Tuesday, September 07, 2010

బహుముఖప్రజ్ఞాశాలి భానుమతీరామకృష్ణ



తెలుగు తారలలో చిరంజీవి శ్రిమతి పాలువాయి భానుమతీ
రామకృష్ణ. మొట్టమొదటి సారిగా వెండితెర పై భానుమతి
1939 లో కాళీంది పాత్రలో "వరవిక్రయం" చిత్రంతో అడుగు
పెట్టారు. బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, సరస్వతమ్మ
దంపతులకు చిన్నారి భానుమతి 7 సెప్టెంబరు,1925 న
జన్మించారు.తన సినిమారంగ ప్రవేశం గురించి భానుమతి
ఇలా చెప్పేవారు." అప్పట్లో నాటకాలన్నా, సినిమాలన్నా
తక్కువగా చూసేవారు.పెళ్ళికాని పిల్లని సినిమాల్లోకి పంపటం
ఎలాగా అని మా నాన్నగారు మధనపడుతున్న సమయంలో
మైనంపాటి నరసింహారావుగారు, అంటే టంగుటూరి సూర్య
కుమారికి మేనమామ వరుసవుతారు, ఆయన "మనం
నడుచుకోవడంలో ఉంటుంది.నడుచుకొనే తీరులో ఉంటుంది.
మా అమ్మాయి కూడా సినిమాల్లో పనిచేస్తోంది కదా" అని
ప్రొత్సహించటం, నాన్నగారు ఒప్పుకోవడంతో నేను సినిమా
పరిశ్రమలోకి అడుగు పెట్టాను"
వరవిక్రయం చిత్రంలో ఆమె "పలుకవేమి నా దైవమా,
రామా" ( పూర్ణచంద్రిక రాగం) అనే త్యాగరాజకృతితో మొదటి
సినిమా పాట ఆరంభమయింది. 1943 ఆగష్ట్ 8 న దర్శకుడు
రామకృష్ణ ను ప్రేమ వివాహం చేసుకొన్నారు. తన కుమారుడి
పేర భరణీ పిక్చర్స్ ప్రారంభించి ఆణిముత్యాలలాంటి చిత్రాలు
తీశారు. తరువాత భరణీ స్టూడియోస్ నిర్మించారు. భరణీ
చిత్రాలంటే మంచి సంగీతం వుటుందని ప్రేక్షకులకు నమ్మకం.
"లైలా-మజును", "ప్రేమ" చిత్రాలకు సి.ఆర్.సుబ్బరామన్ అద్భుతమైన
సంగీతాన్ని ఇచ్చారు.
" ప్రేమే నేరమౌనా..మాపై పగేలా"
" నిను బాసి ఫొవుదానా.."
"రోజుకు రోజు మరింత మోజు..."
"ప్రేమ డింగ్ డాంగ్ బెల్..ప్రియురాలు నైటింగేల్.." పాటలు ఎన్ని
సార్లు విన్నా కొత్తగానే వుంటాయి!
భానుమతి సంగీత దర్శకురాలుగా, చిత్ర దర్శకురాలుగా,నిర్మాతగా,
స్టూడియో అధిపతిగా, రచయిత్రి గా తన ప్రతిభను చాటిన నటీమణి.
"విజయ చిత్ర" పత్రికలో ఆమె వ్రాసిన "నాలోనేను" సీరియలు గా ప్రచు
రించ బడింది. పుస్తక రూపంలోను వెలువడటమే కాకుండా ఇంగ్లీషు
లోకి అనువాదం చేయబడింది.
అక్కినేని నాగేశ్వరరావు గారికి భరణీ మంచి పాత్రలను ఇచ్చి ఆయన
లోని నటుడిని బయటకు తీసుకొనివచ్చింది. లైలామజును,విప్రనారాయణ
లాటి పాత్రలకు అక్కినేనిని ఎన్నుకొన్నప్పుడు విమర్శలను లెక్కచేయక
భానుమతి అతనిలోని ప్రతిభను గుర్తించింది. భానుమతి నటించిన మరో
మంచి చిత్రం 1951లో బియన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన "మల్లీశ్వరి".
అందులోని పాటలు దేశాన్ని పరవశింపజేశాయి..ఎందుకే నీకింత తొందర,
ఆకాశవీధిలో,(ఘంటసాల మాష్టారితో),ఎవ్వరేమని కందురు,మనసున
మల్లెల మాలలూగినే,అవునా నిజమేనా,పిలిచిన బిగువటరా,కోతీ బావకు
పెళ్ళంట, ఇందులో ఏ పాట బాగుందని చెప్పగలం. అన్నీ వీనుల విందులే!
ఆమె వ్రాసిన "అత్తగారికధలు" మరువగలమా? 2005 డిసెంబరు 24
రాత్రి ఆమె కన్ను మూసారు. తెలుగువారి తలపుల్లో ఆమె కలకాలం
జీవించే వుంటుంది. 1971 లో Gramophone Company LP Record
( No: MOCE 7001) భానుమతి పాటలతో విడుదల చేసింది. ఈ రకార్డ్
"స్వర్గసీమ" సినిమాలో నాగయ్యగారి సంగీత దర్శకత్వం లో ఆమె పాడిన
" ఒహొ ఒహొ పావురమా" పాటతో మొదలవుతుంది.

