోసాలు పెరిగి
పోతున్నాయని సాక్ష్యాలతొ సహా చూపించే వీళ్ళే కొన్ని
మోసాల ప్రకటనలు ప్రతి అరగంటకూ చూపిస్తుంటారు.
ఈ ప్రకటన నిజానిజాలతో మాకు సంబంధంలేదని ముందు
చూపిస్తున్నారనుకోండి.దాన్ని చదివే ఓపిక మనలో ఎందరికి
వుంది. కూరలు తరిగే ఓ సాధనం ఖరీదు 1999/- రూపాయలని
మరో రెండొందలు ప్యాకేజీ చార్జీలని ఓ ప్రకటన తో చానల్లలో
ఊదరగొట్టే వస్తువు మా రాజమండ్రి మార్కెట్లో 380/-లకే
దొరుకుతున్నది! న్యూస్ చానల్ల వల్ల అసలు ఉపయోగం లేనే
లేదనీ అనలేం. రాజకీయనాయకులు, కొందరు లంచగొండి
ఉద్యోగుల గురించి బయటపెడుతుంటూనే ఇన్ని అవినీతి
పనులు జరుగుతుంటే ,ఈ చానల్లే లేకుంటే వీళ్ళ ఆగడాలకు
అడ్డేవుండేది కాదేమో అని ఊక్కోసారి అనిపిస్తుంటుంది!
పైన నే వేసిన కార్టూన్ 1963 లో "నవ్వులు పువ్వులు"
అనే హాస్య పత్రికలో వేసినది. అప్పటికింకా టీవీలు రాలేదు
కాబట్టి రేడియో స్టేషన్లో వార్తలు చదువుతున్నట్లు వేశాను.
మరో విషయం.ఇన్నేసి చానల్లు పుట్టుకోస్తున్నా, మన వార్తా
పత్రికల సర్కులేషను తగ్గక పోవడం, ఓ శుభసూచకమే!
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
గత కొద్దిరోజులనుంచి డిస్కవరీ చానల్ తెలుగులో కూడా ప్రసారం
అవుతున్నది.కాని అనువాదకులు కాస్త శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని
పించింది.మొన్న గుజరాత్ సింహాల గురించి కధనం ప్రసారంచేస్తూ
"సింహాల జనాభా" అన్నపదం వాడారు. మనుషులను లెక్కించేటప్పుడు
ఆ మాటను వాడటం సమంజసం అనుకుంటాను. "సింహాల సంఖ్య"
అంటే బాగుంటుందని నా భావన.ఏ మైనా మన తెలుగులో ప్రసారం
చేయటం వల్ల ఇంగ్లీషు రాని వారికి సౌలభ్యంగా వుంటుంది.

