Friday, April 08, 2011

ఊడల మర్రి-2 అను నేటి ఎస్బీఐ చరిత్ర!!





మొన్నటి నా ఊడలమర్రి కధనంలో స్టేట్ బ్యాంకు పూర్వపు గుర్తు మర్రి
చెట్టని చెబుతూ ఆ గుర్తు నా దగ్గర లేక పోవడం వల్ల జ్ఞాపకం చేసుకొని
బొమ్మ గీశాను. మన బ్లాగరు మితృలు ( సాహిత్యాభిమాని, మన తెలుగు
చందమామ) శ్రీ శివరామ ప్రసాద్ తమ దగ్గర వున్న స్టేట్ బ్యాంక్ పోస్టల్
స్టాంపు ఫొటో నాకు పంపారు. అందులో బ్యాంకు మర్రి చెట్టు గుర్తు
వుంది. నా స్టాంపు కలెక్షన్ లో కూడా ఆ స్టాంపు లేదు. ప్రసాద్ గారికి
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ స్టాంపు చిత్రాన్ని ఇక్కడ ఇస్తూ
బ్యాంకు గురించి మరికొంత సమాచారాన్ని ఇస్తున్నాను.
మొట్టమొదటి సారిగా 1806 బ్యాంక్ ఆఫ్ కలకత్తాగా ప్రారంభించి
అటు తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చబడింది.ఆ కాలంలో
అప్పటి ప్రెసిడెన్సీ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బాంబే (1840), బ్యాంక్ ఆఫ్
మెడ్రాస్ (1843) లతో బాటు బ్యాంక్ ఆఫ్ బెంగాల్ వాటిలోఒకటిగా పేరుపొందింది.,
1921 జనవరి 27న ఈ మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను కలపి ఇంపీరియల్
బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు పెట్టారు. అప్పటి నుంచి ప్రజల బ్యాంకింగ్
అవసరాలకు,ఇతర బ్యాంకులన్నిటికి పెద్ద బ్యాంకుగా , ప్రభుత్వానికి బ్యాంకరు
గా వివిధ విధాలుగా బ్యాంకు తన కార్యకలాపాలను నిర్వహిస్తూ వచ్చింది.
ఇంపీరియల్ బ్యాంకులొ బ్రాంచి మేనేజర్లుగా ( అప్పుడు ఈ పదవికి ఏజెంట్
(ప్రతినిధి) అనే వారు) బ్రిటిష్ దేశీయులే వుండేవారు. ఇక్కడ మీరు చూస్తున్న
గ్రూప్ ఫొటో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గుంటూరు (1924).ఇందులో
నిలబడిన వారిలోమొదటి వరుసలో కుడి నుంచి రెండవవారు మా నాన్న
గారు శ్రీ యమ్.వీ.సుబ్బారావు. ఆయన అప్పుడు ఏజెంట్ పెర్సనల్ టైపిస్టుగా
పని చేసేవారట. ఈ బ్యాంక్ బిల్డింగులు అప్పటి బ్యాంక్ ఆఫ్ బెంగాల్,బ్యాంక్
ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ లవి.జూలై 1, 1955లో ఇంపీరియల్ బ్యాంక్
స్టేట్ బ్యాంకుగా మార్పు చెందింది.

4 comments:

  1. అప్పారావుగారూ. స్టేట్ బాంక్ మీద వేసిన స్టాంపు నా దగ్గరా లేదు. మీ వ్యాసం చూసి, ఊడల మర్రి అసలు రూపం లేదు అని అన్నారుకదా. చూద్దాం అని గూగిలించటం మొదలుపెట్టి ఈ బొమ్మ సంపాయించి మీకు పంపాను. మీరు గుర్తుతో, బొమ్మను యధాతధంగా వేశారు. స్టేట్ బాంకు గురించిన చాలా తెలియని విశేషాలు చెప్పారు. ధన్యవాదాలు.

    గుంటూరులో తీసిన పాత ఫొటో ఎంతో బాగున్నది. అప్పటి ఆ మనుషులు, వాళ్ళందరూ బాంకులో పనిచేస్తున్నపుడు ఎలా ఉండేదా అని ఊహించుకుంటే తమాషాగా ఉన్నది. చూడoడి అప్పట్లో బాంకుకి ఎంతమంది ప్యూనులో. ఇప్పుడు ఒక్కడూ ఉండడు, పిలిచినా పలకడు, పలికినా సరిగా చెప్పిన పని చెయ్యడు. బంట్రోతు బంట్రోతు వేషంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్యూన్లందరికీ "లివరీ" ఉచితంగా ఇచ్చినా వేసుకోవటానికి నామోషీ, వేసుకోరు. డబ్బులుమటుకు తీసుకుని తీరతారు. అది మనకు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మార్పు.

    ReplyDelete
  2. how you are getting all these photos sir?
    really superb

    ReplyDelete
  3. 1924లోని ఫోటోనా! Thank you very much మాతో పంచుకున్నందుకు. ఎక్కడ తీసారు సార్ ఈ ఫోటోని.

    ReplyDelete
  4. విజయవర్ధన్ గారు శుభోదయం! ఆ ఫొటో గుంటూరులో 1924 లో తీసినది. అప్పుడు
    మా నాన్నగారు ఏజెంట్ పెర్సనల్ టైపిస్ట్ గా పనిచేశారు. ఆప్పటి ఏజెంట్ బదిలీ
    అయినప్పుడు, మరో ఏజెంట్ వచ్చినప్పుడు ఫేర్వెల్ సంధర్భంగా తీసిన ఫొటో. ఆ
    రోజుల్లో ఇంపీరియల్ బ్యాంకులో అందరూ ఏజెంట్లగా బ్రిటిష్ వారే వుండే వారు.
    మా నాన్నగారు 1959లో ఆఫీసరుగా(SBI) రాజమండ్రిలో రెటైరయ్యారు.
    నాటి నుంచి నా దగ్గర చాలా వస్తువుల లాగే ఈ ఫొటో కూడా భద్రంగా వుంది.

    ReplyDelete