5 comments:

  1. భానుమతి గారి గురించి చాలా క్లుప్తముగా చాలా చక్కగా చెప్పారు. ఎంత సాధించినా జీవితాంతము ఇంకా ఏదో సాధించాలని తాపత్రయ పడేవారు. భానుమతి గారు మన భారత దేశానికే గర్వకారణము.

    ReplyDelete
  2. భానుమతి ని ఆరాధించే అసంఖ్యాకమైన అభిమానుల్లో నేను ఒకరిని.
    అంత వైవిధ్యమైన నైపుణ్యాలు ఉన్న మరో వ్యక్తి, నాకు తెలిసినంత వరకు, చిత్ర సీమలో లేరంటే అతిసయోక్తి కాదేమో.
    నతన, గానం, సంగీత దర్శకత్వం, రచన,చిత్ర దర్శకత్వం, స్టూడియో నిర్వహణ, చిత్ర నిర్మాణం ఇలా ఎన్నో ఎన్నెన్నో.

    దురద్రుష్టం కొద్దీ ఆవిడ తెలుగు వారిలో పుట్టి ఏ పురస్కారాలని అందుకోలేని స్థితిలో వెళ్ళి పోయారు.

    భారత రత్న అందుకున్న ఏ ఉత్తర దక్షిన భారతీయులైనా ఆవిడకి సాటి అంటారా?

    లౌక్యం తెలియక పోవటమే ఆవిడకున్న పెద్ద లోపం అనిపిస్తుంది.

    మెర మెచ్చు కబుర్లు చెప్పి ఉంటే, ఏనాడో ఆవిడకి జాతీయ పురస్కారాలు కూ కట్టేవేమో!

    ReplyDelete
  3. Inthamandhi abhimanualanu sampadinchadame amekoka award. Deeniki minchina awards levane naa nammakam!

    Yemantaro bloggers?

    ReplyDelete
  4. అసలు అవార్డులంటే ఆవిడకు అక్కర కాని పట్టింపు కాని ఉందని నేననుకోను, ఏదో మనలాంటి అభిమానులు ఆవిడకు రావాల్సిన అవార్డులు రాలేదే అని బాధపడడం తప్పించి..

    antaryagam garu,
    లౌక్యంగా మాట్లాడి, మెరమెచ్చు కబుర్లు చెప్పేవారే అయితే ఆవిడ భానుమతే కాదు. భానుమతి గారంటే అలానే ఉండాలి :-) ఏమంటారు?

    ReplyDelete