Wednesday, October 06, 2010

మహానటుడు గోవిందరాజు సుబ్బారావు




ఈ తరం వారికి తెలియకపోవచ్చుగాని నటుడు గోవిందరాజు
సుబ్బారావు గారు "కన్యాశుల్కం" చిత్రంలో లుబ్ధావధాన్ల
పాత్రనభియించిన తీరు మరచిపోలేము. మరో విశేషమేమిటంటే
రంగ స్థలంమీద కన్యాశుల్కం నాటకంలో ఆయన గిరీశం పాత్రను
ధరించేవారట! నటుడిగానే కాకుండా శ్రీ సుబ్బారావు ఆర్ యంయస్
చదివి డాక్టరు గా ప్రాక్టీస్ చేశారు. అంతేకాదు ఆయన అణువిజ్ఞానం
చదివి ఐన్ స్టీన్ తో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగించారు! ఇంగ్లీష్ లో
"ఇనార్గానిక్ ఇవల్యూషన్" పేరిట ఓ పుస్తకం రచించారు.
"ప్రతాపరుద్రీయం" నాటకంలో యుగంధరుడిగా ,పిచ్చివానిగా
అభినయించి నాటక రచయిత వేదం వేంకటశాస్త్రి గారిచే ప్రసంసలు
పొందారు. ఆయన ఎంతటి ప్రతిభగల నటుడో తెలుసుకోవాలంటే
వినోదా వారి "కన్యాశుల్కం" సీడీని తెలుగువారు ప్రతి ఒక్కరు
ఒక్కసారైనా చూసి తీరాలి. 1895 లో జన్మించిన శ్రీ గోవిందరాజు
సుబ్బారావు గారు అక్టోబరు 29, 1959 లో దివంగతులయ్యారు.
శ్రీ సుబ్బారావు గారి గురించి తన "బ్లాక్ అండ్ వైట్" పుస్తకంలో
ప్రముఖ నటులు శ్రీ రావి కొండల రావుగారు కొన్ని ఆసక్తికర
విషయాలు వ్రాసారు. గోవిందరాజు గారి మొదటి సినిమా"మాలపిల్ల".
ఆ పాత్ర ఆహార్యం కోసం జుట్టు,మీసం కత్తిరించుకోడానికి ఆయన
ససేమిరా అన్నారట. దర్శకులు రామబ్రహ్మం గారు, ఇతరులు
బలవంతమ్ చేసి ఒప్పిస్తే తల్లిగారి అనుమతి తీసుకొని చివరికి
ఒప్పుకున్నారట."మాలపిల్ల." లో సుందరరామశాస్త్రి,"బాలనాగమ్మ"
లో మాయలమరాఠీ,"షావుకారు"లో చంగయ్య,"కన్యాశుల్కం"లో
లుబ్దావధానులు, ఇలా ఏ పాత్రకూ పోలికలేదు. ఈ విభిన్న పాత్రలు
సునాయాసంగా ధరించి శ్రీ గోవిందరాజు సుబ్బారావు చలనచిత్ర
ఆకాశంలో ధృవతారగా నిలిచారు. ఆయన ఇంటి పేరు సినిమాలలో
గోవిందరాజుల అని వ్రాసేవారు. గోవిందరాజు సరైన పేరు, బహుశ:
నన్ను వాళ్ళు ఎక్కువ గౌరవిస్తున్న సూచనగా "ల" చేర్చారేమో
అని చమత్కరించే వారట.

