Wednesday, September 21, 2011

మన గురజాడ అప్పారావుగారు.

ఈ రోజు శ్రీ గురజాడ అప్పారావుగారి 150వ జయంతి. ఆదుర్తి, అక్కినేని నిర్మించిన
"సుడిగుండాలు" సినిమాలో ఒక డైలాగు మీకు గుర్తుండే వుంటుంది. ఈ కాలం
పిల్లలకు గురజాడ అంటే తెలియదని అదెక్కడో మారుమూల ఓ గ్రామమనీ అను
కుంటారనీ ఆనాడే మాటల రచయిత శ్రీ యన్నార్ నంది వ్రాశారు. గురజాడ కలం
నుంచి వెలువడిన దేశభక్తి గీతాలు మన జాతీయగీతాల స్థాయికి మించినదిగా
వున్నా తెలుగునే మరచిపోతున్న మన యువతరానికే పూర్తిగా తెలియనప్పుడు
యావత్ భారతదేశానికి తెలిసే అవకాశం ఎక్కడ? "దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే
మనుషులోయ్","ఈసురోమని మనుషులుంటే దేశమేగతిని బాగుపడునోయ్" ఇలా
ఎన్నెన్నో గీతాలను రచించారు.
సంఘదురాచారాలను ఎత్తి చూపిస్తూ ఆయన రచించిన "కన్యాశుల్కం" నాటకం
రంగస్థలం మీదే కాకుండా సినిమాగా ప్రశంసలను అందుకుంది. గురజాడ అంటారు
"మనం చెడ్డవారని అనుకునేవారి యెడల కూడా మంచిగా ఉండుటకు ప్రయత్నిస్తే
దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన యీ లోకము మరింత యింపుగా
కనబడుతుంది. మీకూ, మీ పరిచయం కలిగిన వారికి మరింత సౌఖ్యం కలుగుతుంది.
కాక, మంచి చెడ్డలు ఏర్పరచగలిగినవాడు ఎవడు? మంచిలోనూ చెడ్డ ఉంటుంది; చెడ్డ
లోనూ మంచి ఉంటుంది." ఇలాటి మహనీయుడు మన తెలుగు రాష్ట్రంలో కాకుండా
ఏ తమిళనాడులోనో, బెంగాలు లోనో పుట్టి వుంటే ?! మన తెలుగు వాళ్ళు ,నాయకులు
ఇప్పటికైనా మేలుకుంటారనీ ఆశిద్దాం! అట్లాంటి మంచి రోజులు రావాలనీ కోరుకుందాం
ఈ రోజు సాయంత్రం 4-30 గంటలకు రాజమండ్రి కందుకూరి వీరేశలింగం టౌన్ హాల్లో
కళాగౌతమి ఆధ్వర్యంలో శ్రీ గురజాడ జయంతి సభ జరగడం హర్షనీయం .

2 comments:

  1. machi vishayam teliyajesaru. abhinandanalu.

    ReplyDelete
  2. ఆధునిక కవిత్వానికి అడుగుజాడ గురజాడదే. ఆయన రాసిన "దేశమును ప్రేమించుమన్నా" కవిత ఒక సంచలనం. జాతీయగీతం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్న గీతమని అంటూ ఉంటారు. "నూరేళ్ళకొక టాగూరు పుడతాడు గానీ వెయ్యేళ్ళకొక గురజాడ పుట్టడం కష్టం" అని మన విమర్శకులు భావిస్తున్నారు. "టాగూరు భావాలు పంతొమ్మిదో శతాబ్దికి చెందినవి కానీ గురజాడ భావాలలో అధిక భాగం ఇరవయ్యొకటో శతాబ్దికి చెందినవి" అన్నారట ప్రముఖ రచయిత, విమర్శకుడు రా.రా

    ReplyDelete