Thursday, July 29, 2010

భలే మంచి రోజు ! సినారె పుట్టిన రోజు !!



రసహృదయ వశిష్టుడు సినారె
ప్రముఖకవి, సినీ గేయ రచయిత తెలంగాణాలోని హనుమాజీపేట
అనే చిన్న గ్రామంలో జూలై 29 , 1931 జన్మించారు. ఆయన హైద్రాబాద్
ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేస్తూనె యన్టీయార్
ఆహ్వానం పై 1961 లో "గులేబాకావళి కధ" చిత్రంతో పాటలు వ్రాయటం
ప్రారంభించారు. మద్రాసులో నివాసం వుండకుండా హైదరాబాదులోనే ఉంటూ
శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ లాంటి దిగ్గజాల మధ్య నిలబడి పాటల రచయితగా
అసమాన ఖ్యాతిని పొందారంటే సామాన్య విషయం కాదు. శ్రీ నారాయణరెడ్డి
ప్రభంధిక మాటలను సినీ గేయ రచనలలో ప్రవేశపెట్టారు. ఆయన స్వయంగా
మధురంగా పాడగలగటం మరో ప్లస్ పాయింట్ అయింది. సినారె గా ప్రశిద్దులైన
ఆయన లలిత సంగీతం, గేయ కావ్యాలు వ్రాశారు. " ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు
దాగెనో", "సాగుమా ఓ నీల మేఘమా" లాంటి లలిత గీతాలు సినిమా కోసం
వ్రాసినవి కావు. తరువాత ఆ పాటలను వివిధ సినిమాలలో ఉపయోగించారు.
మొదటి సారిగా 1961లో యన్టీయార్ సినిమా "గులేబాకావళి కధ" చిత్రానికి
పాటలు వ్రాస్తున్నప్పుడు, శనివారం సాయంత్రం హైద్రాబాదు నుండి మద్రాసుకు
వచ్చి పాటలు వ్రాసి తిరిగి సోమవారం ఉదయం ఫ్లయిట్లో తిరుగుప్రయాణమై
యూనివర్సిటీలో క్లాసులకు హాజరయ్యే వారంటే ఆయన కార్యదీక్షత,సమయ
పాలనను మెచ్చుకోలేకుండా వుండలేము. శ్రీ నారాయణరెడ్డి మంచి వక్త. ఘజల్స్
అద్భుతంగా గానం చేయగల ప్రతిభాశాలి. " మాయదారి సిన్నోడు నా మనసే
లాగేసుండు" పాటలో తెలంగాణా మాండలీకాన్ని సినిమా పాటలో మొదటిసారిగా
ప్రవేశపెట్టారు. ఆయన రచించిన ప్రఖ్యాత కావ్య రచన కర్పూరవసంతరాయలు,
నాగార్జున సాగరం, జాతిరత్నం, ఋతుచక్రం, విశ్వంభర, గేయ నాటికలు, నవ్వని
పువ్వు, అజంతాసుందరి మొదలైనవి. 1978లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ
గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. సాహిత్య అకాడమీ తో బాటు 1977 లో పద్మశ్రీ
అందుకొన్నారు. "కర్పూర వసంతరాయలు" కావ్యాన్ని ఆయన ఆలపించగా అమెరికా
లోని ఆయన అభిమానులు LP రికార్డుగా తయారు చేయించి విడుదల చేశారు.
సినారె చమత్కారాలు
ప్రసిద్ధ కవి బోయి భీమన్న తన అభిప్రాయాల్ని వ్యాసాల్లొ, ఉపన్యాసాల్లో నిర్భయంగా
వ్యక్తీకరిస్తుంటారు. భీమన్న పాల్గొన్న ఒక సభలో సినారె ప్రసంగిస్తూ బోయి "భీమన్న
కాదు, ఈయన బాబోయ్ భీమన్న" అన్నారు.
* * * * * *
హైదరాబాదులో నాగార్జున సాగర్ కమ్యూనిటీ హాల్లో సినారె గారికి జ్ణాన పీఠ్ ఎవార్డు
వచ్చినప్పుడు జరిగిన సన్మాన సభకు జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు అధ్యక్షత
వహించారు. సినారె వారిని సంభోదిస్తూ " మేధావుల సాంబశివరావు" అన్నారు.
**********
సినారె చణుకు
1990 లో తూర్పు గోదావరి జిల్లా రామవరం లో సినారె కి సన్మానం ఏర్పాటు
చేశారు. విశేషజనవాహినిని చూసిన ఓ వక్త ఈ సభ "మయ సభ"ను గుర్తు
చేస్తుంది అని అన్నాడు. "మయ సభ" అంటే ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా
చూపించేది. కాబట్టి ఈ సభను మయ సభా అనవద్దు, వాఇ~మయ సభ అందాం
అన్నారు.
***********
సినారె ఇంటికి ఒక నియోగి ప్రముఖుడు, ఆయనతో ఓ వ్యాకరణవేత్తా వచ్చారు.
ఇద్దరూ సినారెకు అత్యంత ఆప్తులు. సెలవు తీసుకొని వెడుతూ స్కూటర్ మీద
కూర్చున్నారు. మితృలకు వీడ్కోలు చెబుతూ సినారె "బాగుంది ! ఈ జంట! ముందు
కరణం, వెనుక వ్యాకరణం" అంటూ చలోక్తి వదిలారు..
***********
ఈ రోజు 29వ తేదీన 80వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సినారె గారికి మన
బ్లాగందరి తరఫున శుభాకాంక్షలు !!

2 comments:

  1. సినారె గారికి... పుట్టిన రోజు శుభాకాంక్షలు !!

    ReplyDelete
  2. నమస్కారం సార్, ఈ మధ్యనే "తొలినాటి గ్రామఫోను గాయకులు" అని ఒక పుస్తకం (CDతో సహా) వచ్చింది. నేను కొనుక్కున్నా. "కర్పూర వసంతరాయలు"ను mp3గా మార్చుకున్నారా?

    ReplyDelete