Tuesday, October 05, 2010

వైణిక శిఖామణి చల్లపల్లి చిట్టిబాబు



ఒక్కో సంగీత వాయిద్యం గుర్తుకు రాగానే ఒక్కో సంగీత
కారుడు గుర్తుకువస్తారు. షెహనాయ్ అనగానే బిస్మిల్లాఖాన్,
ఫ్లూట్ అనగానే హరిప్రాసాద్ చౌరాసియా,సితార్ అనగానే రవి
శంకర్ మన కళ్ళముందు సాక్షాత్కరిస్తారు. ఇక వీణ అనగానే
ఈమని శంకర శాస్త్రి గారితో బాటు వారి శిష్యుడు చిట్టిబాబు
గుర్తుకువస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 13 ,
అక్టోబరు, 1936 న చిట్టిబాబు జన్మించారు. పన్నెండవ యేటనే
కాకినాడ ఇయ్యాని అప్పలాచార్య వద్ద శిష్యునిగా చేరి కచేరి
చేసి సంగీతాభిమానుల ప్రశంసలను పొందాడు. చిట్టిబాబు
తండ్రిగారు, రంగారావు గారు, మద్రాసుకు తీసుకొని వెళ్ళి
ఈమని శంకరశాస్త్రి గారివద్ద చేర్పించారు. శంకరశాస్త్రిగారు
ఏ నాడూ చిట్టిబాబును ఇది నేర్చుకో అని అడగలేదట.గురువు
గారి సాధనను గమనిస్తూ చిట్టిబాబు సాధన చేసేవారట.ఇక
ఆయన అసలు పేరు చిట్టిబాబు కాదట. మద్రాసులో ఈమని
గారి శిష్యరికంలో వుండటంచేత సినిమా వారితో పరిచియాలు
కలిగి ,భరణీ వారు నిర్మిస్తున్న"లైలామజ్ను" లో కుర్రవాని పాత్రకు
ఆయన్ని ఎన్నుకొని అతని అసలు పేరైన హనుమంతు పంతులు
అన్న పేరు టైటిల్స్ లో వేయడం ఇష్టంలేక ఆయన పేరును చిట్టి
బాబుగా మార్చారు.అప్పటి నుంచే ఆయని పేరు చిట్టిబాబుగా
మారిపోయింది. 1950-1960 లలో నిర్మించిన తెలుగు ఇనిమాలలో
వీణ పాటలన్నిటికీ చిట్టీబాబు వీణ వాయించారు.భార్యాభర్తలు చిత్రం
లోని "ఏమని పాడెదనో ఈవేళ", డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని "పాడమని
నన్నడుగవలెనా"మొదలయిన పాటలకు వీణవాదనను చేసింది
చిట్టిబాబు గారే. అరవై దశకంనుంచి చిట్టిబాబు మద్రాసులోని ప్రసిద్ధ
కృష్ణగానసభలో మొట్టమొదటి కచేరీ చేశారు. మైసూరు మహారాజా
చే"వైణికశిఖామణి",టిటిడి వారిచే "సప్తగిరి సంగీత విద్వన్మణి",కేంద్ర
సంగీత నాటక అకడమీ ఎవార్డ్, తమిళనాడు ప్రభుత్వం "కలైమామణి"
లతో గౌరవించారు. విదేశాల్లో అనేక కచేరీలు చేశారు.ఆయన దాదాపు
ఇరవైఐదుకు పైగా ఎల్.పి రికార్డులు విడుదలచేసారు. "మ్యూజింగ్స్
ఆఫ్ మ్యుజీషియన్","రాధామాధవం","శివలీలావిలాసం" "వెడ్డింగ్ బెల్స్"
మొదలైనవి రికార్డులుగా హెచ్యమ్వీ విడుదల చేసింది. తిరువాయూర్
త్యాగరాజ ఆరాధనోత్సవాలలో ప్రతి ఏడాది క్రమం తప్పక
పాల్గొనే అయన ఒక ఏడాది ఎప్పటిలానే పాల్గొని వచ్చి, త్యాగరాజు
తనువు చాలించిన రోజు బహుళ పంచమి నాడే ఈయన 59 ఏళ్ళ
వయసులోనే 1996 ఫిబ్రవరి 9 వతేదీన ఆశేష అభిమానులను
దు:ఖసముద్రంలో ముంచి తనువు చాలించారు. ఆయన ఎల్ఫీలు
ప్లేయర్ పై వింటుంటే ఆ అనుభూతి మరువలేనిది.

