Wednesday, November 17, 2010

మేలుపలుకుల మేలుకొలుపులు


శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు, శ్రీ బాపుగారి వర్ణ చిత్రాలతో
తమిళం లో వున్న తిరుప్పావై దివ్యప్రబంధం తెలుగులోనికి
అందంగా తెనిగించారు. ఆ అందాల మేలుకొలుపులో సిరినోము
అనే ముందు మాటలో రమణ గారు వ్రాసిన కొన్ని మాటలను
మీ ముందు వుంచుతున్నాను.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
"కొండంత దేవుడికి గోరంత పత్రి చాలు - అది భక్తితో ఇస్తేనే.
వేదవేదాంతాలు అర్ధపరమార్ధాలూ మంత్ర తంత్రాలూ తెలిసిన
ఎంత జ్ఞాని అయినా భక్తి లేకుండా కొండంత పత్రీ పూలూ
గుమ్మరించినా అవి గోరంత కూడా స్వామికి చేరవు-చాలవు.
ఈశ్వర స్పృహలేని జ్ఞానం మేఘాలమధ్య ఇరుక్కున్న సూర్య
చంద్రుల వంటివి.కొరగాని వెలుగు, అట్టి జ్ఞానానికి అహంకారమనే
చత్వారం వస్తుంది".
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
కలియుగంలోని శ్రీ విల్లిపుత్తూరు గోదాదేవి-ద్వాపరంలోని
రేపల్లె గొల్లభామగా తనని తాను భావించుకుంది. తమ మధ్యనే
తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం,రాత్రి
వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన, ఆత్రం కలబోసిన
భావరాగానురాగాల పారిజాతాల మాల ఈ తిరిప్పావై.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
రమణగారు ఇంకా ఇలా అంటారు, "ప్రసిద్ధగాయని ఎం.ఎల్.
వసంతకుమారి ఈ పాశురాలను గ్రామఫోను రికార్డులుగా
ఇచ్చారు ( 78 ఆర్.పి.యం).అప్పట్లో ఈపి,ఎల్పీ (ఎక్స్ టెండెడ్ ప్లే,
లాంగ్ ప్లే} రికార్డులు కూడా రాలేదు.టేపులు అంతకన్నా లేవు.
మైలాపూరులో బాపు ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి
కోవెల దగ్గరకు తెల్లవారు జామున నాలుగింటికి వెళ్ళి నిలబడితే
ఈ పాశురాలు నాలుగైదు (న్యాయంగా రోజుకు ఒకటే) పెట్టేవారు.
హాయిగా మెత్తగా స్తోత్రగానం లాగ వుండేది ఆవిడ పాట. నేను
అనుకున్న అల్లరి తనం లేకున్నా- ఏదో గొప్ప పాట వింటున్నా
మన్న ఆనందంతో భక్తితో అవి విని వెళ్ళిపోయేవాడిని. పాటలో
సంగతికీ పాటల సంగతికీ కొంతయినా పొంతన కుదిరేది"
ఆ పాటల మీద ఇష్టం,ఆయన చేత తేట తెలుగులో మనకు
ఆ పాశురాలు అందటం మనం చేసుకొన్న అదృష్ఠం.
చివరిగా శ్రీ ముళ్లపూడి ఇలా అంటారు:
" ఇదీ జరిగింది-ఇది నేను వ్రాసిందికాదు-
శ్రీ అండాళ్ తల్లి అనుగ్రహించింది,ధన్యోస్మి"
ప్రతి ఒక్కరు చదివి స్వంతం చేసుకోవలసిన ఈ అందాల
పుస్తకాన్ని ఎమెస్కో బుక్స్, విజయవాడ వారు ప్రచురించారు.
వివరాలకు:e-mail: emescobooks@yahoo.com
web:emescobooks.com

No comments:

Post a Comment