Thursday, September 02, 2010

ప్రయాణంలో పదనిసలు




ఇప్పుడేమో ప్రయాణాలు అతి సాధారణమై పోయాయి.
ఇంట్లో కూర్చుని ఆన్లైనులో రైలు, విమాన టిక్కెట్లు
ఏ ఇక్కట్లు లేకుండా రిజర్వు చేసేసుకుంటున్నాము.
అదే అంతకుముందు ఇన్ని రైళ్ళూ వుండేవి కావు,
రైళ్లలో ఇంత మంది ఇంత తరచుగా ప్రయాణం చేసే
వారూ కాదు. ఇక రైళ్లల్లో మూడు తరగతులతో బాటు
ఇంటర్ క్లాసుకూడా వుండేది.. సెకండు, ధర్డు
క్లాసులమధ్య ఆ క్లాసు వుండెది. ఇప్పటిలా పడుకో
డానికి ఫస్టు క్లాసులో తప్ప మిగిలిన వాటిలో బెర్తు
సౌకర్యం లేదు. అందుకే ఆ రోజుల్లో బెడ్డింగులని
వుండేవి. వీటినే హోల్డాలు అని కూడా పిలిచేవారు.
ఇందులో ఓ చిన్న పరుపు, బట్టలు, దిండు పెట్టుకొని
చుట్టచుట్టి తీసుకువెళ్ళేవారు. అందులో అన్నీ పట్టేవి
కాబట్టె "హోల్డాల్" అన్న పేరు వచ్చింది. ప్రయాణమంటె
ఓ పెద్ద ట్రంకుపెట్టె, హోల్డాలు, ఓ మరచెంబు తప్పక
వుండి తీరాల్సిందే! ఇప్పుడు రోజులు మారాయి ! సులువుగా
లాగే లగేజులొచ్చాయి. ఇక రైల్లో పడుకోడానికి బెర్తులెలాగో
వుంటాయి. ఇక ప్రయాణంలో మనకు రకరకాల మనుషులు
ఎదరవుతుంటారు. రైలెక్కగానే అదే తమ ఇళ్లయినట్లు
రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. సెల్ ఫోనులొచ్చాయి
కాబట్టి కొత్త స్టేషనొచ్చినప్పుడల్లా ఫలాన స్టేషనులో రైలాగిందని
రన్నింగ్ కామెంటరీ చెబుతుంటారు. మరి కొందరి మాటల్లో
వాళ్ళింట్లో ఏ వస్తువు ఎక్కడుందో , ఏ కొత్త వస్తువులు
కొన్నారో ఆ విషయాలన్నీ సెల్ ద్వారా మాట్లాడుతుంటారు.
ఇంకో రకం మనుషులున్నారు. మనని పలకరించి, ఎక్కడికి
ఎందుకు వెళుతున్నామో అన్నఅన్ని విషయాలతో బాటు మన
స్వంత విషయాలను కూడా ఎంక్వయిరీ చేయడం మొదలు
పెడతారు. నా కెందుకో ఇలాటి అనవసరపు ప్రశ్నలకు జవాబు
చెప్పడం బహు చిరాకు. మరి కొందరు మీరేముట్లు ? అనీ
అడుగుతుంటారు. ఇలా కులం గురించి అడిగే వాళ్ళంటె
అడిగిన వాళ్ళ చెంప పగలగొట్టాలన్నంత కోపమొస్తుంది.
ఇక రైళ్లల్లో ఇలా మన బుర్ర తినేయటమే కాకుండా అడుగడుగునా
తిండి అమ్మేవాళ్ళను ఒక్కడినీ ఒదలకుండాకొనేసి తినేసే వాళ్ళూ
ఎక్కువే! పుస్తకాలు పత్రికలు అమ్మే వాళ్ళు కోసం నేనెదురు
చూస్తుంటె ఒక్కడు రాడు. మా ఆవిడ పద్మ మాత్రం సంతోషిస్తుంది.
సరే ఇక ప్రయాణంలో దిగిపోవలసిన సమయం వచ్చింది.
ప్రయాణం ముగించే ముందు శ్రీ ముళ్ళపూడి వారి జోకులతో
నవ్వుకుంటూ ఇంటికి పోదామండి !!