Monday, October 04, 2010

చందమామ ఆర్ట్ బుక్ I & II




చందమామ ఆర్ట్ బుక్ పేరిట రెండు వాల్యూములుగా
మంచి ఆర్ట్ పేపరు పై చందమామ చిత్రకారులు యమ్.
టీ.వీ.ఆచార్య,చిత్ర, శంకర్, వడ్డాది చిత్రించిన వర్ణచిత్రాలతొ
ఏర్చి కూర్చిన అద్భుత చిత్రాలను చందమామ సంస్థ
ప్రచురించింది.చందమామ ప్రియులంతా స్వంతం చేసు
కోవలిసిన ఈ మంచి పుస్తకం.ఖరీదు పదిహేను వందల
రూపాయలైనా ఇందులోని బొమ్మలు చూసిన తరువాత
ఖరీదు విషయం వెంటనే మరచిపోతాము.
10"X12" పెద్ద సైజులో పూర్తి ఆర్ట్ పేపరు పై రంగుల్లో
ఒక్కొక్కటి185 పేజీలతో రెండు వాల్యూములుగా ఈ పుస్తకం
మంచి బైండింగ్ తో వెలువడింది, ఒక పుస్తకం వెనుకవైపు,
మరో వాల్యుమ్ ముందు వైపు ప్రక్క ప్రక్కన వుంచితే
శ్రీ శంకర్ వేసిన దుప్పి బొమ్మ అందంగా అగుపించడం
ఇక్కడి ఫొటోలో మీరు చూడొచ్చు.ధరలాగానే పుస్తకాలు
కూడా చేతికి చాలా బరువుగా వున్నాయి.టేబుల్ మీద
వుంచి చూడాలి,చదవాలి. రామాయణ,భారత,భాగవత
గాధల ఆనాటి (1954నుండి)ముఖచిత్రాలతో బాటు చిత్రా
చిత్రించిన అట్టచివరి బొమ్మలు,(యూలిసెస్,గౌతమ బుద్ధుడు)
ప్రత్యేకంగా అలరిస్తాయి.రెండవ వాల్యూములో వడ్డాది బొమ్మలతో
బాటు ఒకే ఘట్టానికి ఇద్దరు వేర్వేరు ఆర్టిస్టులు చిత్రిస్తే ఎలా
వుంటుందో కంపారిజన్ అన్న పేజీలలొ చూపించడం చాలా
మంచి ప్రయోగం.మొదటి ఫొటో 1953 నుండి ఈ నాటి వరకు
చందమామలో చిత్రాలు గీస్తున్న శ్రీ శంకర్.

Sunday, October 03, 2010

అల్లో అల్లో ! మిస్టర్ బీన్!!


" పోగో" చానల్లో అగుపించే "మిస్టర్ బీన్", యానిమేటెడ్
రూపంలోనూ, నటుడు రోవన్ అటిక్సన్ నటించిన మూవీ
