Saturday, May 22, 2010

కడియం నందన వనాలు


మొక్కలు మనకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. అంతే కాదు మనకు పండ్లను ,కాయగూరలను అందిస్తాయి.
రకరకాల రంగురంగుల పూలను అందిస్తాయి. వాతావరణము లోకి ఆక్సిజన్ను వదలి కార్బన్ డైయక్సైడ్
ను తీసుకుంటాయి. ఎన్నోరకాల పూలమొక్కలను పెంచే నర్సరీలకు ఆదాయాన్ని, ఎంతో మందికి జీవనో
పాధిని అందిస్తున్నాయి. రాజమండ్రికి సమీపంలో (తూర్పు గోదావరి జిల్లా) కడియం,కడియపులంకలలో
గల నర్సరీలు ఇందుకు నిదర్శనం. అపార్ట్మెంట్ సంస్కృతి మొదలయిన తరువాత ఇంట్లో మొక్కలతో
గార్డెన్ పెంచుకొనే అభిలాష తగ్గిపోయినా ఇంకా మొక్కలను అమితంగా ప్రేమించే వాళ్ళు కుండీలలో
వివిధ మొక్కలను పెంచుకుంటూనే ఉన్నారు.
కడియంలోని నర్సరీలకు ఎంతో చరిత్ర వుంది. మొదట్లో అందరిలాగానే ఇక్కడ కూడా కంది,రాగులు,జొన్న
లాంటి పంటలు వేసేవారు. ఈ పంటలతో లాభాలు అంతగాలేకపోవటం చేత మరో వ్యవసాయ పద్ధతులకోసం
ప్రయత్నించి పూల,పండ్ల మొక్కల సాగును ప్రారంభించారు. సాధారణంగా అన్ని ప్రాంతాలలో అన్ని రకాల
మొక్కలు పెరగవు. కానీ గోదావరి నేల అన్ని రకాలమొక్కలకు అనువుగావుంటుంది. 1950 నుండి నర్సరీ
బాగా అభివృద్ధి చెందటం మొదలయింది. ఒకరిని చూసిమరొకరు ఈ వ్యాపారంలోకి ప్రవేసించారు.. శ్రీ పల్లా వెంకన్న,
శ్రీ గంగుమల్లు సత్యనారాయణ లాంటి ప్రముఖ వ్యాపారులు ఆధునిక పోకడలను అనుసరించి వ్యాపారాన్ని
అభివృద్ధి చేసారు. ఇప్పుడు కడియం, పరిసరాల్లో దాదాపు 600 పైగా నర్సరీ తోటలు ఉన్నాయి. దక్షిణ అమెరికాలో
పెరిగే ఫలానా మొక్క మా గార్డెన్స్ లో దొరుకుతుందని ఇక్కడి నర్సరీ వ్యాపారులు గర్వం గా చెప్పుకొనే స్దాయికి
ఎదిగారు. గులాబి,బంతి, చేమంతి, మల్లె, జాజి, లిల్లి, కనకాంబరం లాంటి పూల మొక్కలనే కాకుండా ఒక్క మందారం
పూలలోనే 500 రకాల మందారాలు ఇక్కడ దొరుకుతాయి. జామ,మామిడి, సపోటా, బత్తాయి, అరటి, దానిమ్మ పండ్ల
మొక్కలే కాకుండా అలంకరణకు ఉపయోగించే సైకస్, క్రిస్టమస్ ట్రీ, యాస్పరేగస్, యుఫోర్బియా,కాక్టస్, అగలోనేమా
మొదలైన 1500 రకాల మొక్కలు లభిస్తాయి. ఇండియాలో ఏ రకం కొత్త మొక్క వచ్చినా అది కడియం నర్సరీలలో
అగుపించాలనేదే ఇక్కడి వ్యాపారుల ధ్యేయం..ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడినుండి మొక్కలు మన రాష్ట్రంలోనే
కాకుండా ఢీల్లీ,గోవా, మధ్యప్రదేష్, మహరాష్ట్ర, బెంగాల్,అస్సాం,రాజస్తాన్ మొదలయిన చోట్లకు కూడా ఎగుమతి అవుతాయి !
ఈ మొక్కలను చాలావరకు స్దానికంగా అభివృధి చేయటమే కాకుండా మరికొన్ని ఇతర చోట్లనుంచి ఇక్కడికి తెచ్చి ఇక్కడ
అభివృద్ధి చేయడం మరో ప్రత్యేకత. ఇక్కడి రైతులకు అంతగా చదువు లేక పోయినా ప్రతి మొక్క గురించి క్షుణ్ణంగా తెలుసు.
నోరు తిరగని శాస్త్రీయ నామాలను కూడా టకటకా చెప్పేయగలరు. కడియం నర్సరీలను ప్రతి రోజూ వేలాది మంది వివిధ
ప్రాంతాల ప్రజలు సందర్శిస్తుంటారు.వారిలో విదేశీయులుకూడా ఈ మొక్కలను చూసి రైతుల వ్యాపార ప్రావీణ్యానికి,
ముగ్ధులవుతుంటారు. ఈ సారి సెలవులకు రాజమండ్రి వచ్చినప్పుడు కడియం నర్సరీలను చూడటం మర్చిపోకండి.


No comments:

Post a Comment