****************
బస్సులో సీట్లు నిండిపోయాయి. ఒక సబల ఎక్కి నిలబడింది.
ఒకాయన లేవబోయాడు.
" అబ్బే కూర్చోండి, మరేం ఫరవాలేదు నేను నిలబడగలను"
అని బలవంతాన కూర్చోబెట్టింది సబల.
తరువాత స్టాపింగులో మరికొందరు జనం ఎక్కారు.ఆయన
మళ్ళీ లేవబోయాడు.
"అబ్బే ఫరవాలేదు. మేం అబలలం కాదు" అని మళ్ళీ కుదేసింది
సబల.
నాలుగైదుసార్లు అలా జరిగింది.
అర్భకంగా ఉన్న ఆ పెద్దమనిషి నీరసంగా కూర్చుని చెయ్యెత్తి
నమస్కరించి," అమ్మా, నేను దిగే చోటుదాటి రెండు మైళ్ళు వఛ్ఛెశాం.
ఇక్కడైనా దయచేసి నన్ను దిగనిస్తే పెందరాళే యిల్లు చేరుకుంటాను..
....ఈసారి లేస్తే కూర్చోమని తొసెయ్యకండి.."అన్నాడు.
*****************
ఒక నేలయ్యగారు తొలిసారి విమానం ఎక్కారు ఢిల్లీకి.ఇంజను
హోరెత్తగానే కిటికీలోంచి చూచి కెవ్వుమన్నాడు.
" అయ్య బాబోయ్. అప్పుడే ఎంతెత్తు కెగిరిపోయామో చూడండి.
ఛూడండి, కిందని జనం చీమలబారులా ఎలా కనిపిస్తున్నారో?"
అన్నాడు.
" అయ్యా, విమానం ఇంకా పైకి లేవలేదు. మీరు చూసేది
జనం కాదు, నిజంగానే చీమలబారు" అన్నాడు పక్కాయన.
*****************
టిక్కెట్టు కలెక్టరు పెట్టెలోకి ఎక్కుతూనే, ఒక శాల్తీ బల్లకింద
దూరడం చూసి వెంటనే ఇవతలి కీడ్చాడు. వాడు ముసలివాడు.
" బాబూ, బీదవాణ్ణి.నయాపైసా కూడాలేదు. నా కూతురి పెళ్ళికని
మా వూరెళ్తున్నాను, దయతల్చండి" అన్నాడు దీనంగా. టి.టి.సి.
జాలిపడి వదిలేశాడు. పక్కబల్లకింద శయనించిన ఇంకొకడిని
ఇవతలకీడ్చాడు.వాడు పడుచు కుర్రాడే." ఏరా నువ్వెక్కడికి?
నువ్వూ నీ కూతురి పెళ్ళికేనా?"అని గదమాయించాడు.
" బాబూ, నేనా ముసలాయనక్కాబోయే అల్లుణ్ణండి.పెళ్ళి నాదే"
అన్నాడా యువకుడు దండం పెట్టి.
************************
శ్రీ ముళ్ళపూడి వారి "నవ్వితే నవ్వండీ" కి, బాపూ గారి
బెడ్డింగ్,ట్రంకు పెట్టెతో సహా ప్రయాణమైన కుటుంబరావురావు
నవ్వుల బొమ్మకి ధన్యవాదాలు తెలియజేసుకొంటూ, టా టా!!

2 comments:

  1. రన్నింగ్ కామెంట్రీ - బాగా చెప్పారు. ఇంకొకటి మర్చిపోయినట్లున్నారు: అదేనండీ కొత్త పాటలు పెద్దశబ్దంతో చెల్ ఫోన్లతో మోగించడం.

    కొన్నిసార్లు అనవసరంగా కదిలించేవారు అప్పుడప్పుడు చిరాకుపుట్టించినా, నాకు ఎవరికివారన్నట్లుండే ఏసీకన్నా స్లీపర్, సాధారణ బోగీల ప్రయాణం నాకిష్టం.

    ReplyDelete
  2. AC lo cellu sambhashanalu parama chiraaku.

    ReplyDelete