గానూ వస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నది. హడావిడిగా
స్నానం చేసి ఆ తువ్వాలుతోనే కారెక్కి, డ్రైవ్ చేస్తూనే
సూటేసుకోవడం, పోస్ట్ బాక్సులో ఉత్తరంవేస్తూ అందులో
ఇరుక్కుపోవడం లాంటి చిలిపి చేష్ఠలు చేసి ఆబాలగోపాలాన్నీ
నవ్విస్తాడు.మిస్టర్ బీన్ పాత్రను అద్భుతంగా పోషించిన అటిక్
సన్ బ్రిటన్ ప్రధాన మంత్రి టోనీ బ్లయర్ చదువుకొన్న స్కూల్లో
చదువుకొన్నాడు.ఏదైనా తను అనుకొన్న విధంగా జరగక పోతే
ముఖాన్ని విచిత్రంగా పెట్టేవాడట. తరువాత ఆక్స్ ఫర్డ్ యూని
వర్సీటీలో చదివే టప్పుడు ఓ బొమ్మ వేస్తే అది చూసిన స్నేహితుడు
ఈ పాత్రను పెట్టి ఓ కధ రాద్దామా అన్నాడట. ఆ ఆలోచనతోనే
1980 లోనే మిస్టర్ బీన్ పుట్టాడు. ఆ కధను నాటికగా ప్రదర్శించాలని
అనుకొని, ఆ పాత్రను అటిక్సన్ ధరించాడు. ప్రేక్షకులను ఆ కధ
విపరీతంగా ఆకర్షించింది. బ్రిటన్ లోని టీవీలు ఆ కధను ప్రసారం
చేయడానికి పోటీ పడ్డాయి. చివరకు 1990 లో మిస్టర్ బీన్ టీవీ
తెరపైకి వచ్చింది. అటు తరువాత మిస్టర్ బీన్ యానిమేటెడ్ చిత్రాలు
మొదలయ్యాయి."మిస్టర్ బీన్-అల్టిమేట్ డిసాస్టర్" అనే సినిమా ఇరవై
రెండుమిలియన్ డాలర్లతో నిర్మిస్తే, రెండువందల ముప్పై డాలర్లను వసూలు
చేసిందట! అసలు కధకు పెట్టిన పేరు, మిస్టర్ వైట్.అది బాగాలేదని
రకరకాల కూరగాయల పేర్లు ఆలొచించి చివరకు మిస్టర్ బీన్ పేరును
నిశ్చయించారు. ఈ పేరే అందరికీ నచ్చింది.
ఇక " పోగో" చానల్ పేరులో ఓ గమ్మత్తు గమనించారా?! తెలుగులో
"పో" అన్న మాటకు ఇంగ్లీషులో "గో" అంటాం గదా. ఆ రెండు మాటలను
కలిపితే "పోగో" అయింది!ఇది నాకు తట్టిన తమాషా ఆలోచన!!

Saturday, October 02, 2010

మతం-అభిమతం




నేను హిందువును, మితృడు ఖాన్ ముస్లిమ్,శ్రీ
విన్ఫ్రెడ్ రాయ్ (ఒకప్పటి మా మేనేజర్) క్రిష్టియన్
అనుకుంటుంటాము గానీ అందరి హృదయాలు
ఒకటే! ఇది నా అనుభవం. బ్యాంకులో పెర్సనల్
మేనేజరుగా నేను బిజీగా వుంటే పని వత్తిడి
తగ్గగానే నన్ను తన చాంబర్లోకి పిలిచి కబుర్లు
చెప్పి కాఫీ ఇచ్చి పంపేవారు మా బ్రాంచి మేనేజర్
శ్రీ రాయ్. ఇది నే నెలా మర్చిపోగలను. అలానే
మరో ముస్లిమ్ జనాబ్ యమ్.ఏ.ఖాన్ మా ఇన్నీస్
పేట (రాజమండ్రి) బ్రాంచి మానేజరుగా జాయిన్
అయిన రోజునే స్వయంగా బజారుకు వెళ్ళి లక్ష్మీ
దేవి ఫొటో ( అంతకుముందు బ్రాంచిలో దేముడి
బొమ్మలుగాని, శుక్రవారం పూజలుగాని లేవు)
కొని తీసుకొని వచ్చి ప్రతి శుక్రవారం సాయంత్రం
పూజకు ఏర్పాటు చేసిన విషయం ఇంకా నా మనసు
లోంచి (ఇది జరిగింది 1973లో) ఇన్నేళ్ళు గడిచినా
చెరిగిపోలేదు. ఇక మా "హాసం క్లబ్" మితృడు ఖాదర్
ఖాన్ హిందువులన్నా ,సాంప్రదాయాలన్నా అమితంగా
అభిమానిస్తారు. వినాయకుడి పై మరీ విపరీతంగా
వేసే కార్టున్లపై ఆయన మండి పడతారు.శవ యాత్రలలో
భగవద్గీతను మైకులో వినిపించడం చూసి స్ఠానిక
పత్రికలో ఓ వ్యాసం వ్రాస్తూ పవిత్రమైన గీత విన్నప్పుడాల్లా
విషాద తలంపు గుర్తుకొస్తున్నది, ఈ పద్ధతిని మానా
లని వ్రాశారు.
ఇటీవలే ఆయన కలం నుంచి జాలువారిన ఈ అద్భుత
కవిత చదవండి. అందరం,అన్నీమతాలు ఒకటే అని ఒప్పు
తప్పకఒప్పుకుంటారు.
"కలసిపోవలసింది ఒక మట్టిలోనే"
శర్మగారింటి పులిహోర ఖాన్ గార్కి పండగ!
ఖాన్ గారి సేమ్యా శర్మ గారికి ఈద్ !!
ఉస్మాన్ గార్కి సుమూహూర్తం సిద్ధాంతి గారే పెట్టాలి
సిద్ధాంతి గారి చెల్లి దడుసుకుంటే
ఇమామ్ గారు తావీదు కట్టాలి
ఇమామ్ గారి తల్లికి కామెర్లొస్తే
ఆచారి గారి పసర్లు పడి తీరాలి!
మిలాల్ బిర్యాని వీర్రాజు లాగించేస్తే
వీర్రాజు సాంబారిడ్లీ మిలాల్ ఊదేస్తాడు!
వెంకన్నగారి ప్రక్కన బీబీనాంచారమ్మ తల్లుంటే
అయ్యప్పగుడికి ముందే బాబాగారి సమాధి
మస్తాన్ మటన్ తిని నారయ్య కుండ నీరు తాగి
నాగూర్ పరుపు పై వాలి దుర్గయ్య దుప్పటి వాడి
ఆలీ హాస్యం చూస్తూ బాలూ పాటలు వింటూ
రహ్మాన్ సంగీతం ఆస్వాదిస్తూ
సిరివెన్నెల సాహిత్యం ఆనందిస్తూ
ఆనందంగా అభిమానంగా ఉండక
మందిరం మసీదు అంటూ
ఎందుకీ మల్లగుల్లాలు !!!
ఎడమొగం పెడమొగంతో
ఎందుకీ అల్లకల్లోలాలు!
బతికి ఉంటే మసలవలసింది
ఒక ఇంటిలోనే
కన్నుమూస్తే కలసిపోవలసింది
ఒక మట్టిలోనే !!
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
మనకు ముస్లిమ్ సోదరులకు ఒకటే తేడా,
మనం ఇల్లా అంటే వారు అల్లా అంటారు !!
ఈ పేరు చూడండి! మూడు మతాల పేర్లున్నాయి !!
వెంకటేసుర్లా ! (వెంకట, ఏసు,అల్లా కలసిలేవూ?!)
( "జ్యోతి" అలనాటి మాస పత్రిక సౌజన్యంతో)
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
మాఇంట్లో ఏసు క్రిస్తు బొమ్మ చూసి మీరు మతం
తీసుకొన్నారా అనిచాలా మంది అడుగుతుంటారు.ఆ బొమ్మను
యాభైఏళ్ళ క్రితం కరిగించడానికిఎవరో ఓ ఇత్తడి షాపులోఅమ్మితే
ఆ బొమ్మను, మరో బొమ్మను మా నాన్నగారు చూసిఆ ఇత్తడికి
వెలకట్టి కొని, చెక్కతో స్టాండును చేయించారు.ఆ బొమ్మల ఫొటోలు
చూడండి. ఎంతో కళాత్మకంగా ఉన్నాయి .

Friday, October 01, 2010

సీనియర్ సిటిజన్స్ డే!



ఇప్పుడు అన్నీ దినాలే! అదేనండి ఒక్కొ సంధర్భానికి ఒక్కో
రోజు.! డాక్టర్ల రోజు, అలానే ఒక్కో రోగానికీ ఒక్కోరోజు.!
స్నేహితుల రోజు,ప్రేమికుల రోజు అలాగే ఈ వేళ అక్టోబరు
ఒకటో తేదీ, సీనియర్ సిటిజన్స్ రోజట! ఈ మధ్యే సీనియర్
సిటిజన్స్ ఫొరమ్ అని రాజమండ్రిలో ఏర్పాటు చేసారు. ఈ
ఒకటొ తేదీన ఓ సీనియర్ సిటిజన్ కు సత్కారంచేస్తారట.!
ఎన్నయినా చెప్పండి, ఎవరైనా నన్ను ముసలాయన అంటే
అసలు పడదు. వయసు పెరగొచ్చు కాని మనసుకు మాత్రం
ముసలితనం అనేది లేదని నా నమ్మకం. ఇంతకు ముందు
ఎవరైనా రిటైరయితే వాళ్ళ ఆఫీసు వాళ్ళు సత్కారం చేసి
ఓ చేతి కర్ర, భగవద్గీత పుస్తకం ఇచ్చేవారు. బజార్లో కూడా
రకరకాల చేతి కర్రలు అమ్మేవారు. ఇప్పుడు రోజులు మారాయి.
పూర్వం రిటైరయిన వాళ్లంతా ఏ పురాణ కాలక్షెపం దగ్గరో
రోజూ కలిసే వారు. ఇప్పుడో వాళ్ళంతా సాయంకాలం బిజీగా
వుండే పార్కుల్లో కలుసుకుంటున్నారు.పరిస్థితులు మారాయి.
ఆయుర్దాయం పెరిగింది. దృక్పధం మారింది. దూరంగా వున్న
పిల్లల దగ్గరకు వెళ్ళి వస్తూ హాయిగా కాలం గడుపుతున్నారు.
నా మట్టుకు నాకు బాంకులో ఉద్యోగం చేస్తున్నప్పటి కంటే
ఇప్పుడే బిజీ లైఫ్ గడుపుతున్నాను. నేను పదవీ విరమణను
మూడేళ్ళ ముందే తీసుకున్నాను. నన్ను కౌన్సిలింగ్ చేయ
డానికి జోనల్ ఆఫీసుకు పిలిపించి మా డీజీయం, "రిటైర్మెంట్
నిర్ణయం ఇంట్లో చెప్పారా?" అని ఏదో మన కారుకు అడ్డం వచ్చిన
వాడిని, ఇంట్లో చెప్పే వచ్చావా? అని అడిగినట్లు, అడిగారు. నేను
చెప్పిన సమాధానం " Sir, I want to live some more time
happily even after my retirement" అని. వెంటనే ఆయన
ఓకే అనేశాడు. తరువాత, నే విన్నది, మూడు నెలల తరువాత
ఆయనా అదే నిర్ణయం తీసుకున్నాడని!.మంచి పుస్తకాలు,
సంగీతం, ఎదో ఓ హాబీ ని అలవాటు చేసుకోవడం, హాస్య రచనలు
చదవడం లాంటి అలవాట్లను చేసుకుంటే ముసలి తనం మన
దగ్గరకు చేరడానికి భయపడుతుంది!
షరా మామూలుగా ఓ చిన్న ముళ్ళపూడి వారి జోకు..
యాభై ఐదేళ్ళు పైబడ్డ ఒహాయన రాత్రి పడుకో
బోయేటప్పుడు "నవజీవన యవ్వన గుళికలు"
ఆబగా ఓవర్ డొస్ పుచ్చేసుకున్నాడు.తెల్లారాక
భార్య లేపగా, లేపగా,చివరకు మేలుకొన్నాడు.
"అబ్బ, ఏంటే అప్పులే నిద్దర్లేపుతావు, నే నివ్వాళ
బలికెళ్ళను" అని గారాలు పోయాడు.
....రసికజన మనోభిరామము నుండి
>>>>>>>>>>>>>>>>
బాపు గారి కార్టూన్ "జ్యొతి" మాస పత్రిక సౌజన్యంతో..
పార్కులొ కూర్చున్న ఓ పెద్దాయనతొ మందు
లమ్ముతున్న మనిషి "మహత్తర యవ్వన
గుళికలు బాబూ,ఒక్క బుడ్డి సేవిస్తే పదేళ్ళు
వెనక్కి వెడతాయి" అంటే
ఆ పెద్దాయన అంటాడు" బానేవుందిగానీ నా
పించను కేం ఇబ్బందిరాదు కదా..,."అని.
( బొమ్మలో అక్షరాలు బాగా అగుపించవేమోనని
వ్రాశా, పెద్దాయనకు ఏమిటీ చాదస్తం అనుకోకండేం!")